Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ఉద్యోగం అంటే... ప్రజలకు సేవ చేసే అవకాశమని కొందరే భావిస్తారు. ఆ కొందరిలో ముందుంటారు డిజేబుల్డ్ వెల్ఫేర్, జేజేబీ డైరెక్టర్.. బి. శైలజ. బాల్యం నుంచి ఎలాంటి కష్టాలు లేకుండా పెరిగారు. కానీ ఉద్యోగంలోకి వచ్చాక ప్రజల కష్టాలు చూసి కదిలిపోయారు. డిజేబుల్డ్ వెల్ఫేర్ ఏడీగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జువనైల్ వెల్ఫేర్ డైరెక్టర్గా... ఎన్నో సంస్కరణలు చేపట్టారు. హౌమ్స్లో ఉన్న పిల్లల జీవితాల్లోకి కొత్త వెలుగు తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ సీఈఓగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అడుగుపెట్టిన ప్రతి డిపార్ట్మెంట్లోనై తనదైన ముద్ర వేసి పలు జాతీయ అవార్డులు గెలుచుకున్న ఆ కరీంనగర్ ఆడబిడ్డ పరిచయం...
శైలజ సొంతూరు కరీంనగర్. డిగ్రీవరకు కరీంనగర్లో చదివిన ఆమె... ఎమ్మే సోషియాలజీ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టారు. అప్పటిదాకా అడ్వకేట్ కావాలన్నది కల. కొద్దిరోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా చేశారు. సోషియాలజీ చదువుతున్నప్పుడే ఆమెకు సామాజిక బాధ్యత తెలిసొచ్చింది. సివిల్స్కు ప్రిపేరవ్వడం మొదలుపెట్టారు. మెయిన్స్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్ రాయాల్సి ఉంది. ఈలోపు గ్రూప్వన్ రాయడం, సెలక్టవడం జరిగిపోయాయి. 1996లో డిజేబుల్డ్ వెల్ఫేర్ ఏడీగా గుంటూరు జిల్లాలో పోస్టింగ్. డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లు.. బస్ పాస్ తీసుకోవాలన్నా, ఫించన్ తీసుకోవాలన్నా... డిజేబుల్డ్ సర్టిఫికెట్ కావాలి. అది జిల్లా కేంద్రంలోనే ఇస్తారు. దానికోసం.. 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్లు. తీరా ఆఫీస్కు వచ్చాక.. ఏ ఒక్క అధికారి లేకపోయినా సర్టిఫికెట్ చేతికి అందకపోయేది. మళ్లీ ప్రయాణం. ఒక్కొక్కరి చేతిలో కిరాయిలకు డబ్బులు కూడా ఉండకపోయేవి. కొత్తగా వచ్చిన అధికారిణి.. ఎంతో చేయాలన్న తపన. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఓ రోజు రాత్రి ఏదో ఊరు నుంచి తిరిగొస్తుండగా... వాళ్ల దగ్గరకే అధికారులు ఎందుకు వెళ్లకూడదు? అనే ఆలోచన వచ్చిందామెకు. వెంటనే అప్పటి కలెక్టర్ పూనం మాలకొండయ్యతో మాట్లాడి... రెండు మూడు మండలాలు కలిపి ఓ క్యాంపు కండక్ట్ చేశారు. దానికి అన్ని రకాల డాక్టర్లు, ఆర్టీసీ అధికారులు, ఎంపీడీఓ, ఎమ్మార్వో.. అందరినీ ప్రజల వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ల దగ్గర చూపించుకుని సర్టిఫికెట్లు తీసుకున్నవాళ్లు వెంటనే ఆర్టీసీ దగ్గర బస్పాసులు తీసుకున్నారు. వాళ్ల డేటాను ఎంపీడీఓ రికార్డు చేశారు. ఆ తరువాత సీఎస్సార్ నుంచి ఫండ్స్ తెచ్చి, మరో క్యాంపు పెట్టి, ఆ రికార్డుల ప్రకారం డిజేబులిటీని బట్టి పరికరాలు... అంటే అంధులకు హియరింగ్ ఎయిడ్స్, వైకల్యం ఉన్నవాళ్లకు ట్రైసైకిల్స్, ఆర్టిఫిషియల్ లింబ్స్ పంపిణీ చేశారు. అట్లా అన్ని జిల్లాలకు ఓ దిక్సూచి అయిన ఆ కార్యక్రమం పేరు 'చేయూత'. మనసుండాలే కానీ.. ప్రభుత్వాధికారి ఎన్ని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టొచ్చో నిరూపించారామె.
నిబద్ధత గల ఆఫీసర్గా...
డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లకు ఎడ్యుకేషన్ తక్కువ. ఉద్యోగాలు మరీ తక్కువ. ఏమైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టమేనని... ఎంప్లాయిమెంట్ ఆఫీసునుంచి డేటా తీసుకుని.. 'మీకు ప్రభుత్వ ఉద్యోగం వెంటనే రాకపోవచ్చు. స్వయం ఉపాధి మీద ఆసక్తి ఉంటే మాకు చెప్పండి' అని అందరికీ పోస్టు కార్డులు రాయించారు. కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు ఆఫీసుకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అన్ని జిల్లా ఆఫీసులను పిలిచి, మళ్లీ ఓ క్యాంపు పెట్టి... కలెక్టర్ చొరవతో ఆ ఏడాది కేవలం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లకే రుణాలివ్వాలని రూల్ పెట్టారు. ఫలితంగా ఎంతోమంది ఉపాధి పొందారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి... కేవలం మూడుశాతం రిజర్వేషన్. ప్రతి ఆరో పోస్టు అంధులకు, 31వ పోస్టు బధిరులకు.. 56వ పోస్టు ఆర్థోపెడిక్ డిజేబులిటీస్ ఉన్నవాళ్లకు ఇవ్వాలి. కానీ వైకల్యం పేరుమీద ఎవరికో ఇచ్చి.. చేతులు దులుపుకునేవాళ్లు. దీంతో అర్హులైనవాళ్లెందరికో అన్యాయం జరిగింది. ఒక నోడల్ బృందం ఏర్పాటు చేసి.. అన్ని ఆఫీసుల రిజిస్టర్స్ తెప్పించి, వికలాంగులకు ఇవ్వనివి, ఇతర బ్యాక్లాగ్ పోస్టుల లిస్ట్ తీయించారు. 360 పోస్టులు భర్తీ చేశారు. ఆరోపోస్టులే ఎక్కువుంటయి. కానీ ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజ్లో అంధులు అప్లయి చేసుకోలేదు. కొంతమందిని వెంటనే గుర్తించి... వాళ్లను రిజిస్టర్ చేయించి, అదే రోజు పోస్టులిచ్చారు. వాళ్ల ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఉద్యోగాలు, ఉపాధి తరువాతనే చాలామందికి పెండ్లిళ్లయ్యాయంటే అతిశయోక్తి కాదు. కొంతకాలం తరువాత తన సొంత జిల్లా అయిన కరీనంగర్కు బదిలీ పెట్టుకున్నారామె. వరంగల్కు బదిలీ చేస్తూ ఆర్డర్స్ కూడా వచ్చాయి. కానీ అక్కడి జనం ఆమెను పంపించొద్దంటూ ధర్నాలు చేశారు. అట్లా మూడుసార్లు బదిలీ ఉత్తర్వులు ఆగిపోయాయంటే... ఎంత నిబద్ధత గల అధికారో అర్థం చేసుకోవచ్చు. ఆ నిబద్ధతకు మెచ్చే... 2002లో 'బెస్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్' నేషనల్ అవార్డు అబ్దుల్ కలాం నుంచి అందుకున్నారామె.
నెంబర్వన్గా నిలిపి...
తరువాత సర్వశిక్ష అభియాన్కు బదిలీ.. అప్పటిదాకా హైదరాబాద్లో ఎడ్యుకేషన్ సర్వేనే లేదు. మొట్టమొదటిసారి ఉపాధ్యాయులందరినీ మోహరించి సర్వే చేయించారు. చదువుల పండుగ నిర్వహించారు.
డ్రాపవుట్స్, బాలకార్మికులను గుర్తించి, లేని చోట స్కూల్స్ఏర్పాటు, విద్యావాలంటీర్లను నియమించారు. ఏడాదిన్నరపాటు పని చేశాక.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ అయ్యింది. అప్పటి దాకా... పథకాలు అమలులో రంగారెడ్డి జిల్లా 23వ స్థానంలో ఉండేది. అలాంటిది ఒకే ఒక్క ఏడాదిలో నెంబర్ 2 స్థాయికి, తరువాతి రెండేండ్లలో నెంబర్వన్గా నిలబెట్టారు.
అందుకుగాను ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తరువాత రంగారెడ్డి జిల్లా రూరల్ డెవలప్మెంట్లో ఏడాది చేశాక... మళ్లీ డిజేబుల్ వెల్ఫేర్కు వచ్చారు. కార్పొరేషన్ అస్తవ్యస్థంగా ఉండేది. దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చారు. విభజన తరువాత జువనైల్ వెల్ఫేర్ డైరెక్టర్గా, డిజేబుల్ వెల్ఫేర్ కమీషనర్గా, డైర్టెర్గా, కార్పొరేషన్ ఎండీగా నాలుగు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జువనైల్ హౌమ్ని ఇంటిలా మార్చి...
జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది. కానీ పట్టించుకునేవారే లేరు. చైల్డ్ ప్రొటెక్షన్ను ఒక మెకానిజం ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనెల్ వెల్ఫేర్ బోర్డు, డిసీపీ, డీపీఓ... వీళ్లంతా ఒక్కో దగ్గరా ఉండి, రకరకాల విధులు నిర్వహి స్తుండేవారు. పది జిల్లాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ భవన్స్ ఏర్పాటు చేశారామె. పిల్లలు ఎక్కడ దొరికినా సీడబ్ల్యూ సీ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఆ పిల్లలను వాళ్లు ఎక్కడపెట్టమంటే ఆ హౌమ్లో పెట్టాలి. అప్పటిదాకా పిల్లలను ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడ ఉంచుతున్నారు? రికార్డులు కూడా లేకుండే. అన్నీ స్ట్రీమ్లైన్చేశారు. నేరం నిరూపితమై శిక్ష పడిన పిల్లలకు హౌవమ్ను... జైౖలులా కాకుండా ఇంటి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేశారు. మనిషిని బంధిస్తే పారిపోవాలనిపిస్తది. ఇంటివాతావరణం ఏర్పాటు చేసిన తరువాత పారిపోవడం కూడా తగ్గింది. మంచి ఆహారం అందేలా చూశారు. హౌమ్లోనే చదువు, హౌమ్లోనే డాక్టర్, అందులోనే ఆటలు. పిల్లలకు బయటి ప్రపంచమే తెలియదు. మొట్టమొదటిసారి ఆ పిల్లలను బయటికి తీసుకొచ్చారు. నలుగురైదుగురు వర్కర్స్, హౌమ్ సూపరింటెండెంట్ కలిసి వాళ్లను ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. అనుమతి ఇవ్వ డానికి ఆమె చూపిన చొరవ, వెంట ఉండి తీసుకెళ్లి తీసుకొచ్చిన సూపం టెండెంట్ ధైర్యం అంతా ఇంతా కాదు. పిల్లల్లో సృజనాత్మక పెరిగేలా వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి... రవీంద్రభారతిలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల్లో పరివర్తన కోసం ఆశాహాస్పిటల్స్ సౌజన్యంతో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడే డీ అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. పిల్లలనుంచి చెడు వ్యసనాలను దూరం చేస్తున్నారు.
యాక్సెసబుల్ ఎలక్షన్స్కోసం...
డిజేబుల్డ్ వేల్ఫేర్ డైరెక్టర్, కమిషనర్గా వచ్చాక.. ఎన్నో రకాల సంస్కరణలు చేవారు. ఒకప్పుడు డిజేబులిటీ కేవలం ఏడు రకాలుండేది. ఇప్పుడు 21 రకాలు. వాళ్లకున్న హక్కులను, రిజర్వేషన్ సరిగ్గా అమలయ్యేలా చూస్తున్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల నుంచి... సబ్సిడీని 80శాతం చేయడం వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. డిజేబుల్డ్ పర్సన్స్ని వివాహం చేసుకున్నవారికి ప్రోత్సాహకాన్ని లక్ష రూపాయలు పెంచారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు తిరిగి మరీ... ఫండ్స్ తీసుకొచ్చి పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్లకు ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను ఏర్పాటు వంటివన్నీ సమర్ధవంతంగా అమలు చేశారు. అందుకుగాను 'బెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిజేబుల్డ్ యాక్టివిటిస్-2018'లో అవార్డు అందుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆమె పాత్ర కీలకమైనది. యాక్సెసబుల్ ఎలక్షన్స్ నిర్వహించాలని నెలన్నర ముందు చెప్పి.. ఆమెను డిప్యూటీ సీఈఓగా చేశారు. నెలన్నరలోనే గైడ్లైన్స్ రూపొందించి, కమిటీ వేసి.. ర్యాంపుల ఏర్పాటు, వీల్ఛైర్స్, బ్రెయిలీలిపిలో బ్రోచర్స్, ఎపిక్ కార్డులు డిజైన్ చేశారు. ఏది అమలు చేయాలన్నా.. అవగాహన ముఖ్యం. అందుకోసం సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. అప్పటికి రెండు లక్షల మంది మాత్రమే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఓటర్లు ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి క్యాంపులు కండక్ట్ చేసి... నాలుగు లక్షల డెబ్బయి ఐదు వేలకు ఓటర్లను పెంచారు. 'యాక్సెసబుల్ ఎలక్షన్స్కి బెస్ట్ ఆఫీసర్'గా అవార్డు అందుకున్నారు. కష్టపడ్డవాడికే కష్టం విలువ తెలుస్తుందంటారు. కానీ ఎలాంటి కష్టాలు పడకపోయినా.. ఇతరుల కష్టాన్ని చూసి కదిలిపోయే మనసున్న ఆఫీసర్ ఆమె. అందుకే డిపార్ట్మెంట్ ఏదైనా తనదైన ముద్ర వేశారు.
