Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాల వార్షికోత్సవానికి వెళ్ళిన పదకొండు సంవత్సరాల కళ్యాణి ఆ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. 7.30 కల్లాకార్యక్రమం ముగిసింది. పక్కింటి వారితో కలిసి వస్తానన్న కళ్యాణి ఇంటికి చేరలేదు. ఇంట్లో వారితో కలిసి వెళ్ళిపోయిందని పక్కింటివారు, పక్కింటి వారితో వస్తుందని ఇంట్లోవారు అనుకున్నారు. తీరా 7.30 కాస్తా 9.30 అయినా ఆ రాత్రి గడిచినా అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. తీరా ఆరా తీస్తే.. కళ్యాణి అసలు తల్లితండ్రులు గ్రామంలో ఉంటారని అమ్మాయిని పిన్ని బాబారులు చదివిస్తున్నారని తెలిసింది. బాబాయి అమ్మాయిని ఎవరికైనా అమ్మేసాడో .. బయట ఆగంతకులు ఎవరైనా ఎత్తుకు పోయారో.. అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. చిదిమి దీపం పెట్టుకునే చక్కని వర్చస్సు కలిగిన కళ్యాణి ఇప్పుడెక్కడ, ఏ పరిస్థితులలో ఉందో ...
ఈ మధ్య ఒంటి పూట బడులైతే పిల్లని పక్కింట్లో వదిలి రావలిసి వస్తున్నానంటే సుజాత అనే ఓ ఉద్యోగి వాపోయింది. వెంటనే సహోద్యోగి లలిత '' ఆ పని మాత్రం చేయకు. అవసరం ఐతే ఇంట్లోనే లాక్ చేసి రా.. ఒంటరిగా ఇంట్లో ఉండటం అలవాటు చేసుకోమను'' అని సలహా ఇచ్చింది. ఎందుకలా అలా అంటున్నారని లలితను అడిగితే .. వాళ్ల వీధి చివర రామారావు అని రైల్వే టీటీగా పనిచేస్తున్నారు. వారి కూతురు రవళి. 9 వ తరగతి చదువుతున్నది. వారిల్లును ఆనుకునే ఓ గది , వంటగది ఉండేది. దాన్ని అద్దెకిచ్చేవాళ్ళు.
మధ్య వయస్కురాలైన రమణమ్మ అనే ఓ మహిళ వారి ఇంటికి వచ్చింది. వాళ్ళ ఊరు గుంటూరు దగ్గర నరసారావుపేట అని, పొలాలున్నాయని వాటిని చూసు కోవడానికి అప్పుడప్పుడూ ఊరికి వెళ్ళాలని బంధువులంతా ఇక్కడే ఉన్నారు కనుక ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నానని చెప్పింది. ఒక్కతే ఉంటుంది . భర్త లేడు... అనే జాలితో ఆమెకు ఇల్లు అద్దెకిచ్చారు రామారావు, రజని గార్లు . ఆమె అలా రెండేండ్లుగా వాళ్ళింట్లో అద్దెకుంటుంది. నెలనెలా అద్దె సమయానికి ఇస్తూ వీరితో బాగా కలిసిపోయింది. మధ్య మధ్య వారం పదిరోజులు పొలం పనులంటూ వెళ్ళి వచ్చేది. వస్తూ వస్తూ ఏదో పట్టుకొచ్చేది. అంతగా కలిసిపోయిన ఆమె రవళికి బాగా చేరువైంది.
10 వ తరగతి పరీక్షలు అయ్యాయి. సెలవులు మొదలవగానే నాతోపాటు తీసుకెళ్ళి రెండు రోజుల్లో వచ్చేస్తామని ఒప్పించి తీసుకెళ్లింది రమణమ్మ రవళిని. ముందు ససేమిరా అన్నా ఆమెపై ఉన్న నమ్మకంతో రవళిని పంపించడానికి చివరకు ఒప్పుకున్నారు. తీరా మూడు రోజులు గడిచినా రవళి కానీ, రమణమ్మ కానీ తిరిగి రాలేదు. రమణమ్మ ఇచ్చిన ఫోన్ నెంబర్ డయల్ చేస్తే మోగడమే లేదు. వెంటనే పోలీసు కంప్లైంట్ ఇవ్వడం, నరసరావుపేటకు వెళ్ళడం, వెతకడం అన్నీ జరిగాయి. ఎన్ని చేసినా అసలు రమణమ్మ అని అక్కడ ఎవరూ లేరని తేలింది. రెండు సంవత్సరాల పకడ్బందీ ప్రణాళికతో రవళి రవాణా చేయబడింది. ఇది విన్నాక కడుపులో దేవేసినట్లయింది. మనల్ని కలచి వేసే ఇలాంటి కథనాలెన్నో...
