Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల ఉన్నత భవిష్యత్ కోసం డబ్బు కూడబెట్టాలనేది తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఆలోచించినంత వేగంగా ఆచరణలో పెట్టకపోవడమే చిక్కంతా. దీంతో లక్ష్యాలు ఉన్నా.. అందుకు తగ్గ నిధిని సమకూర్చుకోలేకపోతున్నారు. దేశంలో విద్యా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఎల్కేజీ నుంచి పీజీకి అయ్యే ఖర్చు.. ఇప్పుడు ఎల్కేజీకే అవుతోంది. మధ్యతరగతి వారు సంపాదించే మొత్తంలో 25శాతం వరకూ పిల్లల చదువులకే వెళ్లిపోతోంది. ఇప్పటినుంచే సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవు.
పదేళ్ల క్రితం పాఠశాల చదువుల ఖర్చులూ.. ఇప్పటి ఖర్చులనూ అసలు పోల్చలేం. విద్యా ద్రవ్యోల్బణం ఏటా కనీసం 10శాతం పైగా పెరుగుతోందని అంచనా. కొన్ని పాఠశాలల్లో కేవలం ప్రైమరీ విద్యకే రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నారు. రవాణాలాంటి ఇతర ఖర్చులు ఉండనే ఉంటాయి. ఇక ఉన్నత చదువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాఠశాల స్థాయిలోనే పిల్లలు ఏ కోర్సులో చేరాలన్నది నిర్ణయం అయిపోతోంది. కాబట్టి, దానికి అనుగుణంగా మనం డబ్బు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, గతంలోలాగా ఇప్పుడూ.. సంప్రదాయ పథకాల్లోనే మదుపు చేస్తామంటే విద్యా ఖర్చులను తట్టుకోవడం అసాధ్యమే. ఎంత దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అందుకే, పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా పెట్టుబడులు ప్రారంభించాలి.
బీమా పాలసీ కీలకం...
- పిల్లల భవిష్యత్తుకు తగిన రక్షణ కల్పించేందుకు బీమా పాలసీ ఎంతో కీలకం. అందుకే, పాలసీని ఎంపిక చేసుకునే ముందు తగిన పరిశోధన ముఖ్యం. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఇరవై ఏళ్ల తర్వాత కూడా మంచిదనే అనిపించాలని మర్చిపోవద్దు. చాలా బీమా పాలసీల వ్యవధి పిల్లలకు గరిష్ఠంగా 18 ఏళ్ల వయసు వచ్చేదాకా ఉంటుంది. ఆ తర్వాత నుంచి అంచెలంచెలుగా సొమ్ము వెనక్కి ఇస్తుంటాయి. కొన్ని ఏకమొత్తంలోనూ అందిస్తాయి. ఈ పథకాలన్నీ క్రమబద్ధంగా మదుపు చేసే అవకాశం కల్పిస్తాయి కాబట్టి, దీర్ఘకాలంపాటు కొనసాగితే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థిక సలహాదారుడిని సంప్రదించి, మీ లక్ష్యాలకు తగిన పాలసీని వెంటనే ఎంచుకోండి. పాలసీకి ప్రీమియం చెల్లించే వ్యక్తికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు 'ప్రీమియం వైవర్ బెనిఫిట్ ఉపయోగపడుతుంది. భవిష్యత్లో చెల్లించాల్సిన ప్రీమియాలన్నింటినీ బీమా కంపెనీ వారి తరఫున పాలసీకి చెల్లిస్తుంది. చాలా వరకు పిల్లల పాలసీల్లో ఈ రైడర్ అంతర్లీనంగానే ఉంటుంది. ఒకవేళ లేకపోతే దీన్ని తీసుకోండి. అంతే, పాలసీ వ్యవధి తీరేంతవరకూ కొనసాగేందుకు ఏ ఇబ్బందీ ఉండదన్నమాట. పాలసీని మధ్యలోనే క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే ఇచ్చే ప్రయోజనానికి ఇది అదనంగా ఉండేలా చూసుకోవాలి.
- ఏ పథకం అయినా మంచి రాబడి అందించినప్పుడే ఫలితం. దీంతోపాటు సొమ్ముకు ఎంతోకొంత భద్రత కూడా ఉండాలి. కాబట్టి, ఈక్విటీ, డెట్ మిశ్రమంగా ఉండేలా పాలసీలను ఎంచుకోవాలి. అదేసమయంలో తగిన మొత్తానికి బీమా రక్షణా ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చేందుకు ఆస్కారం ఉంది. మార్కెట్ పరిస్థితులను బట్టి, పెట్టుబడులు ఈక్విటీల్లోనూ, డెట్లలోకి మళ్లించే విధంగా ఉండాలి. వార్షిక ఆదాయానికి 12 రెట్ల వరకూ బీమా ఉండటం మంచిది. ఏ పెట్టుబడి పథకంలోనైనా మదుపు చేసేప్పుడు దాని గురించి అవగాహన పెంచుకోవడం ముఖ్యం. బీమా పాలసీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పాలసీకి సంబంధించిన వివరాలతో కూడిన సమాచార పత్రాన్ని పూర్తిగా చదవండి. అర్థం కాని వివరాలను బీమా కంపెనీ సలహాదారుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కంపెనీ క్లెయిమ్ పరిష్కార చరిత్ర, బీమా కంపెనీకి ఉన్న పేరు, రుసుములు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని, పాలసీలను పోల్చుకోవాలి. ఆ తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోవాలి.
