Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామాల్లో రజస్వల కాగానే తొమ్మిది రోజులు పండుగ లాగ చేస్తరు. కానీ ఆడపిల్లకు నెలసరి సమయంలో ఎలా పరిశుభ్రంగా ఉండాలి, క్లాత్ ఎలా ఉపయోగించాలి? లేదా ప్యాడ్ ఎలా వాడాలి అనే విషయాన్ని అంతగా పిల్లలతో చెప్పరు. పిల్లలతో ఆ విషయం ఏం మాట్లాడతాం అనే సిగ్గు ఒకటయితే... ఆ దాని గురించి చెప్పాల్సింది ఏముందిలే వాళ్లే నేర్చుకుంటారనే నిర్లక్ష్యం మరోవైపు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా. దాంతో... 80శాతం మంది పిల్లలు మెన్స్ట్రువల్ రాగానే భయపడతారు. కాబట్టి తల్లులు పిల్లలతో కచ్చితంగా ఈ నెలసరి గురించి మాట్లాడాలి.
ఇంతకుముందు రజస్వల వయసు 14, 15 ఏండ్లకు అయ్యేవారు. కానీ ఇప్పుడు 10, 11ఏండ్లకే వస్తుంది. దీనివల్ల పిల్లల్లో యుక్త వయసు తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ వయసులో పిల్లలకు ఏం తెలియడం లేదు. నెలసరి సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సంతాన సంబంధిత సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం వంటివి జరుగుతాయి.
మన దేశంలో 80శాతం మంది సానిటరీ నాప్కిన్స్ వాడరు. 20శాతం మంది మాత్రమే నాప్కిన్స్ వాడతారు. నిజానికి నాప్కిన్స్ కంటే క్లాతే మంచిది. కానీ ఆ క్లాత్ను ఉతికిన తరువాత ఎండకు ఆరేయాలి. అప్పుడే దానికున్న బ్యాక్టీరియా చనిపోతది. తిరిగి వాడొచ్చు. కానీ మనవాళ్లు ఎండకు ఆరేయరు. ఎవ్వరికీ కనపడకుండా ఉండే చోటుల్లో వేస్తారు. అక్కడ ఎండ ఉండదు. గాలి ఉండదు. బ్యాక్టీరియా చావదు. ఫలితం ఎన్నో రకాల జబ్బులు. ఇన్ఫెక్షన్లు వస్తాయి. బట్ట ఉపయోగిస్తే... కచ్చితంగా దాన్ని ఎండలోనే ఆరవేయాలి. ఇప్పుడు గ్రామాల్లో సైతం ప్యాడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనం ఉపయోగిస్తున్న నాప్కిన్స్ ఆరు గంటలు మాత్రమే సురక్షితం. అంతకంటే ఎక్కువ సమయం ఒక ప్యాడ్ను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మన దేశంలో 70శాతం సర్విక్ ఇన్ఫెక్షన్సు నెలసరి సమయంలో పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చేవి. కాస్త జాగ్రత్త తీసుకుంటే... ఈ అనారోగ్యాలను మనం నివారించొచ్చు. సరైన జాగ్రత్తలు పాటించక ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్లకు వైరస్ ఉంటుంది. అది కంటిన్యూయస్గా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచంలోనే ఇండియాలో అత్యధికంగా 27 శాతం సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇది చాలా సంవత్సరాలపాటు నెలసరి పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలే.
నెలసరి నెలకు ఎన్నిసార్లు రావాలి? ఎన్ని రోజుల పాటు ఉండాలి? అనే విషయాలు. సాధారణంగా మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు అవ్వొచ్చు. మూడు రోజుల కంటే తక్కువ అవుతున్నా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అంతకంటే ఎక్కువ అవుతున్నా వెళ్లాలి. రుతుక్రమం సరిగ్గా ఉంటే.. మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. లేదంటే థైరాయిడ్, స్ట్రెస్, ఎనీమియా, ఓవరీ, యూట్రస్లో సమస్యలున్నట్టు.
ఇంకా గ్రామీణ భారతంలో తల్లిదండ్రులయితే అమ్మాయి పుష్పవతి అనేది... పెండ్లికి ఓ సూచికలాగా భావిస్తారు. రజస్వల కాగానే రెండు మూడు ఏండ్లు ఇంట్లో ఉంచుకుని పెండ్లి చేసి పంపించేస్తారు. నిజానికి ప్రెగెన్సీకి వాళ్ల శరీరం సంసిద్ధంగా ఉండదు. ఆ వయసులో పెండ్లి చేస్తే... గర్భం దాల్చడానికి ఏది సరైన సమయం అనే అవగాహన కూడా ఆ పిల్లల్లో ఉండదు. దానివల్ల తరువాత జీవితాంతం మహిళలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ు