Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరు మునిగిపోవడమంటే... ఒక మనిషి, ఒక సమాజం, ఒక సంస్కృతి ముగిసిపోవవడం. మనుషులు ఊరొదిలి చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురైపోవడం. ఆ నిర్వాసిత విషాదం జీవితాంతం ప్రవాసమై వెంటాడుతుంది. అట్లా ప్రవాసులవుతున్న తెలంగాణ బిడ్డలెందరో. కుటుంబ బంగారు భవిష్యత్ కలగని... చివరకు కన్న తల్లికి, కట్టుకున్న భార్యకు, కడుపున పుట్టిన పిల్లలకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నవాళ్లనేకం. అలా భర్త ప్రాణం పోగొట్టుకుని.. కడచూపుకోసం కన్నీరు పెడుతున్న ఓ మహిళ కథ ఇది. నెలరోజులుగా వేల మైళ్ల అవతల, చల్లటి పెట్టెలో అతడి మృతదేహం... ఇక్కడ భర్తను పోగొట్టున్న భార్య.. కొడుకును పోగొట్టుకున్న తల్లి... తండ్రిని పోగొట్టుకున్న రెండు పసిప్రాణాలు... కళ్లనిండా నీళ్లతో క్షణమొక యుగంగా గడుపుతున్న తీరు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామం. 35 ఏండ్ల కిందట ఆ కుటుంబం వలస వచ్చిందక్కడికి. అంతుకుముందు కొన్నాళ్లు బొంబాయిలో ఉన్నారు. దానికంటే ముందు.. మగ్గిడి గ్రామం వాళ్లది. చేనేత కుటుంబం. కానీ... నేత ఎప్పుడో ఆ కుటుంబానికి దూరమయ్యింది. శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టులో కుటుంబం నిర్వాసితమైంది. ధర్మపురి దగ్గర పునరావాస గ్రామం 'మగ్గిడి' ఏర్పాటయ్యింది. పునరావాసం.. ప్రవాసమే అయ్యింది. పిల్లలను తీసుకుని భర్త, భార్యా ఇద్దరూ కలిసి బొంబాయి పయనమయ్యారు. కానీ ఎన్నటికైనా వలస బతుకులు వలసబతుకులే. అందుకే మళ్లీ పుట్టిన నేలను వెతుక్కుంటూ వచ్చి చివరకు మారంపల్లిలో స్థిరపడింది కుటుంబం. సొంత ఇల్లు లేదు. గుంటెడు జాగ లేదు. కిరాయి బతుకులు. అలాంటి పరిస్థితుల్లో ంటి బాధ్యతను తలకెత్తుకున్నాడు రెండో కొడుకు రమేష్.
బాధ్యతను తలకెత్తుకుని...
20 ఏండ్ల కిందటనే... కుటుంబం కోసం దుబారు పయనమయ్యాడు. డ్రైవర్గా ఉద్యోగం. అప్పుడో ఇప్పుడో ఆయన పంపే పైసలు, ఇంటిదగ్గర ఉన్నవాళ్లు చేసే కూలీ.. ఆడ పిల్లల పెండ్లిళ్లు చేశారు. రెండు అర్రల మందం జాగ కొనుక్కున్నరు. రేకులేసుకున్నరు. ఎవ్వరికీ చదువులు సరిగ్గా లేవు. అందుకే చిన్న తమ్ముడైన రాజేశ్వర్ను చదివించాలని ఆయనకు కష్టం తెలియనివ్వలేదు. కానీ... ఐటీఐ అయిపోయిన తరువాత డిగ్రీ చదవడానికి కష్టమై... చివరకు రాజేశ్వర్ సైతం అన్నతోనే పయనమయ్యాడు. రమేష్కు ముల్లంగికి చెందిన లావణ్యతో పెండ్లయ్యింది. తరువాత అన్నదమ్ములిద్ద్దరూ దుబారులో ఎనిమిదేండ్లు ఉన్నారు. వచ్చిన తరువాత... ఉన్న ఇల్లును తల్లికిచ్చి అన్నదమ్ములిద్దరికీ కలిసి.. ఇల్లు జాగ కొనుక్కున్నరు. తరువాత ఒక్కడే సౌదీలోని రియాద్కు పొయ్యిండు రమేష్. రెండేండ్లకోసారి రెండుసార్లు వచ్చిండు. ఏడాదిన్నర కిందట మళ్లీ పొయ్యిండు. ఈ సమయంలోనే ఒక సేట్ దగ్గరి నుంచి మరోసేట్ దగ్గరికి బదిలీ అయ్యిండు.
