Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు కూరగాయలు, ఆకు కూరలు తినిపించడం చాలా కష్టం. ఎన్ని వెరైటీ కూరలు చేసి పెట్టినా ససేమిరా అంటారు. ఎట్లాంటి పిల్లలయినా ఇష్టపడేది దోశ. ఆ దోశల్లోనే కూరగాయలు, ఆకు కూరలు మిక్స్ చేసేస్తే... ఇంకేముందు వాళ్ల మనసు దోచేసుకున్నట్టే! అటు వాళ్లకు నచ్చింది పెట్టినట్టు ఉంటుంది. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే వీటిని ముక్కలుగానో, తురుముగానో చేసి దోశ పిండిలో కలుపుకోవచ్చు. ఆ మాత్రం కూడా వాళ్లకు కనపడకుండా ఉండాలనుకుంటే.. పిండితోపాటు రుబ్బేయొచ్చు. ఇంకెందుకాలస్యం మీరూ ప్రయత్నించండి.
బీరకాయ దోశ
కావలసిన పదార్థాలు
బీర ముక్కలు - 2 కప్పులు, మినపప్పు - 1 కప్పు, బియ్యం - 7 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 2, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్రంఉల్లితరుగు - దోశలపై చల్లడానికి సరపడా, నూనె - కాల్చడానికి సరిపడా.
తయరుచేసే విధానం
మినపప్పు, బియ్యం కలిపి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, ఉప్పుతో పాటు బీర ముక్కలు కూడా కలిపి మెత్తగా దోశల పిండిలా రుబ్బుకోవాలి. పెనంపై దోశల్లా పోసుకుని ఉల్లి తరుగు, జీలకర్ర చల్లి దోరగా కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి.
క్యారెట్ దోశ
కావలసిన పదార్థాలు
క్యారెట్ ముక్కలు - 1 కప్పు, బియ్యం - ముప్పావు కప్పు, ఓట్స్ - ముప్పావు కప్పు, మినప్పప్పు - పావు కప్పు, ఎండుమిర్చి - 2, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి కొద్దిగా.
తయారుచేసే విధానం
బియ్యం, మినప్పప్పు, ఓట్స్ విడివిగా 3 గంటలపాటు నానబెట్టి, క్యారెట్ ముక్కలు, ఎండుమిర్చితో పాటు దోశల పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఉప్పు కలిపిన వెంటనే పెనంపై దోశల్లా పోసుకోవచ్చు. పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
దోసకాయ దోశ
కావలసిన పదార్థాలు
దోసకాయ తురుము - 2 కప్పులు, మెంతులు - చిటికెడు, అటుకులు - అర కప్పు, బియ్యం - అర కప్పు, ఉప్పు - సరిపడా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం
బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలసేపు నానబెట్టాలి. వీటికి దోసకాయ తురుము చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా బయటే ఉంచాలి. ఉదయం దోశలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
పుదీనా దోశ
కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు, పెసర్లతో పాటు మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు - పావు కప్పు చొప్పున, (గింజలు తీసిన) ఎండుమిర్చి - 2, రవ్వ - పావు కప్పు, ఇంగువ - అర టీ స్పూను, దోసకాయ తరుగు - 1 కప్పు, పుదీనా తరుగు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం
బియ్యంతో పాటు పప్పులు, రవ్వ కలిపి 3 గంటలు నానబెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చి పొడి చేసుకుని నానిన దినుసులు, పుదీనా ఆకులు వేసి, అవి మెత్తబడ్డాక ఇంగువ, ఉప్పు, దోసముక్కలు వేసి రుబ్బుకోవాలి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు. తర్వాత దోశల్లా పోసుకోవాలి. పుదీనా దోశల్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది.
పాలకూర దోశ
కావలసిన పదార్థాలు
బియ్యం - ఒకటిన్నర కప్పు, మినప్పప్పు - అరకప్పు, మెంతులు - 1 టీ స్పూను, మసూర్ (ఎర్ర) పప్పు - 2 టేబుల్ స్పూన్లు, పాలకూర - 2 కట్టలు, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - 1.
తయారుచేసే విధానం
బియ్యం, మినప్పప్పు, మెంతులు, మసూర్ (ఎర్ర) పప్పుని 4 గంటలు నానబెట్టి, మెత్తగా రుబ్బి ఒక రాత్రంతా ఉంచాలి. తరిగిన పాలకూర, కొత్తిమీర, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కూడా మెత్తగా రుబ్బుకుని ఆ పిండిలో కలిపి దోశల్లా పోసుకోవాలి. ఈ దోశలు ఆవకాయ గుజ్జుతో బాగుంటాయి.
మెంతి దోశ
కావలసిన పదార్థాలు
మినపప్పు - 150 గ్రాములు, బియ్యప్పిండి - ఒక కప్పు, ఎండిన మెంతి ఆకులు - 3 టీస్పూన్లు, తురిమిన కేరెట్ - ఒక క ప్పు, తినే సోడా మూడు చిటికెలు, ఉప్పు -రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం
మినపప్పుని రాత్రే నానబెట్టాలి. ఉదయం నీటిని వడకట్టి దోశల పిండిలా రుబ్బుకోవాలి. అందులో బియ్యప్పిండిని, తురిమిన కేరెట్ని, మెంతి ఆకుల్ని, సోడాని, ఉపని వేసి బాగా కలపాలి. దీన్ని మామూలుగా దోశల్లా వేసుకుని కొబ్బరి చట్నీ లేక పుదీనా చట్నీతో తింటే బాగుంటుంది.