Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టాలు తలుపు తట్టాయని చాలా మంది భయపడిపోతారు. బతుకంతా బాధలే అంటూ నిరాశతో బతుకుతారు. కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తే పోయేదేమిలేదు అంటూ కొత్తదారులు వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. అలాంటి వారిలో ఒకరు స్వర్ణరెడ్డి. ఇతర రాష్ట్ర్రాలలోని పర్యాటక ప్రదేశాలను మధ్యతరగతి వారు సైతం సందర్శించేలా తక్కువ ప్యాకేజీతో అందిస్తున్నారు. పదిహేను ఏండ్లుగా నమ్మకమే పెట్టుబడిగా తన పర్యాటక యాత్రను కొనసాగిస్తున్న ఆమె పరిచయం..
మాది నల్లగొండ జిల్లాలోని చిన్న ఊరు. వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్న ఇద్దరు పొలం పనులతో బిజీగా ఉండేవారు. అన్న, అక్క,చెల్లితో పాటు బడికి వెళ్లేదాన్ని. ఏడో తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోయింది. అక్క పెండ్లి చేశారు. ఆ తర్వాత నా పెండ్లి చేసి అమ్మనాన్న తమ బాధ్యత తీరింది అనుకున్నారు.
కష్టాలతో...
కొంత పొలం, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్న సంబంధం కావడంతో నా జీవితం బాగుంటుందని అమ్మనాన్న అనుకున్నారు. చిన్నతనంలోనే పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యత నాపై పడింది. మా వారు బిజినెస్ చేసేవారు. అయితే ఎప్పుడూ సరిగ్గా బిజినెస్ ఉండేది కాదు. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం, నేను ఏమైనా అడిగితే కొట్టడం చేసేవాడు. మాకు పాపా, బాబు. వారిద్దరికీ సరిగ్గా పాలు కూడా ఉండేవి కాదు. బాబుకు ఏడాది వయసు ఉన్నప్పుడు ఒకరోజు తాగి వచ్చి బాగా కొట్టాడు. ఎక్కడైనా పడి చావవే అంటూ తిట్టాడు. అంతే ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాను. వళ్లంతా కాలిన గాయాలతో హాస్పిటల్లో నెలరోజులు ఉన్నాను. అక్క, అన్న వచ్చి నన్ను కేసు పెట్టమన్నారు. కానీ, పిల్లల గురించి ఆలోచించి కేసు పెట్టలేదు. పోలీసులు వచ్చి అడిగినా ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పాను తప్ప మా ఆయన వేధింపులు కారణమని చెప్పలేదు.
ఎంత కష్టం వచ్చినా..
కాలిన గాయాలు పూర్తిగా మానకముందే ఇంటికి వచ్చాను. పిల్లలిద్దరిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు అర్థమైంది. తల్లి లేకపోతే పిల్లలను చూసేవారు ఎవరూ ఉండరని. ఆ రోజే నిర్ణయించుకున్నాను ఎంత కష్టం వచ్చినా పిల్లలను వదిలిపోనని. పిల్లల బాధ్యత కన్నవారే తీసుకోవాలి. తండ్రి బాధ్యత తీసుకోకపోతే తల్లి బాధ్యత మరింత పెరుగుతుంది. బాధలున్నాయని బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే పిల్లల జీవితాలు వీధిపాలు అవుతాయి. నాలో వచ్చిన ఈ ఆలోచన ఎన్నో కష్టాలను భరించడానికి ప్రేరణ ఇచ్చింది.
అప్పులే మిగిలాయి...
కాలిన గాయాలతో శారీరకంగా ఎంతో బలహీనంగా ఉన్న నేను మానసికంగా నన్ను నేను దృఢపరుచుకున్నాను. ఇంట్లో ఉన్నదేదో తింటూ నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. నాతో ఉన్న కొద్ది డబ్బులతో బర్రెను కొన్నాను. ఇది ఇచ్చే రెండు లీటర్ల పాలలో ఒక లీటరు పిల్లలకు,. ఇంకో లీటరు పాలు అమ్మి ఆ డబ్బుతో ఇల్లు గడిపేదాన్ని. బర్రెకు గడ్డి మా పొలం నుంచే తీసుకువచ్చేదాన్ని. దాన్ని కూడా కొందరు అడ్డుకున్నారు. దాంతో బర్రెను అమ్మేసాను. ఆ తర్వాత ఇంట్లోనే చీరలు వాయిదాలకు అమ్మడం మొదలు పెట్టాను. కొంతమంది వాయిదాలు కట్టకపోవడంతో అప్పులే మిగిలాయి. ఇలా కాదని ఇంట్లోనే ముందు గది ఖాళీ చేసి కిరాణం షాపు పెట్టాను. రోజూ షాపులోకి కావల్సిన సామాను తీసుకురావడానికి బయటకు వెళ్లేదాన్ని. ఆ సమయంలో షాపులో డబ్బులు మాయం అయ్యేవి. ఒకరోజు సరుకులు తీసుకురావడానికి మూడువేల రూపాయలు తీసుకుని పోయాను. బస్సులో నా పర్సు కొట్టేశారు. డబ్బులు పోవడంతో దిక్కుతోచలేదు. వ్యాపారం అచ్చిరాదనుకుని షాపు తీసేశాను.
విస్తరాకులు కుట్టి..
మా ఇంటికి దగ్గర్లోనే బిస్కెట్ కంపెనీ ఉండేది. అందులో ప్యాకింగ్ పనికి నెలరోజులు వెళ్లాను. అక్కడి వాతావరణం, ఆడవారిని ట్రీట్ చేసే విధానం నచ్చక మానేశాను. పిల్లలు బడికి వెళ్లాలంటే వారికి ఫీజులు కట్టాలి, ఖర్చులు ఉంటాయి. ఎలాగైనా వారి ఖర్చులకు డబ్బులు సంపాదించాలన్న లక్ష్యం నన్ను అనేక దారులు వెతికేలా చేసింది. వంద విత్తనాల సంచులు కుడితే ఐదు రూపాయలు ఇస్తారని ఎవరో చెబితే అక్కడికి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాను. పొద్దున్నే పిల్లలను బడిలో వదిలేసి ఇంటికి వచ్చి మధ్యాహ్నం వరకు సంచులు కుట్టేదాన్ని. పిల్లలను బడి నుంచి తీసుకువచ్చి మళ్లీ సంచులు కుట్టేదాన్ని. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆరోగ్యం పాడైంది. నా బాధలు చూసిన పిల్లలు 'మిషన్ కుట్టోద్దు అమ్మ' అన్నారు. ఇంట్లో రెండు గదులు కిరాయికి ఇచ్చాను. అందులో ఉండే హాస్టల్ వార్డన్ 'చిట్టీలు వేయండి ఆంటీ' అన్నాడు. చిట్టీలకు సంబంధించిన లెక్కలు వివరంగా చెప్పాడు. అప్పటివరకు ఉన్న పరిచయస్తుల్లో కొందరు మంచివాళ్లను చూసి చిట్టీలు ప్రారంభించాను.
కష్టం చూసి..
పిల్లలకు మంచి చదువు చెప్పించడం కోసం నేను పడుతున్న కష్టం చూసి నన్ను చాలామంది ప్రోత్సహించారు. చిట్టీ డబ్బులు తెచ్చుకోవడానికి రోజూ పది కిలోమీటర్లకు తక్కువ కాకుండా నడిచేదాన్ని. పిల్లలకు మాత్రం చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పాను. 'కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది. పెద్ద చదువులు చదివితేనే ఉద్యోగం వస్తుంది. జీవితాలు బాగుంటాయి'. మా అమ్మాయి ఎంసెట్లో మూడువేల ర్యాంకు తెచ్చుకుంది. పాపా, బాబు ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమ్మాయికి మంచి సంబంధం రావడంతో అప్పు చేసి మరీ పెండ్లి చేశాను. అమ్మాయి భర్తతో పాటు లండన్ వెళ్లిపోయింది. అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్లాడు.
ఖాళీ సమయం...