రెండేండ్లకోసారి రెండు నెలలు..
రమేష్, లావణ్యకు ఇద్దరు ఆడపిల్లలు. శివాణి, పావని. వచ్చినప్పుడల్లా రెండు నెలలు ఉండిపోవడమే తప్పించి... దగ్గరుండి పిల్లల ముద్దు ముచ్చట చూసిందెన్నడూ లేదు. పిల్లలూ అంతే.. తండ్రి ప్రేమను ఆస్వాదించిందీ లేదు. వాళ్ల భవిష్యత్ బాగుండాలంటే... తను సొంత గడ్డ మీద ఉండాలనుకున్నడు. అందుకే ఇంకో ఆరు నెలలుండి వీసా అయిపోగానే... ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు రమేష్. అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. ఇంట్లో డ్రైవర్ ఉద్యోగం అంటే... 24 గంటల డ్యూటీ లెక్క. ఫిబ్రవరి 13న రాత్రి తొమ్మిదిగంటలప్పుడు ఫోన్ వచ్చింది. 'మేడమ్ రమ్మంటున్నరు' అని రూమ్మేట్స్తో చెప్పిన రమేష్... బయటికి వచ్చిండు. తరువాత ఏం జరిగిందో తెలియదు. చివరకు రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఆస్పత్రిలోచేరిండు. రెండు నెలల నరకయాతన తరువాత... ఏప్రిల్ 19న చనిపోయిండు. నెల రోజులు దాటిపోయింది. ఇప్పటివరకూ రమేష్ డెడ్బాడీ ఇండియాకు రాలేదు. చివరి రోజుల్లో దగ్గరలేక.. ప్రాణం పోయిన మనిషిని అక్కడ ఉంచుకుని ఇక్కడ నరకయాతన పడుతున్నది కుటుంబం. రమేష్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ కుటుంబ సభ్యులు మే 23న రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మానవ హక్కుల కమీషన్లో పిటిషన్ దాఖలు చేశారు.
బాధితుల వేదన వర్ణనాతీతం..
ఉపాధి లేక వలసలు పోతున్న మన ప్రజలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలుగా మన రాష్ట్రానికి సాధించుకున్నాం. కానీ ప్రవాస భారతీయుల సమస్యలపై, ప్రత్యేకించి గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులపై దృష్టి సారించు కోలేకపోయాం. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 5లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆ కుటుంబాలు, కార్మికులకోసం పనిచేస్తున్న హక్కుల సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ.. అందులో ముందడుగు లేదు. ఈ అయిదేండ్ల కాలంలో... గల్ఫ్ దేశాలలో తెలంగాణ ప్రవాసులు వెయ్యిమందికి పైగా చనిపోయారు. వివిధ కేసుల్లో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్నవారు ఎంతో మంది. ఆ బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతం.
అప్పుడు శ్రీరాంసాగర్... ఇప్పుడు మల్లన్నసాగర్. ముంపు, నిర్వాసితం... పునరావృతమవుతూనే ఉన్నాయి. ఊరు మునిగింది. అది అంతర్గత వలసకు కారణమయ్యింది. తరువాత అంతర్జాతీయ వలస అయ్యింది. ఆ ప్రాజెక్టు ద్వారా నీరందుకున్న రైతులు బాగుపడ్డారు. భూముల ధరలు పదిరెట్లు పెరిగిపోయాయి. ముంపు నిర్వాసితులు మాత్రం భిక్షగాళ్లకంటే దీనంగా మారారు. ఈ ముఖచిత్రం మారాలి.
సిబ్బందిని నియమించాలి..
సౌదీ విశాలమైన దేశం. భారతీయ జనాభా కూడా ఎక్కువ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా భిన్నంగా ఉంటాయి. దాంతో... ఏ ప్రాసెస్ అయినా సౌదీలో కొంచెం ఆలస్యం. దాంతో శవాలను పంపించడంలో చాలా జాప్యం అవుతున్నది. రమేష్ యాక్సిడెంట్ కేసు కూడా నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. దానికి చాలా సమయం పడుతుంది. కానీ డెడ్బాడీ ఇక్కడికి పంపించేందుకు ప్రాసెస్ చేయడానికి, ఇన్వెస్టిగే షన్కు సంబంధం లేదు. ఎంబసీని అడిగితే... 'వర్క్లోడ్ ఉన్నది. చూస్తున్నం... చేస్తున్నం' అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే... సత్వరం రమేష్ డెడ్బాడీ వచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబ బాధ కొంతైనా తగ్గుతుంది. గల్ఫ్ దేశాలలో మరణించిన మనవారి శవాలను తెప్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలలో ప్రత్యేక విభా గాలు లేవు. తగినంత సిబ్బంది లేదు. సిబ్బందిని నియమించాలి.
-అబ్దుల్ ఖాదర్, అడ్వకేట్ ,వలసకారుల హక్కుల కార్యకర్త
ఆయన శవాన్ని తెప్పించండి
''మాది ముల్లంగి. నాన్న లేడు. అమ్మ లక్ష్మి. మేం ఇద్దరం ఆడపిల్లలం. అమ్మనే కష్టపడి పెద్ద చేసి... మా ఇద్దరికీ పెండ్లిళ్లు చేసింది. ఇప్పుడు మా పెండ్లయి 12 ఏండ్లయితున్నది. రమేష్ పెండ్లిగాక ముందునుంచే దుబారు పొయ్యేది. వచ్చినప్పుడల్లా రెండునెలలు ఉంటుండె. ఈసారి వచ్చిపొయ్యి ఏడాదయితుంది. ''ఎప్పుడూ ఇక్కడ్నే ఉన్నట్ట య్యింది. పిల్లలను పట్టించుకున్నట్టు లేదు. ఇట్లయితే వాళ్ల భవిష్యత్ ఏంది? ఊరికొస్తా... పిల్లలను బాగా చూసుకోవాలి'' అన్నడు. ఆ లోపే ఈ యాక్సిడెంట్ అయిపోయింది మేడం. నెల రోజులాయే... కంటికి కునుకు లేదు. ఏడ్చి ఏడ్చి ఎదారిపోతుంది గానీ... ఆయన శవాన్ని తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తలేవు. మా ఎమ్మెల్యే దగ్గరికిపోయినం. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా... తెలిసినోళ్లకళ్ల మొరపెట్టుకుంటున్నం. కానీ... పట్టించుకునేవాళ్లే లేరు. ఎంబసీకి ఎప్పుడు ఫోన్ చేసినా.. 'వారం పడుతుంది. పది రోజులు పడుతుంది' అని చెప్పుడే కానీ.. ఇంతవరకు డెడ్బాడీ తీసుకొస్తలేరు. కేటీఆర్గారు ఇట్లాంటి కేసులను తొందరగ పట్టించుకుంటరని తెలిసింది. మా ఆయన డెడ్బాడీని తొందరగ తెప్పియ్యాలని ఆయనను కోరుతున్న. నేను, మా అత్త ఇద్దరం బీడీలు చుట్టుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నం. అది తిండికే చాలదు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ ఏంది? వాళ్లనెట్టా చదివించుకోవాలి? అర్థమయిత లేదు. నా పిల్లల భవిష్యత్ కోసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వేడుకుంటున్నా' అని రోదిస్తోంది రమేష్ భార్య లావణ్య.
- కట్ట కవిత