Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లి కావడం ఓ వరం. అయితే అప్పటి వరకు తన ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఆ తల్లి పాప పుట్టగానే మారిపోతుంది. తన దష్టంతా పుట్టిన పాపపైనే పెడుతుంది. తన ఆరోగ్యం గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. డెలివరీ తరువాత తీసుకునే ఆహారంపై పెద్దలు పెట్టే ఆంక్షలు కూడా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీనిమూలంగా తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందంటున్నారు వైద్యులు.
డెలివరీ తరువాత తీసుకోవాల్సిన ఆహారంపై చాలామందిలో అపోహలుంటాయి. నీళ్లు ఎక్కువగా తాగకూడదు. పప్పు తినకూడదంటుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం మూలంగా పొట్ట వస్తుందనేది అపోహ మాత్రమేనంటున్నారు వైద్యులు. పప్పులో ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి పప్పును దూరపెట్టడం శ్రేయస్కరం కాదంటున్నారు..
డెలివరీ తరువాత ప్రతీ తల్లి శారీరక అంశాలపై దష్టి పెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు డెలివరీ తరువాత నాలుగైదు రోజుల వరకు స్నానం చేయనివ్వరు. కానీ అది కూడా తప్పేనంటున్నారు వైద్యులు. రెగ్యులర్గా స్నానం చేయాలని సూచిస్తున్నారు.
మసాజ్ చేయించుకుంటే మరీ మంచిదంటున్నారు. కండరాలు పటుత్వం కోల్పోకుండా ఉంటాయంటున్నారు. సిజేరియన్ అయినట్లయితే కుట్ల దగ్గర కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే నెలకొకసారి మూడునెలలపాటు వైద్యులను సంప్రదించాలి.
గర్భం దాల్చినప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్న ఐరన్, కాల్షియం మాత్రలను డెలివరీ తరువాత చాలామంది ఆడవాళ్లు మానేస్తుంటారు. కానీ అది కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. డెలివరీ తరువాత కూడా మూడు నెలల పాటు ఆ మందులను తప్పనిసరిగా వాడాలట. అప్పుడే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందంటున్నారు. కాబట్టి ఆహారంపై ఆంక్షలు పెట్టుకోకుండా ఆకుకూరలు, పండ్లు, పప్పులు అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.