Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను శైలజ'సినిమాలో అమాయకపు అమ్మాయిలా అలరించింది. 'నేను లోకల్'సినిమాతో కొద్దిగా సాధికారతను సాధించింది. 'మహానటి'లో నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అందుకే ఆమెను 'జాతీయ ఉత్తమ నటి' అవార్డు వరించింది. ఈ జనరేషన్ హీరోయిన్ల ఒరవడిలో పడి కొట్టుకుపోలేదు. అలాగని రెగ్యులర్ రోల్స్ను పోగొట్టుకోలేదు. రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటున్న కీర్తి శిఖరం.. కీర్తి సురేష్. 66వ జాతీయ చలనచిత్ర ఉత్తమనటి అవార్డు దక్కించుకున్నది. ఈ అవార్డుతో 'అమ్మ కల నెరవేరింది' అంటున్న కీర్తి సురేష్ గురించి...
కీర్తి తల్లి మేనక సురేష్. మలయాళంలో ప్రముఖ నటి. తండ్రి సురేష్కుమార్ మలయాళ సినీ నిర్మాత. మలయాళీగానే అందరికి పరిచయమైనా కీర్తి సురేష్ పుట్టి పెరిగింది చెన్నైలో. ఆమె ఐదో తరగతివరకు అక్కడే చదువుకుంది. తండ్రి మలయాళ ఇండిస్టీలో ఉండటంతో సెలవులప్పుడు మాత్రమే కేరళ వెళ్లేది. తండ్రి నిర్మిస్తున్న సినిమా షూటింగ్లు జరుగుతుంటే చూసేది. ఓసారి అలా వెళ్లినప్పుడే అనుకోకుండా బాలనటిగా సినీరంగ ప్రవేశం జరిగింది. ఆడుతూపాడుతూ మూడు సినిమాలు చేసింది. అది కూడా తండ్రి నిర్మించిన సినిమాల్లోనే. చిత్ర నిర్మాణ సమయంలో హీరోయిన్లకు ఇస్తున్న ప్రాధాన్యం... వాళ్ల దర్జా, టీవీ సినిమాలు ఇదంతా చూసినవాళ్లెవరికైనా నటి కావాలన్న ఇష్టం ఏర్పడిపోతుంది. అలా ఆమెకూ బాల్యంలో హీరోయిన్ కావాలన్న ఇష్టం ఉండేది. కానీ కొంచెం పెద్దయ్యాక... చదువువైపు దృష్టి సారించింది. కీర్తికి, వాళ్లక్కకు సృజనాత్మకంగా, కళాత్మకంగా బతకడం వాళ్లకు ఇష్టం. డ్రాయింగ్ బాగా వేసేది కీర్తి. అందుకే అర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఇలా ఏదో ఒకటి చేయాలనుకున్నది. ముందు ఆర్కిటెక్చర్ అనుకున్నా... తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ను ఎంచుకుంది. అలా నటన కంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగింది. చెన్నైలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది.
ఫైనల్ ఇయర్లో ఉండగానే...
దర్శకులు ప్రియదర్శన్ , కీర్తి సురేష్ తండ్రి, మోహన్లాల్ అంతా కలిసి చదువుకున్నారు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. ప్రియదర్శన్ మొదటి సినిమాకు కీర్తి సురేష్ తండ్రే నిర్మాత. అందులో మోహన్లాల్ నటించారు. అంతలా ఉండేది వాళ్ల అనుబంధం. అందుకే ప్రియదర్శన్ మొదట సినిమా అవకాశం కీర్తికి ఇవ్వాలనుకున్నారు. లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతుండగా ప్రియదర్శన్ ఆమెకు ఫోన్ చేశారు. 'వెనక్కి వచ్చేరు... షూటింగ్ స్టార్ట్ చేద్దాం' అని. ఆయన నమ్మకాన్ని చూసి కీర్తి మొదట ఆశ్చర్య పోయింది. తరువాత తన మీద తనకు విశ్వాసం పెరిగింది. అయినా మొదట చదువు పూర్తి చేయాలి వద్దని చెప్పింది. 'నటించడం ఇష్టం లేదనుకుంటారేమో' అని తరువాత అంగీకరించింది. హీరోయిన్గా మొదటి సినిమా 2013లో 'గీతాంజలి' (మలయాళం). ఆ తరువాత రింగ్ మాస్టర్లో చేసింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే రెండు సినిమాలు పూర్తయ్యాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. ఆ తరువాత తమిళ సినిమాల్లో అవకాశం వచ్చింది. తరువాత తెలుగు. ఇలా ఒకదాని తరువాత మరోటి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 'అది నా అదృష్టం. నా బాధ్యత పెరిగింది. నా శక్తి మేరకు నటించాను. నటిస్తున్నాను' అని వినమ్రంగా చెబుతుంది.
లక్ష్యాలేం లేవంటూనే...
ఐదో తరగతిలో ఉండగానే కేరళ వెళ్లిపోవడం, ప్లస్ టూ వరకు అక్కడే చదవడంతో తమిళ్ మాట్లాడటం తగ్గింది. అప్పుడు వాళ్లమ్మ తమిళ్ నేర్చుకోమని అక్కాచెల్లెళ్లిద్దరికీ చెప్పేది. ఎందుకింత బలవంతపెడుతోంది అమ్మ అని అప్పుడు తిట్టుకున్నారిద్దరూ. సినిమాల్లోకి వచ్చాకగానీ కీర్తికి అర్థం కాలేదు.. వాళ్లమ్మ మాటల్లోని అంతరార్థం. ఇప్పుడు తమిళ్, మలయాళం, ఆంగ్లం అనర్ఘళంగా మాట్లాడగలగదు కీర్తి. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. మహానటిలో తనే డబ్బింగ్ చెప్పింది. ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం ఆమెకు కలిసొచ్చింది. సెట్స్లో చాలా సార్లు డిజైనర్ అందుబాటులో లేకపోతే.. ఎలా చేయాలని టైలర్కి తనే చెబుతుంది. చదువు ఇలా ఉపయోగపడటం సంతోషాన్నిస్తుంది కదా అని ఆనందంతో చెబుతుంది. అయితే మహానటిలో ఆమె అలాంటి ప్రయోగాలు చేయలేదు. కేవలం నటనమీదే దృష్టి సారించింది. 'ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని నాకేమీ లేదు. ఎలాంటి రోల్ వచ్చినా దానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. క్వీన్లో కంగనా పాత్రలాంటివి ఇష్టం. అయితే అలాంటివే చేయాలి, ఈ డైరెక్టర్తోనే చేయాలి వంటి లక్ష్యాలేం పెట్టుకోలేదు. కాకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే బాగుంటుంది' అని చెబుతుంది.
దుస్తులు, నగలంటే ఇష్టం...
సినిమాల్లో నటించడం కాకుండా కీర్తి అంటే... అక్కతో కలిసి సినిమాలు చూస్తుంది. అందులోనూ ఫాస్ట్ పేస్డ్, థ్రిల్లర్స్ ఎక్కువగా చూస్తుంది. పాతవి ఈస్ట్మన్ కలర్ డ్రామాస్ ఇష్టపడుతుంది. అందులో వాళ్లు ధరించిన దుస్తులు, నగలు అన్ని చూస్తూ అబ్బురపోతుంది. అంత ఇష్టం కాబట్టేనేమో మహానటిలో అన్ని రకాల కాస్ట్యూమ్స్ ధరించే అవకాశం వచ్చింది. దాదాపు 140 రకాల కాస్ట్యూమ్స్ ధరించింది. అనేక రకాల ఆభరణాలను వేసుకుంది. వాటికే కొత్త అందాన్ని తెచ్చింది. సినిమాలు లేనప్పుడు ఆమెను అమితంగా ఇష్టపడే, ప్రేమించే మనుషులు చుట్టూ ఉండాలని కోరుకుంటుంది. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తనకోసం కొంత సమయం కేటాయించుకోవడం కూడా ఆమెకు ఇష్టమైన వ్యాపకం. భరతనాట్యంతోపాటు జాప్, వెస్ట్రన్, సినిమాటిక్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నది. 'బి పంక్చువల్... బి డిసిప్లెన్.. అందరినీ గౌరవించాలి' అనే సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తుంది.
