Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ ఆ పంట, ఫలాలు అందించకుండానే ఎండిపోతోంది. వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు, తగవులు వస్తుంటాయి. అవన్నీ తామరాకుపై నీటి బొట్టు చందంగా ఉంటే సంసారంలో ఆనందం ఉంటుంది. కానీ ఇవాళ రేపు వైవాహిక బంధంలో ఆనందం కంటే బాధే ఎక్కువ ఉంటోందని యువతీ యువకులు గట్టిగా నమ్ముతున్నారని ఓ సర్వేలో తేలింది. అందుకు కారణం 'అర్థం చేసుకోరు' అనే సమాధానం ఇరువైపుల నుండి వస్తోందట.
- ఎవరు ఎవరిని మొదట అర్థం చేసుకోవాలి, ఎవరు ఎవరి మాట వినాలి... ఇలా ఎన్నో ప్రశ్నలు వివాహ బంధాన్ని శాసిస్తున్నాయి. సర్దుకుపోవటం అంటే ఓడిపోవటంగా తీసుకుంటున్నారు . దాంతో ఆ పదమే భార్య భర్తల సంబంధంలో వినిపించటం లేదు.
- సమస్య సష్టించుకోవటం ఎందుకు? ఆ తర్వాత దాని పరిష్కారానికి ప్రయత్నించటం ఎందుకు? ఇద్దరు ఒకటిగా మారేందుకు సిద్ధపడినప్పుడే ఆ బంధం కోసం, దానితో ముడిపడే వారి జీవితం కోసం ఒకసారి ఆలోచిస్తే మంచిది. మనకు చాలా ముఖ్యం అనిపించే దేన్నయినా కాపాడుకోవటానికి చాలా ప్రయత్నిస్తాం కదా. అంటే మనం ముఖ్యం అనుకున్నామా లేదా అన్నదే ఇక్కడ మన ఆలోచనలని రూల్ చేస్తోంది. అందుకే బంధం కలకాలం నిలవాలంటే ఆ బంధం జీవితంలో ముఖ్యమైనది అని మొదట నమ్మాలి.
- సమవుజ్జీల మధ్య గెలుపోటములు వుండవంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కలసి ఒకటిగా నడిచే జీవితంలో కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గెలిచినా, ఓడినా అది ఇద్దరిదీ. ఈ విషయం ఒక్కటి అర్థం అయితే పట్టుదలలు వుండవు, ఆరోపణలు వుండవు. నా మాటే నెగ్గాలనే తాపత్రయాలు వుండవు.
- పక్క మనిషి ఓటమిలోంచి వచ్చే కన్నీటిని చూస్తూ నాదే విజయం అని ఆనందించటానికి ఇది ఆట కాదు, జీవితం. మనిషిని గెలిచి, మనసుని ఓడిపోవటం తెలివితక్కువతనం. మనసులని గాయపరుచుకుంటూ, ఇద్దరు మనుషులు నూరేళ్ళు ఒక గూటిలో కలసి వుండటం అంటే అది ఇద్దరూ, ఇద్దరికీ కోరి వేసుకుంటున్న శిక్ష. ఇక్కడ శిక్ష వేసిన వ్యక్తీ కూడా శిక్ష అనుభవిస్తారు, అదే విచిత్రం. అందుకే పచ్చగా పదికాలాలు నిల బడాలంటే ఆ బంధం కోసం కొంచెం ఆలోచించాలి, మరికొంచెం తెలుసుకోవాలి. ఇంకొంచెం శ్రద్ద పెట్టాలి.