Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొడుకులతోనే పున్నామనరకమ'నుకునే పితృస్వామిక వ్యవస్థలో ఆమె ఆరో వేలుగా పుట్టింది. అంత వివక్షలోనూ తండ్రి చూపించిన అక్షరం... ఆమెకో లక్ష్యాన్ని ఏర్పరిచింది. 'ఆడపిల్లకు చదువెందుకు? ఇంకా పెండ్లి చేయరా?' అనే ఇరుగుపొరుగును తప్పించుకుని పారిపోయి.. విశ్వవిద్యాలయాన్ని చేరింది. అక్కడే ఆమె ప్రపంచం విశాలమయ్యింది. పేదరికాన్ని, కుల, లింగ వివక్షలను ఓడించి... ఒకటికాదు, రెండు కాదు ఒకేసారి ఆరు ఉద్యోగాలను సంపాదించుకుంది. అన్నీ వదులకుని.. అధ్యయనానికి అవకాశమున్న అధ్యాపక వృత్తిని ఎంచుకుని.. ఇప్పుడు సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నది. ఆమె నందిగామ నిర్మల. పరిశోధనలో నిత్య విద్యార్థిని. 'సాహిత్య పరిశోధనే నా ఊపిరి' అని చెప్పే ఆ ప్రతిభాశాలి పరిచయం.
నిర్మల పుట్టింది ఖమ్మం జిల్లా చెరువు మాదారం. తండ్రికి కరెంట్ ఆఫీసులో అటెండర్ ఉద్యోగం. దాంతో పాల్వంచ, తర్వాత ఖమ్మం గుట్టల బజార్కి మారింది కుటుంబం. నలుగురు అమ్మాయిల తర్వాత కూడా అబ్బాయి కోసం చూస్తుంటే... ఐదుగురి సంతానంలో ఆమె ఆరో వేలుగా పుట్టింది. మళ్లీ ఆడపిల్లేనా.. అన్న నిట్టూర్పుల మధ్య.. చిన్నప్పటినుంచి వివక్షతో పెరిగింది. తండ్రి చేసిన గొప్ప పని... వార్తా పత్రిక వేయించి, కచ్చితంగా అందరితో చదివించడం. పత్రికలోని శీర్షికలన్నీ ఒక్కటికూడా వదిలి పెట్టకుండా చదివేది నిర్మల. చివరకు దారుల్లో సైన్ బోర్డ్సుకూడా వదలకుండా చదవడం అలవాటయ్యింది. తను పనిచేసే ఆఫీసులో ఆఫీసర్స్ను చూడటం వల్ల... వాళ్లలా తన పిల్లలు కావాలన్న ఆకాంక్ష ఉండేది తండ్రికి. కానీ పరిస్థితులు అంతంత మాత్రం. ఆర్థిక సమస్యలు బాగా అనేకం. ఐదుగురు ఆడపిల్లలు కాబట్టి తొందరగా పెండ్లి చేయాలి. భారం తీరిపోతది అనుకు నేవాళ్లు. అందుకే... నిర్మల నలుగురక్కలకీ టెంత్ అయిపోగానే పెండ్లి చేసేశాడు తండ్రి. కానీ ఆమె చదువు మాత్రం అలా ఆగిపోలేదు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకుంది నిర్మల.
ట్యూషన్ టీచరం ప్రభావం...
