Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం, సామాజిక సేవ ఆమెకు రెండు కండ్లు. అనాథలు, అంధులు, వయోవృద్ధులు ఇలా మరొకరి అవసరం ఉన్నవారందరికీ ఆమె చేయూతనిస్తారు. 53సార్లు రక్తదానం చేసి మహిళలు కూడా రక్తదానం చేయవచ్చు అన్న అవగాహన కల్పించారు. మాటతో కాదు చేతలతో సేవారంగంలో అవగాహన కల్పిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఆమె ముందుంటారు. తొలి అడుగు మనదైతే మలి అడుగులో తోడుండే వారు ఎంతో మంది ఉంటారన్నది ఆమె అభిమతం. ఆమే ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు
డాక్టర్ గురజాడ శోభా పేరిందేవి. దాదాపు ఐదు దశాబ్దాలుగా సామాజిక, సాహిత్య రంగాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుతున్నారు. అనేక కార్యక్రమాల ద్వారా మలి దశలో ఉన్నవారికి జీవితం పై ఆసక్తి కల్పిస్తున్న ఆమె పరిచయం..
మా నాన్నగారు గురజాడ భుజంగరావు, నేషనల్ సేవింగ్స్లో రీజినల్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన జీవించిలేకున్నా ఆయన నేర్పించిన విలువలు మా జీవితాన్ని నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. ప్రముఖ సంఘసంస్కర్త, కవి గురజాడ అప్పారావు గారు మాకు బంధువులే. అమ్మ గురజాడ వెంకటలక్ష్మి, గృహిణి అయ్యినప్పటికీ సామాజిక సేవ చేయాలన్న స్ఫూర్తిని మాలో నింపారు. మా వారు సి. యస్. పాణి, చార్టర్డ్ అకౌంటెంట్. సాహిత్య, సామాజిక సేవల్లో నాకు కొండంత అండ ఆయన. మా అబ్బాయిలిద్దరూ కూడా ఎంతో సహకారం అందిస్తారు.
అమ్మే ఆదర్శం..
మాడపాటి హనుమంతరావు స్కూలులో చదువుకున్నాను. నేను స్కూలులో చదువుతున్నప్పుడే చందమామ, బాలమిత్రలకు కథలు రాసేదాన్ని. పారితోషికం కూడా వచ్చేది. ఆ డబ్బుతో స్నేహితులందరికీ చాక్లెట్లు కొనాలను కున్నాను. కానీ, అమ్మ మాత్రం ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు పండ్లు తీసుకురా అంది. మాది ఉమ్మడి కుటుంబం ఇంట్లో నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ తాతయ్య ఇలా పెద్దవాళ్ళు ఉండేవారు. నాకు వచ్చిన పారితోషికంతో వాళ్లకు ఒకసారి పండ్లు మరొసారి బట్టలు తీసుకువచ్చేలా అమ్మ నన్ను ప్రోత్సహించారు. మనకు జన్మనిచ్చి, విద్యాబుద్ధులు చెప్పించిన పెద్దవారిని గౌరవించాలని చిన్నతనం నుంచే నేర్పించారు. ఇప్పుడు వయోవృద్ధుల కోసం పని చేయడంలో అమ్మ చెప్పిన మాటలే నాకు ఆదర్శం.
రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పెండ్లి తర్వాత ఎం.ఏ., (తెలుగు, సోషియాలజీ), జర్నలిజంలో పి.జి. డిప్లోమా చేశాను. వృద్ధాప్య సమస్యలపై పిహెచ్.డి పూర్తి చేశాను.
సాహిత్య రంగంలో..
స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే రచయిత్రిగా సాహిత్యరంగానికి పరిచయం అయ్యాను. ఇప్పటి వరకు వందలాది కథలు, కవితలు, పాటలు, నాటికలు, వ్యాసాలు, వ్యక్తిత్వ వికాసం రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అంతేకాకుండా ''మెమరీ బ్యాంక్'' అనే గ్రంథాన్ని, యునిసెఫ్ ఇండియా 'పాత్ ఫైండర్ ఇంటర్నేషనల్ వారి ''కమ్యూనిటీ ఔట్ రీచ్ ట్రెయినింగ్ గైడ్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాను. ఇప్పటివరకు 11 గ్రంథాలు ముద్రితమయ్యాయి. వాటిలో స్వీట్ 60 (అరవై కథల సంపుటి) , స్వాతంత్య్ర సమరయోధుడు కానా, 60 లో 20 , కొత్త దంపతులతో కొన్ని క్షణాలు , ఆమె ఓటమిని ఓడించింది , విధిని ఎదిరిస్తున్న వీధిబాలలు , ధిక్కార నానీలు (కవి త్వం), వైకల్యాన్ని అధిగమిద్దాం(కథల సంపుటి), సామాన్యులలో మాన్యులు , అమావాస్య చంద్రిక, తెలుగు కథ - వ ద్ధుల సమస్యలు (పిహెచ్.డి., సిద్ధాంత గ్రంథం), వ ద్ధాప్యం వరమా? శాపమా? (పరిశోధనాత్మక వ్యాసాలు) ముఖ్యమైనవి. స్వీట్ 60 పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి బీనాదేవి గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాను.
