Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల క్రమశిక్షణలో భాగంగా పిల్లలను దండించడం మన దేశంలో సాధారణమయింది. పిల్లలు నేరస్తులు కాదు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్న దానిని గుడ్డిగా అనుసరిస్తూ పిల్లలను పేరెంట్స్ దండిస్తూ ఉంటారు. కాని అది ఏ మాత్రం సరైన ఫలితాలను ఇవ్వకపోగా వారి మానసిక స్థితిపైన వ్యతిరేకంగా పనిచేస్తుంది. పేరెంట్స్ సరైన అవగాహన లేకుండా పిల్లలను వారికి కోపం వచ్చినపుడు దండిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇతరులపై కోపంతో, లేదా విపరీతమయిన ఒత్తిడితో పిల్లలను దండిస్తారు.
అలాకాకుండా పిల్లలకు.. అమ్మానాన్నలే తోడూనీడగా ఉండాలని మానసిక వైద్యులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచుల్ని, మేధాశక్తిని, ప్రత్యేక కౌశలాలను గుర్తించాలి. పిల్లలు అల్లరికి మారుపేరు. అల్లరి శతిమించకూడదని ఆంక్షలు పెడతాం. ఇది సరికాదంటారు మనో వైజ్ఞానికులు. ఇప్పుడు వాళ్లకు విధించే శిక్షలు ప్రవర్తనపైనా, ఉద్వేగాలపైన ప్రభావం చూపిస్తాయంటున్నారు. శిక్షలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో వారి వయసును, మనసును పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.
ఆరునుంచి పదమూడేళ్ళ మధ్య వయస్సు చాలా సున్నితమైనది. శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా వారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతరుల మీద ఆధారపడకూడదన్న తపన, స్వేచ్ఛగా వ్యవహరించాలన్న కోరిక, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో కనిపిస్తాయి. ఎన్నో విషయాలలో పిల్లలు తమ సొంత తెలివితేటలను ఉపయోగించడం ముచ్చటవేస్తుంది. అయినా అప్పుడప్పుడు పనుల్ని తప్పించుకోవడానికి ఏవో సజనాత్మక మైన సాకులు చెబుతుంటారు. సో.. అమ్మానాన్నలే పిల్లలకు తోడూనీడగా ఉండాలని మనో వైజ్ఞానికులు అంటున్నారు.
శిక్షించడం వల్ల నష్టాలు
తలిదండ్రులు కోపంతోనే బిడ్డను కొడతారు. బిడ్డకు కూడా బాధ వల్ల కోపం వస్తుంది. కోపం పెద్ద వాళ్లకు గానీ, పిల్లలకు గానీ మంచిది కాదు. అన్ని గుణాల కంటే కోపం ప్రమాదకరమైనది.
కొందరు తలిదండ్రులు పిల్లలను చేతితో కాక కర్రతో కొడతారు. అలా కొట్టినట్లయితే పొరబాటున తగలకూడని చోట తగిలితే, లేనిపోని సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది.
అస్తమానం కొడుతున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలకు గౌరవం పోతుంది. విలువ తగ్గిపోతుంది. తలిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే బంధం కాస్తా పలచబడి పోతుంది. కొట్టిన చేతుల్ని చాపితే, బిడ్డలు మనస్ఫూర్తిగా ఆ కౌగిట్లోకి వెళ్లలేరు. తమకు పడిన దెబ్బలే వారికి గుర్తువస్తాయి.
కొట్టడం పరిష్కారం కాదు. అప్పటికప్పుడు భయం చేత, ఆ అల్లరిని తాత్కాలికంగా పిల్లలు ఆపేస్తారు. తర్వాత మళ్లీ అదే పని చేస్తారు. తిరగబడడానికి ప్రయత్నిస్తారు. చేతకాకపోతే తనకు తాను హింసించుకుంటారు.
పిల్లలను కొట్టకుండానే వారిలో పరివర్తన తీసుకు వచ్చేందుకు కోపంతో కాకుండా, ప్రేమతో చెప్పడం మంచిదని లేదంటే సున్నితంగా మందలించడం సురక్షితమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.