చిన్నపుప్పడు ట్యూషన్ టీచర్ కుమారి ఆమెను బాగా ప్రభావితం చేసింది. సుమతీశతకం, వేమన శతకం పద్యాలు నేర్పించింది. దాంతో భాష మీద పట్టు వచ్చింది. నిర్మల బాబారు కొడుకు... తెలుగు టీచర్. ఆయనా గైడెన్స్ ఇచ్చేవారు. ''మీరందరూ అమ్మాయిలే. అక్కల్లాగే నీకు తొందరగా పెండ్లి చేసి వెళ్లగొట్టాలని చూస్తారు. తెలుగు చదువు. తెలుగు పండిట్ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది. సెటిలయిపోవచ్చు'' అని చెప్పేవాడు. అలా తెలుగులో డిగ్రీ చేసింది. ఆమె డిగ్రీ అయిపోయిందో లేదో... పదవీ విరమణ అయిన ముప్పై రోజులకే తండ్రి తుదిశ్వాస విడిచారు. చదువు విషయంలో అప్పటిదాకా ఆమెకున్న ఆశ.. తండ్రి. ఆయన చనిపోవడంతో...ఆ ఒక్క ఆశ ఆవిరయ్యింది. 'రిటైర్మెంట్ డబ్బులు కూడా వచ్చాయి. పెండ్లి చేస్తే అయిపోతుంది. ఆలస్యమయితే ఆ డబ్బులు కూడా అయిపోతాయి' అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఆమెకు చదువుకోవాలన్న కోరిక. ఉద్యోగం చేయాలన్న లక్ష్యం. డిగ్రీ తరువాత ఖాళీగా ఉంటే... ఎట్లయినా పెండ్లి చేసేస్తారు. అప్పటికే నలుగురు అక్కల జీవితాలను చూసింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో... రకరకాల సమస్యలు. పెండ్లి చేసుకోకూడదు, చదువుకోవాలని పీజీ ప్రవేశ పరీక్ష రాసింది. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఎమ్మే తెలుగు చేసింది. పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే టీపీటీనోటిఫికేషన్. ప్రయివేటు హాస్టల్లో ఉండి ఆంధ్రసారస్వత పరిషత్లో టీపీటీ పూర్తి చేసింది. వెంటనే డీఎస్సీ పడలేదు. అన్నీ సర్దుకుని ఖమ్మం తిరుగు ప్రయాణం.
టీచర్గా పరీక్ష..
'ఏదో సాధిస్తానని వెళ్లింది. మూడేండ్ల తరువాత బ్యాగ్ సర్దుకుని వచ్చేసింది. హైదరాబాద్కు వెళ్లి ఏం సాధించింది' ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు. వాటినుంచి తప్పించుకోవడానికి.. రోజూ లైబ్రరీకి వెళేది. పేపర్లు, పుస్తకాలు...అన్నీ చదివేదాన్ని. అట్లా భాష మీద పట్టు వచ్చింది. ఓ ప్రయివేటు స్కూల్లో టీచర్గా చేరి, ఎనిమిది, తొమ్మిది తరగతులకు తెలుగు బోధించి తనను తాను పరీక్షించుకుంది. పీజీ చేసి ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటే ఉంటే సరిపోదు. ఇంకా కష్టపడాలి. మంచి స్థానానికి వెళ్లాలి. ఇదే ఆలోచన. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీనుంచి ఎంఫిల్ నోటిఫికేషన్ వచ్చింది. రాసి, ఫస్ట్ ర్యాంక్ సాధించుకుంది. చదవడం ఆమె చేతిలోఉంది. కానీ... హైదరాబాద్కు రావడంతో మాత్రం తన తల్లి చేతిలో ఉంది. చదువుకుంటానని తల్లితో చెప్పింది. కానీ.. 'ఇలా వెళ్లిపోతే పెండ్లి చేయకుండా తిప్పుతున్నదని చుట్టాలందరు నన్ను అంటరు?' అని తల్లి ఒక్కటే ఏడుపు. కష్టపడి తల్లిని ఒప్పించింది. ఎవ్వరికీ చెప్పకుండా... హైదరాబాద్ బస్సెక్కింది. ఓయూ లేడీస్ హాస్టల్లో ఉంటూ 'బి ఎస్ రాములు కథలు-సామాజిక పరిణామాలు' అంశంపై ఎంఫిల్ మొదలుపెట్టింది. ఆర్ట్స్ కాలేజీ మీదుగా వీచిన గాలులే ఎంతోమందికి నూతనోత్సాహాన్నిస్తాయి. అతిశయోక్తిగా అనిపించినా అదే నిజం. అట్లాంటిది ఆ కాలేజీలో చేరిన ఆమెకు... లక్ష్యం తెలిసొచ్చింది. అప్పటిదాకా టీచర్ అయితే చాలనుకుంది. కానీ చెన్నప్ప, వెంకట్రెడ్డి వంటి ప్రొఫెసర్ల ప్రోత్సాహం ఆమెను... సివిల్స్ వైపు మళ్లించింది.