కేవలం రచయిత్రిగానే కాకుండా కాలమిస్ట్గా, సబ్ ఎడిటర్గా పనిచేశాను. 'ఫోటో క్రానికల్ మ్యాగజైన్ కి సబ్-ఎడిటర్ గా, 'వికలాంగుల పిలుపు' చైతన్య మాసపత్రిక అసోసియేట్ ఎడిటర్, . 'ఆంధ్ర బాలానందం' వజ్య్రోత్సవ సంచికకి, బీహార్ తెలుగు అసోసియేషన్ వారి 'తెలుగు తరంగిణి' అనే పత్రికకి ఎడిటర్గా 'నింగి నేల' (తెలుగు) మాసపత్రిక (సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ ) సబ్ ఎడిటర్గా పనిచేశాను. దాదాపు రెండు దశాబ్దాల పాటు పత్రికారంగంలో పని చేశాను.
చేయూత కావల్సిన వారికి..
నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక కథకు పారితోషికంగా ఐదు వందల రూపాయలు వచ్చాయి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. మా చుట్టాలంతా కలుస్తున్నారు అని తెలిసి మేం అక్కడకు వెళ్ళాం. మా పెద్దనాన్న వృద్ధుల సమస్యల గురించి వివరిస్తూ వారి సంక్షేమం కోసం కొంతమొత్తం సేకరించి ఒక ఆశ్రమం కడదాం అన్నాడు. వెంటనే నా వద్ద ఉన్న ఐదు వందల రూపాయలు ఇచ్చాను. అయిన వారి ఆదరణ కరువైన పెద్దవారి వద్దకు నన్ను తీసుకువెళ్ళేవారు మా పెద్దనాన్న. వారి సమస్యలు వింటుంటే చాలా బాధ అనిపించేది. మన మూలాలను నిర్లక్ష్యం చేస్తున్నాం అన్న వేదనలో నుంచి ఎన్నో కథలు రాశాను. అయినవారే కాదు సమాజం కూడా పట్టించుకోని పండుటాకుల గురించి ఎంతైనా చేయాలనిపించేది. నేను పిహెచ్డి చేయడానికి కూడా స్ఫూర్తి వారే. ఇప్పుడు 80ఏండ్ల్లు దాటిన వృద్ధ మహిళలను దత్తత తీసుకున్నాను. జీవన చరమాంకంలో ఉన్నవారికి చేయూత నిస్తూ.. వారిలో ఉత్సాహం నింపేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నాం. అంధులను ఫీజులు కట్టి విద్యావంతులను చేయడంతో పాటు వందలాది మంది అంధులకు సహాయంగా పరీక్షలు రాస్తాను. వికలాంగుల కోసం ప్రత్యేకంగా వెబ్ సైటు ప్రారంభించి విద్య, వైద్య, ఉద్యోగ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అప్నాగర్ వీధి బాలల సంస్థ, నగర కేంద్ర గ్రంథాలయం, శారదా మహిళామండలి, అభినందన, ఆంధ్ర బాలానందం, సత్యసాయి బాలవికాస్, సత్యసాయి మహిళా విభాగం, శాంతి ఓల్డేజ్ హౌమ్లో సభ్యురాలిగా ఉంటూ సమాజానికి సేవలందిస్తున్నాను. ' గైడింగ్ లైట్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్' ఆర్గనైజేషన్ కి జనరల్ సెక్రటరీగా , సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నాను.
రక్త, అవయవ దానాలపై..
