Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడి వాతావరణం అమ్మ ఒడిలాంటిది. కాలేజీ కొచ్చాక ఆ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థినులు రెక్కలొచ్చిన పక్షుల్లా విహరిస్తుం టారు. ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకొని స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాల్సిఉంటుంది. అందుకు ఎలాంటి సూచనలు పాటించాలంటే..
- కాలేజీలో చేరిన తరువాత అధ్యాపకులు పరిచయం కావడం ఎంత అవసరమో తోటి విద్యార్థినులతో మాట్లాడి వారిని పరిచయం చేసుకోవడమూ అంతే అవసరం. అందకోసమని పనికట్టుకొని మాట్లాడనక్కర్లేదు. కళాశాల మొదలైన తొలినాళ్ల నుంచి రోజుకొకరి పక్కన కూర్చుంటే చాలు. వాళ్లే స్నేహితులవుతారు. పరిచయం కోసమని అదే పనిగా పక్కవారిని విసిగించడం, వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం వంటివి చేయకూడదు. కాలేజీ చదువులకు సంబంధించిన వివరాలు తప్ప మిగిలినవి మనకి అనవసరం అనే ధోరణిలోనే ఉండాలి. అయితే ఎదుటి వాళ్లు ఏం చెప్పినా ఓపిగ్గా వినడమూ ముఖ్యమే.
- ఇతరులను విమర్శించడం, దురుసుగా మాట్లాడటం వంటివి చేయకూడదు. ప్రతి ఒక్కరినీ గౌరవ వాచకంతో పిలవడం అలవాటు చేసుకోవాలి. అంతేతప్ప గెలవకపోతే ఎవరేమనుకుంటారో, అందరూ నవ్వుతారు.. వంటి సంకోచాలు అనవసరం. విజయం సంగతటుంచి వేదిక మీద ధైర్యంగా మాట్లాడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
- తోటివారి గురించి కొద్దిగా తెలిశాకే స్నేహం దిశగా అడుగులు వేయాలి. అలానే అమ్మానాన్నలకూ వారిని పరిచయం చేయడం, ఇంటికి తీసుకురావడం చేయాలి. వీలైతే వారి తల్లిదండ్రుల్నీ ఇంటికి ఆహ్వానించడమూ మంచి పద్ధతే. దీనివల్ల బంధాలు ఇంకా బలపడతాయి.
- సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేరినా... తెలిసిన వారినే ఖాతాలోకి ఆమోదించాలనే నియమాన్ని పెట్టుకోవాలి. అలానే వ్యక్తిగత సమాచారం పంచుకోకుండా చూసుకోవాలి. ఎవరికైనా సరే ఫోన్ నంబర్ ఇవ్వాలంటే తల్లిదండ్రులవి ఇచ్చేస్తే సరిపోతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మాత్రం తక్షణ సాయమందించే కాలేజ్ యాజమాన్యానికి ధైర్యంగా చెప్పుకోవాలి.