Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా దర్శకులు అంటేనే చిన్నచూపు. అనేకానేక ముద్రలు. కానీ వాటన్నింటినీ బ్రేక్ చేసింది మేఘనా గుల్జార్. అదంతా రాత్రికి రాత్రి జరిగిపోలేదు. ఒక సినిమా ఫ్లాపయ్యాక ఏండ్లకు ఏండ్లు ఇంటినుంచి బయటికి రాకుండా ఉన్న రోజులున్నాయి. తల్లి అలనాటి నటి. తండ్రి ఫేమస్ ఫిల్మ్ మేకర్. ఆ ప్రివిలేజెస్నేమీ వాడుకోలేదు. అందుకే మొదటి సినిమాకు తరువాత సినిమాకు ఐదేండ్లు సమయం పట్టింది. సమయం, సక్సెస్, డబ్బులు.. వేటితో సంబంధం లేకుండా తన సౌకర్యాన్ని బట్టి సినిమాలు తీస్తూ... కమర్షియల్ డైరెక్టర్స్ సరసన నిలిచింది. యాసిడ్ దాడి నుంచి బయటపడి విజయవంతంగా బతుకుతున్న లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నది.
మేఘన తండ్రి గుల్జార్. తల్లి అలనాటి నటి రాఖి. సాహిత్య అధ్యయనం ఆమెకు సహజంగా అబ్బింది. ఫెయిరీ టేల్స్ విపరీతంగా చదివేది. తండ్రితోపాటు బుక్స్టోర్కు వెళ్లి తనకు ఇష్టమైన పుస్తకాలు కొనుక్కునేది. ఏవి కొనాలనే విషయంలో తండ్రి గుల్జార్ ప్రమేయం మాత్రం ఉండేది కాదు. చాలా ఇండిపెండెంట్గా పెరిగింది. ముంబైలోని సెంట్ జేవియర్ కాలేజీలో సోషయాలజీ చదివింది మేఘన. తల్లిదండ్రులిద్దరూ సినిమాల్లోనే ఉన్నా... ఆమె మాత్రం సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నది. చదువుకుంటున్నప్పుడే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ పియానో, కరాటే వంటివాటిమీద ఆసక్తి చూపించేది కాలేజీలోఉండగానే... మూడేండ్లపాటు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఫ్రీలాన్సింగ్ చేసింది. తరువాత చదవాలన్న ఆసక్తిపోయిన తరువాత... సినిమాల్లోకి రావాలనుకుంది. అది కూడా డైరెక్టర్గా. తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గాచేస్తే.. బాగుండదనుకుంది. అలాగని తల్లిదండ్రుల రికమండేషన్ కూడా తీసుకోలేదు. ఆ రోజుల్లో ఎవరినైనా కలవాలంటే కొన్ని గంటలపాటు వేచి చూడాల్సి వచ్చేది. అలా అనేకసార్లు వేచి చూసింది కానీ తానెవరో చెప్పలేదు. తన కాలేజ్ ఫ్రెండ్ జహీర్ ద్వారా అతని తండ్రి, ఫిల్మ్మేకర్ సయీద్ అఖ్తర్ మీర్జా దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.
న్యూయార్క్లో చదువుకుని...
1995లో న్యూయార్క్ యూనివర్సిటీలో టిక్ ఆర్ట్స్ స్కూల్లో ఫిల్మ్మేకింగ్ షార్ట్ కోర్సు చదివింది. కానీ అప్పటికే సినిమాల్లో పనిచేసి ఉన్నది కనుక... ఆ సిలబస్ చాలా ప్రాథమికమైనదిగా తోచిందామెకు. తొమ్మిదినెలల పాటు అక్కడ ఉన్నది. ఆ తొమ్మిదినెలల్లోనే ఓ యాక్సెసరీస్ స్టోర్లో సేల్స్గాళ్గా పనిచేసింది. స్థానిక ఇండియన్ చానల్లో ఓ షోను హౌస్ట్ చేసింది. తిరిగి ఇండియాకు వచ్చాక... ఏడాదిపాటు 'అముల్ ఇండియా షో'కి వ్యాఖ్యాతగా పనిచేసింది. ఈ సమయంలోనే కెమెరా ముందు తాను అసౌకర్యంగా ఫీలవుతున్నట్టు అనిపించింది. కెమెరా ముందుకంటే.. కెమెరా వెనుక బాగా పనిచేయగలనని తెలుసుకున్నది. 1998లో సెక్యూరిటీ ఏజెన్సీస్ గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్ 'ఇన్సెక్యూరిటీ' దూరదర్శన్ కోసం చేసింది. ముంబైలోని ఇళ్లలో పనిచేస్తున్న మహిళల సమస్యలపై... 'బాయి' లఘు చిత్రాన్ని నిర్మించింది. ఆ సమయంలోనే ఓ కథ రాసుకున్నదే. సరోగసీ మీద రాసిన ఆ కథ తరువాత 'ఫిల్హాల్'(2002) సినిమాగా వచ్చింది. ఆమె దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా. కానీ అది అంతగా పేరు తెచ్చుకోలేదు. రకరకాల సమీక్షలు వచ్చాయి. కొన్ని విమర్శలు ఆమెను గాయపరిచాయి. ఫిలిమ్ మేకర్గా తనకు సామర్థ్యం లేదేమోనని బాధపడింది. కొద్దిరోజులు బయటి ప్రపంచానికి దూరంగా బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో కేవలం సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ గడిపేసింది. ఆ తరువాత తన తండ్రి గురించి పుస్తకం 'బికాజ్ హి ఈజ్' పుస్తకం రాసింది. 2004లో అది పబ్లిష్ అయ్యింది. తరువాత 2007లో 'జస్ట్ మ్యారీడ్' సినిమా తీసింది. సెన్సిటివ్గా ఉండే మేఘన.. మొదటి సినిమాకు వచ్చిన విమర్శల నుంచి బయట పడేందుకు ఐదేండ్లు పట్టింది. తరువాత పది లఘు చిత్రాలను కలిపి 'పూరణ్మాషి'గా ఓ ప్రయత్నం చేసింది. అది బెడిసికొట్టింది. ఇక సినిమాల జోలికే వెళ్లొద్దని నిర్ణయించుకుంది.
తల్వార్తో హిట్...
తరువాత తనతోపాటూ న్యూయార్క్లో చదువుకున్న స్నేహితుడు గోవింద్ సంధునే పెండ్లి చేసుకుంది. కొడుకు పుట్టాడు. ఆ తరువాత సినిమాలే జీవితం కాదు. ఇప్పుడు బాబుకూడా ఉన్నాడు. సినిమాలు కాకుండా ఎంతో జీవితం ఉందని తనకు తాను సర్ది చెప్పుకుంది. కానీ ఆమెలో క్రియేటివ్ ప్రాసెస్ ఎప్పుడూ ఆగిపోలేదు. బాబు కొంచెం పెద్దయ్యాక... ఓ సారి దర్శక నిర్మాత విశాల్ భరద్వాజ్ 'బాబును ఓ సాకుగా చూస్తున్నావు' అని అన్న మాటలు ఆమెను ఆలోచింపజేశాయి. తరువాత 2015లో 'తల్వార్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అందుకే 'తల్వార్' సినిమా తనకు పునర్జన్మ లాంటిది అంటుంది మేఘన. 13 ఏండ్ల ఆరుషి తల్వార్ హత్య కేసును తీసుకుని చేసిన ఈ సినిమా ఆమెకు మొట్టమొదటి హిట్ ఇచ్చింది. 9కోట్ల బడ్జెట్తో తీస్తే.. 38 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తరువాత 'రాజీ'. హరీందర్ సిక్కా రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా. 'తల్వార్'ను మించిన హిట్ ఇచ్చిన సినిమా ఇది. రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకోసం భవానీ అయ్యర్తో కలిసి స్క్రీన్ప్లే రాసింది మేఘనా. సన్నివేశాలనీ, ఆ కాలాన్ని అద్భుతంగా చిత్రీకరించింది.
సక్సెస్తో సంబంధం లేకుండా...
ప్రయోగాత్మక చిత్రాలకు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే.. ఫిలాల్ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ మేఘనా గుల్జార్. కమర్షియల్ సక్సెస్తో సంబంధం లేకుండా తను చేసే ప్రతి సినిమా సమకాలీన పరిస్థితులకు ఎంతో కొంత అద్దం పట్టాలని కోరుకుంటుంది. అలాంటి ప్రయోగమే ఇప్పుడూ చేస్తున్నది. యాసిడ్ అటాక్ సర్వైవర్ లక్ష్మీ అగర్వాల్ విజయగాథను 'ఛపాక్'గా తెరకెక్కిస్తున్నది. దీపికా పదుకొణే ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా నిర్మాత కూడా ఆమెనే. 'దీపికను కలవాలనుకున్నప్పుడు నాలో నేనే చాలాసార్లు 'ఇలాంటి కథపై ఆమెకు ఒకవేళ ఆసక్తిలేకపోతే ఎలా' అని అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలి. చివరికి దీపిక ఒప్పుకున్నది చాలా సంతోషించా' అని చెబుతున్న మేఘన ఈ సినిమాను 2019 జనవరిలో విడుదల చేయనుంది. మరో వాస్తవ కథను తెరకెక్కించబోతున్నది మేఘన. మన దేశ మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మనేక్షా జీవిత కథను సినిమాగా తీస్తున్నది. ఆ పాత్రను... రాజీలో నటించిన వికీ కౌషల్ను పోషించనున్నాడు.
స్నేహితుడు కూడా...
ఆమెకు ఏడాది ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె తండ్రి దగ్గరే ఉండిపోయింది. అయినా తల్లి లేని లోటు ఏనాడూ రానీయలేదాయన. ఆమెకు జడలు వేసి స్కూల్లో దింపే దాకా తనతోనే ఉండేవాడు. తిరిగి ఆమె స్కూల్ నుంచి వచ్చే... నాలుగు గంటలకల్లా తన సినిమా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసేవారు. ఆమె ఎప్పుడూ ఏదీ మిస్సవ్వలేదు. ''ఇద్దరం ఒకే వృత్తిలో ఉన్నాం. నాన్న సింప్లిసిటీ నచ్చుతుంది. ఎంతో సంక్లిష్టమైన, లోతైన విషయాలను కూడా చాలా సాధారణంగా చెప్పేస్తారు. ఒక రచయితగా నాన్న గురించి రాయాలనిపించింది. నిజానికి సినిమా తీయొచ్చు. కానీ ఎంతోవిశాల జీవితాన్ని రెండున్నర, మూడు గంటలకు కుదించి వేయడం అంటే ఏమీ చెప్పలేం. నాన్న గురించి చెప్పడం మంటే భారత-పాక్ విభజన గురించి చెప్పడం. ఆ తరువాత ఆయన అసిస్టెంట్గా పనిచేసిన సినిమాలు, గేయ రచయితగా, మాటల రచయితగా, స్క్రిప్ట్ రచయితగా, ఫిలిం మేకర్గా.. ఒక్కోటి ఒక్కో సినిమా అవుతుంది. అందుకే సినిమాతో న్యాయం చేయలేను. నాన్న గురించి చెప్పడానికి పుస్తకమే సరైనది అనిపించింది. ఆయన కేవలం తండ్రే కాదు... నాకు స్నేహితుడు కూడా. ఎన్నోసార్లు అందరు అమ్మానాన్నల్లా మీరెందుకు కలిసి ఉండరు?' అని లెటర్స్లో అడిగితే... వాటికి ఎంతో ఓపికగా పరిణితితో సమాధానం ఇచ్చేవారు'' అని చెప్పే మేఘనకు తండ్రినుంచి జన్యుపరంగా వచ్చింది కొంతయితే... తండ్రిని చూస్తూ పెరిగిన కూతురిగా ఆయనను చూస్తూ నేర్చుకున్నది చాలా. అందుకే తండ్రి ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉంటుంది.
తల్లి నుంచి బెంగాలీ నేర్చుకుని...
అలాగని తల్లి అంటే ఏం కోపం లేదు. సమయం ఉన్నప్పుడల్లా తల్లి దగ్గరకు వెళ్లేది. ఆమె షూటింగ్లో ఉన్నప్పుడు సెట్స్కు వెళ్లి అల్లరి చేసేది. అలా ఆమె మర్చిపోలేని షూటింగ్ లొకేషన్ కశ్మీర్. తల్లి సినిమా చేస్తుండటంతో సెలవుల్లో అక్కడికి వెళ్లి మేఘన. ఇటీవల తను 'రాజీ' చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె కొడుకు సమరు సెలవుల్లో అక్కడికి వచ్చాడు. ఆ రోజులు మరిచిపోలేనివని చెబుతుందామె. మేఘన రాఖీ కూడా అంతే హుందాగా బతికింది. వాళ్లు బెంగాలీలు. ఉమ్మడి కుటుంబం. అమ్మమ్మ తాతయ్యలకు బెంగాలీ తప్ప మరో భాష రాదు. అందుకే వాళ్లతో మాట్లాడేందుకు బెంగాలీ నేర్చుకుంది మేఘన. తల్లిదండ్రులిద్దరి ప్రభావం తనపైన ఉందని, హుందాగా బతకడమెలాగో తల్లి నుంచి, నిరాడంబరతను తండ్రి నుంచి నేర్చుకున్నానని చెబుతంది.
వాళ్లూ మనలాగే మనుషులు...
నాన్న పంజాబీ. విభజన తరువాత ఇండియాలోకి వచ్చేశాం. ఇప్పటికీ అక్కడికి వెళ్తే... ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. ఆత్మీయంగా చూసుకుంటారు. నమ్మకం, దేశభక్తి, ప్రేమ వంటివన్నీ మనిషికి చాలా వ్యక్తిగతమైనవి. కానీ ఇప్పుడా అర్థం మారిపోయింది. బయటికి గట్టిగా అరిస్తేనో, ఏదైనా చేస్తేనో దేశభక్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే... ఇదంతా 'ఆర్మ్ చైర్ దేశభక్తి'గా అనిపిస్తుంది. ఇరువైపుల రాజకీయ నాయకులు, వాళ్లు చేసే రాజకీయాల వల్లే ఈ దేశభక్తి ఇదంతా ముందుకొస్తున్నది. రాజీ కశ్మీర్లోనే షూట్ చేశాను. నిజానికి ఆ సినిమాలోని పాత్రలు... పాకిస్తాన్కు చెందినవి కూడా ఎంతో సెన్సిటివ్గా ఉంటాయి. నిజానికి మనకు పాకిస్తాన్ అనగానే బార్బేరిక్గా ఉంటారని ఓ ఇమేజ్ పడిపోయింది. కానీ వాళ్లకు మూడు చేతులు, మూడు కండ్లు ఏం లేవు. వాళ్లూ మనలాగే మనుషులు. రక్తమాంసాలున్న, భావోద్వేగాలున్న మనుషులు. ఆ విషయాన్ని మరిచిపోతున్నాం.
కంటెంట్ ఇంపార్టెంట్..
ఇప్పుడు మహిళా దర్శకులు సినిమా తీయడం అంత కష్టమేం కాదు. పదిహేడు పద్మెనిమిదేండ్ల కిందట... కేవలం ఇద్దరు ముగ్గురే మహిళలు ఉండేవారు. వాళ్లకు నిర్మాతలు, నటులు దొరకడం చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు సినిమా అనేది కంటెంట్ మీద ఆధారపడే ఉంటున్నది. నీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉన్నదా... కచ్చితంగా నిర్మాతలు, నటులే కాదు... ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. నీ జెండర్ గురించి ఆలోచించరు.