రక్తదానం అనగానే మగవారు, బలవంతులు మాత్రమే చేయాలన్న అపోహ మనలో ఉంది. దీనిపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ముందుగా నేనే రక్త దానం ఇవ్వడం ప్రారంభించాను. ఒక ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నంలో 16ఏండ్ల వయసులోనే నాకు 18ఏండ్లు అని అబద్దం చెప్పి రక్తదానం చేశాను. ఇప్పటికీ 53సార్లు రక్తదానం చేశాను. ఇప్పుడు మా అబ్బాయి నా బాధ్యత తీసుకున్నాడు. ఎవరికీ రక్తం అవసరమైనా తన స్నేహితులతో కలిసి వెళ్ళి రక్తదానం చేస్తున్నాడు.
నూతనోత్సహం నింపేలా..
మనకు తెలియకుండా గడిచిపోయే బాల్యం, చదువుతో సాగే కౌమారం, కెరీర్ ప్రధానంగా యవ్వనం, బాధ్యతలతో మధ్యవయసు. వాటిని దాటి వృద్ధాప్యంలోకి వచ్చేనాటికి అయినవారి నుంచి చీదరింపులు, సమాజం నుంచి ఔట్ డేటెడ్ అన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. వాటిని తట్టుకుని అరవై తర్వాత జీవితాన్ని ఆనందమయం చేసుకునేలా వృద్ధుల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. అందుకే వృద్ధాశ్రమాలకి వెళ్ళి నటన, గానం, వన్ మినిట్ గేమ్స్ లాంటివి ఆడడంలో వయోధికులకి శిక్షణ ఇస్తూ, వారిలో నూతనోత్సాహాలు నింపేందుకు కృషి చేస్తున్నాను. వయోధికులకు సమాజం చేయూత నివ్వాలన్న కోణంలో వివిధపత్రికలలో వ్యాసాలు రాస్తున్నాను.
గ్రామాల్లో..
పట్టణాల్లో వృద్ధుల సమస్యల కన్నా గ్రామాల్లో వృద్ధుల సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధ రైతుల సమస్యల సాధన కోసం పని చేయబోతున్నాం. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం జీవిత చరమాంకంలో ఉన్న వయోధికుల గురించి కూడా శ్రద్ధ తీసు కునేలా ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు ఇచ్చాం. గ్రామాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో ఒక ఆశ్రమాన్ని వృద్ధమహిళలు, అనాధ ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. పెద్దవారి పట్ల పిల్లలకు బాధ్యత పెంచేలా, పిల్లలకు పెద్దవారు అండగా ఉండేలా చూస్తాం.
అవార్డులు, పురస్కారాలు
- జర్నలిజంలో.. డాక్టర్ శివారెడ్డి బంగారు పతకం, కె. రవీంద్రన్ నాయర్ బంగారు పతకం, 'కులపతి అవార్డు, తురగా క ష్ణమోహన్ రావు క్యాష్ అవార్డు, బెస్ట్ ఆఫ్ కమింగ్ జర్నలిస్ట్ అవార్డు, ''బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు''
- సాహిత్యంలో.. 'మహిళా మెరిట్ అవార్డు', ''సాహితీ నవరత్న' అవార్డు - ('స్వీట్ 60' కథల సంపుటి గాను విశ్వసాహితీ సంస్థ నుంచి), 'ఆమె ఓటమిని ఓడించింది' వనితల వ్యక్తిత్వ వికాస రచనకు గాను ఆంధ్ర సారస్వత సమితి 'ఉత్తమ వనితల వ్యక్తిత్వ వికాస పుస్తకం' పురస్కారం....
-'లేఖిని' మహిళా రచయితల సంస్థ నుండి 'మాతృ దేవోభవ' పురస్కారం...
సామాజిక సేవారంగంలో.. 'డి. ఆర్.ఎస్ ఇంటర్నేషనల్ వారి నుండి 'ఇందిరాగాంధీ అవార్డు'
- 'జెఎం.సి కమ్యూనికేషన్స్' సంస్థ వారి 'దశాబ్ద మహిళ అవార్డు'
- 'సంఘమిత్ర' వికలాంగుల సంస్థ నుండి 'సంఘమిత్ర అవార్డ్',
- 'యువకళావాహిని' సంస్థ నుండి బాదం సరోజినీ దేవి స్మారక పురస్కారం.
- కేరళలో జరిగిన అంతర్ రాష్ట్రీయ వృద్ధుల సమ్మేళనం నాటికల పోటీలో నేను రచించి, వృద్ధుల చేత నటింపజేసిన 'ఓల్ ఈజ్ గోల్డ్ నాటికకు 'ఉత్తమ నాటిక' పురస్కారం లభించింది.