Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా అందరి చదువు ఉద్యోగం వచ్చేవరకు. కానీ ఆమెకు చదువు జీవితకాలపు తృష్ణ. కంప్యూటర్స్ చదివింది. మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకున్నది. సాంకేతికతలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నది. చదువులు ఉద్యోగాల కోసం కాదు.. ప్రజల జీవితాలను బాగు చేయడానికని తండ్రి చెప్పిన మాటలను బలంగా నమ్ముతూ ఆచరణలో పెడుతున్నది. అది ఒక పార్శ్వం మాత్రమే... జీవితంలోని సారాన్ని అక్షరబద్ధం చేసే అద్భుతమైన రచయిత. సామాజిక సమస్యలను దృశ్యమానం చేసే మంచి ఫిలిం మేకర్. జీవితంలో ప్రతి పనికి స్ఫూర్తి... ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులే అని చెప్పే ఆధునిక, ఆదర్శ మహిళ తెలికచర్ల స్నేహలత. ఆ మిర్యాలగూడ ఆడబిడ్డ పరిచయం ఆమె మాటల్లోనే...
''మాది మిర్యాలగూడ. అమ్మ లక్ష్మీరాజ్యం. గణితం ఉపాధ్యాయురాలు... నల్గొండ బోయవాడ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా రిటైర్ అయ్యారు. నాన్న శేషు. సైన్స్ టీచర్. శేషు సార్గా సుపరిచితం. అందమైన బాల్యం నాది. మిర్యాలగూడలో మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది. పొలాలు. తాతయ్య దగ్గర పద్యాలు నేర్చుకోవడం, ఇంగ్లీష్ చదువుకోవడం. పొలానికి వెళ్లడం. తాతయ్యలు ఇద్దరు డీఈఓలుగా రిటైర్ అయ్యారు. ఇల్లంతా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. టెంత్ వరకు అక్కడే చదువుకున్నా. ఇంటర్మీడియట్ హైదరాబాద్, డిగ్రీ నల్గొండ మహిళాడిగ్రీ కళాశాలలో పూర్తయ్యింది. మా ఇంట్లో నేను డాక్టర్ అవ్వాలనుకున్నారు. నేను వేరే ఎంచుకున్నాను. దాంతో డిగ్రీలోనే ఐసీఎస్ఎస్ కంప్యూటర్ సెంటర్లో చేర్పించింది అమ్మ. అక్కడే పీజీ డొప్లొమా చేశాను. డిగ్రీ ఎగ్జామ్స్ కాగానే పెండ్లి అయ్యింది. పీజీ ఎంట్రన్స్ రాస్తే మంచి ర్యాంకులొచ్చాయి. కానీ... మా వారు ఆనంద్, గుజరాత్ స్టీల్స్లో పనిచేసేవారు. సౌత్ ఇండియాకు మేనేజర్గా బెంగళూరు బదిలీ అయింది. నేనూ వెళ్లాల్సి వచ్చింది. అక్కడా చదువుకోవాలని... బెంగళూరు యూనివర్సిటీకి ప్రవేశ పరీక్ష రాశాను. మంచి ర్యాంకులు వచ్చినా... నాన్లోకల్ ఇష్యూస్ ఉండి సీటు రాలేదు. అక్కడ ఆప్టెక్లో ఎంట్రన్స్ రాస్తే... 80 శాతం స్కాలర్షిప్ వచ్చింది. కంప్యూటర్స్లో రెండేండ్ల హానర్స్ డిప్లొమా చేశాను. మళ్లీ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కావడంతో.. నేను హైదరాబాద్లో కోర్సు కంప్లీట్ చేసి... రీజనల్ టాపర్గా బయటికి వచ్చాను. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. మా వారికి ఊరంటే ఇష్టం. కాబట్టి ఊరికోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో... గద్వాల్లో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించాం. ఏటా రెండు మూడు వందల మందివిద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. మహాలక్ష్మి ఆదిదేవమ్మ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించాం.
విదేశాల ఆలోచన...
నాకు ఐదేండ్లున్నప్పుడనుకుంటా మా పిన్ని యూఎస్ వెళ్తుంటే ఎయిర్పోర్టుకెళ్లాం. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. 'బాగా చదువుకుంటే పెద్దయ్యాక నువ్వూ వెళ్లొచ్చు' అని చెప్పారందరు. బాల్యంలో చెప్పినవి బలంగా నాటుకుపోతాయి. బాబు పుట్టాక బాధ్యతల రీత్యా.. హైదరాబాద్కు వచ్చి సాఫ్ట్వేర్లో జాయినయ్యా. కానీ కార్పొరేట్లో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. బాబును చూసుకోవడం ఇబ్బంది అవ్వడంతో.. వాసవి కాలేజీలో ఫ్యాకల్టీగా చేరాను. 2005లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసే ఆర్గనైజేషన్... మొట్టమొదటి స్టూడెంట్ ఛాప్టర్ హైదరాబాద్లో ఐదు కాలేజీల్లో ప్రారంభించింది. మా కాలేజీలో నేను గైడ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏషియా పసిఫిక్లో కాన్ఫరెన్స్ లెవల్లోఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాబు కొంచెం పెద్దయ్యేదాక చేసి... తరువాత ఎమెక్యూ కంపెనీలో చేరాను. అప్పటికీ చిన్నప్పటి అమెరికా కోరిక అలాగే ఉండిపోయింది. 2006లో యూఎస్కు వచ్చాను. ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి అట్లాంటాలోనే ఉన్నాం. ఇక్కడ చాలా కాంట్రాక్టింగ్ వర్క్స్ చేశాను. దాదాపు 50 కంపెనీలకు పనిచేశాను. ఇప్పుడు డెల్టా ఎయిర్లైన్స్ కంపెనీలో చేస్తున్నా.
నిత్య విద్యార్థిని..
చదివే వయసులో బాధ్యతలు మీద పడటం వల్లనేమో.. పనిచేస్తున్నా కూడా చదువుకోవాలన్న కోరిక పోలేదు. వాసవి కాలేజీలో పనిచేస్తూనే... 'డి' లెవల్ ఎగ్జామ్స్ రాశాను. ఎంబీఏ కరస్పాండెన్స్లో చదువుకున్నాను. ఇండిస్టీ సర్టిఫికేషన్ చేశాను. యూఎస్ఏ వచ్చాక... ఐటెల్ సర్టిఫికేషన్ చేశాను. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిగ్ డేటా, మేషిన్ లర్నింగ్ సర్టిఫికేషన్ కోర్సులు చేశాను. ఎమ్ఐటీలో బ్లాక్ చైన్ సర్టిఫికేషన్ చేశాను. ఇప్పుడు... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద చేస్తున్నాను. అలాగే.. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎంఫిల్ చేశాను. ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో 'గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డిజైన్' అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. గత ఏడాది ఎగ్జామ్స్లో యూనివర్సిటీ టాపర్ని నేనే. నలభై ఏండ్ల యూనివర్సిటీ హిస్టరీలో నాకు వచ్చిన మార్కులు ఎవ్వరికీ రాలేదు. ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాను. ఇటీవలే ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ థారులాండ్లో ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ ఎయిర్లైన్స్లో ఉపయోగించే విధానం మీద పేపర్ ప్రజెంట్ చేశాను. బెస్ట్ పేపర్ అవార్డు వచ్చింది. థాయిలాండ్లో... రైతులు వాడే పనిముట్లు, ప్రభుత్వమే షేర్డ్ రిసోర్సెస్లా అందిస్తున్నది. ఆ పరిశోధనలో భాగంగా బిజినెస్ మోడల్ డెవలప్చేయడం కోసం నన్ను ఆహ్వానించారు. నేను చేసిన పని రైతులకు పరోక్షంగా సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉంది. సమాజానికి పనికొచ్చే రీసర్చ్ ఇది. అధ్యయనం నాకు జీవితకాలపు జిజ్ఞాస.
బాధను అక్షరీకరించి...
డిగ్రీలో ఉన్నప్పుడే వీణ నేర్చుకున్నాను. నాన్నకు ఆరోగ్యం బాగలేక... మధ్యలో మానేశారు. కానీ నేర్చుకోవాలన్న కోరిక ఉండిపోయింది. మా అత్తగారింట్లో అందరూ చాలా బాగా పాడతారు. 'ఈ ఇంటికొచ్చిన కోడండ్లెవరికీ పాటరాదు. కూతుళ్లకు, కొడుకులకే వస్తుంది' అని జోక్ చేసేవారు. 'నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. కొంత కష్టపడాల్సి వస్తుందేమయో కానీ... అసాధ్యం అంటూ ఏమీ ఉండదు' అని సీరియస్ ఛాలెంజ్గా తీసుకుని నేర్చుకున్నాను. యూఎస్ వచ్చాక వీణ క్లాసెస్ కూడా కంటిన్యూ చేశాను. ఒక కచేరీ చేసేంత నేర్చుకున్నా అనుకున్నా. 97లో నాన్న పోయారు. 2015లో అమ్మ పోయింది. ఆ దు:ఖంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నేను డిప్రెషన్ అయితే బాబు ఎట్లా? అని, కూతురిగా బాధ ఉన్నా.. తల్లిగా బాధ్యతగా ఉండాలనుకున్న. అయితే ఆ బాధ పోవడానికి రాయడం మొదలుపెట్టాను. అప్పుడే హను కొత్తపల్లి కలిశారు. నేను రాసినవి చూసి... 'నీవు బాగా రాయగులుగుతావు. ఇది మంచి పుస్తకం అవుతుంది అని చెప్పి... నా రచనలన్నింటినీ 'బీయింగ్ ఇన్ లవ్' పుస్తకంగా తీసుకొచ్చారు. బాబు పుడతాడు అని తెలిసినప్పుడి నుంచి... తల్లిగా నేను ఎలా ఫీలయినది రాసుకున్నా. ఆ భావాలన్నీ పుస్తకంగా బాబుకు కానుకగా ఇచ్చాను. 'బీ మైన్' అనే మూడో పుస్తకం తీసుకొచ్చారు. మరో రెండు పుస్తకాలు రానున్నాయి. వాటన్నింటికీ హంస రైటింగ్స్ పేరుతో వెబ్సైట్ చేశాను.
సమస్యలను దృశ్యమానం చేస్తూ....
తరువాత దృశ్య మాధ్యమంలోకి వెళ్లాలనిపించింది. వంద లఘు చిత్రాలు లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటివరకు 85 తీశాను. అందులో ఏ టు జడ్ ప్రొడక్షన్ మాదే. ఫిలిం చిన్నదే అయినా.. ఏదో ఒక సామాజిక సందేశం ఉంటుంది అందులో. పేరెంట్స్ పట్ల బాధ్యత, చైల్డ్ లేబర్, సమాజంలోని వివక్షలు, ఇప్పటికీ ఓ హిందూ ముస్లిం పెండ్లి చేసుకుంటే తప్పయిపోతుంది, ఇంట్లో ఇరవై ఏండ్ల యువతి ఉందంటే 'పెండ్లెప్పుడు?' అని ప్రశ్నిస్తారు... కానీ ఆమె ఏం చేయాలనుకుంటుంది అని ఎవ్వరూ అడగరు. సమాజం నిత్యం ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యల మీద సినిమాలు తీశాం. వాటికోసం హంస ఫర్ యు ఛానల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నలు నాలో ఉదయించడానికి కచ్చితంగా కారణం నాన్నే. గేట్స్ వాళ్లు లిటరరీ వర్క్కి, ఆటా వాళ్లు ఇనిస్పైరింగ్ ఉమెన్గా, తానా వాళ్లు మీడియా అండ్ ఆర్ట్స్ విభాగంలో అవార్డు ఇచ్చారు. ఇవన్నీ మరింత బాగా పనిచేయడానికి ప్రోత్సాహంగానే భావిస్తాను.
పంచడంలో ఆనందం...
నా పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బంతా చారిటీగా.. నల్గొండ గద్వాల్ ప్రాంతాల్లో ఉన్న అనాధాశ్రమాలు, అంధుల పాఠశాలలు, ఎయిడ్స్తో ఉన్న పిల్లల కోసం ఇచ్చాం. హను వాళ్లది విజయవాడ కావడంతో హంస ప్రొడక్షన్స్ ఆఫీస్ అక్కడే పెట్టాం. అక్కడ 160మందికి ఉపాధి కల్పించాం. ఏదో షూట్ చేయడానికి వెళ్లినప్పుడు అంగన్వాడీ సెంటర్స్ను చూశాను. మనసు కదిలిపోయింది. వాటిని దత్తత తీసుకుని... అవసరమైన విద్యుత్, భవన పునరుద్ధరణ, నీళ్లు, పిల్లలకు చెప్పులు, బెడ్షీట్స్... అందజేశాం. పెద్దలకు పితృకర్మలు చేస్తారు. కానీ నాన్న భావజాలం వేరు. అందుకే అవన్నీ చేయకుండా ఆ డబ్బును మదర్థెరిస్సా ఓల్డేజ్ హౌమ్కు అందజేస్తున్నా. అది నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. పంచుకోవడంలో ఉన్న ఆనందం... పంచితేగానీ తెలియదు. మిర్యాలగూడలోని మా ఇంటిని... కంటి ఆస్పత్రికోసం ఇచ్చేశాం. 'రంగనాయకమ్మ రంగాచార్యులు' పేరుమీద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ హాస్పిటల్ నడుస్తున్నది.''
నాన్న సందేశం... అమ్మ స్ఫూర్తి...
