Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా నాన్నకు పెళ్లి' పేరుతో సినిమా వచ్చింది. అందులో కొడుకు క్యారెక్టర్అయిన శ్రీకాంత్.. తన కోసం అన్నీ త్యాగం చేసిన తండ్రికి మళ్లీ పెండ్లి చేయాలనుకుంటాడు. చేస్తాడు. అది సినిమా... అందులోనూ పెండ్లి తండ్రికి కాబట్టి సమాజం సులభంగానే జీర్ణించుకుంటుంది. ఆ పెండ్లి కాస్త నిజ జీవితంలో ఓ కొడుకు తన తల్లికి చేయాలనుకుంటే... సమాజం నుంచి స్పందన ఏమిటి? ఎవరేమైనా అనుకోని. తాను మాత్రం తల్లికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నాడు. ఆ హీరో పేరు గోకుల్ శ్రీధర్. కేరళలోని కొల్లాం జిల్లా. 23 ఏండ్ల గ్రాడ్యుయేషన్ కుర్రాడు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? దానికి వస్తున్న స్పందన ఏమిటి?
ఆ మధ్య కాలంలో ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి 'దమయంతి కూతురు' పేరుతో కథ రాశారు. అందులో తల్లి పాత్ర... ఇద్దరు పిల్లల తరువాత ఇంకొకరిని ప్రేమించి వెళ్లిపోతుంది. పెద్దవాడైన కొడుకు.. తల్లి మానసిక వేదనను అర్థం చేసుకుంటాడు. కానీ తల్లి వెళ్లిపోయేనాటికి చిన్నదైన కూతురు మాత్రం... ఆమెను తప్పుబడుతుంది. 'ఆమె వెళ్లిపోయి మనకు వేదనను మిగిల్చింది' అని కూతురు అంటే.. 'వెళ్లిపోకుండా ఉండి ఉంటే.. ఆమె పడే వేదన మాటేమిటి?' అంటాడు కొడుకు. అచ్చం కథలో కొడుకులాగే పెద్ద మనసున్న మారాజు ఈ నిజ జీవితంలో కొడుకు. గోకుల్ హైస్కూల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. కారణం తండ్రి... తల్లిని పెట్టే హింస. మొదటి భర్తతో ఉన్నప్పుడు గోకుల్ తల్లి మినీ అయ్యప్పన్ స్కూల్ టీచర్. కుటుంబ కారణాల వల్ల ఆమె ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. విడిపోయిన తరువాత... ఆమె కొల్లాంలోని ఓ లైబ్రరీలో లైబ్రరియన్గా పనిచేసింది. అధికారికంగా విడాకులు రావడానికి చాలా కాలం పట్టింది. చివరకు 2013లో విడాకులు వచ్చాయి. తన తల్లికి మళ్లీ పెండ్లి చేయాలనుకున్నాడు గోకుల్. ఇప్పటికి ఆ సందర్భం వచ్చింది. మినీ అయ్యప్పన్ పనిచేస్తున్న చోట సహౌద్యోగి ఒకరు ఈ సంబంధాన్ని చూశారు. రెండో పెండ్లి ఆలోచనను ఆమె మొదట తిరస్కరించారు. కుటుంబ సభ్యులు, గోకుల్ కలిసి ఆమెను ఒప్పించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న గోకుల్... తనవామపక్ష భావజాలం, తల్లివైపు కుటుంబ సభ్యులు ప్రగతిశీల భావాలున్నవాళ్లు కావడంవల్లే ఇది సాధ్యమవుతుందోన్నాడు. పెండ్లి ఆడంబరంగా కాకుండా రిజిస్టర్ ఆఫీస్లో జరగనుంది. అదే విషయాన్ని ఫేస్బుక్లో తన వాల్పైన పోస్ట్ చేశాడు.
తల్లి ఒంటరి కావద్దని...
''మా అమ్మ మళ్లీ పెండ్లి చేసుకుంటున్నది. ఇది అందరికీ తెలియడం అవసరం అనిపించి రాస్తున్నాను. రెండో పెండ్లిని చాలా మందిని అంగీకరించరు. దీనికి సమాజం నుంచి స్పందన ఎలా ఉంటుందో ఊహించ గలను. కానీ అవేవీ పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే.. అమ్మ నా కోసం తన జీవితాన్నే పక్కన పెట్టేసింది. మొదటి పెండ్లిలో ఎంతో గృహహింసను ఎదుర్కొన్నది. ఓసారయితే... నుదురునుంచి రక్తం కారేలా కొట్టాడు. ఇన్ని భరిస్తూ ఉండటం అవసరమా? అమ్మా అని అడిగితే... 'నేను నీకోసమే బతుకుతున్నా. నీకోసం ఎంతటి యాతనైనా అనుభవిస్తాను' అని చెప్పింది. ఆ తరువాత మరింత హింస పెరిగింది. ఇంట్లోంచి బయటికి వచ్చేశాం. ఆరోజే అనుకున్నా... మా అమ్మకు మళ్లీ పెండ్లి చేయాలని. నాకోసం తన జీవితాన్ని, యవ్వనాన్ని, కలలను అన్నింటినీ త్యాగం చేసింది అమ్మ. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నా. రేపు ఉద్యోగం వచ్చి ఎక్కడికైనావెళ్లిపోతే... అమ్మ ఒంటరిదైపోతుంది. అందుకే అమ్మకు మళ్లీ పెండ్లి చేయాలనుకున్నా. దీన్ని రహస్యంగా ఉంచడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా బహిరంగంగా ప్రకటిస్తున్నా. మా అమ్మ మినీ అయ్యప్పన్, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కె.వేణును పెండ్లి చేసుకోబోతున్నది'' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
గోకుల్పై ప్రశంసల జల్లు..
గోకుల్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దగ్గరనుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గోకుల్కు ఫోన్ చేసి 'గృహహింస వల్లే తన తల్లి ఆత్మహత్య చేసుకుంది. కానీ నేను ఏమీ చేయలేక పోయాను. ఫలితం అమ్మను పోగొట్టుకున్నాను' ఏడ్చేశాడు. అది గోకుల్ను కదిలించేసింది. ఆ ఒక్క తల్లేకాదు... మరే తల్లి అలా గృహింసను ఎదుర్కోకూడదని, తన తల్లిలా హింసపడకూడదని గోకుల్ భావిసు ్తన్నాడు. ఈ విలువలను కేరళ సమాజం స్వాగతిస్తుందని బలంగా నమ్ముతున్నాడు.