Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శిలలపై శిల్పాలు చెక్కినారు.. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు' అంటూ శ్రావ్యంగా వినిపించే పాట శిల్పకళను కన్నుల ముందు సాక్షాత్కరింపచేస్తుంది. కఠినమైన రాళ్ళను శిల్పాలుగా మలచాలంటే ఎంతో శారీరక శ్రమ అవసరం అవుతుంది. ఇప్పటివరకు మగవారు మాత్రమే రాణించగలరు అనుకున్న శిల్పకళలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు స్నేహఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ స్నేహలత ప్రసాద్. చిత్రకారిణిగా ఎంతో అద్భుతమైన చిత్రాలకు తన కుంచెతో రూపమిచ్చిన ఆమె బహుముఖప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు. కళారంగంలో ఆమె చేస్తున్న కృషికి వరల్డ్ ఏషియా ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కళలను అందిరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో స్నేహఆర్ట్స్ ఏర్పాటుచేసిన ఆమె పరిచయం..
రాజస్థాన్లో జోధ్పూర్లోని రాజ్ కుటుంబం. నాన్నగారు దివాన్సింగ్. ఎయిర్ఫోర్స్లో పనిచేసేవారు. అమ్మ లీలాదేవి గృహిణి. ఆమెకు నన్ను ఆర్టిస్ట్గా చూడాలన్న కోరిక ఉండేది.ఆడపిల్లలలు ఇంటి నుంచి బయట కాలు పెట్టాలన్నా మా కుటుంబంలో ఎన్నో ఆంక్షలు ఉండేవి. అయినా చిన్నతనం నుంచే అమ్మ నన్ను కళారంగంలో ప్రోత్సహించారు. సాహిత్యంపై, లలిత కళలపై ఆమెకు ఎంతో ఆసక్తి. అందుకే చిత్రకళపై నాకు ఉన్న మక్కువను గుర్తించిన అమ్మ నన్ను ప్రోత్సహించారు. కొద్ది నెలల కిందట నాన్న గారు చనిపోయారు. ఆ తర్వాత అమ్మ సాహిత్యానికి చేరువై పుస్తకాలు రాస్తున్నారు.
రంగుల ప్రపంచం..
అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో స్కూల్లో జరిగిన డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనేదాన్ని. ప్రతిసారి బహుమతులు అందుకునేదాన్ని. స్కూల్లో మొదలైన రంగుల ప్రపంచం ఆ తర్వాత నా ప్రపంచాన్నే మార్చేసింది. డిగ్రీలోనూ డ్రాయింగ్ ఒక సబ్జెక్ట్గా తీసుకున్నాను. ఉదరుపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్, రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పూర్తి చేశాను. నేను తీసుకున్న పరిశోధనాంశం 'పాశ్చాత్య దేశాల చిత్రాలకు, భారత దేశ చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం'. దీనిని పూర్తి చేయడానికి రెండేండ్లు ఎంతో కష్టపడ్డాను. ఇందుకోసం విదేశాల్లోని ఎన్నో ప్రాంతాలను తిరిగి అక్కడి చిత్రకళ, శిల్పకళను గమనించే అవకాశం వచ్చింది.
అతి పెద్ద చిత్రం...
చిత్రకళపై మక్కువతో ఎన్నో పెయింటింగ్స్ వేయడం వాటిని ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్రూప్, సోలోగా ప్రదర్శనలు నిర్వహించాను. అందమైన అనేక చిత్రాలతో రాజస్థాన్లోని ప్రముఖ పెయింటర్స్ జాబితాలో నా పేరు చేరింది. ప్రక తికి ప్రాధాన్యం ఇస్తూ వేసిన ఎన్నో పెయింటింగ్స్ ప్రశంసలు అందుకున్నాయి. 64 ఫీట్స్ కాన్వాస్పై వేసిన చిత్రం అతి పెద్ద చిత్రంగా రికార్డు సృష్టించింది.
తెలుగింటి కోడలిగా..
నాన్నకు నన్ను డాక్టర్ను చేయాలన్న కోరిక తీరలేదు. నా ఆసక్తిని గమనించి ఆర్టిస్ట్గా ఎడగడానికి సహకరించారు. పెండ్లి సంబంధాలు చేసే సమయంలో మాత్రం డాక్టర్ పెళ్ళికొడుకు కోసం వెతికారు. దాంతో నిజామాబాద్కు చెందిన డాక్టర్ ప్రసాద్ సంబంధం నాన్నగారికి అన్ని విధాల నచ్చింది. దాంతో డాక్టర్ భార్యగా, తెలుగింటి కోడలిగా హైదరాబాద్లో అడుగుపెట్టాను. మా వారు ఇక్కడే స్థిరపడటంతో హైదరాబాద్ నా హౌమ్ టౌన్ అయ్యింది. రాజస్థాన్లో పేరున్న కళాకారిణిని. కానీ, హైదరాబాద్కు కొత్త. ఇక్కడ నేను, నా కళ ఎవరికీ తెలియదు. కుటుంబబాధ్యతలు, మా వారి హాస్పిటల్ బాధ్యతలతో కొన్నిరోజులు రంగులకు దూరమయ్యాను. ఈలోగా ఇద్దరు పిల్లలు. వారి పెంపకంతో బిజీ. అలా ఎనిమిదేండ్ల పాటు కుంచె పట్టకుండా ఉండిపోయాను.
ప్రకృతిపై ప్రేమతో..
పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ చుట్టూ ఆవహించిన నిశ్శబ్దాన్ని ఛేదించడానికి మా వారి ప్రోత్సాహంతో మళ్ళీ కుంచె పట్టాను. రంగులకు డబ్బులు మా వారిని అడగవచ్చు. కానీ, ఆత్మాభిమానం అడ్డం వచ్చింది. దాంతో పుట్టింటివారిచ్చిన నగలను కొన్నింటినీ అమ్మేసి కావల్సిన వస్తువులు కొన్నాను. ప్రకృతి పై ప్రేమతో 'రొమాంటిసైజ్ నేచర్' పేరుతో చిత్రాలు వేశాను. హైదరాబాద్లో మొదటిసారి ఎగ్జిబిషన్ నిర్వహించాను. ఇలా కొన్ని ప్రదర్శనలు నిర్వహిస్తున్న సమయంలో సిమ్లాలో జరిగిన ఆర్ట్ వర్క్షాప్లో పాల్గొనే అవకాశం వచ్చింది.
స్టోన్ ఆర్ట్లో..
అప్పటివరకు రంగులతోనే సహవాసం. ఆ వర్క్షాప్లో కళాకారులు చేస్తున్న స్టోన్ వర్క్ నన్ను ఆకట్టుకుంది. కేవలం కాన్వస్పై రంగులతోనే కాకుండా వివిధ లోహలతో, రాళ్ళతో శిల్పాలు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అక్కడ నేర్చుకున్న అంశాలతో సొంతంగా శిల్పాలు చెక్కడం ప్రారంభించాను. ఆ తర్వాత శిల్పకళపై ఆసక్తి ఏర్పడింది. చిన్నచిన్న శిల్పాలు చేయడం ప్రారంభించి చివరగా 64 అడుగుల శిల్పాల వరకు నేను తయారు చేయగలిగాను. నేను రూపొందించిన రాతి, లోహ, కాంక్రీట్ శిల్పాలు న్యూఢిల్లీ నుంచి హర్యానా వెళ్ళే జాతీయ రహదారికి ఇరువైపులా అమర్చే ప్రాజెక్ట్ను పూర్తి చేయగలిగాను. నిజం చెప్పాలంటే దీనిని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను.
ఉమెన్ అచీవర్..
విశాలమైన రోడ్లు, అందమైన పార్క్లతో నగరాలు స్మార్ట్ సిటీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా అందమైన శిల్పాలను ఏర్పాటు చేయవచ్చు. నిజం చెప్పాలంటే విదేశాల కన్నా మనదేశంలోనే శిల్పసంపద అద్భుతంగా ఉంటుంది. అనాటి శిల్పుల ప్రతిభాకౌశలం అబ్బుర పరిచేలా శిల్పాలు మన దేవాలయాల్లో కనిపిస్తాయి. చిన్నచిన్న శిల్పాల నుంచి 64అడుగుల శిల్పం వరకు నేను చెక్కగలిగాను. శిల్పాలు చెక్కడం అనేది కష్టమైన పనిగా, కేవలం మగవారు మాత్రమే చేయగల పనిగా భావిస్తారు. వేడి, మిషిన్ శబ్దాలు, దుమ్ము, ఎండా ఇలా అనేక ఇబ్బందులు భరించాలి. అందుబాటులోకి వచ్చిన పరికరాలు కష్టమైన పనిని కొంతమేరకు సులభతరం చేస్తున్నాయి. అయితే సృజనాత్మకత ముఖ్యం. కేవలం రాతితోనే కాకుండా లోహలతో, కాంక్రిట్లోనూ అందమైన శిల్పాలను తయారుచేస్తున్నాను. ఉదయపూర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ క్యాంప్లో 'బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే కాన్సెప్ట్తో 'తల్లీ, తండ్రీ, మధ్యలో అమ్మాయి' శిల్పాలకు ఇంటర్నేషనల్ వరల్డ్ ఏషియా ఉమెన్స్ అచీవర్ అవార్ట్ను అందుకున్నాను. ఉమెన్, నేచర్ థీమ్లో ఎన్నో చిత్రాలు వేయాలని, శిల్పాలు చెక్కాలని ఉంది.
ఏ రంగంలోనైనా..
లింగవివక్ష లేకుండా సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి. ముఖ్యంగా శిల్పకళ వంటి మేల్ డామినెటింగ్ రంగాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాలి. చిత్రకళతో పాటు శిల్పకళలో మహిళలను ప్రోత్సహించేలా స్నేహఆర్ట్స్ ఏర్పాటు చేశాను. ట్రైనింగ్, వర్క్షాప్లు నిర్వహిస్తూ కళలను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాను.