Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతకు తన పరిస్థితి ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. కాపాడాల్సిన కన్నతండ్రే బిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తట్టుకోలేక పోతున్నది. చివరకు ఏం చేయాలో తెలియక ఇద్దరు బిడ్డలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ఐద్వా అదాలత్కు వచ్చిన ఆమె తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో చదవండి.
నవతకు పదేండ్ల కిందట పెండ్లియింది. ఇద్దరు ఆడపిల్లలు. నవత భర్త సుందరం ఒక ప్రభుత్వ కంపెనీలో పనిచేస్తాడు. పెండ్లయిన నాటి నుంచి అతనికి అనుమానం ఎక్కువ. పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు తన బిడ్డే కాదు అంటూ పెద్ద గొడవ చేశాడు. పెద్దమనుషులు సర్ది చెప్పడంతో భార్యబిడ్డలను ఇంటికి తీసుకువెళ్ళాడు. రెండేండ్ల పాటు బాగానే ఉన్నాడు. రెండోకాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందని వెళ్ళి కనీసం చూడలేదు. మళ్ళీ పెద్దమనుషులు వచ్చి సర్ది చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్యబిడ్డలను ఇంట్లో అడుగు పెట్టనిచ్చాడు. నవతకు ఇద్దరు అక్కలు, అన్న ఉన్నారు. వాళ్ళేవ్వరితో మాట్లాడవద్దని ఆంక్షలు విధించాడు. ఇద్దరు ఆడపిల్లల కోసం అన్నింటికీ సరే అంటూ సర్దుకు పోయింది నవత.
బిడ్డ పట్ల ప్రవర్తన..
దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షుమాదిరిగానే ఈ పదేండ్ల సంసారం నెట్టుకు వచ్చింది నవత. భర్త, అత్త ఆడపడుచులు పెట్టే ఇబ్బందులు మూడోమనిషికి తెలియకుండా భరించింది. తిట్టినా, కొట్టినా కాలు బయట పెట్టలేదు. ఈ సారి మాత్రం పెద్ద బిడ్డ పట్ల భర్త ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయింది. పెద్ద పాపకు తొమ్మిదేండ్లు. రాత్రివేళ తాగి వచ్చిన భర్త నిద్రపోతున్న బిడ్డ శరీరాన్ని తాకడం చూసి ఆమె తట్టుకోలేక పోయింది. 'పిల్లను ఎందుకు నిద్రలేపుతున్నావు' అన్న నవత గొంతు విని కంగారు పడ్డాడు సుందరం. ఇద్దరి మధ్య గొడవ విని నిద్రలేచారు పిల్లలిద్దరూ. ఇంట్లోవారు నిద్రలేవడంతో సైలెంట్గా వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్న స్కూలు బ్యాగు సర్దుతున్న నవత వద్దకు వచ్చిన కీర్తి' అమ్మ ఈ మధ్య నాన్న నన్ను గట్టిగా పట్టుకుంటున్నాడు. వదిలించుకుని వెళ్ళిపోతే కొడుతున్నాడు. నాకు భయంగా ఉంది' అంది. రాత్రి సంఘటనతోనే బక్కచిక్కి పోయిన నవతకు కీర్తి మాటలు మరింత భయాన్ని కలిగించాయి. పదేండ్లు భర్త పెట్టిన బాధలు భరించింది పిల్లల భవిష్యత్ కోసం. ఈ రోజు వారి భవిష్యత్ భర్త కారణంగా కష్టాల్లో పడుతుంటే చూస్తూ మౌనంగా భరించడం తన వల్ల కాదు అనుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. భర్త ఆఫీస్కు వెళ్ళిన తర్వాత కింది పోర్షన్లో ఉండేవారి సలహాతో ఐద్వా అదాలత్కు వచ్చింది.
తిరిగి ఆ ఇంటికి..
నవత చెప్పిన విషయాలు విన్న బాధ్యులు వెంటనే ఆమె అన్న, అక్కలకు ఫోన్ చేశారు. 'మా ఇంటికి రాకపోయినా భర్తపిల్లలతో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాం. ఇప్పుడు కన్నబిడ్డల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే చూసిచూడనట్లు ఉంటూ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ను నిర్లక్ష్యం చేయడం సరికాదు. మేం నవతకు తోడుగా ఉంటాం. మీరు ఎలా చెప్పితే అలా చేస్తాం. వారం రోజులు టైమ్ ఇవ్వండి' అన్నారు. నవత అన్న రాజేష్ వెంటనే వచ్చి నవతను, పిల్లలను ఇంటికి తీసుకుపోయాడు. వారం రోజుల తర్వాత నవత వచ్చి ' నేను తిరిగి ఆ ఇంటికి పోను. నేను ఉద్యోగం చేస్తాను. నా బిడ్డలను కష్టపడి పెంచుకుంటాను. 24గంటలు నా భర్త నుంచి బిడ్డలను కాపాడుకోవడం నా నుంచి కాకపోతే అన్న ఆలోచన నాకు నిద్రపట్టనివ్వడం లేదు. మీరే ఎలాగైనా నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలి' అంది. వెంటనే సుందరంకు ఫోన్ చేశారు. ఈ వారం వీలు కాదు వచ్చేవారం వస్తాను అన్నాడు సుందరం. తల్లిని తీసుకుని వచ్చాడు. ' అనుమానంతో మీ భార్యను వేధిస్తున్న మాట నిజమేనా?' సుందరంను అడిగారు బాధ్యులు.
'మేడమ్! ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. నేను నా భార్యబిడ్డలను ఎంతో బాగా చూసుకుంటాను. ఆమె అక్కలు, అన్న మా కాపురం చెడగొట్టాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆమె రెండోబావతో చనువు ఎక్కువ. మాపెండ్లికన్నా ముందే వారిద్దరి మధ్య సంబంధం ఉందని నాకు తర్వాత తెలిసింది. అయినా నేను పెద్దమనుషుల మాటకు కట్టుబడి భార్యబిడ్డలను ఇంట్లో ఉండనిచ్చాను. వాళ్ళ ఇండ్లళ్ళకు పోవద్దు అన్నాను. అందుకే రోజూ ఇంట్లో గొడవ చేస్తుంది. పిల్లలను కూడా నాకు దూరం చేస్తుంది. కంపెనీలో, యూనియన్లో నాకు మంచి పేరు అంది. ఆస్తి ఉంది. కావాలని నన్ను పెద్దమనుషుల పంచాయితీలో నిలబెట్టింది. ఇప్పుడు ఇలా మీ వద్దకు వచ్చింది' అన్నాడు కోపంతో ఊగిపోతూ సుందరం.
' నిజానికి మీరు చేస్తున్న అరాచకాలపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఈ పాటికి జైలులో ఉండేవారు. భర్త, తన పిల్లలకు తండ్రి అయిన కారణంగా మిమ్మల్ని క్షమించి మా వద్దకు వచ్చింది. మీరు భార్య పట్ల, బిడ్డల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థమైంది. మీలాంటి వారి వల్లే ఆడపిల్లల జీవితాలు సమస్యల మయంగా మారుతున్నాయి. భార్య మీద అనుమానం, బిడ్డల మీద అఘాయిత్య ప్రయత్నం. చేసిన తప్పులు గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజాలై పోవు. మీ మాటల్లోనే తెలుస్తుంది. ఇప్పటికైనా మీ తప్పులు దిద్దుకుంటే మంచిది. లేకపోతే మీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఉద్యోగం పోతుంది. మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది' అన్నారు బాధ్యులు.
నా ఇంట్లో కాలు పెట్టావంటే..
తన భార్య విషయాలన్నీ చెప్పిందన్న విషయం అర్థమైంది సుందరానికి. తన కొడుకు ఎంతో మంచివాడు అనుకున్న సుందరం తల్లి వాస్తవాలు విని 'ఛీ.నువ్వు నా కొడుకువు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నా ఇంట్లో కాలు పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఇలాంటి వాడిని మీరు ఏం చేసినా నేను పట్టించుకోను' అంటూ అక్కడి నుంచి కోడలును తీసుకుని వెళ్ళిపోయింది.
'చూశావా, నీ నిజ స్వరూపం తెలిసి కన్న తల్లే నిన్ను అస్యహించుకుంది. తలుపు వేసి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది. నాలుగు గోడల మధ్య భార్యను వేధిస్తే భరించింది. కానీ, ఆమె కండ్ల ముందే బిడ్డలను కాటేయాలని చూస్తే భరించలేకపోయింది. నీ భార్య మంచిది కాబట్టి పోలీస్ కేసు పెట్టి నీ ఉద్యోగం పోకుండా, నీకు జైలు శిక్ష పడకుండా మా వద్దకు వచ్చింది. వారి పోషణ కోసం నువ్వు ప్రతినెలా నీ జీతం నుంచి సగం భార్యబిడ్డలకు ఇవ్వాలి. లేకపోతే కోర్టు నుంచి విడాకులు తీసుకోవడంతో పాటు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది' అన్నారు బాధ్యులు.
ఏం జరుగుతుందో అన్న భయంతో..
ఉద్యోగం పోయి, జైలు జీవితం గడపాల్సి వస్తుందని గ్రహించిన సుందరం ' తప్పయ్యింది. ఏదో తాగిన మత్తులో అనుచితంగా ప్రవర్తించాను. ఇక మీదట ఎప్పుడు ఇలా చేయను. నవతను, పిల్లలను ఇంటికి తీసుకుపోతాను' అన్నాడు.
'నేను వెళ్ళను మేడమ్! ప్రతినిమిషం ఏం జరుగుతుందో అన్న భయంతో నేను బతకలేను. మా పోషణ కోసం డబ్బు ఇస్తే చాలు. పిల్లలకు పెద్ద చదువులు చెప్పించడంతో పాటు మగవారి అఘాయిత్యాలు ఎదుర్కొనేలా కరాటే నేర్పిస్తాను' అంది నవత.
భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడని నవత తన సొంత కాళ్ళపై నిలబడింది. అత్తను, ఇద్దరు బిడ్డలను చూసుకుంటూ ఒంటరిగానే బతకడానికి సిద్ధమైంది.
తన కొడుకు ఎంతో మంచివాడు అనుకున్న సుందరం తల్లి వాస్తవాలు విని 'ఛీ.నువ్వు నా కొడుకువు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నా ఇంట్లో కాలు పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఇలాంటి వాడిని మీరు ఏం చేసినా నేను పట్టించుకోను' అంటూ అక్కడి నుంచి కోడలును తీసుకుని వెళ్ళిపోయింది.
మీరు భార్య పట్ల, బిడ్డల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థమైంది. మీలాంటి వారి వల్లే ఆడపిల్లల జీవితాలు సమస్యల మయంగా మారుతున్నాయి. భార్య మీద అనుమానం, బిడ్డల మీద అఘాయిత్య ప్రయత్నం. చేసిన తప్పులు గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజాలై పోవు. మీ మాటల్లోనే తెలుస్తుంది. ఇప్పటికైనా మీ తప్పులు దిద్దుకుంటే మంచిది. లేకపోతే మీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఉద్యోగం పోతుంది. మీ నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది' అన్నారు బాధ్యులు.