Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెమలికెవరు నాట్యం నేర్పాల్సిన అవసరం లేదు. కోయిలకు గానం నేర్పడం ఎవ్వరి తరమూ కాదు. అది సహజాతి సహజంగా అబ్బే విద్య. ఉప్పల వసంతకూ అలాగే. ఇంట్లో తల్లిదండ్రుల నుంచి సహజంగా ప్రవహించిన గానం... ఆమెకూ అబ్బింది. జనం నాలుకలపై తారాడే జానపదాన్ని.. అద్భుతంగా పాడుతుంది. అప్పటికప్పుడు ఆశువుగా గజళ్లకు స్వరం కట్టేస్తుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా... సంగీతాన్ని ప్రవృత్తిగా చేసుకుని సాగిపోతున్న ఆ వసంత కోకిల పరిచయం...
వసంత సొంతూరు ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల దగ్గర మద్దూరు. తండ్రి టీచర్ కావడంతో చేర్యాలకు వచ్చి స్థిరపడ్డారు. ఐదుగురు సంతానంలో చివరి వ్యక్తి. ఇద్దరక్కలు, ఇద్దరన్నలు.. అందరూ పాటలు పాడతారు. సంగీతం నేర్పే సౌకర్యం వాళ్ల చుట్టుపక్కల ఎక్కడా లేదు. గ్రామాల్లో వృత్తి కళాకారుల కుటుంబాల్లోనే సహజంగానే ఓ కళాత్మక వాతావరణం ఉంటుంది. వాళ్లింట్లోనూ అలాంటి వాతావరణమే ఉండేది. అందుకే కొత్తగా ఎక్కడికో వెళ్లి సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. వసంత తాత(అమ్మ తండ్రి)కి సంగీతం అంటే చాలా ఇష్టం. భజనలు, శ్లోకాలు, భక్తి గేయాలు అన్నీ కూతురికి నేర్పించాడు. దాంతో వసంత వాళ్లమ్మ చిన్నప్పటి నుంచి శ్లోకాలు, మంగళ హారతులు, లాలిపాటలు, బతుకమ్మ పాడుతూ ఉండేది. అలా తల్లిని చూస్తూ పాటలు నేర్చుకున్నారు. ఐదుగురు పిల్లలు. పిల్లలకు బాల్యంలో ఉన్న ఆసక్తులు చాలా... పెద్దయ్యాక ఉండవు. కానీ పాటల పట్ల వసంత ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ పోయింది.
భర్త ప్రోత్సాహంతో...
స్కూల్లో ఉన్నప్పుడు ఆ పాట ఈ పాట అని కాదు... అన్ని పాటలు పాడేది. పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరి, టీచర్స్ డే... వేడుకు ఏదైనా ఆమె పాట ఉండాల్సిందే. ఏడో తరగతి వరకు మద్దూరులో చదువుకున్న వసంత... తరువాత చేర్యాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. డిగ్రీలో బీఏ స్పెషల్ తెలుగు చేసింది. సంగీతం పట్ల ఆమెకున్న ఇష్టమే తెలుగును ఎంచుకునేలా చేసింది. చాలామంది ఆడపిల్లల్లాగే ఆమెకు డిగ్రీలోనే పెండ్లయ్యింది. కానీ చదువు ఆపేయ లేదు. అందుకు కారణం... భర్త రాజు. ఆమెను ప్రోత్సహించాడు. అంతేకాదు... అత్తామామలు సైతం కోడలును కోడలులా కాకుండా కూతురులా చూసుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక.. తెలుగు పండిట్ ట్రైనింగ్ చేయించారు. ఫలితం... తెలుగు పండిట్ శిక్షణ పూర్తయిన వెంటనే... అంటే 2001లో తెలుగు టీచర్గా ఉద్యోగం.
ఉద్యోగం తరువాత కూడా...
ఉద్యోగం వచ్చేదాక ఓ పట్టుదల... ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత ఓ నిర్లక్ష్యం ఉంటుంది చాలా మందిలో. కానీ ఆమె వసంత అలా కాదు. అక్కడా తనకు ఇష్టమైన పాటలను వదిలిపెట్టలేదు. సబ్జెక్ట్ తెలుగు కావడంతో అందులోని పద్యాలు, కథలకు తానే స్వర కల్పన చేసి పిల్లలకు ఆసక్తి కలిగించే విధంగా చెప్పడం మొదలుపెట్టింది. తాను ఒక్కతే పాడటం కాదు... పద్యాలు, పాటలు, కథలు అన్ని పిల్లలకు కూడా నేర్పించడం మొదలుపెట్టింది. చిన్నచిన్న బుర్రకథలు సైతం పిల్లలకు నేర్పించి.. ప్రదర్శింపజేస్తున్నది. పిల్లలకు అర్థమయ్యే స్థాయిలో వారితో నాటికలు కూడా వేయిస్తున్నది. ఇప్పుడు ప్రపంచమంతా ఆంగ్లం చుట్టూ పరుగులు పెడుతున్నది. తెలుగుపై ఆసక్తి కొరవడుతున్నది. పిల్లల్లో తెలుగుపై ఆసక్తి పెంపొందిం చేందుకు... ప్రతి ఏటా పద్యాల పోటీ పెడుతున్నది. తెలుగు ఎక్కువగా రావడం కోసం తెలుగు పదాల పోటీలు, అంత్యాక్షరిలు పెడుతుంటుంది. పాఠాలను బుక్రథలుగా కూడా వేయిస్తున్నది. వసంత టీపీటీ చేసేప్పుడు లలిత టీచర్ ఉండేది. భాష మీద పట్టు రావాలని... టీపీటీ ట్రైనింగ్లో కూడా డిక్టేషన్ చెప్పేది. తెలుగును బతికించుకోవాలనే ఆమె తపన చూసిన తరు వాత... తెలుగుపై మరింత ఆసక్తి పెరిగింది వసంతలో. అందుకే ఆ క్లాసు, ఈ క్లాసు అని కాకుండా... తను చెప్పే అన్ని క్లాసుల్లో పిల్లలకు కచ్చితంగా డిక్టేషన్ చెబుతుంది.
