Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యవసాయం అంటే ప్రకృతితో సహవాసం. కానీ, నేడు ఇది ప్రకృతిని దూరంగా తీసుకుపోయే ఆవాసంగా మారుతుంది. చాలావరకు వ్యవసాయభూములు నివాసాలుగా మారుతుంటే... సారవంతమైన భూమంతా రసాయనాల మయం అయిపోతుంది. అత్యధికంగా క్రిమిసంహారకమందులు వాడుతూ ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు' అంటూ ఆవేదన చెందుతున్నారు కెఎన్ బయోసైన్సెస్ వ్యవస్థాపకురాలు బయో కెమిస్ట్ సుధారెడ్డి. వ్యవసాయరంగంలో ఎన్నో ప్రయోగాత్మక అంశాలను ప్రవేశపెట్టి జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఒకరి నుంచి సాయం ఆశించే రంగంగా కాకుండా ఆదాయం తెచ్చే వ్యాపార రంగంగా ప్రతి రైతు చూడాలని అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయని అంటున్న ఆమె పరిచయం..
ప్రకృతి మీద, ప్రకృతిని చేరువ చేసే వ్యవసాయం మీద చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువ. హైదరాబాద్లోనే ప్రాథమిక విద్య నుంచి సెంట్రల్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పీజీ వరకు చదివాను. ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రేమించేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఒకరకంగా చెప్పాలంటే బయోకెమిస్ట్రీని ప్యాషన్తో చదివాను. ఇంట్లోవారంతా నా ఇరవై రెండ్ల కిందట కె.ఎన్. బయోసైనెన్స్ ఏర్పాటుచేశాను. ముందుగా టిష్యూ కలర్చ్ ప్రారంభించాను. ఓర్పు, ఇష్టం రెండు కలిసి నేను చేసే ప్రయోగాలకు సత్ఫలితాలను ఇచ్చాయి. కమిట్మెంట్, ప్లానింగ్ జతకావడంతో ఈ రోజూ కేవలం టిష్యూ కల్చర్ మాత్రమే కాకుండా సీడ్స్, ప్లాంట్స్, ఆర్గానిక్ , బయో ఫర్టిలెజర్స్ వరకు ఉత్పత్తి చేస్తున్నాం. ఒక అసిస్టెంట్తో ప్రారంభించిన మా కంపెనీలో ఇప్పుడు నాలుగువందల మంది పనిచేస్తున్నారు.
పని చేస్తూ పోవాలి..
చాలామంది వ్యాపారం ప్రారంభించగానే లాభాలు ఆశించి క్వాలిటీని పట్టించుకోరు. అయితే మౌత్పబ్లిసిటీకి మించిన ప్రచారం మరోటిలేదు. నేను ఈ సంస్థను ప్రారంభించినప్పుడు వ్యవసాయ పద్ధతులను మార్చడం పైనే దృష్టి సారించాను. నేరుగా రైతు పొలాల్లో చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందించాం. ఎక్కడా మాకు ఔట్లేట్స్ లేకపోయినా మా ఉత్పత్తులు గురించి తెలుసుకుని వచ్చి మరీ తీసుకువెళ్ళుతుంటారు. ఇప్పుడు మా వద్ద 60రకాల సేంద్రియఎరువులు అందుబాటులో ఉన్నాయి.
మిత్రపురుగులతో..
ఈ భూమిపై 78శాతం జీవులే ఉన్నాయి. వాటిలో పది శాతం మాత్రమే హానికరమైనవి. వ్యవసాయానికి సాయం చేసే జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఇవి ఒక చైన్ లింక్ మాదిరిగా ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తుంటాయి. ఉదాహరణకు వరిపంటకు వచ్చే దోమ తెగులు. ఈ దోమను నీటిలోని చిన్న చేపలు, కప్పలు తింటాయి. కానీ, ఇప్పుడు క్రిమిసంహార మందులు వాడుతున్నారు. వాటి వల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది. సమతుల్యత దెబ్బతింటుంది. ఈ విషయంపై ఎన్నో సదస్సులు నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తున్నాం.
ఆప్డేట్ అవుతూ..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆధునిక హంగులు సమకూరుతున్నాయి. శారీరక శ్రమను తగ్గించే యంత్రాలు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలిస్తూ.. రైతులు అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే సరికొత్త ట్రాక్టర్ రూపకల్పన చేసి కూలీల అవసరాన్ని తగ్గించి వ్యవసాయరంగంలోనూ ఆధునికతను తీసుకువచ్చే కృషి చేస్తున్నాం.
కార్పోరేట్ వలలో చిక్కిన సేద్యం
'అన్నం పెట్టే రైతు ఆకలి చావులు, దుక్కిదున్ని పంటను పండించే రైతు దుఖంతో ఆత్మహత్య చేసుకోవడం భరించలేని బాధాకరమైన సంఘటనలు. వీటికి కారణం ఎవరూ అన్న ప్రశ్నిస్తే సంప్రదాయ వనరులను, ఎరువులను కాదని రసాయనిక ఎరువుల వైపు, వాణిజ్యపంటలవైపు వెళ్లేలా చేసి, గిట్టుబాటు ధరలు ఇవ్వని ప్రభుత్వాలే అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఇది కేవలం మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితి కాదు ప్రపంచమంతా కార్పోరేట్ వలలో చిక్కి ప్రకృతిసేద్యాన్ని కూడా పచ్చనోట్లతో శాసించాలని చూస్తున్నారు.
వన్ స్టాప్ సోల్యూషన్
టిష్యూ కల్చర్ నుంచి ట్రాక్టర్ రూపకల్పన వరకు వ్యవసాయంలో కావల్సిన అనేక అంశాలపై పరిశోధనలు కొనసాగించాం. రైతులకు అవసరమైన వాటన్నింటినీ తయారుచేస్తున్నాం. ఇరవైరెండేళ్ల మా శ్రమ ఫలితాలను రైతులకు నేరుగా అందించేలా వన్ స్టాప్ సోల్యూషన్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి యాభై కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయం ప్యాషన్ ఉన్న ఏడుగురిని ఎంపిక చేస్తాం. వారికి వ్యవసాయ పద్దతుల్లో పూర్తి అవగాహన కల్పిస్తూ ట్రైనింగ్ ఇస్తాం. చుట్టూ పక్కల ఏ రైతుకు సమస్య వచ్చినా సంప్రదించి, సలహాలు తీసుకునేలా గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఈ సెంటర్లో పంట విత్తనాల నుంచి పంట బీమా వరకు అన్నింటిపై సమాచారం అందుబాటులో ఉంటాయి. దాదాపు పదివేల సెంటర్లను ఈ విధంగా ఏర్పాటు చేస్తే దాదాపు డెబ్బైవేల మందికి ఉపాధి దొరుకుతుంది. రైతు సమస్యలు తీరుతాయి. ఈ సెంటర్ ద్వారా చాలామంది యువ ఎంటర్ప్రెన్యూర్స్ తయారు అవుతారు. దేశప్రగతిలో భాగస్వాములను చేస్తాం.
సహజ వనరులను కాపాడేది ..
ప్రకృతిని మహిళతో పొలుస్తారు. అందుకే ప్రకృతి పరిరక్షణలోనూ మహిళల పాత్ర చాలా కీలకం. అందుబాటులో ఉంటే వనరులను సద్వినియోగం చేసుకోవడం, వెస్ట్ను అరికట్టడం మహిళలకు బాగా తెలుసు. చిన్న ఉదాహారణ చెప్పాలంటే.. వంకాయలో పుచ్చు ఉంటే ఆ వంకాయనంతా పడేయరు. కేవలం పుచ్చువరకు తీసి మిగతా భాగాన్ని వాడతారు. పొదుపులోనూ, వనరులను కాపాడడంలోనూ మహిళదే అగ్రస్థానం. అందుకే మేం ఏర్పాటుచేయబోయే వన్ స్టాప్ సోల్యూషన్లోనూ మహిళకే ప్రాధాన్యత.
రసాయనాల వెంట పరుగులు..
రైతే రాజు అంటూ ప్రభుత్వాలు వారికి ఏదో గొప్ప చేసినట్టుగా, రైతులకు కిరీటం పెట్టినట్టు సంబరపడుతున్నాయి. కానీ, ప్రస్తుత తరుణంలో రైతు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎరువులపై, రసాయనాలపై, విత్తనాలపై సబ్బడీలంటూ నాసిరకంవాటిని అంటగట్టడంతో పాటు భూమిలోని సారమంతా పీల్చేలా చేశారు. సంప్రదాయ బాటను వీడి రసాయనలవెంట పరుగులు పెట్టేలా చేశారు. ముందుతరాల వారికి మనం ఏమి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు గాలి, నీరు, మట్టి కలుషితంగా కాకుండా స్వచ్ఛంగా అందిస్తే చాలు. కానీ, మనం ఏం చేస్తున్నాం? ఆస్తులు కూడబెట్టే ప్రయత్నం చేస్తూ పచ్చని పొలాలను ప్లాట్లుగా మార్చుతున్నాం. ఆరోగ్యకరమైన ఆహారం బదులుగా తినే ఆహారం వల్ల జబ్బులు రాకుండా మందులు వేసుకుంటున్నాం. రైతే కాదు ప్రతి మనిషి ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయాలి.