Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొడి బారిన జుట్టుకు ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు చివర్లు చిట్లకుండా చేయడమే కాకుండా పెళుసుబారడాన్ని తగ్గించి కుదుళ్లకు, మాడుకు తేమను అందిస్తుంది. ఆముదంలో కొబ్బరి నూనె కలిపి మాడుకి మర్దనా చేసి ఒక గంట ఉంచుకోవాలి. తలస్నానం చేసే ముందు వేడి నీళ్లలో ముంచిన తుండుని జుట్టుకి చుట్టాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లలోకి నూనె బాగా ఇంకుతుంది.
- నిర్జీవంగా ఉన్న జుట్టు మెరవాలంటే బొప్పాయికి మించింది లేదు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. బట్టతలను నివారిస్తుంది. జుట్టు బాగా పెరిగేలా చేయడమే కాకుండా మెరుపును, బలాన్ని కూడా ఇస్తుంది. ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు, ఒక కప్పు అరటిపండు ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక కప్పు పెరుగు తీసుకుని బ్లెండర్లో వేసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకి, జుట్టుకి రాసి 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
- అరటిపండు గుజ్జులో గుడ్డు, ఆలివ్ నూనె కలిపి హెయిర్ ప్యాక్లా వేసుకుని అరగంట తరువాత తలస్నానం చేసినా ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతమవుతుంది.
- చుండ్రు పోగొట్టేందుకు ఆ షాంపు ఈ షాంపు అని పరుగులు పెట్టకుండా శీకాకారు వాడండి. ఇది చుండ్రును పోగొట్టడమే కాకుండా జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. శీకాకాయ, వేపాకు పొడులను (ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది) ఒక్కోటి నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఇందులో పెరుగు కలిపి చిక్కటి పేస్ట్లా చేసి మాడుకి రాయాలి.
- జుట్టుకి సంబంధించి ఇతర సమస్యలేవైనా ఉంటే మెంతులు వాడాలి. ఇవి జుట్టు రాలడాన్ని, చుండ్రును అరికట్టడమే కాకుండా జుట్టు పెరిగేలా చేస్తాయి. మంచి కండిషనర్లా పనిచేస్తాయి. మాడుని చల్లగా ఉంచి, రకరకాల సమస్యలను అంటే దురద, పొట్టు లేవడం వంటి వాటిని తగ్గిస్తాయి. మెంతుల్ని అరగంటసేపు నీళ్లలో నానబెట్టాలి. తరువాత ఆ నానబెట్టిన నీళ్లతో కలిపి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. మాడు, జుట్టుకి కొబ్బరి నూనె రాసి మెంతుల పేస్ట్ను మాడుకి పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.