Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాఫ్వేర్ ఉద్యోగం.. ఐదంకెల జీతం.. ఏసీలో ఉండటం, కార్లలో తిరగడం, ఖరీదైన ఫోన్లలో చాటింగ్ .. ఇవే నేటి యువత కోరుకునే జీవితం. చుట్టూ వాతావరణం గురించి ఆలోచించే తీరిక లేదు. సోషల్మీడియాలో సెలబ్రెటీలు పెట్టే ఛాలెంజ్లకు మాత్రం స్పందిస్తారు. నెక్ట్స్ డేే మరిచిపోతారు. వార్తల్లో 'అస్సాంలో వరదలు' చూసి అయ్యో అంటారు. మరుక్షణం ఛానల్ మార్చి
కామెడీషోల్లో బిజీ అవుతారు. ప్రస్తుత యువతరం స్మార్ట్ దారిలో ఫాస్ట్గా నడుస్తుంటే 'ప్రాణ' ఆర్గనైజేషన్ ఫౌండర్, డైరెక్టర్ పరకాల ప్రత్యూష మాత్రం అంటార్కిటిక్ మంచుఖండాల్లో మార్పులను అధ్యయనం చేసివచ్చారు. సాఫ్ట్వేర్ నుంచి క్లైమెట్ అడ్వైజర్గా పర్యావరణాన్ని రక్షించే దిశగా ముందుగు సాగుతున్నారు. నేటి లగ్జరీల గురించి కాకుండా రేపటి నీడ్స్ కోసం ఆరాటపడుతున్న ఆమె పరిచయం..
నాన్న పరకాల రమేష్బాబు, బిహెచ్ఇఎల్లో అకౌంట్స్ సెక్షన్లో పనిచేశారు. అమ్మ అనురాధ. ప్రైవేట్కాలేజీ లెక్చరర్. అక్క, నేను. ఇద్దరినీ ఉన్నత చదువులు చదివిం చారు. అక్క డబుల్ మాస్టర్స్ చేసి, అమెరికాలో ఉంది. ఇంటర్ వరకు హైదరాబాద్లోనే చదివి వేలూరు విఐటిలో బి.టెక్ చేశాను. ఆ తర్వాత ఎం.ఎస్, ఎం.టెక్, ఇగ్నో నుంచి ఎం.ఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశాను. బి.టెక్ చదువుతున్నప్పుడే చాలా కంపెనీల్లో ఆఫర్స్ వచ్చాయి. పిజీ చేయాలన్న ఆలోచనతో జాబ్ గురించి ఆలోచించలేదు.
టీచింగ్ వైపు...
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి జీతం వస్తుంది. కానీ, మనుషులతో కాకుండా యంత్రాలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అది నాకు ఇష్టం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఐదంకెల జీతం తీసుకోవడం కన్నా రేపటి ప్రపంచానికి వారసులైన చిన్నారులకు పాఠాలు చెప్పడమే ముఖ్యమనిపించింది. దాంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కాదని టీచింగ్ వైపు వెళ్ళాను. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్మెంట్ సైన్స్లో భాగంగా 'సస్టెనబులిటీ ఇన్ సిటీస్' అంశంపై శిక్షణ తీసుకున్నాను. 'టీచ్ ఫర్ ఇండియా'లో చేరి పూనెలోని ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ పాఠాలు చెప్పడం ప్రారంభించాను. టీచ్ ఫర్ ఇండియా ద్వారా ఎంతో మంది ప్రముఖుల ఉపన్యాసాలు వినే అవకాశం కలిగేది. అలా 2013లో అంటార్కిటిక్ వెళ్లాలన్న తపన కలిగింది. ఇందుకు కారణం 1980లో ఉత్తర, దక్షిణ ధృవాలను కాలినడక ద్వారా చేరుకున్న రాబర్ట్ స్వాన్ ప్రసంగం వినడం. ఆయన ఈ రెండు ధృవాలను కాలి నడకన చేరుకున్న మొదటివ్యక్తి. అంటార్కిటిక్ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలు విన్నతర్వాత పర్వావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో తెలిసింది. అంటార్కిటిక్ వెళ్లాలన్న తపనకు అప్పుడే అంకురార్పణ జరిగింది.
సమాజంలో మార్పు దిశగా..
టీచర్గా 40మంది చిన్నారుల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ప్రయత్నం చేశాను. ఎంతో మంచి రిజల్ట్ కనిపించింది. టీచర్గా ఒక స్కూలుకే పరిమితం కాకుండా విస్తృతస్థాయిలో సమాజసేవ చేయాలంటే సివిల్స్ రాయడం మంచిదనిపించింది. రెండు సార్లు ప్రయత్నించి మెయిన్స్ వరకు వెళ్లగలిగాను. ఆశించిన ఫలితం రాలేదు. ఎంతో చేయాలన్న తపన మాత్రం మనసులో బలంగా ఉండిపోయింది.
రేడియో జాకీగా..