విద్యానిధికి...
- పిల్లలు 3 నుంచి 8ఏళ్ల లోపు ఉన్నప్పుడే వారి పేరుమీద మదుపు ప్రారంభిస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చని నిపుణుల సూచన. అప్పుడే ఉన్నత చదువుల సమయం వచ్చేసరికి ఈ నిధి మీకు సహాయకారిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న విద్యా ఖర్చులు తట్టుకోవడానికి వీలైనంత తొందరగా పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. తగిన ప్రణాళికతో వెంటనే మదుపు ప్రారంభించి, దీర్ఘకాలంపాటు కొనసాగేందుకు అవకాశం ఇస్తే మంచి రాబడిని సాధించడానికి వీలుంటుంది. మీరు ఏ పథకంలో మదుపు చేసినా.. ఈ విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రాబడినివ్వాలి. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడమే మార్గం. దీర్గకాలంలో ఇవి ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని అందిస్తాయి. పారదర్శకంగా ఉంటూ, సులభంగా నగదును వెనక్కి తీసుకునే సౌలభ్యమూ ఉంటుంది. ఈ పథకాల నుంచి సగటున 12 శాతం రాబడిని అంచనా వేసుకోవచ్చు.
- విద్యా నిధి ఏర్పాటు కోసం పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ ఆధారిత పథకాల్లో ఈక్విటీ ఇండెక్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, ఈఎల్ఎస్ఎస్, లార్జ్క్యాప్ ఈక్విటీ డ్కెవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవచ్చు. కొంచెం నష్టభయాన్ని భరించే సామర్థ్యం ఉంటే.. నేరుగా షేర్లలోనే పెట్టుబడులు పెట్టవచ్చు. మార్కెట్లో అనుభవం లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడమే ఉత్తమం. కొంచెం మొత్తాన్ని ఎలాంటి నష్టభయం లేకుండా ఆదాయాన్నిచ్చే పోస్టాఫీసు పొదుపు పథకాలు, 15 ఏళ్ల తర్వాత సొమ్ము కావాలనుకుంటే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. బ్యాంకు టర్మ్ డిపాజిట్లు, జీరో కూపన్ దీర్ఘకాలిక బాండ్లు కూడా నష్టభయం భరించలేని వారికి నప్పుతాయి. బంగారం, స్థిరాస్తులు (పెట్టుబడి సొమ్ములో 25 శాతానికి మించకుండా), జీవిత బీమా పాలసీలను ఎంచుకోవచ్చు.
ఙవిద్యా నిధికి కేటాయించిన మొత్తాన్ని మూడేళ్లకోసారి సమీక్షించాలి. మరికొన్ని రోజుల్లో లక్ష్యానికి దగ్గరకొచ్చే అవకాశం ఉంటే.. సొమ్మంతా సురక్షితమైన పథకాల్లోకి మళ్లించాలి. ఆటుపోట్లు ఎదురైనా మనకు ఇబ్బంది ఉండదు. పిల్లల కోసం ఖర్చు చేసేందుకు వీలుగా వారి పేరుమీద ఒక ప్రత్యేక ఖాతాను ప్రారంభించండి. వారి భవిష్యత్తుకు మీరేం చేయాలనుకుంటున్నా ముందుగా సొమ్మును ఆ ఖాతాలో జమ చేసి తర్వాతే పెట్టుబడులకు మళ్లించండి. దీనివల్ల మీ పిల్లల సొమ్మును కచ్చితంగా వారి అవసరాలకే వాడటం ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు అందులోనుంచి ఏదైనా అవసరాలకు ఖర్చు చేస్తే వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేయాలి. అప్పుడు పిల్లల కోసం ఎంత పొదుపు, మదుపు చేస్తున్నాం అనే విషయం సులువుగా తెలుసుకోవచ్చు. పిల్లల చదువులు పూర్తయ్యేందుకు ముందుగా ఎంత సొమ్ము కావాలి దానికోసం ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఒకసారి మనం పెట్టుబడి పెట్టడానికి నిర్ణయిం చుకుంటే ఇక దానిని మధ్యలో ఆపకుండా కొన సాగించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతాం.