Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరు చివర డిగ్రీ అన్న రెండు అక్షరాలు రాసుకోవాలన్న ఆమె తపన మూడు పిజీలు
సాధించేవరకు ఆగలేదు. ఆడపిల్లలకు ధైర్యాన్ని, భవిష్యత్పై భరోసా ఇచ్చేది అక్షరాలే అని త్రికరణశుద్ధిగా విశ్వసించిన ఆమె ఈ రోజు వందలాది మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆడపిల్లలను దూరవిద్యద్వారా ఉన్నతచదువులు చదివేందుకు
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్నారు. బాలికావిద్యాకోసం కృషి చేస్తూ అక్షరానికి దూరమైన నిరుపేదలను కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో చేరుస్తున్నారు. వారి భవిష్యత్ బాగుండేలా దిశనిర్దేశం చేస్తున్నారు. ఆమే కాకతీయ, అంబేద్కర్ దూరవిద్యా యూనివర్సిటీల కౌన్సెలర్, కస్తూరిబాగాంధీ పాఠశాల టీచర్ వసంత. అక్షరాలను ఆడపిల్లలకు అందిస్తున్న ఆమె పరిచయం..
మాది కరీంనగర్. వ్యవసాయ కుటుంబం. నలుగురు పిల్లలను చదివించ డానికి నాన్న ఎంతో కష్టపడ్డారు. అమ్మకు ఇల్లే ప్రపంచం. పొలం పనులు తప్ప మరో విషయం ఆమెకు తెలియదు. ఇద్దరు ఆడపిల్లలను కూడా మగపిల్లలతో సమానంగా చూసేవారు. పదోతరగతి పూర్తి అయిన తర్వాత పెండ్లి చేశారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మా వారు టీచర్ కావడంతో చదువు విలువ తెలిసిన వ్యక్తి. మా ఇంటి చుట్టుపక్కల వారు వారి పిల్లలను ఏం చదివిస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చేవారు. వారు ఆసక్తిగా ఉన్నత చదువుల గురించి అడగడం, మా వారు ఓపికగా వారికి చెప్పడంతో చదువుపై నాలో ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.
పేరు చివర..
మాకు ఇద్దరు ఆడపిల్లలే కావడంతో 'ఇద్దరూ ఆడపిల్లలేనా' అంటూ చాలామంది హేళనగా మాట్లాడేవారు. చిన్న చూపు చూస్తూ మాట్లాడేవారు. అది నాకు నచ్చేది కాదు. ఆడపిల్లలైతే ఏంటీ అన్న పట్టుదల పెరిగింది. వారిద్దరినీ మంచి స్కూలులో జాయిన్ చేశాం. నేను కూడా చదువుకుంటాను అని మా వారితో చెప్పడంతో ఆయన సరే అన్నారు. రెగ్యలర్గా కాలేజీకి వెళ్ళడం కష్టం కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నాను. పదో తరగతి చదివిన వారు నేరుగా డిగ్రీలో చేరాలంటే వారి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. నేను పరీక్ష రాసి డిగ్రీలో చేరడానికి అర్హత సాధించాను. నా పేరు చివర బిఏ అని రాసుకోవడానికి ఎంతో ఆరాటపడ్డాను. కుటుంబబాధ్యతలు, పిల్లల పెంపకం మధ్య డిగ్రీ పూర్తి చేస్తానా లేదా అన్న డైలమాలో ఉన్న నాకు మావారు, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించడంతో డిగ్రీ పూర్తి చేశాను.
మూడేండ్ల కృషి తర్వాత వనంత, బిఏ అని రాసుకోగలిగాను.
ఆర్థిక ఇబ్బందులతో..
డిగ్రీ చదువుతున్నప్పుడే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. పిల్లలతో పాటు నేను బడికి వెళ్ళేదాన్ని. డిగ్రీతోనే నా చదువు ఆపేయకూడదనుకున్నాను. దూరవిద్యద్వారా ఉన్నత చదువులు చదివే అవకాశం ఇస్తున్న యూనివర్సిటీలో ఎన్నో ఉన్నాయి. వాటిలో మనకు అందుబాటులో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పిజీ కూడా చదవాలనుకున్నాను. టీచింగ్లో ఉన్నాను కాబట్టి ముందుగా బి.ఎడ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎం.ఏ (సోషియాలజీ), ఎం.ఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ఎం.ఎడ్, పిజీడిడిఇ కూడా పూర్తి చేశాను.
కౌన్సెలర్గా..
టీచర్గా కెరీర్ను ప్రారంభించినప్పటికీ విద్యాభ్యాసం కొనసాగించాను. 15ఏండ్లు టీచర్గా పనిచేసి ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బి.ఏ విద్యార్థులకు కౌన్సెలర్గా ఉన్నాను. బి.ఎడ్ కాలేజీలో లెక్చరర్గా పదేండ్ల పాటు పనిచేశాను. ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. వారి జీవితాలను తీర్చిదిద్దుకునేలా గైడెన్స్ ఇవ్వగలిగితే చాలు.. విద్యార్థులు ఎన్నో నేర్చుకుంటూ భవిష్యత్ను తీర్చిదిద్దుకుంటారు.
పాఠాలు రాసేలా..
యూనివర్సిటీలు నిర్వహించే అనేక సెమినార్లకు నేను తప్పక హాజరు అయ్యేదాన్ని. మనం నేర్చుకోవల్సిన ఎన్నో అంశాలను సెమినార్ల ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది. విద్యారంగంలో ఉన్న ఎంతో మంది అభిప్రా యలను, అనుభవాలను, సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా బోధనాపద్ధతులను మరింత మెరుగుపరుచుకుంటూ విద్యా బోధన చేయవచ్చు అన్న ఆలోచనతో ఎన్నో సెమినార్లకు హజరయ్యాను. కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలనాశాస్త్రంలో అనేక విషయాలపై పేపర్ ప్రజెంట్ చేశాను. బిఏ విద్యార్థుల కోసం మొదటి ఏడాది కోర్సులో రెండు పాఠాలను కూడా రాసే అవకాశం వచ్చింది.
సాహిత్యసేవలో..
టీచర్గా పనిచేసే సమయంలో చిన్నారుల్లో మాతృభాషపై మమకారం పెంచేలా వారికి చిన్నిచిన్న పజిల్స్ చేయించేదాన్ని. చిట్టిపొట్టి కథలు రాయిస్తూ.. భాషమాధుర్యాన్ని తెలియచేసే ప్రయత్నం చేశాను. అదే సమయంలో నాకు స్ఫురణకు వచ్చిన అనేక అంశాలను కవితలుగా రాసాను. వాటిలో బాల్యం, మా వూరు, తెలుగు వెలుగు, తెలుగే గొప్ప వెలుగు, జరభద్రం, మహిళా అభినందన్, యాదాద్రి, ఓటు వంటి కవితలు ఎంతో ఆదరణ పొందాయి. అనేక అంశాలపై వ్యాసాలు, ప్రముఖుల రచనలకు సమీక్షలు కూడా రాసాను.
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు నిర్వహించిన సాధికారత బతుకమ్మ పాటల పోటీల్లో నేను రాసిన పాటకు మొదటి బహుమతి వచ్చింది. పాలమూరు సాహితి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొని సత్కారం అందుకున్నాను.
సామాజిక సేవ..
ఆడపిల్ల చదువే దేశానికి వెలుగు అన్న ఆలోచన తల్లిదండ్రుల్లో రావాలి. ఆడపిల్లలను చులకనగా చూసే స్వభావం పూర్తిగా పోవాలి. చదువుకు దూరంగా ఉంటున్న ఆడపిల్లలు ఎక్కడ కనిపించినా వారికి చదువుపై అవగాహన కల్పించి బడిలో చేరుస్తాను. బాలికా విద్యాభివృద్ధిలో భాగంగా గత దశాబ్దంగా ఎంతోమంది నిరుపేద బాలికలను గుర్తించి వారిని స్థానిక కస్తూరిబా గాంధీ పాఠశాలలో చేర్చించి వసతి కల్పిస్తూ విద్యను అందిస్తున్నాం. అక్షరజ్ఞానం ఆడపిల్లల జీవితాలను మారుస్తుంది అన్నది నా ప్రగాఢవిశ్వాసం. అందుకే ఆడపిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. దూరవిద్యకోర్సుల గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నతవిద్య చదివి ఉపాధి మార్గాలను అందుకునేలా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. వారి భవిష్యత్ బాగుండేలా దిశనిర్దేశం చేస్తున్నాను.