ఎక్కువ మందిని ప్రభావితం చేయాలంటే ప్రసారసాధనాల ద్వారానే సాధ్యం. ప్రతిఒక్కరికీ చేరే రేడియోలో జాకీగా చేరాను. రేడియో మిర్చిలో రెండున్నర ఏండ్లు పనిచేశాను. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నా ప్రోగ్రామ్ వచ్చేది. రేడియో అంటే పాటలు, సెలబ్రెటీల విషయాలు, సినిమా కబుర్లు కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయాలనిపించింది. మనలోనే కొందరు ఛేంజ్ మేకర్స్ ఉంటారు. వారిని గమనించి, గుర్తించి వారితో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించాను. అలా దాదాపు వందమందిని నా ప్రోగ్రామ్ ద్వారా పరిచయం చేశాను. వారిలో ప్రభుత్వాధికారులు, కళాకారులు, రచయితలు ఎందరో ఉన్నారు. ప్రతిరోజూ ఛాలెంజింగ్గా ఉండేది. రెండున్నర ఏండ్లు చేసిన తర్వాత పర్యావరణ పరిరక్షణకే ఎక్కువ టైం కేటాయించాలనిపించింది. దాంతో రేడియో జాకీ నుంచి క్లైమెట్ సలహాదారుగా మారాను.'ప్రాణ' ఆర్గనైజేషన్ ప్రారంభించాను. స్కూలు పిల్లల నుంచి ఆర్మీ అధికారుల వరకు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నాను. వివిధ గవర్నమెంట్, కార్పోరేట్, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సెమినార్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం.
అంటార్కిటిక్ దిశగా ..
మానవ సంచారం కూడా అసాధ్యమైన మంచు ఖండంమైన అంటార్కిటిక్ భూగోళం పై ఉన్న అన్నీ ప్రాంతాల వాతావరణాన్ని శాసించగలదు. ఇక్కడ వాతావరణంలో వేడి ఒక డిగ్రీ పెరిగితే సముద్రమట్టాలు పెరిగి పోతాయి. పర్యావరణం లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల కారణంగా అంటార్కిటిక్ ఉనికికే ప్రమాదం వాటిల్లుతోంది. మంచు ఎడారిలో ఉండే జీవజాలం అతి అరుదైనది. అక్కడ సముద్రంలో పెరిగే జీవుల్లో వేల్స్ అతి ముఖ్యమైనవి. వీటి నుంచి వచ్చే ఆయిల్కు ప్రపంచమార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో కొన్నిదేశాలు అక్కడ ఆయిల్ టాంకర్స్ను ఏర్పాటుచేసి వేల్స్ను చంపేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల వ్యర్థాలను ఇక్కడ వదిలేస్తున్నాయి. ఇలాంటి కారణాలతో అంటార్కిటిక్ వాతావరణంలో వచ్చే మార్పులు భూగోళంపై గందరగోళం సృష్టించే ప్రమాదం ఏర్పడింది. దాంతో అంటార్కిటిక్ పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ జరిగే మార్పులను, వాటి కారణంగా వచ్చే ఉపద్రవాలను భూమిపై నివసించే ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. అయితే అందరికీ అక్కడకు వెళ్లడం సాధ్యం కాదు. ప్రతి ఏటా వివిధ దేశాల నుంచి యాభై నుంచి వందమంది పర్వావరణ శాస్త్రవేత్తలు, పరిరక్షకులు అంటార్కిటిక్ వెళ్ళి అక్కడి వాస్తవ పరిస్థితులను గమనించి, వారివారి దేశాల్లో పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. అలా అంటార్కిటిక్ వెళ్లాలనుకునేవారికి వివిధ దశల్లో పరీక్షలు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుని కొందరు మాత్రమే మంచు ఖండాల దరికి చేరగలుగు తారు. అలా 2018లో నేను అంటార్కిటిక్ వెళ్ళే అవకాశం అందుకున్నాను. రాష్ట్రప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో నెలరోజుల పాటు అంటార్కిటిక్ యాత్రలో పాల్గొన్నాను. అక్కడ గమనించిన ఆనేక అంశాలను, మంచుఖండాలను కాపాడుకోవల్సిన అవశ్యకతను ప్రతి వేదికపై వివరిస్తున్నాను. పర్యవరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
చిన్నచిన్న మార్పులతో..
ఎండాకాలం పోయి వానాకాలం వచ్చి రెండు నెలలవుతున్నా ఇంకా వర్షాలు లేవు. విపరీత మైన ఎండలతో ప్రతిఒకరూ ఇబ్బంది పడ్డారు. భూగర్భనీటి మట్టం నానాటికీ తగ్గిపోతున్నది. వీటన్నింటినీ ఎవరు కారణం? మనమే. సహజవనరులను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాం. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కారణంగా భూమిలో, సముద్రంలో వ్యర్థాలు ఎక్కువగా చేరుతున్నాయి. 'మనం ఏం చేయగలుగుతాం? ప్రభుత్వాలు ఏమైనా చేయాలి' అని ప్రతి ఒక్కరం అనుకుంటాం. మార్పు మన నుంచే ప్రారంభం కావాలి. అప్పుడు ప్రభుత్వాలు దిగివస్తాయి. చిన్నచిన్న మార్పులు చాలు పర్యావరణాన్ని కాపాడేందుకు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాడవద్దు. బట్టతో కుట్టిన సంచీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
- ఆఫీస్లో టీ, కాఫీలు తాగేవాళ్లు యూజ్ అండ్ త్రో కప్పులు కాకుండా స్టీల్, గ్లాస్ కప్పులను ఉపయోగించాలి.
- ఇంట్లో కూరగాయలు, బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోయాలి. ప్రతిఇంట్లో మొక్కలు కనీసం ఇండోర్ ప్లాంట్స్ అయినా పెంచుకోవాలి.
- కొద్దిదూరానికి వాహనాలపై కాకుండా నడిచేవెళ్ళాలి.
- పేపర్ వాడకం తగ్గించాలి.
- ఇలాంటి చిన్నచిన్న మార్పులు ప్రతిఒక్కరూ చేయదగినవే. చేసి చూడండి.. మార్పు మీరే గమనిస్తారు.