Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడి తలుపులు తెరుచుకున్నాయి. బుడిబుడి అడుగులతో బిడ్డలు బడికి పోతుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతున్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని, టై కట్టుకుని, షూతో టిక్టాక్గా తయారై పోతున్న పిల్లలను చూసి ఆనందిస్తున్నారు. కొత్తగా బడికి వెళ్లే పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వారి ప్రవర్తనలో వచ్చే మార్పును మనం గమనించలేం. పిల్లల చదువుల విషయంలో గతంలో తల్లిదండ్రిపాత్ర తక్కువగానూ, టీచర్ల పాత్ర ఎక్కువగానూ ఉండేది. ఇప్పుడు పిల్లల చదువుల్లో వచ్చిన మార్పుతో బడికి వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది.
విజ్ఞానదాయకమైన విద్య పిల్లల భవిష్యతును బాధ్యతాయు తంగా మాయింది. ఇందుకోసం పిల్లల చిన్న వయస్సునుండే తల్లిదండ్రి ముఖ్యంగా తల్లి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బడికి పంపిస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు. పిల్లల చదువు విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి. వారిచేత చదివించటం, హోంవర్కు చేయించటం దగ్గర ఉండి చేయించాలి. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు కావల్సిన ప్రతీదీ వారే చేస్తుంటా రు. పిల్లల బ్యాగ్ సర్దడం నుంచి షూలు వేయడం వరకు. దాని వలన పిల్లలకు లాభంకంటే నష్టం ఎక్కువ. పిల్లల తరగతులు పెరిగే కొద్ది వారి బాధ్యతలు కూడా పెంచాలి.
సొంతంగా చేసుకునేలా..
ఫస్ట్క్లాస్ పిల్లలు తమ బ్యాగులో పుస్తకాలు సర్దుకునేలా తర్ఫీదు ఇవ్వాలి. ఆ తర్వాత యూనిఫామ్, షూ వేసుకోవడం, వాటర్ బాటిల్ నింపుకోవడం, లంచ్ బాక్స్ పెట్టుకోవడం ఇలా చిన్నచిన్న పనులు సొంతంగా చేసుకునేలా చూడాలి. బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్బాక్స్ సింక్లో పెట్టడం, హౌంవర్క్ చేసుకోవడం వంటివి వారే సొంతంగా చేసుకునేలా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే వారికి బాధ్యత తెలిసేలా చేయాలి. అప్పుడే పెద్దవాళ్లు అయిన తర్వాత తమ పనులు తాము చేసుకోగలుగుతారు. పోనిలే చిన్నపిల్లలు అంటూ అన్ని పనులు తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లలు బాధ్యతారహితంగా తయారు కావడంతో పాటు ఇతరులపై ఆధారపడే స్వభావం అలవడుతుంది.
ఇంటి వాతావరణం..
బడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకుని ఆ తర్వాత చదువుకునేలా ఇంట్లో వాతావరణం అలవాటు చేయాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లల ఏకాగ్రత తగ్గుతుంది. వారు చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటే పిల్లలు హౌంవర్క్ చేసుకోవడానికి, క్లాసులో చెప్పింది మరోసారి చదువుకోవడానికి ఇష్టపడతారు.
దగ్గర ఉండి..
కొంతమంది పిల్లలకు ఒకసారి క్లాసులో టీచర్ చెప్పగానే అర్థం కాదు. అలాంటప్పుడు కొన్ని పాఠ్యాంశాలు చదవటానికి కష్టపడుతుంటారు. అలాంటి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన శిక్షణ ఇవ్వాలి. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పకుండా 'నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు', 'బుర్ర లేదు' అంటూ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను కించపరుస్తుంటారు. ఇలాంటి మాటలు వారి చిన్నిమనసుపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. వారిలో న్యూనతాభావాన్ని పెంచుతాయి. చిన్నప్పటినుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి. దీనివల్ల వారిలో విషయపరిజ్ఞానం పెరుగుతుంది.
తరుచుగా ..
చాలా పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. అయితే ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే ఈ మీటింగ్స్ ఉంటాయి. ఇలా కాకుండా అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళి, వారి ఉపాధ్యాయులను కలవాలి. పిల్లల చదువు, ప్రవర్తనపై టీచర్ల అభిప్రాయాలను తెలుసు కోవాలి. కొన్నిసార్లు పిల్లలు తప్పుదారిలో వెళ్ళుతుంటే చెప్పడానికి టీచర్లు భయపడతారు. తరచుగా వారిని కలవడం, పిల్లల గురించి చర్చించడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇతర పిల్లలతో వారు ఎలా ఉంటున్నారో గమనించే వీలు కలుగుతుంది. పిల్లల ముందు ఇతర పిల్లలను తిట్టడం, పొగడడం చేయవద్దు. తోటివిద్యార్థుల పట్ల స్నేహభావం, గురువుల పట్ల గౌరవం ఉండేలా చూడాలి.
ప్రతిభను గుర్తించేలా..
చాలామంది తల్లిదండ్రులు చదువు..చదువు అంటూ పిల్లల వెంట పడతారు. కేవలం చదువే కాకుండా పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషమైన ప్రతిభ కనబరిచినపుడు వారిని ప్రోత్సహించాలి. దాంతో పిల్లల్లో శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చదువుతోపాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి, మానసికాభివృద్ధి పెంపొందుతాయి. డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, స్పోర్ట్స్ వల్ల పిల్లల్లో ఏకాగ్రత, స్పోర్టివ్నెస్ పెరుగుతాయి. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కోకరిక్యులం యాక్టీవిటీస్ ఉపయోగపడతాయి.
తేడాలు వద్దు..
పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు, అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి. ఇప్పటికీ చాలా ఇండ్లలో అబ్బాయిలను కార్పోరెట్ స్కూళ్లకు, అమ్మాయిలను ప్రభుత్వపాఠశాలలకు పంపించడం కనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. లింగవివక్ష లేని సమాజం కావాలని ఆశించేవారంతా పిల్లల మనసులపై లింగబేధాల ప్రభావం పడకుండా చూడాలి.
జాగ్రత్తలు చెప్పాలి..
మన పెద్దలు చదువు చారెడు బలపాలు దోసెడు అన్న సామెత చెబుతారు. 'పెన్సిలు పారేస్తే రేపు మరొకటి కొనిపెట్టను' అని తల్లిదండ్రులు చెబుతారు. పారేసుకొచ్చాక మళ్ళీ కొనిస్తారు. పిల్లలకు తమ వస్తువులను జాగ్రత్త పెట్టుకోవడం నేర్పించడంతో పాటు ఇతరుల వస్తువులు తీసుకోవద్దు అన్నది కూడా చెప్పాలి. వేరేవారి వస్తువులు దొరికితే టీచర్కు ఇచ్చేలా వారికి నేర్పించాలి.
ఆహారపదార్థాలు పడేయకుండా..
చాలామంది పిల్లలు టిఫిన్, లంచ్ బాక్స్ అలాగే తీసుకువ స్తుంటారు. ప్రపంచంతో ఆహారంకోసం అలమటించే వారు కోట్లాది మంది ఉన్నారన్న విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. చిన్నతనంలో నేర్చుకునే మంచి అలవాట్లు పెద్దయ్యాక కూడా మరిచిపోరు. నీటిని వృధా చేయడం, ఆహారపదార్థాలను పడేయడం తగ్గిస్తారు.