Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళితులు చదువుకోవడం నేటికీ కష్టమైన చోట... శతాబ్దాల కిందటే వాళ్ల కుటుంబం చదువుకున్నది. కానీ ఉన్నత చదువుల్లో, ఉద్యోగాలో కేవలం రెండుశాతంగా ఉన్నప్పుడు.. కులాన్ని దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తరువాతి తరాలను అది వెంటాడింది. దాన్ని తప్పించుకోవడానికి ఆమె విదేశాలకు వెళ్లింది. రోహిత్ వేముల ఆత్మహత్య కదిలించింది. ఇన్నాళ్లు దాచుకున్నది చాలు .. ఇకపై వద్దు అని ఆమె 'కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్' పుస్తకంగా బయటికి వచ్చింది. ఆ దాచుకోవడం వెనుక ఉన్న అభద్రత, భయాన్ని, దళితులపై కొనసాగుతున్న వివక్షను, దళితుల్లోనూ మహిళలపై కొనసాగుతున్న అణచివేతను అక్షరీకరించింది. ఆమె.. యాషిక దత్. న్యూయార్క్లో పనిచేస్తున్న జర్నలిస్టు.
కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం చదవడం కోసం 2015లో న్యూయార్క్కు వెళ్లింది యాషిక... అక్కడ ఆమెకు వేడుకలా అనిపించింది. తనలాగే ఉన్న బ్లాక్స్, హిస్పానిక్, గే ఫ్రెండ్స్... చాలా విషయాలపై బహిరంగంగా మాట్లాడుకునేవాళ్లు. వివక్షకు గురైన తమ కథలను మిగిలిన స్నేహితులతో పంచుకునేవారు. ఇదంతా ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. కారణం... ఇండియాలో చదువు తుండగా ఆమె తన కులాన్ని దాచిపెట్టింది. కానీ ఇక్కడలా కాదు. తమ గురించి చెప్పినప్పుడు మిగిలినవాళ్లు దాన్ని సావధానంగా ఆలో చించడం, వాళ్ల కోపాన్ని సైతం.. సహానుభూతితో అర్థం చేసుకో వడం చూసింది. సరిగ్గా రెండు నెలల తరువాత... యాషిక తను కులం వల్ల ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నది. తరువాత ఆమె పంచుకున్న విషయాలపై వాళ్లు స్పందించిన తీరు.. ఆమెను సిగ్గుపడేలా చేయలేదు. తన ఆవేశం అంతా పోయినట్టనిపించింది. అంతే.. అప్పటినుంచి దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, వెనుకబాటు తనాన్ని మరింతగా తెలుసుకునేందుకు... సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమకారులతో పరిచయాలు ఏర్పరుచుకున్నది. ఆ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రోహిత్ వేముల ఎదుర్కొంటున్న వేధింపుల గురించి కూడా తెలుసుకున్నది. ఆ సమయంలో రోహిత్ వేముల ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపాడు. పది రోజుల తరువాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే.. రోహిత్ వేముల ఆత్మహత్య వార్త ఫేస్బుక్నిండా ఉంది.
స్టేట్మెంట్ నుంచి పుస్తకంగా...
భారతదేశంలో యూనివర్సిటీల్లో జరిగేవన్నీ ఆత్మ హత్యలు కాదు వ్యవస్థీకృత హత్యలు. అందులో చాలా బయటికి రానేరావు. కానీ రోహత్ వేములది అలా కాదు. మొత్తం దేశాన్ని కుదిపేసింది. అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో రోహిత్ వేముల అప్పటిదాకా యూనివర్సిటీలో చేసిన పోరాటం అంతా తెలుసుకున్నది. చివరకు ప్రాణం తీసుకున్న తీరు ఆమెను కలిచి వేసింది. ఇద్దరూ వేల మైళ్ల దూరాన ఉన్నా.. ఇద్దరినీ కలిపింది దళిత ఐడెంటిటీ. కులాన్ని సగర్వంగా చాటుకున్నాడు రోహిత్. తాను మాత్రం కులాన్ని భారతీయ స్నేహితుల దగ్గర, సహౌద్యోగుల దగ్గర దాచి పెట్టింది. ఇకనుంచి అలా చేయకూడదని న్యూయార్క్లో ఉండగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాను దళితురాలిగా సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చింది. అప్పుడామె పెట్టిన నోట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. సరిగ్గా ఏడాది తరువాత ఆ స్టేట్మెంట్కు పూర్తి వివరణగా 'కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్' పుస్తకాన్ని తీసుకొచ్చింది. అందులో తన ఇన్నేళ్ల జీవితాన్ని పంచుకున్నది.
ఇంటిపేరు మార్చుకుని...
