Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాఘవకు ఏమీ తోచడం లేదు. ఇంటికి వెళ్లాలంటేనే భయ పడుతున్నాడు. గడప లోపల కాలు పెట్టగానే ఎవరు ముందుగా ఎదురు వస్తే వారు మరొకరిపై చెప్పే మాటలు వినడానికే ఇబ్బంది పడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లి, జన్మంతా తోడుండే భార్య ఇద్దరూ తనకు సమానమే. అలా కాదని ఒక్కరే కావాలని అనడం మూర్ఖత్వం. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి తనను పెంచిన తల్లిని ముసలితనంలో చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉంది. అలా అని భార్యను నిర్లక్ష్యం చేయలేదు. తన జీవితంలో ఆమెకు ఎంతో ముఖ్యస్థానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. సమస్యలు కేవలం ఆడవారికే అని ఎవరైనా అంటే మండిపడతాడు రాఘవ. కుటుంబ సలహా కేంద్రం కేవలం ఆడవారికే కాదు మగవారి సమస్యలను కూడా పరిష్కరిస్తుందన్న నమ్మకంతో ఐద్వా అదాలత్కు వచ్చాడు. రాఘమ సమస్య ఏంటీ, ఎలా పరిష్కరించాకున్నాడో తెలుసుకుందాం..
రంగమ్మ రోజువారీ కూలీగా పనిచేసేది. ప్రైవేటు ఉద్యోగం చేసే భర్త రంగయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మూడేండ్ల వయసున్న రాఘవను తీసుకుని పట్టణం వచ్చింది. ఇండ్లల్లో పనిచేస్తూ కొడుకును చదివించింది. డిగ్రీ వరకు చదువుకున్న రాఘవ కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాడు. చిన్న ఇల్లు కట్టుకున్నారు. తల్లితో రాఘవ సంతోషంగా ఉన్నాడు. కొడుకు ప్రయోజకుడు కావడంతో రంగమ్మ సంతోషించింది. పెండ్లి చేస్తే తన బాధ్యత తీరుతుంది అనుకుంది.
కూతురైనా, కోడలైనా..
రాఘవకు పెండ్లి సంబంధం తెలిసిన వారి ద్వారా వచ్చింది. ఆమె కూడా ఇంటర్ వరకు చదవడం, నలుగురు పిల్లల మధ్య పెరగడంతో కష్టసుఖాలు తెలిసిన పిల్ల అని రాధతో రాఘవ పెండ్లికి ఒప్పుకుంది రంగమ్మ. కట్నం ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. రాధ తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన డబ్బుతో ప్లాట్ కొని రాధ పేరుపైనే రిజిస్ట్రర్ చేయించింది. తాను కష్టపడి చేయించిన పదితులాల బంగారం కోడలికి పెట్టింది. కూతురైనా, కోడలైనా రాధే అనుకుంది. పెండ్లి అయిన తర్వాత ఏడాది వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత రాధ, రంగమ్మ మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి.
వంటింట్లో మొదలై..
రాధకు అక్క, అన్న, తమ్ముడు ఉన్నారు. పుట్టింట్లో పనులన్నీ నేర్చుకుంది. అయితే వంట మాత్రం సరిగ్గా వచ్చేది కాదు. రంగమ్మకు రోజూ రాత్రి జొన్నరొట్టె తినడం అలవాటు. రాధకు నేర్పించే ప్రయత్నం చేసింది.
వంట చేయడం అంటే రాధకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నేర్చుకోకపోతే ఎలా అంటూ రంగమ్మ మందలిచ్చేది. దాంతో రాధ అలిగి పుట్టింటికి వెళ్లిపోయేది. వాళ్ల అమ్మనాన్న నచ్చచెప్పి పంపిస్తే రెండు రోజుల తర్వాత వచ్చేది. ఇలా ఐదారుసార్లు జరిగిన తర్వాత రంగమ్మ ఒక రోజు రాధ వాళ్ళ అమ్మనాన్నను కూడా గట్టిగా మందలించింది. దాంతో రాధకు, రంగమ్మకు మాటామాటా పెరిగింది. 'నీవున్నంత వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను' అంటూ వెళ్లిపోయింది. పెద్దవాళ్లలో పంచాయితీ పెట్టించి నచ్చచెప్పి కాపురానికి పంపించారు. రంగమ్మనే కాస్త తగ్గింది. ఓపిక ఉన్నప్పుడు వంట చేసేది లేకపోతే కోడలు చేసిందే తినేది.
బాధ్యతలు పంచుకునేలా..
రాధ, రంగమ్మ మధ్య రోజూ చిన్నచిన్న గొడవలు సహజంగా మారాయి. రాఘవ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తల్లి లేదా భార్య ఎవరో ఒకరు మరొకరిపై చెప్పడం దినచర్యలో భాగమైంది. బాధ్యతలు తెలిసిన తల్లి, బాధ్యతలు పంచుకోవల్సిన భార్య చీటికిమాటికి గొడవలు పడటంతో విసిగిపోయిన రాఘవ ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. రాత్రి తొమ్మిందింటీకి వచ్చినా ఇద్దరి మధ్య తగవులు తీర్చడం మాత్రం తప్పలేదు. ఇద్దరికీ సమాధానం చెప్పలేక విసిగిపోయాడు. ఇలాంటి సమయంలో అతనికి కనిపించిన ఆశాకిరణం ఐద్వా అదాలత్.
ప్రేమ ద్వేషంగా మారితే..
