Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే కూరగాయలకు కరువు. అటు ఇటు చూసి.... ఏవీ అందుబాటులో లేక... చివరకు రెండు చిగురాకులు తెంపుకొచ్చి కూర వండేస్తారు.. పల్లెల్లోని ఆడపడుచులు. ఏ కూరకైనా వంకపెట్టే మగమహారాజులు.. పుల్లపుల్లగా నోటికి తగిలే ఈ కూరను మాత్రం కిక్కురుమనకుండా తినేస్తారు. అట్లా పెద్దవాళ్లనే కాదు... పిల్లలకు కూడా నోరూరించే కూర చింతచిగురు. తెలంగాణలో చింతచిగురు అనగానే దాని జతకు వట్టిచేపలో, మటనో, చికెనో గుర్తొస్తుంది. అలా కాకుండా పూర్తి వెజ్ వంటలు ఈ వారం మీకోసం!
చింతచిగురు పులిహౌర
కావలసినవి:బియ్యం - రెండు కప్పులు, చింత చిగురు - ఒక కప్పు, పల్లీలు - గుప్పెడు, మినపప్పు, శనగపప్పు - చెరో టీస్పూను, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఆవాలు - అర టీస్పూను, ధనియాలు - ఒక టీస్పూను, పసుపు - పావు టీస్పూను
తయారుచేసే విధానం: చింత చిగురు ముందుగా కడిగి, ఎక్కువ తడి లేకుండా తుడిచేయాలి. అన్నం కూడా వండుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి చింగచిగురు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో పోపు దినుసులు వేయించాలి. అంటే ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు వేయించిన దినుసులు, చింతచిగురు మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మళ్లీ స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, పసుపు, రెండు ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అందులో చింతచిగురు పొడి కూడా వేసి కలపాలి. ముందు గా వండిన అన్నాన్ని, ఉప్పుని అందులో వేసి బాగా కలపాలి. అంతే చింగచిగురు పులిహౌర రెడీ.
చింతచిగురు పొడి తయారీ
కావలసినవి:
చింతచిగురు- 200గ్రా., పల్లీలు-పావుకప్పు, దనియాలు- టేబుల్స్పూను, శనగపప్పు- టేబుల్స్పూను, ఎండుమిర్చి- 20, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, నూనె- 4 టీస్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
చింత చిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి పల్లీలు, దనియాలు, శనగపప్పు వేసి వేయించాలి. చివరగా ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తరవాత వీటిని మిక్సీలో వేయాలి. అదే బాణలిలో మిగిలిన రెండు టీస్పూన్ల నూనె వేసి చింతాకు వేసి వేయించి దించి చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీలో వేసిన పప్పుల్లో ఉప్పు, వెల్లుల్లి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి. చివరగా ఆకులు కూడా వేసి పొడి చేయాలి.
చింతచిగురు పొన్నగంటి పచ్చడి
కావలసినవి: పొన్నగంటి కూర-పావుకేజీ, చింతచిగురు-కప్పు, పచ్చిమిర్చి-పది, నువ్వుల పొడి-ఐదుచెం చాలు (వేయించాలి), వెల్లుల్లి రేకలు-ఐదు, ఉప్పు రుచికి తగినంత, ఆవాలు-అరచెంచా, జీలకర్ర-అరచెంచా, మినప్పప్పు-చెంచా, కరివేపాకు-నాలుగు రెబ్బలు, ఇంగువ-చిటికెడు.
తయారుచేసే విధానం:
ముందుగా చింత చిగురు, పొన్నగంటి కూర కడిగి పెట్టుకోవాలి. తరవాత బాణలిలో కొద్దిగా నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పొన్నగంటి కూరవేయాలి. కొద్దిసేపయ్యాక చింతచిగురు వేసి కలిపి మూతపెట్టాలి. ఆకులు బాగా మగ్గాక పొయ్యి కట్టేయాలి. చల్లారాక మిక్సీలో వేసి తిప్పాలి. ఇప్పుడు నువ్వుల పొడి, ఉప్పు వేసి ఒకసారి రుబ్బాలి. తరవాత బాణలిలో రెండు చెంచా నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేయాలి. అవి వేగాక రుబ్బి పెట్టుకున్న మిశ్రమం వేస్తే సరిపోతుంది. వేడివేడి అన్నంలో తింటే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశలతో కలిపి తినొచ్చు. ఈ రెండు ఆకుకూరల వల్ల చక్కటి పోషకాలు అందుతాయి. పిల్లలూ ఇష్టంగా తింటారు.
చింతచిగురు కొబ్బరి పచ్చడి
కావలసినవి:
చింతచిగురు-125 గ్రాములు, కొబ్బరి తురుము-ఒక కాయ, ఎండుమిర్చి-పదిహేను, వెల్లుల్లి రెబ్బలు-ఎనిమిది, జీలకర్ర-ఒక టీ స్పూన్, కరివేపాకు-రెండు రెమ్మలు, ఉప్పు, నూనె-తగినంత, తాలింపునకు - శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
చింతచిగురు శుభ్రంగా కడగాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించి తీసుకోవాలి. మరో రెండు స్పూన్లు నూనె వేసి చింతచిగురు వేసి వేయించాలి. మగ్గిన తరువాత కొబ్బరి తురుము కూడా వేసి రెండు నిముషాలు వేయించాలి. ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగిన చింతచిగురు, కొబ్బరి మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
మీల్ మేకర్ చింతచిగురు కూర
కావలసినవి: నూనె - 3 టీ స్పూన్లు, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉల్లి తరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు, పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, మీల్ మేకర్ - 2 కప్పులు (సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి), చింతచిగురు - కప్పు, జీలకర్ర పొడి - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, కారం - టీ స్పూను
తయారుచేసే విధానం:బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, తరుగు, పసుపు వేసి వేయించి మూత ఉంచాలి. ఉడికిన తర్వాత మూత తీసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. నానబెట్టుకున్న మీల్ మేకర్ జతచేయాలి. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలిపి మూత ఉంచి, సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. చింతచిగురు జత చేసి, ఆకు మెత్తపడే వరకు ఉడికించి, దించాలి. ఇది చపాతీలలో బాగుంటుంది.