అద్భుత నటనకు అవార్డు...
తల్లిదండ్రులిద్దరూ సినిమా రంగానికే చెందినవారయినా... నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఆమెంతో తపన పడింది. తొందర్లోనే తన సత్తా ఏంటో నిరూపించుకుంది. 'మహానటి' సినిమా గురించి కీర్తికి మొదట చెప్పింది నాని. 'నా దాక వస్తే ఆలోచిస్తా' అని బదులిచ్చిందామె. అనుకున్నట్టుగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వచ్చి అడిగాడు. 'ఈ అమ్మాయి సావిత్రి పాత్రకు న్యాయం చేయగలదా?'అని చాలామంది అనుకున్నట్టే... 'నేను చేయలేనేమో' అని ఆమె కూడా సందేహించింది. కానీ తరువాత ఒప్పుకుంది. కానీ 'ఎలా చేస్తాను? ఎలా చేయాలి?' ఎన్నో ప్రశ్నలు. నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆమె చేయగలదని నమ్మారు. ఆమెలో ఆ విశ్వాసాన్ని నింపారు. ఈ సినిమాకోసం కీర్తి పది నెలలుపాటు వర్క్ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు మరో ఐదు సినిమాలు చేసింది. దాంతో కొన్ని నెలలపాటు రాత్రింబవళ్లు శ్రమించింది. నిద్రలేని రాత్రులు గడిపింది. అయినా మహానటిలో సంతోషకరమైన సీన్స్ చేసినప్పుడు... ఆ సంతోషాన్ని వెంట తీసుకెళ్లింది. బాధ, డిప్రెషన్తో ఉన్న వాటిని చేసినప్పుడు రోజంతా అలాగే ఫీలయ్యింది. అంతగా సావిత్రి పాత్రలో వందశాతం జీవించింది. వెడితెరపై మరో సావిత్రిని తలపించింది. ఆకాశమంత కీర్తిని సంపాదించుకుంది.'మహానటి' సినిమాలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు వరించింది. తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు కీర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
బదాయీహౌ డైరెక్టర్తో బాలీవుడ్ ఎంట్రీ...
ప్రస్తుతం బోనీకపూర్ నిర్మిస్తున్న, బదాయిహౌ డైరెక్టర్ అమిత్శర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు అజరుదేవ్గన్తో కలిసి నటిస్తున్నది. తెలుగెలో రెండు మహిళా ఓరియెంటెడ్ సినిమాలను చేస్తున్నది. అలాగే తమిళ్లోనూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్సినిమాకోసం సంతకం చేసింది.
అమ్మకు అంకితం
మలయాళంలో మా అమ్మ నటించిన తొలి సినిమా(ఒప్పోల్)కే జాతీయ పురస్కారం రావాల్సింది. ఆ మూవీలో తన పాత్రను ఎంతగానో ప్రేమించేది. ఆ చిత్రానికి అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. తనకు కూడా అవార్డు వస్తుందని అమ్మ భావించింది. కానీ చివరి క్షణాల్లో మార్పుల వలన అది జరగలేదు. దాని గురించి నాతో చాలా సార్లు చెప్పింది. అమ్మ కలను నెరవేర్చాలని అనుకున్నా. ఊరికే... 'చూడు ఏదో ఒక రోజు... జాతీయ అవార్డును గెలుచుకుంటా' అని అమ్మతో చెప్పేదాన్ని. మహానటిలో సావిత్రి పాత్ర చేసే సమయంలో నేను ఏదీ ఆశించలేదు. దిగ్గజ నటి సావిత్రిలా నటించడాన్ని సవాలుగా తీసుకున్నా. ఆమెలాగే హావభావాలను పలికించేందుకు ఎంతో శ్రమించా. జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంటానని ఊహించలేదు. అవార్డు ప్రకటించగానే పట్టరాని సంతోషం కలిగింది. సినిమాకు మూడు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. నేను ఇంకా నమ్మలేకుండా ఉన్నాను. కల నిజమైంది. ఈ అవార్డు అమ్మకు అంకితం.