రాఘవ సమస్య అంతా విన్న తర్వాత అతని తల్లి భార్య రాధను పిలిపించారు. ముందుగా రంగమ్మతో విడిగా మాట్లాడారు. 'మేడమ్! నా కొడుకు మూడేండ్లు ఉన్నప్పుడే వాడి తండ్రి చనిపోయాడు. ప్రాణంగా పెంచాను. పాచిపని చేసి మరీ వాడిని చదివించాను. వాడి కన్నా నాకు ఎక్కువ ఏమీ లేదు. వాడి పిల్లలతో ఆడుకుంటూ మిగిలిన జీవితం గడిపేయాలని ఉంది. కోడలైనా, బిడ్డ అయినా రాధే అనుకున్నాను. అనుభవంతో మంచి మాట చెప్పితే కోపం వస్తుంది. ఉండేది ముగ్గురం మనుషులమే కదా! రోజూ ఎంత వండాలో తెలియదా? తినే తిండిని వృధా చేస్తే నాకు కోపం వస్తుంది. నేను చెప్పేది వాళ్లకోసమే కదా! నేను ఏం చెప్పినా వినిపించుకోదు. ఏదైనా పని చూసుకుంటాను అంటే రాఘవ కోపడుతున్నాడు. నన్ను వృద్ధాశ్రమంలో వేయమని అంటున్నాను. కానీ, వాడు ఒప్పుకోవడం లేదు' నేను ఏం చేయాలో చెప్పండి. నా కొడుకు సంతోషంగా ఉండడానికి ఎంత కష్టమైనా భరిస్తాను' అంది రంగమ్మ.
అన్నింటిల్లో జోక్యం..
రంగమ్మ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత రాఘవ భార్యను పిలిచి ఆమె సమస్య చెప్పమన్నారు బాధ్యులు.
'మేడమ్! మా అత్త అన్నింటిల్లో జోక్యం చేసుకుంటుంది. మా ఆయనతో బయటకు వెళ్ళాలన్నా ఆమె పర్మిషన్ కావాలి. ఏరోజు ఏం వండాలో ఆమె డిసైడ్ చేస్తుంది. కష్టపడి ఆయనను పెంచినందుకు ఆమె ఏం అన్నా నేను భరించాలా? నా కంటూ స్వేచ్ఛ లేదా! ఆయనను నమ్ముకునే కదా నేను వచ్చాను' అంటూ కన్నీళ్ళూ పెట్టుకుంది.
తెంచుకుంటూ పోతే..!
'రాధ. మీ ముగ్గురి మాటలు విన్నాం. ఒకరిపై ఒకరికి కోపం కన్నా నా మాటే నెగ్గాలన్న పంతం ఎక్కువగా ఉంది. మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక పోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నువ్వు చదువుకున్నావు. ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ అమ్మవాళ్ళింట్లో వాతావరణం గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మనాన్న, అన్నవదిన కలిసే కదా ఉంటున్నారు. వారిద్దరూ కలిసే ఇంటి పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికీ మీ ఇంట్లో మీ అమ్మ పెత్తనమే కదా నడుస్తుంది. మీ నాన్న, అన్నయ్య జీతం తీసుకువచ్చి మీ అమ్మకే కదా ఇస్తారు. మరీ మీ వదిన కూడా అత్త పెత్తనం ఎక్కువైంది అంటూ ఏ రోజైనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా? కుటుంబం అంటే కేవలం భార్యాభర్త మాత్రమే కాదు. నీకు అన్న, అక్క, తమ్ముడు ఉన్నారని, కష్టం సుఖం తెలుసనే అనుకున్నారు. నీ భర్తకు నువ్వు ఒక్కదానికే కాదు తల్లి కూడా కావాలి. రేపు నువ్వైనా అంతే. ఈ రోజు కోడకులే రేపటి అత్త అన్న విషయం మరిచిపోవద్దు. ఈ రోజు మీ అత్త నచ్చలేదు. రేపు నీ భర్త నచ్చడు. ఇలా బంధాలను తెంచుకుంటూ పోతే చివరకు మిగలేది ఒంటరి తనమే. నీది చిన్నవయసు అర్థం చేసుకో. మీ అమ్మను అత్తలో చూసుకో. ఆమె ఏదైనా చెబితే విను. ఎందుకంటే ఆమె జీవితం ఎన్నో కష్టాలను చూసింది. మీరు అలా కావద్దనే ఆమె తపన అంతా. మీరిద్దరూ కలిసి ఉంటే రాఘవ కూడా సంతోషంగా ఉంటాడు. రేపు మీకు పిల్లలు పుడితే పెద్దదిక్కు ఎవరున్నారు? కుటుంబం అంటే భార్యభర్తలే కాదు. పిల్లలు , పెద్దలూ అందరు అని అర్థం చేసుకో. నీ కుటుంబ ఆనందం నీ చేతుల్లో ఉంది. మీ అత్త కూడా ఇకమీద ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని మేం చెబుతాం' అన్నారు బాధ్యులు. సరే అంది రాధ. మీ మధ్య గొడవలు తగ్గేవరకు రెండువారాలకు ఒకసారి ఇక్కడికి రండి. ఏమైనా సమస్యలు వస్తే మీలో మీరు గొడవ పడకుండా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పండి' అన్నారు. బాధ్యుల మాటలకు సరే అంటూ రాఘవ, రాధ రిజిస్టర్లో సంతకాలు చేసి రంగమ్మతో కలిసి ఇంటిదారి పట్టారు.