మమేకమయ్యాను...
''నాన్న ఘట్టయ్య, అమ్మ ప్రేమలత. నాన్న వ్యాపారం చేసేవారు. అమ్మ గృహిణీ. నాన్నకి చదువుకోవడం బాగా ఇష్టం. మమ్మల్ని చదివిస్తూనే ఇతర స్కూల్స్లో పిల్లలకు బుక్స్, నోట్బుక్స్, బ్యాగులు, స్టేషనరీ అంతా పంచేవారు. అమ్మానాన్న ఇష్టం మేరకే మేం బాగా చదివాం. చెల్లి డాక్టర్. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా.. ఎప్పడూ ఉద్యోగంలాగా చేయలేదు. గుంటూరులో మొదటి పోస్టింగ్ వచ్చినప్పుడు నేను ఇంకా విద్యార్థినే. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన డిజేబుల్డ్ వాళ్లను చూస్తే ఏడుపొచ్చేది. అక్కడ సైకిళ్లుంటాయి. నాకు ఇవ్వాలని ఉంటది. కానీ సర్టిఫికెట్ ఉండదు. తిరిగి వెళ్లడానికి వాళ్ల దగ్గర డబ్బులు కూడా ఉండేవి కావు. అది చూసి ఏడ్చేసేదాన్ని. నాకు అప్పటిదాకా ప్రపంచమే తెలియదు. బాధలు, కష్టాలు అసలే తెలియదు. మొట్టమొదటిసారిగా బాధనిపించింది. అందుకే అదొక్కటే కాదు... తరువాత ఏ విభాగంలో ఉంటే అందులో మమేకమై పనిచేశాను''
ఆంక్షలు పెట్టలేదు...
''మహిళగా నేను ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. కానీ... మహిళల పట్ల వివక్ష కచ్చితంగా ఉంటుంది. పోస్టింగ్స్లో వివక్ష. గౌరవం ఇవ్వరు. కీలకమైన పనులను మెన్కు అప్పగిస్తారు. అంతగా ప్రాధాన్యత లేని అంశాలను మహిళలకు కేటాయిస్తారు. మహిళలు కూడా బాగా పని చేస్తారని ఎంత చెప్పినా వాళ్ల మెదళ్లలోకి ఎక్కదు. వీటన్నింటిని ఎదుర్కోవాలంటే అధ్యయనమే. చదువే మనకు అన్నీ ఇస్తుంది. ఎలా బతకాలో నేర్పిస్తుంది. ఎన్నో రకాల హింసలనుంచి బయటపడొచ్చు. మహిళలకు సంపాదన కచ్చితంగా ఉండాలి. అది ఇచ్చే బలమే వేరు. పట్టణాల్లో మహిళలు చైతన్య వంతులవుతున్నారు. గ్రామీణ మహిళలకు ఇంకా అవగాహన రావాలి. వాళ్లు బయటికొస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విషయంలో అమ్మ నాకు స్ఫూర్తి. తను గృహిణే అయినా... ఎంతో బలవంతురాలు. అమ్మానాన్నలది ఆ కాలంలోనే కులాంతర ఆదర్శ వివాహం. కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లు.. ఎక్కడికో వెళ్లి పోయి బతుకుతారు. కానీ ఆమె అదే ఊళ్లో నిలబడ్డారు. బతికి చూపించారు. మా అమ్మ, అమ్మమ్మ బాగా చదువు కున్నారు. అన్ని రకాల సాహిత్యం చదివారు. అమ్మ ఇప్పటికీ చదవుతుంటంది. అమ్మకు చాలా పెద్ద లైబ్రరీ ఉంది. అమ్మ మా విషయంలో ఎప్పుడూ వివక్ష చూపలేదు. 'అమ్మాయిలు... ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇక్కడికి వెళ్లొదు ్ద అక్కడికి వెళ్లొద్దు... అనలేదు. వీళ్లతో ఆడుకోవద్దు.. వాళ్లతో ఆడుకోవద్దు' వంటి ఆంక్షలేవీ పెట్టలేదు. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మానాన్నల పెంపకమే! మా వారు రామకృష్ణ ఐటీలో పనిచేస్తున్నారు. యూఎస్ సిటిజెన్. అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగం చేశారు. పెండ్లి తరువాత ఇక్కడ కూడా కంపెనీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాత్రం ఇక్కడే స్థిరపడ్డారు. తను వర్క్హాలిక్. నా విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోరు. నేను మంచి పనులు చేసినప్పుడు మాత్రం వెన్ను తడతారు. ఇద్దరు పిల్లలు. హ్యాపీ ఫ్యామిలీ''