యాషిక రాజస్థాన్లోని అజ్మేర్లో భంగి కులంలో పుట్టింది. అక్కడ భంగి కులస్తులు.. సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే వాళ్ల తాతలు దాని నుంచి తప్పించుకున్నారు. కాలేజీకి వెళ్లారు. సివిల్స్ చదివారు. తరువాత ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేశారు. 2001 వరకు ఆమె తండ్రి కూడా ప్రభుత్వోద్యోగంలోనే ఉన్నాడు. వేల ఏండ్లుగా దళితులు చదవడానికి, రాయడానికి దూరంగా ఉన్నారు. అలాంటి ఉన్నతోద్యోగాలు కేవలం ఏ రెండు శాతమో ఉంటాయి. కానీ అక్కడా పెద్ద సమస్య.. కులం. చదువు పెరిగింది. ఉన్నతోద్యోగాల్లో ఉన్నారు. కానీ... కులం స్టేటస్ పెరగలేదు. అగ్రకుల సహ విద్యార్థులు, సహౌద్యోగుల మధ్య... ఇమడలేరు. తమ కులాన్ని బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం. అప్పటికే ఉన్నతోద్యోగాల్లో ఉన్న యాషిక కుటుంబం... దానికి పరిష్కారంగా తమను తాము అగ్రకులంగానే చెప్పుకున్నది. తమకులం తెలియకుండా ఉండటానికి పడరాని పాట్లు పడింది. అమెరికాలో బ్లాక్.. వైట్గా చెప్పుకోవడానికి ఎన్ని సమస్యలో అన్ని సమస్యలు. నల్లజాతీయులైన బంధువులు ఒక్కరున్నా.. నీవు ఎలా కనబడుతున్నావనే దానితో సంబంధం ఉండదు. నిన్ను నల్లజాతీయుడిగానే ముద్రవేస్తారు. తెల్లగా, యురోపియన్ ఫీచర్స్తో ఉంటే తప్ప అక్కడ పాస్ కారు. అట్లా యాషిక కుటుంబం కూడా పాస్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఎందుకంటే ఇండియాలో చర్మం రంగుకు చాలా ప్రాధాన్యత కాబట్టి. మధ్య తరగతి చెంది, సంపన్న వర్గాల అభిరుచులు కలిగి ఉండి, బట్టలు, వాడే వస్తవులు, ప్రత్యేకించి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉంటే అగ్రవర్ణం అయిపోవచ్చు. కానీ కులంతో పాటు వచ్చే ఇంటి పేరు ఒకటి ఉంటుంది. దాన్ని వదిలించడం కష్టమవుతుంది. కానీ.. ఇక్కడ యాషిక వాళ్ల తాతలు వదిలించుకున్నారు. భంగీల ఇంటి పేరయిన 'నిదనియా' వదిలేసి... దాని స్థానంలో దత్ చేర్చారు. చాలా రాష్ట్రాల్లో అగ్రకులాలకు చెందిన ఇంటి పేరది.
బ్రాహ్మణ యువతిగా కనిపించాలని..
బాల్యంలో యాషిక తల్లి తమ కులం దాచడం కోసం తాను ఉత్తరప్రదేశ్ చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దాన్నని, భర్త మాత్రం రాజస్థాన్ దళిత్ అని చెబుతుండేది. తనను తాను బ్రాహ్మణ మహిళగా చూపించుకోవడం కోసం... ఎంతో కష్టపడాల్సి వచ్చిందామె. సంప్రదా యాలు, పూజలు తెలుసుకున్నది. నేర్చుకున్నది. నిజమైన బ్రాహ్మణులకంటే ఎక్కువ బ్రాహ్మిణ్గా కనబడటం కోసం ఓ ఆవును కొని... అత్తగారింట్లో గ్యారేజ్లో కట్టేసేది. యాషికను కూడా ఇంగ్లీష్ మీడియం బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. అక్కడెవరైనా అడిగినా... బ్రాహ్మిణ్ అని చెప్పాలని ముందే వివరించింది. ప్రారంభంలో కొద్దిమందికి అలాగే చెప్పినా.. తరువాత యాషిక బ్రాహ్మణ అమ్మాయినే కనిపించడంతో ఆ ప్రశ్నే ఎదురు కాలేదు. ఇంగ్లీష్లో మాస్టర్స్తో మంచి చదువు, అగ్రకులాల చెందిన అమ్మాయిలతో సులభంగా కలిసిపోవడం, వాళ్ల అభిరుచులు, మ్యానరిజం... అన్నీ అలవరుచుకుంది. ఢిల్లీలో సంపన్న వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే సెంట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకుంది. ఆ కాలేజీకీ ఉన్న పేరు వల్లే... ఆమెకు ఫ్యాషన్ జర్నలిస్టుగా అవకాశం దొరికింది. కొంతమందికి సందేహం వచ్చినా... అయినా ఓ దళిత యువతికి అందులో చదివే అవకాశం ఉండదులే అని నివృతి చేసుకున్నారు.