అధ్యయనం నుంచి పరిశోధన వరకు...
ఎంఫిల్ చేస్తూనే పోటీ పరీక్షలకు అధ్యయనం మొదలుపెట్టింది. రెండున్నర సంవత్సరాల ఎంఫిల్ తరువాత అక్కడే పీహెచ్డీలో చేరింది. 'ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వం-ధోరణులు' అంశంపై పరిశోధన మొదలుపెట్టింది. మరోవైపు... ఏ నోటిఫికేషన్ వచ్చినా.. అప్లై చేయడం, రాయడం. 2011లో గ్రూప్-2, డీఎస్సీ, హాస్టల్వార్డెన్, మోడల్ స్కూల్, జేఎల్ .. అన్నీ ఒకేసారి వచ్చాయి. అన్నింటికీ అప్లై చేయడమే కాదు. కష్టపడి రాసింది. ఒకటి కాదు... రెండు కాదు.. ఒకేసారి ఆరు ఉద్యోగాలు. గ్రూప్టు నాన్ ఎగ్జిక్యూటివ్, డీఎస్సీ, హాస్టల్ వార్డెన్, ఖమ్మం మోడల్ స్కూల్, జేఎల్ వచ్చాయి. సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యింది. మెయిన్స్కి చదవడానికి తన ఆర్థిక స్థోమత సరిపోదు. గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు. కాబట్టి అన్నీ వదిలేసి... జూనియర్ లెక్చరర్గా చేరింది. 2012లో నిజామాబాద్లో పోస్టింగ్. 2016లో నందిని సిధారెడ్డి పదవీవిరమణతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. బదిలీ అయ్యి ప్రమోషన్ మీద... సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నది. అదే కాలేజీలో మహిళా సాధికారతా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. కె.వి రమణాచారి నాన్నగారు కె.వి.రాఘవాచారి సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో చదువు కుని, అదే కాలేజీలో సంస్కృతం అధ్యాపకునిగా పనిచేశారు. కెవిరాఘవాచారి స్మారక సాహిత్య పీఠం అని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. ఎన్ఎస్ఎస్ గాళ్స్ యూనిట్ కో ఆర్డినేటర్ కూడా పనిచేస్తున్నారు. దాదాపు పన్నెండు అంతర్జాతీయ, పదిహేను జాతీయ సదస్సులలో పేపర్స్ ప్రజెంట్ చేసింది. భక్తి, నవల, కాలంతో కథ, కవిత్వం మానవ జీవిత ప్రభావం, స్త్రీ వాద సాహిత్యం.. ఇలా అనేక అంశాల మీద ఇప్పటికే అనేక పరిశోధనా వ్యాసాలు రాసింది.
విద్యార్థులే ప్రపంచంగా...
కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత అయిపోయిందనిపించుకోదు. విద్యార్థుల చదువును మాత్రమే పట్టించుకోదు... వాళ్ల సమస్యలను సైతం అర్థం చేసుకుంటుంది. వాళ్ల ఇండకు వెళ్లి... తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. గ్రామాల్లో ఇంటర్అయిపోగానే ఆడపిల్లల పెండ్లి చేసేస్తారు. అలాంటి వాళ్ల ఇండ్లకు వెళ్లి... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తుంది. చదువు ప్రాముఖ్యత చెబుతుంది. డిగ్రీనో, పీజీనో చదివించాక పెండ్లి చేయమంటూ సూచిస్తుంది. చదువుకునేది ఉద్యోగం కోసమే కాదు... వాళ్ల వ్యక్తిత్వం ఏర్పడటం కోసమని చెబుతుంది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న పిల్లలకు చదువులో సహాయం చేస్తున్నది. అరవై నిమిషాలు క్లాసులో ఇరవై నిమిషాలు బయటి సామాజికాంశాలే చెబుతుంది. అందుకే ఎక్కడికివెళ్లినా.. పిల్లలు ఆమె చుట్టూ ఉంటారు. ఆమెఉ పిల్లల్లో కలిసిపోయి ఉంటుంది. అక్కడ చదువు అయిపోయాక, ఆమెను ఒక్కసారి చూడటం కోసం... యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి.. విద్యార్థులు కళాశాలకు వస్తారంటే ఎంతలా అభిమానాన్ని సంపాదించు కున్నదో అర్థం చేసుకోవచ్చు. అవన్నీ తనకు మరింత మానసిక స్థైర్యాన్నిస్తాయని చెబుతుందామె. నెట్, జేఆర్ఎఫ్ కోచింగ్ కూడా ఇస్తుంది. 'అధ్యాపక వ త్తిలో పొందిన సంత ప్తి మరే రంగంలోనూ పొందలేం' అని చెబుతుంది. విద్యార్థులే ఆమె ప్రపంచం.
పరిశోధనలో నిత్య విద్యార్థిని..
''పరిశోధన నాకు చాలా ఇష్టం. ఏదైనా ఒకఅంశాన్ని తీసుకుని పరిశోధించాలి. ముందు తరాల వాళ్లు ఏం చెప్పారు. ఇప్పుడు మనమేం చెబుతున్నాం. భావి తరాలకు ఏం అందించాలన్నది ఆలోచన. ఇప్పటికి దాదాపుగా పద్నాలుగు అంతర్జాతీయ, పదిహేనుకు పైగా జాతీయ సదస్సుల లో నా పరిశోధనా పత్రాలు సమర్పించాను. అనేక కార్యశాలల్లో భాగం అయ్యాను. అనేక సావనీర్లలో నా సాహిత్య పరిశోధనా పత్రాలు చోటు చేసుకున్నాయి. ఇక సాహిత్య వ్యాసాలూ సమీక్షలు, కవిత్వం కూడా అనేక సంకలనాల లో భాగం అయ్యాయి. వివిధ సెమినార్ లలో నేను చేసిన పరిశోధనా పత్రాలను ఒక పుస్తకంగా తీసుకొని రావాలి. సాహిత్య పరిశోధనే నా ఊపిరి. పరిశోధనలో నిత్య విద్యార్థిని'' అని చెప్పే నిర్మల... సాహిత్యరంగంలో చేస్తున్న సేవను 'బహుజన సాహిత్య అకాడమీ'గుర్తించింది. 'సాహిత్య రత్న' అవార్డుతో ఈ నెల 9న తిరుపతిలో సత్కరించనుంది.
సమస్త భావోద్వేగాల వ్యక్తీకరణ...
నాకు ప్రాచీన, ఆధునిక సాహిత్యం రెండూ ఇష్టమే. అయితే ప్రాచీన సాహిత్యం చదివినప్పటికి, ఆధునిక సాహిత్యం చదివిన ప్పటికి నాలో చాలా మార్పు వచ్చింది. ప్రాచీన కావ్యాల్లో స్త్రీని కావ్య కన్యగా చేసి, స్త్రీ అంగాంగ వర్ణన చేసేవారు. ఆధునిక కాలంలో... యురోపియన్ సమాజం నుంచి, పాశ్చాత్య సాహిత్య ప్రభావం నుంచి ఆధునిక సాహిత్యంలోకి అనేక ధోరణులు, పాయలొచ్చాయి. శివకవుల కవిత్వం ఇష్టం. శివకవులు 12వ శతాబ్దంలోనే సమాజంపై తిరుగుబాటు చేశారు. వాళ్ల కవిత్వంలో ధిక్కారస్వరం ఉండేది. బసవ పురాణంలో పాత్రలు కూడా ఇష్టం. మా ఖమ్మం కవులు దాశరధి సోదరులు మొదలు.. ఇప్పుడున్న మైనారిటీ కవుల వరకు అందరి కవిత్వం చదువుతా. ఆధునిక కవుల్లో అఫ్సర్, ప్రసేన్, సీతారాం, షాజాహాన కవిత్వం ఇష్టం. గురి చూసి పాడే పాట ఒక వందసార్లు చదివి ఉంటాను. వీళ్లందరితోపాటు శ్రీశ్రీ, చలం సాహిత్యం కూడా నా జీవితం మీద ప్రభావం చూపించాయి. ఆత్మకథలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు ఎక్కువగా చదువుతాను. ఈ సాహిత్యం అంతా సమాజం మీద ఎంతో ప్రభావం చూపింది. సాహిత్యం అంటే పిచ్చి. ఎందుకంటే సమస్త భావోద్వేగాల వ్యక్తీకరణ సాహిత్యం ద్వారా చేయగలుగుతాం కదా!.
