Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేకరీల దగ్గర నుంచీ పరాఠా హౌటళ్ల దాకా మైదాదే ప్రపంచం. కానీ ఆహార నిపుణులు మాత్రం ఈ మైదాని స్లో పాయిజన్గా చెబుతున్నారు. వీలైనంతగా మైదాకు దూరంగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు.
- గోధుమ గింజల్లో ఉండే పిండి పదార్థాలను వేరు చేస్తే అదే మైదాగా మారుతుంది. నిజానికి మైదా పసుపు రంగులో ఉంటుంది. ఇలా ఉండే మైదాకు తెల్లటి తెలుపుని ఇచ్చేందుకు బెంజోయిక్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇక మెత్తగా ఉండేందుకు అల్లోక్సాన్ అనే రసాయనాన్నీ వాడతారు. ఆహారంలో ఇలాంటి కత్రిమ రసాయనాలు చేర్చడం వల్ల అనారోగ్యం తప్పదు.
- మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిని తిన్నవెంటనే చాలా అధికంగా, చాలా త్వరగా చక్కెరను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇలా త్వరగా ఉత్పత్తి అయిన చక్కెరను నియంత్రించేందుకు మన శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుంది. తరచూ మైదాని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి, తద్వారా పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే చక్కెర వ్యాధి బారిన పడక తప్పదు.
- ఇక మైదాలో పిండిపదార్థాలే కానీ పీచుపదార్థాలు కనిపించవు. మనం తిన్న ఆహారం సవ్యంగా జీర్ణం కావాలంటే, అందులో ఎంతో కొంత పీచుపదార్థం తప్పనిసరిగా ఉండితీరాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పేగుల్లో పుండు మొదలుకొని మొలల వ్యాధి వరకూ నానారకాల రోగాలు దాడిచేసే ప్రమాదం మైదా కలిగిస్తోంది.
- మైదాలో పిండిపదార్థాలు తప్ప విటమిన్లు కనిపించవు. ఇక ఖనిజాలు, ప్రొటీన్ల శాతమూ అంతంతమాత్రమే! అంటే మైదాతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం తప్ప మరేదీ మిగలదన్నమాట.
- మైదాలో గ్లియాడిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తాత్కాలికంగా పెంచుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. అంటే ఒక పరాఠా తింటే మరో పరాఠా తినేలా ప్రోత్సహిస్తుంది. ఇది ఊబకాయానికి దారితీస్తోంది. అందుకే మైదా సంబంధిత పదార్థాలను తినేముందు ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.