Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓల్డ్ ఈజ్ గోల్డ్ 'కు ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. అందులో ఒకటి సినిమా. ఇప్పటికీ ప్రేక్షకులను కను తిప్పకోకుండా చూసేలా చేయగల సత్తా ఆలనాటి నటీనటులదంటే అతిశయోక్తి కాదు. ఇక టాకీ రాకముందయితే ఎక్స్ప్రెషెన్స్తోనే ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి నటీమణుల్లో జరీనా వాహెబ్ ఒకరు. 'తు జో మెరీ సుర్ మే... సుర్ మిలాకే' అంటూ అమోల్పాలేకర్తో గొంతు కలిపితే.. దేశమంతా ఫిదా అయ్యింది. 'దో దివానే షహర్ మే' అంటూ ప్రేమ పిచ్చిని చెబితే... ప్రేక్షకులంతా ఆమె ప్రేమలో పడిపోయారు. చందమామలాంటి అమాయకపు ముఖం... మనసులో భావాలన్నీ పలికించే కళ్లు. క్యారెక్టర్ ఏదైనా ఇట్టే ఇమిడిపోగలిగే వ్యక్తిత్వం. 70 చివర్లో.. ప్రతి ఇంట్లో అమ్మాయిలా మారిపోయిన పేరు జరీనా. ఆమె సినీ ప్రస్థానం గురించి క్లుప్తంగా...
జరీనా వాహెబ్... దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. విశాఖపట్నంలో ముస్లిం సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన జరీనాకు సినిమాలంటే ఆసక్తి. ఎనిమిదో తరగతిలో ఉండగానే... ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరింది. సినీ ఇండిస్టీలో తమదైన ముద్ర వేయడం కోసం తనలా కలలు కంటున్న అనేక మంది మధ్య ఆమె ఎంతో నేర్చుకుంది. సినిమాల పట్ల ఆమెకున్న ఆకాంక్షతో... అభినయం, అభివ్యక్తి కోసం ఎంతో అధ్యయనం చేసింది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ఆమెను చూసిన లెజెండర్ ఫిల్మ్ మేకర్ రాజకపూర్... జరీనాకు మ్యానరిజమ్స్ తెలియవన్నాడు. కానీ ఆమెకు సినిమా తప్ప మరో ఆలోచనే లేదు. అందుకే చాలా కష్టపడింది. పుణేలో శిక్షణ పూర్తయ్యాక... ముంబై వచ్చింది. బాంద్రాలోని మౌంట్మేరీలో పేయింగ్ గెస్ట్గా ఉంటూ... సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.
జీనత్కు సోదరిగా...
ఓ రోజు ఆమెను దేవానంద్ను కలవమని ఎవరో సలహా ఇచ్చారు. 'ఇష్క్ ఇష్క్ ఇష్క్' సినిమా ఆడిషన్స. జీనత్ అమన్ సోదరి పాత్ర కోసం. ఫొటోలు తీసుకుని వెళ్లింది. అప్పటి దర్శకుల కళ్లలోనే కెమెరా ఉండేదేమో... ఎలాంటి ఫొటోస్ చూడకుండానే 'నీది ఫొటోజెనిక్ఫేస్' అన్నారాయన. ఖాట్మండ్లో షూటింగ్. నటిగా ప్రస్థానం మొదలైంది. పెండ్లితో జయభాదురి సినిమాలకు దూరమైంది. ఆ ఖాళీని భర్తీ చేసింది జరీనా. సాదాసీదా అమాయకపు పల్లెటూరి పిల్లలా కనిపించే ఆమెను చూసి.. రాజ్కపూర్ 'భంగన్' అని పిలిచేవాడు. అంతకుముందు ఆ పేరుతో వహీదా రెహ్మాన్ను పిలిచేవారాయన. ఆ తరువాత ఆ స్థానాన్ని జరీనాకు ఇచ్చేశాడు. 'నేను ఆరాధించే వహీదాజీతో నన్ను పోల్చి చెప్పడం... నా జీవితంలో మరిచిపోలేని ప్రశంస' అని తరువాత అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది జరీనా. రేఖ, జరీనా మంచి స్నేహితులు. బాంద్రాలో ఉండేప్పుడు ఇద్దరూ కలిసి లాంగ్వాక్స్కు వెళ్లేవాళ్లు.
'చిత్చోర్'లో అల్లరిపిల్లగా..
70ల్లో ఆమె ఇంకా చిన్నపిల్ల కావడంతో హీరోయిన్గా అవకాశాలు ఎక్కువగా రాలేదు. అయినా తానెంటో తనకు తెలుసు. టాప్ హీరోయిన్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. మంచి నటికావా లనుకుంది. అందుకు అవకాశాలకోసం ఎదురుచూసింది. ఈ రోజుల్లోలా అవకాశాలు రాక.. డిప్రెషన్, ఫ్రస్టేషన్ వంటివేమీ లేవు. ఆ తరువాత తారాచంద్ బర్జాత్యా నుంచి ఆడిషన్కోసం పిలుపొచ్చింది. కేవలం ముగ్గురు అటెండ్ అయ్యారు. ఆమెకు అవకాశం దక్కింది. అదే... 'చిత్చోర్'(1976). బసు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అమోల్పాలేకర్ పక్కన అల్లరి, అమాయకపు అమ్మాయిగా అద్భుతంగా నటించింది. 'రంగ్బిరంగే.. ఫూల్ కిలే హై.. లోగ్ బీ ఫూలో జైసే'... నిజంగానే పువ్వులాంటి మంచి మనసున్న ఆ అమ్మాయి మొదటి సినిమాతోనే అందరి మనసులను దోచేసుకుంది. కథపరంగానే కాదు... సినిమా మ్యూజికల్ హిట్ కూడా. తరువాత మళ్లీ అమోల్పాలేకర్ పక్కనే 'ఘరోండా'లో పట్టణపు పడుచుగా నటించింది. అర్బన్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న ప్రేమకథ ఘరోండా! ఆ రెండు సినిమాలతో ఆన్స్క్రీన్లో సక్సెస్ఫుల్ జోడీగా జరీనా, అమోల్పాలేకర్ పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత రాజశ్రీ ప్రొడక్షన్స్నుంచి కాల్ వచ్చింది. తీరా వెళ్లాక.. వేసుకోమని కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అంతకుముందే ఒక హీరోయిన్తో 11 రీల్స్ తీవారు. కానీ.. ఆమె ఇబ్బంది పెట్టడంతో పిలిచి జరీనాకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా 'గోపాలక్రిష్ణ' (1979). ఆ తరువాత... 'నయ్యా'(1979), 'సావన్ కో ఆనే దో'(1979), 'జజ్బాత్'(1980), 'దర్ద్ ఏ దిల్'(1983) అట్లా వరుస సినిమాలతో రాజ్శ్రీ ప్రొడక్షన్స్ ఆమెకు సొంత ఇంటిలా మారిపోయింది.
మలయాళ సినిమాల్లో మార్క్...
హిందీతోపాటు ప్యారలల్గా మలయాళ సినిమాలను కూడా చేసింది జరీనా. సలీల్ చౌదరి.. మలయాళ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్హాసన్ హీరోగా చేస్తున్న ఓ సినిమాకు ఆయన... జరీనాను సూచించాడు. మలయాళం ఒక్క ముక్క కూడా పలకడం రాలేదామెకు. మొదటిరోజు షూటింగ్లో బాగా ఏడ్చింది. కమల్హాసన్ వెళ్లి... 'భాష రాకపోతే ఇబ్బందేం లేదు. డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం లిప్ మూమెంట్ ఇవ్వు' అని సలహా ఇచ్చారు. తరువాత రోజునుంచి ఆమెకు కొంత ఈజీ అయ్యింది. ఆ సినిమా మదనోల్సవం (1980). తరువాత చమారమ్, నాయట్టు, మిస్టర్ మైఖేల్, పాలంగల్, సారా వర్షమ్, ఫుట్బాల్, వీడు.. వరుసగా చేసుకుంటూ పోయింది. 15 రోజుల్లోనే ఆమె పార్ట్ షూటింగ్ పూర్తి చేయడంతో పాటు రెమ్యునరేషన్ కూడా కరెక్టుగా ఇచ్చేవారు. అట్లా వచ్చిన రూపాయి రూపాయి పెట్టి... 83వేల రూపాయలు పెట్టి మౌంట్మేరీలో సింగిల్బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నది.
వయసుకు తగ్గ పాత్రలతో...
మలయాళ సినిమాల్లో ఎక్కువగా చేస్తుండటంతో హిందీలో కొన్ని అవకాశాలు పోయాయి. అయినా ఆమెకోసమే పుట్టిన పాత్రలు కొన్ని ఆమెకోసం ఎదురుచూశాయి. సితార(1980) సినిమాలో అమాయకపు అమ్మాయి కోసం చూశారు సినిమా దర్శక, నిర్మాతలు. ఎన్ని ఆడిషన్స్ నిర్వహించినా హీరోయిన్ దొరకలేదు. ఎందుకంటే వాళ్ల మనసులో ఉన్నది జరీనా. అలా తనదైన ఇమేజ్ను సృష్టించుకున్నది. హిందీ, మలయాళంతోపాటు తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో గాజుల కిష్టయ్య, అమరప్రేమ, హేమాహేమీలు, రక్త చరిత్ర రెండు పార్టుల్లోనూ ఆమె నటించింది. చాలామంది హీరోయిన్లు... కొన్ని పాత్రలకే పరిమితమవుతారు. కొంత వయసు వచ్చాక.. కొన్ని పాత్రలు చేయడానికి ఇష్టపడరు. కానీ ఎలాంటి అంతరాయం లేకుండా... వయసుకు తగ్గ పాత్రలతో ఎప్పుడూ వెండితెరపై తళుకులీనుతూనే ఉన్నది జరీనా. నిజానికి సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని గడిపేయొచ్చు. కానీ ఆమె అలా ఎన్నడూ కూర్చోలేదు. 60 దాటాక కూడా అదే ఎనర్జీతో పనిచేస్తూనే ఉన్నది. ఎందుకంటే... 'పని చేయడం నాకు ఇష్టం. లేకపోతే ఊపిరాడనట్టుగా ఉంటుంది. వర్క్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ మి' అంటుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'వన్ డే', 'ఫౌజీ కాలింగ్', 'పీఎం నరేంద్ర మోడీ' త్వరలో విడుదల కానున్నాయి. కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. టీవీ షోస్, సీరియల్స్లోనూ నటించింది.
తనకంటే చిన్నవాడిని పెండ్లి చేసుకుని..
1986లోని కళంక్ కా టీకా ఆమె జీవితంలో పెద్ద మలుపు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు కాబోయే భర్త ఆదిత్య పంచోళీని కలుసుకున్నది. ఆదిత్యది యూపీలోని రారుబరేలి. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి రాజన్ పంచోలి.. సినీ దర్శకుడు. కానీ ఆదిత్యకు సినిమాల్లోకి రావాలని అస్సలు లేదు. ఓసారి ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా... ఓ దర్శకుడు ఆదిత్యను చూశాడు. ఓ టీవీ సీరియల్లో అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత నటించడమే కాదు... ఎన్నో సినిమాలు, సీరియళ్లకు దర్శకత్వం కూడా వహించాడు ఆదిత్య. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 15 రోజుల్లోనే వాళ్లిద్దరూ పెండ్లి చేసుకున్నారు. తనకంటే వయసులో చిన్నవాడైన ఆదిత్య పంచోలీని వివాహం చేసుకున్నందుకు అనేక విమర్శలు. కులాంతర, మతాంత వివాహాన్ని జరీనా తల్లి మొదట వ్యతిరేకించింది. తరువాత ఆమెను ఒప్పించింది జరీనా. ఆదిత్య ఆమెకంటే ఆరేండ్లు చిన్నవాడు. దాంతో తొందర్లోనే పెండ్లి పెటాకులవుతుందని అనేక విమర్శలు. వారిద్దర సహజీవనానికి 32 ఏండ్లు... ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిందా జంట. పెండ్లి తరువాత కానీ.. ఇప్పటికీ ఆమె సినిమాల విషయంలో అతనెప్పుడూ జోక్యంచేసుకోలేదు. రెమ్యునరేషన్ ఎంత అని కూడా ఎప్పుడూ అడగలేదు. వాళ్లిద్దరికీ కొడుకు సూరజ్ పంచోళీ, కూతురు సనా పంచోళీ ఉన్నారు.
- కట్ట కవిత