రెండు రకాల వివక్ష...
లింగవివక్ష, కుల వివక్ష రెండూ చూశాను. అమ్మాయికి చదువెందుకు అనుకునే లింగ వివక్ష ఊరి సమాజంలో ఉంటే.. ఈ దళిత మహిళ ఇంత దూరం ఎట్లా వచ్చింది అనే అసూయ పట్టణ సమాజంలో ఉన్నది. లెక్చరర్స్ అయినా... ఆ వివక్షలేవీ పోగొట్టుకోరు. సెమినార్లకు వెళ్లి వచ్చిన తరువాత.. అభినందిం చడానికి కూడా మనసు ఉండదు. ఆడవాళ్లకు చదువు అవసరమా... అనే భావన. 'ఒక్కరే సెమినార్లకు భలే వెళతారండి!' పొగిడినట్టుగానే ఉండే మాటల్లో చాలా అర్థాలుంటాయి. అదే ఓ అగ్రకులానికి చెందిన మహిళ అయితే ఈ వివక్ష ఉండకపోయేది. ఎక్కువ కులం వాళ్లయితే... ఎంత అసమర్థులైనా పైకి తీసుకురావాలని చూస్తారు. తక్కువ కులం వాళ్లయితే ఎంత సమర్థులయినా అణగదొక్కేయాలని చూస్తారు.
ఒక్కో మహిళదీ ఒక చరిత్ర...
చరిత్రలో మథర్థెరిస్సా, ఝాన్సీలక్ష్మీభాయి, రాణి రుద్రమదేవి వంటివాళ్ల గురించి పరీక్ష దృష్టితో చదివి వదిలేయకుండా.. పూర్వాపరాలు అధ్యయనం చేసేదాన్ని. కానీ.. వాళ్లేకాదు, మన చుట్టూ ఉన్న మహిళలొక్కొక్కరిదీ... ఒక చరిత్ర. చదువుకున్నవాళ్లు, చదువు కోనివాళ్లు. మా అమ్మ చదువుకోకపోయినా... ఆర్థిక సమస్యలున్నా, ఆరుగురు మరుదులకు పెండ్లి చేసింది. పేదరికంలోనూ ఆరుగురు పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ సమర్థవంతంగా చేసింది. అమ్మను చూసి చాలా స్ఫూర్తి పొందుతాను. నా ట్యూషన్ టీచర్ కుమారి కూడా నాకు ఆదర్శం. ఆమె డిజేబుల్డ్. ఇంట్లోనే ఉండి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఐదుగురు చెల్లెళ్లకు పెండ్లి చేసి... వాళ్లకు జీవితాన్నిచ్చింది. తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. గొప్పవాళ్లెక్కడో పుస్తకాల్లోనే ఉండరు.. మన చుట్టే ఉంటారు. మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దృఢ చిత్తంతో ఉండాలి. ఏ పనిచేయాలను కున్నా.. ఆ పని పూర్తి చేసేంతవరకు పట్టు వదలకుండా ఉండాలి. అందుకే ఆడపిల్లకు స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే తనను తాను నిరూపించుకుంటుంది.