నాన్న విరసంలో యాక్టివ్గా ఉండేవారు. కొద్దిరోజులు సాగర్లో, తరువాత నల్గొండలో పని చేశారు. ఏపీటీఎఫ్ ఆర్గనైజర్. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఎప్పుడో కానీ ఇంటికి వచ్చేవారు కాదు. మాది చాలా సంప్రదాయ కుటుంబం. కానీ నాన్న ఇంట్లోకి వచ్చారంటే మొత్తం వాతావరణం మారిపోయేది. ఇంటిల్లిపాది నాన్నకు నచ్చినట్టే ఉండేవారు. నాన్న మితభాషి. మంచి లీడర్. ఆయన ఆలోచన ఎప్పుడూ సమాజం గురించే. అందులోని రుగ్మతల గురించే. ఉపాధ్యాయులెందరో జీతాల లెక్కల్లో ఉన్నప్పుడు... టీచర్గా పనిచేస్తూనే ఈ విద్యావ్యవస్థను ప్రశ్నించారు. నిత్యజీవితంలో చదువులను ఎట్లా అన్వయించుకోవాలో చెప్పారు. విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లోని అనేక సమస్యలను కేంద్రంగా చేసుకుని కథలు, వ్యంగ్య రచనలు, నాటికలు అద్భుతంగా రాసిన సృజన శీలి. మాతో ఉన్న కొద్ది సమయంలోనే శ్రీశ్రీ, ఇతర గొప్ప రచయితల గురించి చెప్పడం, పుస్తకాలు చదివించేవారు. మానసికంగా దృఢంగా ఉంటే... ఏదైనా అధిగమించగలం అని చెప్పేవారు. దేనినైనా నేరుగా చెప్పకుండా నాకు నేను తెలుసుకునేలా చేసేవారు. ఆలోచనా తీరును పెంచే కథల పుస్తకాలు తెచ్చి చదివించేవారు. 'తెలుసుకోవాలన్న కోరిక ఉన్నంత వరకే మనిషి బతుకుతాడు' అని చెప్పేవాడు. నా ఆలోచనా విధానంలో నాన్న ప్రభావం చాలా ఉంది. నాన్న చనిపోయాక ఆయన రచనలను... కార్టూనిస్టు నర్సిం అన్నంతో కలిసి 'శేషుసర్.నెట్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాం. నిరంతరం చదువు కోవాలనే స్ఫూర్తి అమ్మానాన్నల నుంచి వచ్చిందే... 'నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. కాలేజీ పిల్లలకు టీచ్ చేయాలంటే.. పీజీ ఉండాలి' అని ఎమ్మే ఇంగ్లీష్ చేసింది అమ్మ. నేను కాలేజీకి వచ్చేనాటికి అమ్మానాన్నలిద్దరివీ డబుల్ మాస్టర్స్ అయిపోయాయి. అమ్మ ఎంఫిల్ చేసి, పీహెచ్డీ ఎన్రోల్ చేసుకున్నది. అమ్మ తన సమయాన్ని అస్సలు వృథా చేసేది కాదు. నాన్న తన పనుల్లో ఎంతో బిజీగా ఉంటే...మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అమ్మే. నేను ఏ వర్క్ చేసినా.. దానిమీద వాళ్ల ప్రభావం చాలా ఉంటుంది.
దృఢంగా ఉండాలి...
ఏదైనా సాధించాలంటే.. కుటుంబ సహకారం ప్రధానం. మా బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా వారు అట్లాంటా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇద్దరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. హనుగారి సపోర్ట్ కూడా చాలా ఉంది. ప్రతికూల ఆలోచనలు నామీద పడకుండా చూసుకుంటా. ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి. దాన్ని చేరుకోవడానికి ఎంతో నిబద్ధత, ఏకాగ్రత కావాలి. అలాగే ఒత్తిడి ఉంటే ఏం చేయలేం... నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. నచ్చిన పని నేను చేసుకుంటూ పోతున్నా. టీవీ చూడను. పుస్తకాలు చదువుతాను. వాటితోపాటు చుట్టూ ఉన్న మనుషులను చదువుతాను. నాకు ప్రాధాన్యం అనిపించని పనులేవీ చేయను. సాధారణంగా మహిళలను అమ్మ, అక్క, చెల్లి, భార్య, తల్లి... ఇలా ఒక ఫ్రేమ్లో పెడతారు. జీవితాంతం ఆ ఫ్రేమ్లో ఫిట్టవ్వాల్సి వస్తుంది. తీరా అందులో ఇమిడే వ్యక్తిత్వం మనది కాదని తెలుసుకునేసరికి నలభై ఏండ్లు దాటిపోతాయి. ఈ క్రమంలో నేనేంటి? అని అర్థం చేసుకోగలిగితే... చాలా సంతోషంగా ఉంటాం. మనకు ఏం కావాలో ముందు దాన్ని తెలుసుకోవాలి. జీవితంలో అనేకరకరాల సమస్యలు వస్తాయి. ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులతో పోరాడాలి. అధిగమించాలి.