Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన సంప్రదాయాల్లో ఒక శాస్త్రీయవిజ్ఞానం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక చరిత్ర ఉంటుంది. అది ఎంటో తెలుసుకుని చెప్పగలిగితేనే ఏ సంస్కృతియైనా, సంప్రదాయమైన, ఆచారమైన భవిష్యత్ తరాలకు అందుతుంది. అలా చెప్పలేకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధానమవుతుంది' అంటున్నారు నాలుగు దశాబ్దాలుగా జానపద, ప్రాచీన సంప్రదాయ, ఆధునిక సాహిత్య రంగాల్లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ రావి ప్రేమలత. మూడుదశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా ఆమె అనేక అవార్డులు అందుకున్నారు. జానపద సాహిత్యంలో స్త్రీల స్వరాన్ని సాధికారికంగా వినిపించడం ఆమె విశిష్టత. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడమే జానపద విజ్ఞాన ప్రత్యేకత అంటూ ఆమె చెప్పిన అరుదైన అంశాలు మానవి పాఠకుల కోసం..
మీ రచనావ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు?
ఎం.ఏ చదువుతున్నప్పుడు వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. అయితే ఇది ఒక రోజుతో జరిగిన ప్రక్రియ కాదు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడంపై ఉన్న అభిరుచితో మాలతీచందూర్, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శ్రీశ్రీ, సినారె తదితరుల సాహిత్యం ఎక్కువగా చదివేదాన్ని., తెలుగుసాహిత్యంపై ఉన్న ఆసక్తి, పెద్దవాళ్లు చెప్పే జానపదకథలు నన్ను రచనావ్యాసంగం వైపు మళ్లించాయి.
మొదటి సారిగా 'స్రవంతి'లో నేను రాసిన వ్యాసం వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ వచ్చాయి.
జానపదసాహిత్యంపై , పరిశోధనాత్మక వ్యాసాల వైపు ఆసక్తి ఎలా కలిగింది?
పుస్తకాలు చదువుతున్నప్పుడు అందులో ఉండే అంశాలను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న తపన కలిగేది. అందుకోసం మరిన్ని రెఫరెన్స్ పుస్తకాలు చదివేదాన్ని. అలా చదివిన అంశాలన్నింటినీ వ్యాసంగా రాయడంతో అది పరిశోధనాత్మక వ్యాసం అయ్యేది. జానపదసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆచార్య నాయిని కృష్ణకుమారిగారి మార్గదర్శకత్వంలో పిహెచ్డి చేశాను. చరిత్ర చెప్పని, పుస్తకాల్లో లేని చాలా విషయాలు ప్రజల్లో ఉన్నాయి. వాటికి అక్షరరూపం ఇవ్వడం వల్ల రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయ చరిత్రను అందించడం సాధ్యమవుతుంది. జానపద సాహిత్యంలో ఎక్కువగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశాను.
మీరు క్షేత్రస్థాయి అంశాల కోసం గ్రామల్లో ఎక్కువగా తిరిగారు కదా? మీ దృష్టికి వచ్చిన అంశాలు?
పూర్వం మతాలన్నవి మనుగడలో లేని కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అందుకు నిదర్శనం గ్రామదేవతలు. ప్రతి ఊరికి రక్షణగా గ్రామదేవతలు ఉంటారు. కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి గ్రామదేవతల పేర్లు మారినా వారందరినీ గ్రామ రక్షకులుగా ప్రజలు భావిస్తారు. అందుకే వందల ఏండ్ల చరిత్ర ఉన్న గ్రామదేవతల కథలు మనకు జానపదసాహిత్యంలో కనిపిస్తాయి.
పొద్దున్నే వాకిట్లో వేసే ముగ్గు మీద పరిశోధన చేసి పుస్తకంగా తీసుకువచ్చారు? 'తెలుగు స్త్రీల చిత్రలిపి' గురించి చెప్పండి.
మన సంప్రదాయాల్లో ఒక సైన్సు ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక చరిత్ర ఉంటుంది. అది ఎంటో చెప్పకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధానమవుతుంది. నేను ముగ్గుల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఇదే విషయం స్పష్టమైంది. అతి ప్రాచీన కాలం నుంచి సంప్రదాయకంగా మహిళలు వేస్తున్న అనేక ముగ్గులను పరిశీలించినపుడు అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలిశాయి. ముగ్గులు అనేవి భావవ్యక్తీకరణ సాధనాలుగా, ఒక విధమైన లిపిగా గుర్తించాను. మహిళల కళానైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. వాకిట్లో వేసే ముగ్గులు చిత్రకళాధిదేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు అన్న విషయాన్ని చెబుతూ 'తెలుగు స్త్రీల చిత్రలిపి'గా వాటన్నింటినీ పుస్తకం రూపంలో తీసుకువచ్చాను. ఈ పుస్తకానికి రామరాజు జానపద విజ్ఞాన బహుమతి వచ్చింది. జానపద విజ్ఞానానికి ఎల్లలు లేవు. మన రాష్ట్రంలోని మహిళల చిత్రకళా నైపుణ్యం ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మహిళల చిత్రకళతో పోలి ఉంటుంది.
మీ గురించి చెప్పండి.
భువనగిరి దగ్గర నాగిరెడ్డి పల్లె మా సొంతూరు. నాన్న రావిరా మిరెడ్డి, ఆర్ అండ్ బిలో ఇంజనీర్గా పనిచేశారు. అమ్మ మనోరమ. ముగ్గురు అమ్మాయిలం, ఒక అబ్బాయి. ఇంటికి నేనే పెద్దదాన్ని. హైస్కూల్ వరకు భుననగిరిలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ లోని రెడ్డి కాలేజీ లో పియుసీ, వనితా మహావిద్యాలయలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్, పిజీ(తెలుగు), ' తెలుగు పద సాహిత్యం పురాగాథలు' అంశంపై పిహెచ్డి పూర్తి చేశాను. రాంచంద్ర డిగ్రీ,పిజీ కాలేజీలో ముఫ్పైఏండ్లు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసే జె.వి.సత్యనారాయణ రెడ్డితో పెండ్లి అయ్యింది. మాకు ఒక అమ్మాయి. డాక్టర్ప్రణీత, ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. అమ్మనాన్న నాతోనే ఉంటున్నారు.
జానపదకథలపై త్వరలో పుస్తకం వస్తుందన్నారు. ఎలాంటి కథలు అందులో ఉన్నాయి? ఆ పుస్తకం గురించి చెబుతారా?
యూజిసి ప్రాజెక్ట్ కింద జానపదకథలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను. అనేక పల్లెల్లో తిరిగి దాదాపు రెండువందల కథలను సేకరించాను. వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను. జానపద కథల్లో మూడు రకాల కథలుంటాయి. సందర్భోచిత కథలు, కాలక్షేపకథలు, నీతికథలు. ఒక్కొక్క విభాగంలో నాలుగైదు కథలను ఎంపిక చేశాను. పిల్లలకు మంచి అలవాట్లు, ప్రవర్తన నేర్పేలా ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి. అయితే అవి అన్నీ మౌఖికరూపంలోనే తప్ప లిఖిత రూపంలో లేవు. వాటిని సేకరించి పుస్తకంలో పొందుపరుస్తున్నాను.
తెలంగాణ జానపదసాహిత్యం పై మీ అభిప్రాయం.
తొలితెలుగుకథ, శతకం, వాజ్మయం వంటి అనేక సాహిత్య ప్రక్రియ లకు పుట్టినిల్లు అయినా తెలంగాణలో సమాచార రాహిత్యంతో ఇన్ని రోజులు జానపదసాహిత్యం మరుగునపడింది. ఇప్పుడిప్పుడే జానపదకళా రూపాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ సంబంధాలు, విలువలు శిథిలమవుతున్న ప్రస్తుత తరుణంలో జానపదసాహిత్యంలోని అమూల్యమైన అంశాలను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ విలువల్ని అంతర్లీనంగా చెబుతూ తరతరాల నుంచి జనబాహుళ్యంలో ఉన్న కళలను, కథలను సేకరించి వాటిని అమూల్యసంపదగా భావించినప్పుడే మానవీయవిలువలు పెరుగుతాయి.
తొలి తెలుగు మహిళా మంత్రిణి నాగమ్మ
'ప్రపంచ చరిత్రలో రాజ్యాలను పరిపాలించిన స్త్రీలున్నారు. యుద్ధాల్లో ఆయుధాలను పట్టి పోరాడిన అనేకమంది వీరవనితలున్నారు. కానీ మంత్రిత్వం నెరిపిన మహిళలు మాత్రం బహు అరుదుగా ఉన్నారు. వీరిలో పన్నెండవ శతాబ్దంలో పల్నాడునేలిన నలగాముని మంత్రిణి నాగమ్మను ప్రపంచంలోనే ప్రప్రథమ ప్రధానమంత్రిగా చెప్పుకోవడం తెలుగుజాతికి గర్వకారణం' ఈ విషయాన్ని 'తొలితెలుగు మహిళామంత్రిణి నాగమ్మ వ్యాసం'లో సప్రమాణికంగా నిరూపించారు ప్రేమలత. ఇందుకోసం ఆమె విస్తృత పరిశోధన చేశారు.
అవార్డులు..
- ఉత్తమ విమర్శ గ్రంథం 'వ్యాసలతిక'కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- ఉత్తమ గ్రంథం ' తెలుగు స్త్రీల చిత్రలిపి' తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- ఉత్తమ పరిశోధకురాలు తంగిరాల బహుమతి
- ప్రముఖ రచయిత పాకాల యశోదరెడ్డి స్మారక పురస్కారం
- వై. రంగనాయకమ్మ స్మారక పురస్కారం
- ఉత్తమ విమర్శ గ్రంథం'అవలోకనం' తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
- ఉత్తమ అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం
రచనలు..
1. తెలుగు జానపదసాహిత్యం పురాగాథలు - 1980
2. జానపద విజ్ఞాన పరిశీలనం - 1990
3. తెలుగు స్త్రీల చిత్రలిపి - 1991
4. జానపద విజ్ఞానంలో స్త్రీ - 1996
5. వ్యాస లతిక - 2002
6. Folk tales of south india - Andhra pradesh - Editor - 2005
7. ఆలోకనం - 2015
8. పాకాల యశోదరెడ్డి - 2015