సవతి తల్లి పోరు పడలేక వీధిలోని ఓ అబ్బాయి 'నిన్ను ప్రేమిస్తున్నాను పద మనం ఎటైనా వెళ్ళిపోదాం' అంటే ఇంట్లో ఉన్నది నరకం బయటంతా స్వర్గం ..అనుకుని వేరే ఆలోచన లేకుండా డబ్బూ నగలు తీసుకొచ్చి వాడికప్పగించేస్తుంది. వాడు ఏ హోటల్కో తీసుకెళ్లి రెండు రోజులు మాయమాటలు చెప్పి మోజు తీర్చుకుని వదిలేసి పారిపోయిన సంఘటనలు మరికొన్ని ..
- వదిలేసిన వాడిదొక మోసమైతే మిగిలిన హోటల్ సిబ్బంది వాడుకుని మురికి కూపంలోకి తోసేసే సంఘటనలు కొన్ని..
- ఇంట్లోంచి పారిపోవాలని తమంతట తాము బయలుదేరి బాహ్య ప్రపంచపు వలలో చిక్కుకుని విలవిలలాడే అమాయకులు కొందరు..
ఏది ఏమైనా బాల్యం నుంచి అమ్మాయిల పరిస్థితి భయంకరంగా మారింది. అడుగు బయటపెట్టింది మొదలు ఇంట్లోకి చేరే వరకు తల్లిదండ్రులు గుండెలు అరచేతిలో పట్టుకోవాల్సిందే. ఎవరు చాక్లెట్ ఇస్తానంటూ పిలుస్తాడో.. ఎవరు చెవిపోగులు లాగేస్తారో ..ఎవరు ఎత్తుకు పోతారో ..ఎవరు శరీరభాగాలను తాకే ప్రయత్నం చేస్తారో తెలీదు.
బడిపిల్లలను ఆటోల్లో పంపించినప్పుడు మధ్య మధ్య మనం ఆ ఆటో డ్రైవర్ ఎవరో ఎటువంటి వాడో వాకబు చేయాలి. ఎందుకంటే ఇటీవల బడిపిల్లలని రెండు ట్రిప్పుల్లో తీసుకెళ్లే ఓ ఆటో డ్రైవర్ ప్రతిరోజూ ఓ అమ్మాయిని రెండో ట్రిప్లో తీసుకువస్తుంటాడు. తీరా చూస్తే ఆటో డ్రైవర్ మొదట ట్రిప్పుకు, రెండవ ట్రిప్పుకు మధ్య సమయంలో పిల్లలను గ్రౌండ్లో ఆడుకోమని పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి కొన్ని రోజులపాటు ఆ అమ్మాయిపై ఆఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఇక బస్సుల్లో పంపే తల్లిదండ్రులు బస్సుడ్రైవరు బస్సులో ఉండే సహాయకుడు ఎవరిని ఎక్కడ ఎలా దింపుతున్నారో కనుక్కోవాలి. బస్సులో మొదట ఎక్కించే, చివర దిగే పిల్లల తల్లిదండ్రులు డ్రైవరు గురించి స్వయంగా పరిశీలించాలి.
పాఠశాలలోకి ప్రవేశించాక వాచ్ మెన్లతో జరిగిన సంఘటనలు ఇది వరకే విన్నాం. బడిలో పిల్లలు బాలికల పాఠశాలలో చదివితే ఓ రకమైన ఇబ్బందులు..ఏ గొడవలు లేకుండా మా పిల్లల్ని బాలికల పాఠశాలలో చేర్పించే శామని చేతులు దులుపుకుంటారు కొందరు తల్లితండ్రులు. బాలికల పాఠశాల ఆవరణలోను చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలు వారు ఊహించలేరు. బాల బాలికలు కలిసి చదువుకున్నప్పుడు ఓ వయసు రాగానే వారిలో కలిగే మార్పులపట్ల సరియైన అవగాహన లేక ఏదేదో ఊహించుకుని ఇంకేదో చేయ్యాలన్న ఆరాటంతో తప్పుదోవ తొక్కేవారు కొందరు.
ప్రస్తుతం పిల్లలకు టీవీ, సినిమాలు, సెల్ ఫోన్లు, యూట్యూబ్ లు, వీడియో గేమ్స్ ఇలా ఎన్నోఅందుబాటులో ఉన్నాయి. వాటి ప్రభావంతో అన్ని విషయాల పట్ల మన ఊహలకందని అవగాహన వారికి ఏర్పడిపోతుంది. అది పాజిటివ్గానా లేక నెగెటివ్గానా అని మనం తెలుసుకునే లోపలే కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెల్లవారింది మొదలు ఎలా ఎంజారు చేద్దామా అన్న ధ్యాసే తప్ప ఎలా వృద్ధిలోకి వద్దామా అనే ప్రయత్నం లేదు. చిన్న చిన్న తరగతులలో ఉండగానే బారు ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలని , వారితో రహస్య సంభాషణలు జరపాలని, ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని వారికి వారే ఓ అంచనాకి వస్తున్నారు. ప్రతి తల్లీ, తండ్రీ తమ పిల్లలు చదువులో రాణించి మంచి మార్కులతో పాసవ్వాలనీ, జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే ఆశలతోనే పాఠశాలకు పంపిస్తారు.
ఇదివరకు పిల్లల ముఖాల్లో అమాయకత్వం కనిపించేది. ఇప్పుడు పిల్లల ముఖాల్లో అతిహుషారు. వారి నోట్లోంచి పెద్ద మాటలు వింటుంటే వాటికి మురిసిపో వాలో వారి భవిష్యత్తు గురించి భయపడాలో తెలియని పరిస్థితి. చిన్నచిన్న పిల్లలు హీరోలు, హీరోయిన్లు, విలన్లుగా తమని తాము ఊహించేసు కుంటున్నారు. దాంతో ఆట, పాట, మాట అన్నీ మారిపోతున్నాయి.ఆధునికత ముసుగులో మనం పిల్లలకు అన్నీ అందుబాటులో ఉంచడం వల్ల వారి మానసిక వికాసం పక్కదోవ పట్టే ప్రమాదం పొంచి ఉంది.
శిశుమరణాలు పెరగడం మనం గమనిస్తున్నాం. భారత దేశంలో ఆగేయాసియా దేశాలలో 7400 మంది శిశువులు జన్మించిన లోపే మరణిస్తుంటే అందులో 70 శాతం ఆడశిశువులని గణాంకాలు తెలియజేస్తువ్నాయి. టైమ్స్ ఆఫ్ తెలంగాణ ప్రకటించిన వివరాల ప్రకారం బాలికా శిశహత్యలు ప్రధానంగా రక్తహీనత , పోషకాహారం లోపం వల్ల పేదరికం, నిరక్షరాస్యత, వెట్టిచాకిరి, వలసలు వంటి సామాజిక సమస్యల వల్ల జరుగుతున్నాయి. వీటికి కారణాలు..
1. బాలికల విక్రయం , 2. బాలికలపై అత్యాచారాలు 3. బలవంతంగా వ్యభిచారానికి నెట్టివేయడం, 4. వలసలలో నిరంతర సంచార జీవనం , 5. బాల కార్మిక వ్యవస్థ . కారణాలు స్పష్టంగా సమస్యలను వేలెత్తి చూపినా తీపి జ్ఞాపకంగా ఉండాల్సిన బాల్యం చేదు సంఘటనలు ఎదురు చూడాల్సి రావడం బాలికలపరంగా శాపంగా పరిణమించాయి.
రాష్ట్ర ప్రభుత్వం బాలికల అభివృద్ధి కోసం 35700 అంగన్ వాడి కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా బాలికల సంక్షేమం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వివిధ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. అయితే అవి సక్రమంగా బాలికలకు చేరాల్సిన అవసరం ఉంది.
బాలికల పట్ల జరిగే మోసాలు , అన్యాయాలు ఎప్పటికప్పుడు బయటపెడ్తూ మీడియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. చట్టాలు ఉన్నా అవి అమలు పరచడంలో జాప్యం జరుగుతుంది. జరిగిపోయిన మోసం బయటకు రావడం అప్పుడు స్పందించడం కన్నా మోసాలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఇటు తల్లితండ్రులమీద, సమాజం మీద ఉంది.
బాల్యం ప్రతి వ్యక్తి జీవితంలో మధుర ఘట్టంగా నిలిచిపోవాలే తప్ప తలుచుకోలేని విషాద జీవనం కాకూడదు. బాలికల పట్ల ప్రేమ ఆప్యాయత ఎంత అవసరమో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కోగలిగే అవగాహనను పసివారైనా కలిగించక తప్పదని గ్రహించాలి. మన ఇంటి బిడ్డకే ఆ మోసం జరిగితే అని తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏ ఇంటి బిడ్డయినా తన సొంత కూతురుగా భావించి ఎటువంటి మోసాలకు బలవకముందే తేరుకుని మోసాలు, ప్రమాదాల బారినుంచి బాలికలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది.