Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇష్టం వచ్చినట్టుగా ప్లాస్టిక్ ఉపయోగిస్తాం. ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. ముందు తరాల గురించి ఆలోచించకుండా విద్యుత్ ఉపయోగిస్తాం. అవసరం లేకపోయినా లైట్స్, ఫ్యాన్స్ ఆన్లో ఉంచుతాం. నీళ్లను వృథా చేస్తాం. దీనికంతటికీ కారణం... పర్యావరణానికి మనం కలిగిస్తున్న హాని. వర్షాలు లేవు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. భవిష్యత్లో మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటన్నింటినీ ముందే ఊహించిన ఆ డాక్టర్ పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టింది. అయితే ముందు ఇల్లు మారితే... తరువాత సమాజం మారుతుందని నమ్మింది. అందుకే తన ఇంటిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా మార్చేసింది. ముంబైకి చెందిన ఆ డాక్టర్ గురించి ఓ పరిచయం...
డాక్టర్ రీమా లెవిస్. 38 ఏండ్లు. సైకో థెరపిస్టు, పైలేట్స్ ట్రైనర్ కూడా. బెంగళూరులో పుట్టిన రీమా... ప్రకృతికి దగ్గరగా పెరిగింది. చెట్లన్నా, పువ్వులన్నా ఆమెకు చాలా ఇష్టం. పెండ్లి తరువాత ముంబై మెట్రోపాలిటన్ రీజీయన్కి మారింది. డాక్టర్గా మనుషులను బాగు చేస్తున్న రీమా... భూమిని బాగు చేయాలనుకుంది. 2010లో ఇల్లు కొనుకున్నారు. అప్పుడే గర్భిణి కూడా. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం.. రేపు తన బిడ్డ ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనన్న కలవరం మొదలైందామెకు. అందుకే కొత్త ఇంటిని పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసి తన కొడుకుకు కానుకగా ఇవ్వాలనుకుంది. అందుకు ఆమె చేసిన మొదటి పని... సోలార్ వాటర్ హీటర్ను ఇన్స్టాల్ చేసింది. బాత్రూమ్స్, కిచెన్ను దానికి అలాచ్ చేసింది. కూరగాయలు కడగడం, వంట, తాగడానికి అదే నీటిని వాడుతుంది. భూమి మన అవసరాలన్నీ తీర్చుతున్నది.. కానీ భూమిని మాత్రం మనం పాడు చేస్తున్నాం. వచ్చే తరాలకు సురక్షితమైన భవిష్యత్ను అందించాలంటే... భూమిని రక్షించుకోవాలని... తన డూప్లెక్స్ ఇంటిని పూర్తిగా పచ్చగా మార్చేసింది.
విద్యుత్ వాడకం పెరిగిపోతున్నది. దాని ఉత్పత్తికోసం సహజవనరులను ఉపయోగిస్తున్నాం. తన ఇంటికి సోలార్ విద్యుత్ వాడాలని... నాలుగేళ్ల కిందట సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇల్లు మొత్తం సోలార్ పవర్తోనే నడుస్తున్నది. సోలార్ ప్యానెల్స్ అమర్చకముందు వాళ్ల కరెంట్ బిల్లు... పదివేల రూపాయలు. వేసవిలో అది మరింత పెరిగిపోయేది. సోలార్ సిస్టమ్ ఉపయోగించడం మొదలుపెట్టిన తరువాత.. వాళ్ల కరెంటు బిల్.. కేవలం 300. పెట్రోల్తో నడిచే కారును తీసేసి... ఎలక్ట్రిక్ కారును తీసుకున్నది. నెలకు పదివేల రూపాయలు పెట్రోల్కు అయిపోయేది. అలాంటిది... ఈవీ ఛార్జింగ్ యూనిట్ను పార్కింగ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేసి.. సోలార్ ప్యానల్స్కు కనెక్టు చేసింది. ఆ కారుకు ఉపయోగించే విద్యుత్ ఖరీదు కేవలం 500 రూపాయలు మాత్రమే. అంతేకాదు... ఇంట్లోని చెట్లు, మొక్కల కోసం సహజమైన వెర్మీకల్చర్ను ఉపయోగించి కంపోస్టింగ్ తయారు చేస్తున్నది. వాళ్లింటి టెర్రాస్పై... ఆకుకూరలు, కూరగాయల తోపాటు బొప్పాయి, గుమ్మడి వంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నది. ప్రకృతిని ఇష్టపడటం అంటే... ప్రకృతిని ఎంజారు చేయడంతోపాటు దాన్ని కాపాడుకోవాలనే పిలుపునిస్తున్నది రీమా.
సంచి పట్టుకెళ్లండి...
''పర్యావరణానికి సన్నిహితంగా ఉండాలంటే... 'దానికోసం చాలా సమయం వెచ్చించాలి. సమయం వృథా!' అనుకుంటారు చాలా మంది. కానీ అది అబద్ధం. తల్లిగా, డాక్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తూనే... ఇంటిని పచ్చగా ఉండం కోసం కేవలం 15 నిమిషాలు సమయం కేటాయిస్తాను. అందరు అనుకున్నట్టు ఎక్కువ సమయమేం పట్టదు. మీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు.. ఎంతో మార్పును తీసుకొస్తాయి. మార్కెట్కు వెళ్లి ప్లాస్టిక్బ్యాగ్లో అన్నీ తెచ్చే బదులు... ఇంటినుంచే వెళ్లేప్పుడే బట్టతో చేసిన ఓ సంచిని తీసుకెళ్లండి. ప్రకృతిని మనం కాపాడితే... అది మనలను కాపాడుతుంది'' అని చెబుతున్నది రీమా.