జానపదాలు, బుర్రకథలు, గజల్స్...
దాదాపు 20 ఏండ్ల సర్వీస్. ఈ కాలంలో ఎక్కడ ఉపాధ్యాయుల మీటింగ్స్ జరిగినా ఆమె పాట ఉండాల్సిందే. పద్యాలు, పాటలు, భజనలు... ప్రక్రియ ఏదైనా అలవోకగా పాడుతుందామె. వాట్సాప్ వినియోగం పెరిగి పోయిన తరువాత... ఆమె పాటలు టీచర్స్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో వసంత స్వరం అలా జిల్లా మొత్తానికి వ్యాపించింది. టీచర్లు సహజంగానే గీత, గేయ రచయితలుంటారు. వాళ్లు రాసినవి పంపిస్తే... స్వరాలు కూర్చి పాట పాడి పంపడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు కొన్ని వందల పాటలు పాడింది వసంత. ఆమె పాటలు పాడిన వాళ్లంతా ముఖ పరిచయం ఉన్నవాళ్లేమీ కాదు. వాట్సప్ పరిచయం. ఎక్కువగా జానపదగేయాలు, సామాజికాంశాలపై పాటలు మాత్రమే పాడేది. ఇప్పుడు గజల్స్ పాడటంలోనూ ఆమె దిట్ట. నిజానికి గజల్స్ ఎలా ఉంటాయో కూడా ఆమెకు తెలియదు. ఓసారి సుజాత అనే టీచర్... వసంత పాడిన పాటలను వాట్సప్ ద్వారా విన్నది. వసంత ఫోన్ నెంబర్ కనుక్కుని మరీ... ఫోన్ చేసి 'నేను గజల్స్ రాస్తుంటా... వాటిని పాడగలవా?' అడిగింది. అప్పటిదాకా గజల్స్ మీద అంత శ్రద్ధ పెట్టింది లేదు. అందుకే వినమని కొన్ని గజల్స్ కూడా పంపిందామె. అవి విన్నాక గజల్స్ శైలి తెలిసొచ్చింది వసంతకు. ఆవిడ రాసిన గజల్స్కు ట్యూన్ చేసి పాడటం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా కొన్ని వందల గజల్స్ పాడింది. ప్రస్తుతం జనగాంలో స్థిరపడ్డ వసంత... అక్కడ పండుగ, మీటింగ్... వేడుక ఏదైనా ఆమె పాట ఉండాల్సిందే.
నా స్ఫూర్తితో...
'' పాటలయితే అమ్మ నుంచే నేర్చుకున్నా. ఒక్క పాటలేనా.. అమ్మ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకున్నా. మా నాన్ననుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. ఆయన తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. నాన్న టీచరే అయినా... డిగ్రీలోనే పెండ్లి కావడంతో నేను టీచర్ అవుతానని అస్సలు అనుకోలేదు. మా వారు నల్ల రాజు... నన్ను పట్టు బట్టి చదివించారు. టీపీటీ ట్రైనింగ్ చేయించారు. మా అత్త మామలు కూడా అంతే ప్రోత్సహించారు. మా ఇంట్లో ఫస్ట్ టీచర్ను నేనే. నా తరువాత నన్ను స్ఫూర్తిగా తీసుకుని అమ్మగారివైపు, అత్తగారివైపు అందరూ టీచర్లు అయ్యారు. టీచర్ అయిన తరువాత పాటల పట్ల నాకున్న ఇష్టాన్ని చూసిన మావారు ఎక్కడ కార్యక్రమం అయినా దగ్గరుండి తీసుకెళ్తారు. కుటుంబ సహకారం వల్లే అటు ఉపాధ్యాయురాలిగా, ఇటు గాయనిగా కొనసాగ గలుగుతున్నా. ఇప్పటిదాకా ఆల్బమ్స్ ఏమీ చేయలేదు. భవిష్యత్లో చేయాలనుకుంటున్నా. అవకాశం వస్తే... శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకోవాలనుకుంటున్న''