Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమలాదాస్ సురయ్య... స్త్రీల సెక్సువాలిటి, మనోభావాలు, భావావేశాలు, పురుషాధిక్య సమాజం అర్ధం చేసుకోలేని, అర్ధం చేసుకోడానికి నిరాకరించే స్త్రీల సమస్యలను కవిత్వీకరించారు. నిరంతర అన్వేషిగా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల పర్యవసానంగా ప్రజల ఆగ్రహాలను చవి చూశారు. మతం మార్చుకున్నారు. ప్రేమతో నిండిన స్త్రీ పురుష సంబంధాల కోసం జీవితమంతా అన్వేషించారు. మనుష్యుల మధ్య మానవీయ సంబంధాల కోసం ఆరాటపడ్డారు.
1932లో మలబార్ తీరంలో సంప్రదాయ నాయర్ల కుటుంబంలో పుట్టింది. తండ్రి వి.యం.నాయక్ 'మాతృభూమి' మళయాల పత్రికకు మేనేజింగు ఎడిటర్గా పనిచేసేవారు. తల్లి బాలామణి కవయిత్రి. తల్లి, మేనమామ నారాయణ మీనన్లు రచయితలుగా ప్రసిద్ధులవ్వడం వల్ల ఇంటి నిండా సాహిత్య వాతావరణం వుండేది. చిన్నప్పటి నుండే కవిత్వం చదవడం అలవాటైందామెకు. బాల్యంలో ఎదుర్కొన్న ఒంటరితనం... స్కూల్ వాతావరణం, అక్కడి యాంత్రికత ఆమెకు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి. అందుకే ఆరేళ్ళ వయసులోనే ఎంతో విషాదభరితమైన కవిత్వాన్ని రాశారు. 15 సంవత్సరాలకే తన కంటే చాలా పెద్దవాడయిన మాధవ దాస్తో పెళ్ళి చేశారు. ఆమె మరింత నైరాశ్యంలోకి వెళ్లిపోయింది.
సంఘర్షణను కవిత్వీకరించి...
పెళ్ళి, భర్త లాంటి ఆలోచనలు కలగని వయస్సులోనే పెళ్ళవడం, వివాహ జీవితంలో కుదురుకోకముందే 16 ఏళ్ళకే తల్లవడం జరిగిపోయాయి. తను ఊహించుకున్న జీవితానికి, వాస్తవంలో తను బతుకుతున్న జీవితానికి ఎక్కడా పొంతన కుదరక తీవ్రమనస్తాపం చెందేది. ఈ సంఘర్షణ ఆమె కవిత్వంలో పొంగిపొర్లేది. ఇంట్లో పనంతా అయ్యాక, అందరూ తిని నిద్రపొయ్యాక, అర్థరాత్రి వేళ డైనింగు టేబుల్ని శుభ్రం చేసుకొని అక్కడే రాయడానికి కూర్చునేది. గంటలు అలా గడిచిపోతుండేవి. ఒక్కోసారి తెల్లారిపోయేది. రాత్రంతా మేలుకొని రాస్తూ వుండడం, పగలు మళ్ళీ కుటుంబ బాధ్యతలు వీటన్నింటితో ఆమె ఆరోగ్యం పాడవడం మొదలైంది. కమలాదాస్ కథలు, నవలలు రాసినప్పటికీ ఆమె రాసిన కవిత్వం బహుళ ప్రజాదరణ పొందింది. తనలో చెలరేగే సంఘర్షణలను, భావోద్వేగాలను, కల్లోలాలను వ్యక్తీకరించడానికి కథ, నవల కన్న కవిత్వాన్నే ఎక్కువగా ఎంచుకున్నది. ఆమె భావాల తీవ్రత, స్వేచ్ఛా కాంక్ష కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతుంది. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసే మాధవ్ దాస్ ఇంటా బయటా ఎప్పుడూ డబ్బులెక్కల్లోనే మునిగి తేలుతుండడం, ఆమె ఏం రాస్తే డబ్బులు రాలతాయో ఆలోచించడం, ఆమెను కవిత్వం రాయడం మానేసి కథలు రాయమని నిర్దేశించడంతో కమల నవలలూ, కాలమ్స్ రాయడం మొదలుపెట్టింది.
'మైస్టోరీ'తో అంతర్జాతీయ కీర్తి...
కమలాదాస్ మళయాళ సాహిత్యాన్ని 'మాధవకుట్టి' పేరుతో, ఆంగ్ల సాహిత్యాన్ని 'కమలాదాస్' పేరుతోను రాసేది. ఆమె రాసిన ఆంగ్ల రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. నోబుల్ సాహిత్య పురస్కారానికి కూడా నామినేట్ అయ్యాయి. కమలాదాస్ ఆంగ్లంలో అయిదు కవితాసంపుటులు ఒక నవల 'అల్ఫాబెట్ ఆఫ్ లస్ట్', 'పద్మావతి ది హర్లెట్ అండ్ అదర్ స్టోరీస్' పేరుతో కథల సంపుటి, 'మై స్టోరీ' ఆత్మకథ ప్రచురించింది. 1976లో ఆమె ప్రచురించిన 'మైస్టోరీ' జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గొప్ప కీర్తిని సంపాదించిపెట్టినా అంతే స్థాయిలో ఆమె మీద విమర్శల జడివాన కూడా కురిసింది. అందులో ఆమె వర్ణించిన అనుభవాలు, వివాహేతర సంబంధాల వర్ణనలు, ఆడస్నేహితులతో ఎదురైన అనుభవాలు, భర్త కొనసాగించిన హౌమోసెక్సువల్ సంబంధాలు వీటిన్నింటిని నదురు బెదురు లేకుండా తన ఆత్మకథలో రాసిన కమలాదాస్ సంప్రదయవాదులతో పాటు బంధువుల ఆగ్రహానికి కూడా గురైంది. లెస్బియన్ రిలేషన్ షిప్ గురించి ఆమె రాసిన అంశాలు చాలా మందిని కమలాదాస్ రాసిన విషయాలు ఆనాటి మళయాళీ సమాజాన్ని ఓ కుదుపు కుదిపాయి.
జీవితమంతా అన్వేషణ...
కమలాదాస్ తన జీవితమంతా ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించింది. 'ప్రేమతోను, నమ్మకంతోను నిండిన సంబంధాలను స్త్రీ పురుషులు ఇద్దరూ కోరుకుంటారని, అవి ఇంట్లో దొరకనప్పుడు బయట వెతుక్కుంటారని' ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె. ఆమె మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి అక్షరం వివాదాస్పదమైంది. మానవీయ స్త్రీ పురుష సంబంధాల గురించి ధైర్యంగా రాయడం ద్వారా కొత్తగా రాస్తున్న రచయిత్రులకు ఎంతో స్ఫూర్తిని, నిబ్బరాన్ని ఇచ్చింది. ఎనభై దశకంలో వెల్లువెత్తిన స్త్రీవాద సాహిత్యానికి, స్త్రీ వాద కవయిత్రులకు స్ఫూర్తిగానూ కమలాదాస్ రచనలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇస్లాం స్వీకరించి...
డిసెంబరు 16, 1999 సంవత్సరంలో 65 ఏళ్ళ వయస్సులో ఇస్లామ్ మతాన్ని స్వీకరించింది. ఆమె రచనలు ఎంత సంచలనం కల్గించాయో ఆమె ఇస్లామ్ మత స్వీకరణ కూడా వేడి వేడి చర్చల్ని లేవనెత్తింది. అంతే కాదు బురఖా ధరిస్తూ, స్త్రీలను అణిచివేసే హిందూ మతంలో కన్నా ఇస్లామ్లోనే స్త్రీలకు రక్షణ వుందనే ప్రకటన కూడా చేసింది. సహజంగానే ఇలాంటి ప్రకటనలు జనంలో ఆమె పట్ల ఆగ్రహం పెల్లుబికేలా చేశాయి. అయినా తాను నమ్మిన దాన్ని ఆచరించడానికి, రాయడానికి, బహిరంగంగా ప్రకటించడానికి ఏనాడు జంకలేదు. ఒక సంప్రదాయ హిందూ నాయర్ కుటుంబానికి చెందిన కమలాదాస్, భర్త మరణానంతరం ఇస్లాం స్వీకరించి, పేరు మార్చుకుని తుదివరకు అలాగే బతికింది. పురుషాధిక్య సమాజం, ఛాందసవాద భావాలపై పోరాడిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి కమలాదాస్ సురయ్యా (75) మే 31న 2009లోకన్నుమూశారు.