Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలంలో పిల్లలంతా చాలా స్పీడ్గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆట పాటల్లోనూ చాలా ఫాస్టుగా ఉంటున్నారు. అదే స్థాయిలో అల్లరి కూడా ఉంటుంది. అలాంటి సమయాల్లో పిల్లల్ని నియంత్రించలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటుంటారు. దీంతో కోపంతో పిల్లలపై అరవటం, దండించడం వంటివి చేస్తుంటారు. అయితే పిల్లల్ని దారిలో పెట్టేందుకు ఇది సరియైన పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు.
- ఒకప్పుడు ప్రతీ ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ అవుతోంది. ఫలితంగా పిల్లల్లో మొండిపట్టు, మంకుపట్టు ఎక్కువవుతోంది. ఇటువంటి పిల్లలతో వ్యవహరించటం తలకు మించిన పని అవుతుంది. అందుకే వీరితో పట్టువిడుపుతో మెలుగుతుండాలి.
-ఇంట్లోని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం వంటివి ఇంట్లోనే అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్దవారిని చూసి పిల్లలు బాగా నేర్చుకొంటారు. అందుచేత పిల్లలకు ఈ విషయాల్ని విడమరిచి చెప్పాలి. ఒకవేళ ఇటువంటి విషయాల్లో సక్రమంగా లేకపోతే నెమ్మదిగా నేర్పించాల్సి ఉంటుంది. అంతే తప్ప కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు.
- పిల్లలు ఎప్పుడూ పిల్లలతోనే ఆడుకోవాలని కోరుకుంటారు. తోటి పిల్లలతో అనుకరించటం లేదా తోటి పిల్లలకు నేర్పించటం అంటే బాగా ఇష్టపడతారు. సరిగ్గా ఈ టెక్నిక్ నే పెద్దలు కూడా అనుసరించాలని చెబుతున్నారు. అంటే పిల్లలతో బాస్ మాదిరిగా మాట్లాడటానికి బదులు తోటి పిల్లల మాదిరిగా అనునయించి చెప్పటం మేలని నిపుణులు అంటున్నారు. ఒక పని వద్దని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం కన్నా నిదానంగా అందులోని మంచి చెడ్డల్ని విడమరిచి చెప్పటం మేలని అంటున్నారు.
- అలాగే పిల్లల్ని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు. ఒక్కరూ తనలో తానే మథనపడే అవకాశం ఇవ్వకూడదు. నలుగురిలోనూ కలిసిపోనివ్వాలి. చుట్టుపక్కల వారితో కలవకపోవటం, స్కూల్లో తోటి ఫ్రెండ్సుకి దూరంగా ఉండటం మంచి అలవాట్లు కాదని తెలియచెప్పాలి. ఇతరులతో కలిసిపోయేందుకు పిల్లలను ప్రోత్సహించాలి.
- కొంత మంది పిల్లలు గారాబం ఎక్కువ అయినప్పుడు ఎవరినైనా ధిక్కరించే లక్షణంతో ఉంటారు. ఇటువంటి వారికి క్రమంగా తామే అధికులం అన్న భావన కలుగుతుంది. ఇటువంటి వారు చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేని వారుగా మారతారు. ఇటువంటి పోకడల్ని మొదట్లోనే గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.
- పిల్లలు తమ స్నేహితుల మీద అభిమానం చూపుతారు. వీలుంటే పిల్లల స్నేహితుల్ని ఇంటికి పిలవటం మంచిది. అప్పుడప్పుడు పిలిపించి ఇంట్లోనే ఆడుకొనే వెసులుబాటు కల్పించాలి. దీంతో పిల్లలు పొంగిపోతారు. స్నేహితుల ఎదుట పిల్లల్ని చికాకు పడటం, కోప్పడటం, పోల్చి తిట్టడం మాత్రం మంచి పద్ధతికాదు.
- ఇటీవల కాలంలో పిల్లలకు కోప తాపాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలు ఎదిగే కొద్దీ ఇటువంటి పోకడలు అధికం అవుతున్నాయి. పిల్లలు చికాకుగా ఉంటే మనం మండిపోవటం మంచిది కాదు. చీటికి మాటికీ కోపం తెచ్చుకోవటం ఎంత చెడో విడమరిచి చెప్పాలి. పిల్లల కోపానికి కారణం ఏమిటో గుర్తించాలి. అటువంటి సందర్భం ఎందుకు ఏర్పడిందో వివరంగా చెప్పటం మేలు. అటువంటప్పుడు కోపం తెచ్చుకోకుండా వ్యవహరించాలని సూచించాలి. పెంకితనంతో ఉన్నప్పుడు మొండిగా వ్యవహిరిస్తుంటారు. అటువంటప్పుడు కోపం తెచ్చుకొంటే మరింత మొండిగా మారిపోతుంటారు.
- పిల్లల్లో టీవీ, ఇంటర్ నెట్చూసే వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీని వలన బద్దకం పెరిగిపోతుంది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించటానికి, పనులు చేయించుకోవటానికి టీవీని అలవాటు చేస్తుంటారు. ఇది సరికాదు. తర్వాత కాలంలో ఈ అలవాటు కొంప ముంచుతుంది.
- పిల్లలతో ప్రశాంతంగా, నిదానంగా ఉండటం మంచిదే కానీ, అవసరమైనప్పుడు కఠిన వైఖరి అవలంబించాలి. వద్దన్న పని చేస్తామని పదే పదే మొండికేస్తుంటారు. కొన్ని సార్లు చెప్పిన మాట వినకుండా పెంకిగాఉంటారు. అటువంటప్పుడు సంయమనంతో చెబుతూనే ఉండాలి. అదే సమయంలో పిల్లల మనస్సు మరలించి రాంగ్ స్టెప్ పడకుండా చూడాలి.అవసరమైతే ఇటువంటి సమయంలో కఠినంగా కూడా వ్యవహరించాలి.
- పిల్లలకు కావలసిన వస్తువులు తెచ్చి పెట్టి ఇవ్వటం మంచిదే. షాపింగ్ కు తీసుకువెళితే ఎన్నయినా కొని పెట్టవచ్చు. కానీ, దీనికి పరిమితి ఉండాలి. ఏది కనిపించినా కావల్సిందే అని కొందరు పిల్లలు మొండికేస్తారు. ఇటువంటి అలవాటును ప్రోత్సహించటం మంచిది కాదు.