Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాట్యబోధన వృత్తిగా.. నాట్యసాధన ప్రవృత్తిగా తీసుకున్న ఆమె తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారు. జీవిత భాగస్వామికూడా నాట్యాచార్యుడు కావడంతో రెండున్నర దశాబ్దాలుగా ఆమె ప్రపంచం నాట్యమే అయ్యింది. ఇటీవల ఆఫ్రికాలోని సెనగల్లో మూడు రోజుల పాటు జరిగిన తిరంగ ఫెస్టివల్లో మన దేశ ప్రతినిధులుగా పాల్గొని సకుటుంబ సమేతంగా ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించారు. ఆమే తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్యవిభాగాధిపతి కాంచనపల్లి రత్నశ్రీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నాట్యంపై వ్యాసాలు రాస్తూ ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె పరిచయం..
ఎనిమిదో ఏటా నాట్యసాధన ప్రారంభించాను. ప్రముఖ గురువు రోజారాణి గారివద్ద మొదట భరతనాట్యం నేర్చుకున్నాను. మాడపాటి హనుమంతరావు హైస్కూల్లో పదోతరగతి వరకు, రెడ్డి కాలేజీలో ఇంటర్ వరకు చదివాను. నా ఇంటర్ పూర్తి అయ్యేనాటికి తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు జరగడం, అదే ఏడాది లలితకళల విభాగం ఏర్పాటు కావడంతో భరతనాట్యంలో సర్టిఫికెట్ కోర్సు, డిప్లోమా పూర్తి చేశాను. ఆ తర్వాత బి.ఏలో కూచిపూడి మాత్రమే ఉండటంతో ప్రముఖ గురువు ఉమా రామారావు గారి సూచనతో బి.ఏ కూచిపూడిలో చేరాను.
మాదే ఫస్ట్ బ్యాచ్...
తెలుగు యూనివర్సిటీలో కూచిపూడి విభాగంలో చేరిన ఫన్ట్ బ్యాచ్ మాదే. ఆ తర్వాత ఎం.ఏలో చేరాను. గోల్డ్మెడల్ సాధించాను. ఫస్ట్ బ్యాచ్లో యూనివర్సిటీలో గోల్డ్మెడల్ అందుకున్న విద్యార్థిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత 1993లో యూనివర్సిటీలోనే ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఎం.ఫిల్ పూర్తి చేసి 2006లో డాక్టర్ ఉమా రామారావుగారు గైడ్గా, ప్రముఖ గురువు ఆచార్య అలేఖ్యపుంజాల గారి (కో గైడ్) వద్ద 'కూచిపూడి యక్షగానాలు - మేలట్టూర్ భాగవతమేళ నాటకాలు - ఒక తులనాత్మక పరిశీలన' అంశంపై పిహెచ్డి పూర్తి చేశాను.
సాహిత్యప్రముఖులతో..
నాన్న ప్రొఫెసర్ రమేష్రాజు. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటులో ఉండేవారు. అమ్మ లీలావతి. గృహిణి. తాతయ్య (అమ్మ తండ్రి) బిరుదురాజు రామరాజు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు విభాగంలో పిహెచ్డి అందుకున్న మొదటివ్యక్తి. ప్రముఖ సాహిత్యవేత్తలు దాశరథి కృష్ణమాచార్య గారు, కాళోజిగారు, వట్టికోట ఆళ్వారు స్వామిగారు, సి.నారాయణ రెడ్డిగారు తదితరులు తాతగారి కోసం వచ్చేవారు. సాహిత్య ప్రముఖులతో ఇల్లు కళాక్షేత్రంగా ఉండేది. ఇంట్లో బోధనారంగం లో ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో నేను బోధనారంగాన్నే ఎంచుకున్నాను. రెండున్నర దశాబ్దాలుగా నాట్యబోధనలో కొనసాగుతూ ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ కూచిపూడి విభాగం హెచ్ఓడిగా ఉన్నాను.
జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో..