పిల్లలిద్దరూ చెరో దేశం వెళ్లిపోయేసరికి నాకు ఇంట్లో ఏమీ తోచేది కాదు. ఇంతలో చిట్టీలు ఎత్తుకున్న కొందరు తిరిగి కట్టకపోవడంతో మూడు లక్షల రూపాయల అప్పు మీద పడింది. పెండ్లి అప్పు తీర్చడానికి తిప్పలు పడుతున్న నాకు చిట్టీల అప్పు పెద్ద భారంగా మారింది. ఏం చేయాలి అన్న సమయంలో 'టూర్ అండ్ ట్రావెల్స్' పెట్టండి అని కొందరు సలహా ఇచ్చారు. ఏడో తరగతి చదివిన నేను ఇతర రాష్ట్రాలకు టూరిస్టులను తీసుకుని వెళ్లడం ఎలా సాధ్యం అనుకున్నాను. సరే ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే సరి లేకపోతే వేరే పని చూద్దాం అనుకున్నాను.
మొదటి బ్యాచ్లోనే..
టూర్ తీయాలంటే ముందుగా పేపర్లో యాడ్ ఇవ్వాలని చెప్పారు. యాడ్ ఇచ్చిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. వారందరికీ 'ఫస్ట్ టైమ్ టూర్ తీస్తున్నాను. మీకు ఇష్టమైతేనే రండి' అని చెప్పాను. తెలిసినవాళ్లు, నా కష్టాలు చూసినవాళ్లు 'ఏం కాదు స్వర్ణమ్మ. నువ్వు సక్సెస్ అవుతావు. భయపడకుండా ముందుకు వెళ్ళు ' అన్నారు. ఫస్ట్ బ్యాచ్లోనే నలభైమందితో తమిళనాడు టూర్ వెళ్లాను.రూట్స్, హౌటల్స్, రూమ్స్ ఏమీ తెలియవు. అన్ని తెలుసుకుంటూ చాలాసార్లు టూరిస్ట్ల సూచనల మేరకు ముందుకు వెళ్లాను. అలా..అలా ఒక్కొక్క ట్రిప్లో కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నాను. గత పదిహేనేండ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టూర్ తీసుకువెళ్తున్నాను.
మధ్యతరగతివారికి..
ప్రతినెల రెండు టూర్స్ అయినా ఉంటాయి. తక్కువ బడ్జెట్ కావడంతో మధ్యతరగతివారు ఎక్కువగా వస్తుంటారు. మా ట్రావెల్స్లో వచ్చేవారిలో మహిళా టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సెలవుల్లో ఒక్కొక్క ట్రిప్లో వంద మందికి పైగా ఉంటారు. ఒకసారి 150మందికి పైగా టూరిస్ట్లను తీసుకుని వెళ్లడంతో పాటు సేఫ్గా తిరిగివచ్చాం. ప్రతి టూర్ వెంట నేను వెళ్తాను. ఆయా ప్రదేశాలను దగ్గర ఉండి చూయిస్తాను. ఎక్కువగా మౌత్పబ్లిసిటీ ద్వారానే మా టూర్కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు తమిళనాడుతో పాటు గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
సంకల్పం ముఖ్యం..
ఇంట్లో నుంచి బయట కాలు పెట్టని కుటుంబంలో పుట్టిపెరిగినా.. పరిస్థితుల వల్ల బయటకు రాక తప్పలేదు. ప్రతి మహిళలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని ముందు ఆమె నమ్మాలి. సమాజంతో గౌరవంగా బతకడం కోసం, పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం పట్టుదలతో పనిచేయాలి. ఏదైనా సాధించాలన్న సంకల్పం మనసులో నుంచే రావాలి. చాలామంది అంటారు.. 'సపోర్ట్ ఉంటే ఏమైనా సాధించవచ్చని'.. కానీ, సంకల్పం ఉంటే సపోర్ట్ తప్పక వస్తుంది అన్నది నా నమ్మకం. ఈ రోజు మా అమ్మాయి లండన్లో ఆపిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్. వాళ్లకు ఒక బాబు. మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. కోడలు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. నేను నెలలో ఇరవైరోజులు టూర్లోనే ఉంటాను. మా వారు ఇల్లు, బిజినెస్ చూసుకుంటూ ఉంటారు.