న్కూయార్క్లో మేలుకొలుపు...
న్యూయార్క్కు వెళ్లేదాక యాషిక తన కులం గురించి ఎక్కడా చెప్పలేదు. ఇండియాలో ఉన్నప్పుడు సైతం ఎప్పుడూ... రిపోర్టర్గా పొలిటికల్ బీట్స్ చూడలేదు. ఎందుకంటే... రాజకీయాల గురించి రాస్తున్నప్పుడు... ఏదైనా అభిప్రాయం చెప్పాల్సి వస్తే తన కులం ఎక్కడ బయటపడుతుందేమోనని భయం. అప్పటికే ఐఐఎమ్సీ, ఏసీజే లాంటి చోట్ల, ఇతర కాలేజీల్లోనూ కుల వివక్షను గురించి ఆమె విన్నది. అందుకే యాషికకు ఎప్పుడూ మనసులో భయం వెంటాడుతూ ఉండేది. ఎప్పుడైనా పట్టుబడతానేమో, స్నేహితులను పోగొట్టుకుంటానేమో, ఇప్పటిదాకా వచ్చిన గౌరవం పోతుందేమో. చివరకు బైలైన్స్ కూడా ఇవ్వరేమో. ఇండియాలోనే జర్నలిజంలో కొనసాగితే... ఏదో ఒక స్థాయిలో అంటే.. ప్రమోషన్ల కోసమైనా కచ్చితంగా కులాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకు ఉదాహరణ.. 2008లో ఓ అమెరికన్ రిపోర్టర్ ఓ దళిత జర్నలిస్టు అభిప్రాయం కోసం అన్ని ఆంగ్ల పత్రికలనూ వెదికాడు. కానీ ఒక్కరంటే ఒక్కరు దొరకలేదు. ఇవన్నీ ఒకటయితే.. చివరకు పెండ్లి చేయాల్సి వచ్చినప్పుడైనా కులం ముందుకొస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే యాషిక ఇండియాను వదిలిపెట్టింది. న్యూయార్క్లో జర్నలిజంలో ఉన్నత చదువులు చదువుతూనే ఉద్యోగం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో విషయాలు పుస్తకంలో పంచుకుంది. కుల వ్యవస్థ పుట్టుక, వలసవాదంలో కులం ఎలా ఉంది? దళితుల కోసం అంబేద్కర్ చేసిన కృషి, రిజర్వేషన్, దళిత మహిళలపైన అణచివేత, కులం-చర్మం రంగు, ఉన్నత విద్యలో కుల వివక్ష, మాన్యువల్ స్కావెంజింగ్, కులం- సినిమా, కులం-క్రికెట్, ముందే చెప్పుకున్నట్టు కులం-మీడియా... ఇలా ఎన్నో విషయాలమీద వివరంగా చర్చించింది.
తల్లి పోరాటం గురించి...
దళిత్గా బయటికి వస్తూ... తన ఉనికిని పరిశోధించింది. ఒక జర్నలిస్టుగా తన గురించి మాత్రమే రాయడం సరికాదని...ఎన్నో పరిశోధనలు చేసింది. ఎంతో డేటాను సేకరించి రాసింది. వాటన్నింటిని రాసింది. అంతేకాదు... కేవలం కులం గురించేకాదు.. తన కులంలోనూ ఉండే పురుషాధిపత్యాన్ని ప్రశ్నించి రాసింది. ఇంట్లోనే తల్లి ఎదుర్కొన్న హింసను పేర్కొన్నది. ''పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన, బ్రూణహత్యల్లో ముందున్న, ఆడపిల్లల రేషియోలో అతి తక్కువ స్థానంలో ఉన్న రాజస్థాన్లో ఆడపిల్లలుగా పుట్టినందుకు... మమ్మల్ని పెంచడానికి ఎంతోకష్టపడింది. మా సమానత్వం కోసం ఆమె ఎంతో పోరాడింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి మమ్మల్ని చదివించింది. నేను ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి ఎంతో స్వేచ్ఛచ్చింది. ఇప్పుడో పుస్తకం రాయగలిగానంటే అది పూర్తిగా ఆమె పెంపకం వల్లనే. నెవర్గివప్ అన్న తన పట్టుదల, పోరాటం చూసి గర్వపడతాను. దళితుల జీవితాల గురించి రాస్తూ... మహిళగా అమ్మ ఎదుర్కొన్న హింసను దాచిపెడితే నేను తప్పు చేసిన దాన్నవుతాను. అందుకే అమ్మ గురించి కూడా రాశాను'' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది యాషిక.