తెలుగు యూనివర్సిటీ లో నాతో పాటుగా బి.ఏ, ఎం.ఏ చేసిన రుద్రవరం సుధాకర్ తో పెండ్లి తర్వాత నా జర్నీ అంతా నాట్యమే. ఇద్దరిదీ ఒకే వృత్తి, ప్రవృత్తి కావడంతో జీవితం ాట్యసాధనలో సాఫీగా సాగిపోతోంది. 2005లో 'కూచిపూడి నృత్య సిద్ధాంత బోధిని' గ్రంథాన్ని ప్రచురించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక డాన్స్ జర్నల్స్లో కూచిపూడి నాట్యంపై ఆర్టికల్స్ రాశాను. శాస్త్ర బద్దంగానే నాట్యబోధన ఉండాలన్న ఆలోచనతో కూచిపూడికి సంబంధించి అనేక అంశాలను సరళతరం చేస్తూ వ్యాసాలుగా రాసే పనిలో ఉన్నాను. సిద్ధాంతపరంగా, ప్రయోగికపరంగా కూచిపూడి నాట్యాన్ని క్షేత్రస్థాయి వారికి కూడా చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ప్రతి ఏటా..
మా వారు 1985లో శ్రీ సిద్దేంద్ర కళాపీఠం' ఏర్పాటుచేశారు. పెండ్లి తర్వాత ఇద్దరం కలిసి ఇక్కడ నాట్యం నేర్పిస్తున్నాం. కేవలం ప్రోగ్రామ్ ఇవ్వడానికే కాకుండా ఏదైనా కళను నేర్చుకోవాలన్న ఆసక్తిలో మా వద్దకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మూడేండ్ల వయసు నుంచి ముఫ్పైయేండ్ల దాటిన వారు కూడా వస్తున్నారు. కొందరిని తల్లిదండ్రులు తమ ఆసక్తితో ఇక్కడ చేరిస్తే ఆ తర్వాత వారు నాట్యంపై మక్కువ పెంచుకుని నాట్యసాధనలో నిమగమవుతున్నారు. మా ఇనిస్టిట్యూట్ నుంచి ప్రతి ఏటా ఐదారుగురు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత వారిలో చాలామంది డిప్లామాలు, పిజీలు పూర్తి చేసినవారున్నారు.
కుటుంబ సమేతంగా..
మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి సాహితీ ప్రియ ఆర్కిటెక్ట్, చిన్నామ్మాయి మహతి కీర్తన, డిగ్రీ ఫైనలియర్. మా అమ్మాయిలిద్దరికీ సంగీతంలోనూ, నాట్యంలో ప్రవేశం ఉంది. ఇటీవల ఆఫ్రికాలోని సెనగల్లో మూడు రోజుల పాటు జరిగిన తిరంగ ఫెస్టివల్లో ఐసిసిఆర్ తరపున పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ వేదికపై నేను, మా వారు, పిల్లలిద్దరూ కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చాం.
బాధ్యతను పెంచేలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నాను. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ' విశిష్ట మహిళా పురస్కారం' నా బాధ్యతను మరింత పెంచింది.
మూలాలు మరిచిపోకుండా...
కూచిపూడి కళ నేడు ఆధునిక పేరుతో అనేక రూపాల్లోకి మారుతోంది. ఆహార్యంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జీనుగబెండుతో తయారుచేసే తేలికపాటి ఆభరణాల స్థానంలో లోహాలతో, పూసలతో తయారు చేసిన ఆభరణాలు అందుబాటు లోకి వచ్చాయి. కాలానుగుణంగా వచ్చే మార్పులను ఆహ్వానించా ల్సిందే. అయితే నాట్యకళ మూలాలను మరిచిపోవద్దు. ఆధునికత పేరుతో విపరీతాలకు పోయి ఫ్యూజన్ అంటూ శాస్త్రబద్ధత లేని విధానాలను తీసుకువస్తే ముందుతరాల వారికి సరైన నాట్యకళను అందించలేం. నాట్యమంటే వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి కావల్సిన మూడు భంగిమలు, ఆరు ముద్రలు కాదు. నాట్యమంతా ఒక శాస్త్రం. దాన్ని పూర్తిగా నేర్చుకోవాలి. నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగాకొత్త నృత్యరూపకాలను కంపోజ్ చేయాలి. అలా అని శాస్త్రాన్ని దాటి విపరీతాలకు పోవద్దు.
మనోవికాసం పెరుగుతుంది..
ఇప్పుడు కొన్ని ప్రైవేటు, కార్పోరేట్ స్కూల్లల్లో నాట్యాన్ని కో కరిక్యులం సబ్జెక్ట్గా పిల్లలకు నేర్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో నాట్యాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని మేం కోరుతున్నాం. పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించే కళలను నేర్పడం ద్వారా వారిలో మనోవికాసం ఇనుమడింపజేయవచ్చు. అంతేకాదు.. నాట్యశాస్త్రాన్ని అభ్యసించిన వారికి ఉపాధి లభిస్తుంది.