Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యరంగంలో మహిళలు రాణిస్తున్నా కవిత, కథ, నవల ప్రక్రియలకే పరిమితమైన వారే ఎక్కువగా కనిపిస్తారు. సర్వకళల సమాహారం నాటకం అంటారు. అలాంటి 'నాటక రచనా రంగం'లోనూ తనదైన ప్రత్యేక ముద్రను వేశారు అత్తలూరి విజయలక్ష్మి. ఆమె కలం నుంచి జాలువారిన ప్రతిఅక్షరంలో మనుషుల మధ్య బంధాలు కనిపిస్తాయి. కుటుంబాలుగా కలిసి జీవించడంలోని మాధుర్యం, కష్టసుఖాలు పంచుకోవడంలోని బాధ్యత ప్రస్ఫుటమవుతాయి. కుటుంబవ్యవస్థలోనే మనదేశ మూలాలు ఉన్నాయని ఆమె రచనలు బలంగా చెబుతాయి. మన చుట్టూ అల్లుకున్న బంధాలే పాత్రలుగా మనలను పలుకరిస్తాయి. రోటిన్కు భిన్నంగా ముగింపు ఇస్తూ సామాజిక సమస్యలను అనేక కోణాల్లో చర్చిస్తూ, పరిష్కార మార్గాలు వెతుకుతూ ఆమె కలం ముందుకు సాగుతుంది. సాహిత్య రంగంలో విశేషకృషి చేస్తున్న ఆమె పరిచయం..
అమ్మ అనసూయ, నాన్న ఏఎల్ నరసింహారావు, జర్నలిస్ట్, ఎం.ఎన్ రాయ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ, అబ్బురు రామకృష్ణరావు గారితో కలిసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనేక పత్రికల్లో, ఆల్ ఇండియా రేడియోలో ఆయన రాసిన రాజకీయ వ్యాసాలు 'నడుస్తున్న చరిత్ర'గా చాలా కాలం ప్రసారమయ్యాయి. ఈనాడు నుంచి రిటైర్ అయ్యారు.అమ్మ సాహిత్యం, నాన్న జర్నలిజం పుస్తకాలపై మక్కువను పెంచాయి. ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, తమ్ముడితో కలిపి మొత్తం ఆరుగురం పిల్లలం. మా ఇంట్లో సాహిత్యం అనేక రూపాల్లో విస్తరించి ఉండేది. దిన, వార పత్రికలు, కథల పుస్తకాలు, నవలలు, గ్రంథాలు ఎన్నో ఉండేవి. సాహిత్యం ఎక్కువగా చదివినప్పటికీ ఎలా రాయాలో తెలిసేది కాదు. దాంతో చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు రాసేదాన్ని. అలా మొదటి రచన శకునాలపై రాశాను. అది రేడియోలో చదివాను. మంచి ఆదరణ రావడంతో పాటు ఇంకా రాయమని ప్రోత్సహించారు.
భావాలనే అక్షరాలుగా..
సుల్తాన్ బజార్ బాలికల పాఠశాలలో చదువుకున్నాను. చిన్నతనం నుంచి పుస్తకమే నా నేస్తం. ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నేను బయటకు చెప్పాలనుకున్న విషయాలను చెప్పలేక నాలోని భావాలను అక్షరాలుగా మార్చేదాన్ని. అలా..అలా రాయడం అలవాటు అయ్యింది. నాన్న స్నేహితులు రావురి భరద్వాజగారు నేను రాసినవి చూసి ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. 1974లో ఒక నాటకంలో పాత్ర వేసే అవకాశం వచ్చింది. నాన్న కూడా ఒప్పుకోవడంతో నాటకం వేశాను. ఆ తర్వాత యువవాణిలో 'కళ్ళాణి పెళ్ళి' అనే స్కెచ్ 15నిమిషాల పాటు ప్రసారం చేశారు. అప్పట్లో రేడియో నిర్వహించే కార్యక్రమాల్లో కల్చరల్ ప్రోగ్రామ్ చేసేవారికి అరగంట సమయం కేటాయించేవారు. అలా మరో సంస్థ వాళ్ళు అడగడంతో 'కీలుబొమ్మలు' నాటకం రాసిచ్చాను. అది కూడా ప్రసారమయ్యింది.
రెట్టింపు ఉత్సాహంతో..
ఇంటర్ చదువుతూ, రేడియోలో చిన్నచిన్న స్కెచ్లు, కథలు రాస్తుండగానే పెండ్లి అయ్యింది. ఆ తర్వాత చాలాకాలం రచనావ్యాసంగానికి దూరంగా ఉన్నాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జలమండలిలో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే పర్సనల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉద్యోగ, ఇంటి బాధ్యతతో దాదాపు ఏడెండ్ల పాటు రచనావ్యాసంగానికి దూరంగా ఉన్నాను. బాధ్యతల నుంచి కాస్త వెసులుబాటు కాగానే మనసు అక్షరాల వెంట పరిగెత్తింది. నాటకాలతో పాటు కథలు రాశాను. వాటిని పత్రికలకు పంపిస్తే తప్పక అచ్చు అయ్యేవి. దాంతో రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని కథలు రాయగలిగాను. ఈనాడు పత్రికలో వచ్చిన 'తోటమాలి' కథతో రచయిత్రిగా గుర్తింపు వచ్చింది. ఆ కథను హిందీలోకి, ఇతర భాషల్లోకి కూడా అను వదించారు. కథలతో పాటు రేడియో నాటకాలు కూడా రాసేదాన్ని.' కేవలం డైలాగ్లు రాస్తే అది నాటకం అయిపోదు. నాటకీయత ఉన్నప్పుడే అది శ్రోత లను ఆకట్టుకుంటుంది' అని నా చిన్ననాటి మిత్రుడు కళాకృష్ణ గారు చేసిన సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అప్పట్లో మధ్యహ్నాం మూడు, నాలుగు గంటల మధ్య ప్రసారమయ్యే గంటసేపు నాటకం రాయడం ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అలా గంటసేపు నాటకం రాయాలన్న కోరిక ఉండేది. 1997లో రాసిన 'జీవనసమరం' నాటకంలో నా కోరిక తీరింది.
కితకితలు..
కథలు, నాటికలే కాదు నవల రాయాలన్న ఆలోచన 2000లో రాసిన 'దత్తపుత్రుడు'తో సాకారమైంది. అదే ఏడాది రాసిన 'మ్యాచ్ఫిక్సింగ్' హాస్యనాటిక రంగస్థల నాటకతో రచయిత్రిగా సాహిత్యరంగంలో సుస్థిర స్థానం ఏర్పడింది. మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు దృశ్య, శ్రవణ నాటికగా అనేక సార్లు రేడియోలో, దూరదర్శన్లో ప్రసారమయ్యింది. స్టేజీ నాటకంగా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ప్రదర్శిస్తునే ఉన్నారు.
మ్యాచ్ఫిక్సింగ్ నాటిక రైట్స్ను ప్రముఖ దర్శకులు ఇ.వి.వి సత్యనారాయణ గారు తీసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'కితకితలు' సినిమా కోసం ఈ నాటికను తీసుకున్నారు. ఆ తర్వాత రాసిన మరో నాటిక 'అంతర్మథనం'తో కలిపి పుస్తకంగా తీసుకువచ్చాను. ఇప్పటివరకు మొత్తం 23 నవలలు రాశాను. వాటిలో ఇరవై అచ్చు అయ్యాయి. త్వరలో మూడు నవలలు రానున్నాయి. రెండు వందలకు పైగా నాటకాలు, రెండు వందలకు పైగా కథలు రాశాను. నా రచనలపై ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు పిహెచ్డి చేస్తున్నారు. చాలా కథలు, నవలలు కన్నడలోకి, ఇతర భాషల్లోకి అనువదించారు. ఇటీవల 'తెల్లగులాబీ' నవల హిందీలోకి అనువదించారు.
రంగస్థల రత్నాలు..
పండితులను, పామరులను ఆకట్టుకునే అద్భుత శక్తి నాటకంలో ఉంది. కవిత, కథ, నవల, వ్యాస ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేసినా నాటకం అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. పాత్రల ద్వారా అంతర్గతంగా సందేశాన్ని ఇచ్చే నాటకాలంటే విపరీతమైన ఆసక్తి. మిగతా ప్రక్రియల కన్నా నాటకం రాయడం కాస్త కష్టమే. అయినా నేను ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. రాయడంతో కొత్తదనం కోసం ఆరాటపడుతూ ప్రయోగాత్మకంగా రాసిన ' రంగస్థలం' నాటకం ఎంతో పేరు తెచ్చింది. కళాకారుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని నేను రాసిన ఈ నాటకం ప్రేక్షకులతో పాటు కళాకారుల ప్రశంసలు అందుకునేలా చేసింది. రంగస్థలం నాటకం రాసిన తర్వాత కళాకారుల జీవితాలను ఎందుకు పరిచయం చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. దాంతో దూరదర్శన్ వారిని సంప్రదించి దాదాపు ఇరవై మంది కళాకారుల జీవితాలను 'రంగస్థల రత్నాలు' పేరుతో ప్రసారం చేశాం. కళాకారులకు కేవలం చప్పట్లు సరిపోవు.. వారి కళ తరతరాల వరకు బతకాలంటే ఆర్థికంగా వారికి చేయూత ఇవ్వాలి అప్పుడే కళ బతుకుతుంది. అక్కినేని ఇనిస్టిట్యూట్ లో రేడియా నాటకాల ప్రాక్టిస్ చేయించే బాధ్యత కొన్నిరోజులు తీసుకున్నాను.
జీవితాలను శాసిస్తున్న..
అనేక పత్రికల్లో కాలమ్స్ రాశాను. వాటిలో చాలా అంశాలు పాఠకుల ఆదరణ పొందాయి. ప్రస్తుతకాలంలో టెలివిజన్ జీవితాలను శాసిస్తోంది. నేడు వివిధ చానల్స్లో వస్తున్న టీవీ సీరియళ్ళపై రాసిన వ్యంగ్యహాస్య కథలు 'అష్టావక్ర నాయికలు' పుస్తకంగా వచ్చింది. మానవసంబంధాలను వికృతరూపంలో చూపిస్తూ కుటుంబంలోని వ్యక్తుల మధ్య అనుబంధాలను అవహేళన చేసేలా కొన్ని సీరియల్స్ ఉంటున్నాయి. ఇలాంటి అనారోగ్యకరమైన ప్రక్రియలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
స్వచ్ఛమైన ..
జలమండలిలో 1985లో ఉద్యోగంలో చేరి 2013లో అధికారహౌదాలో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇన్ హౌజ్ జర్నల్ 'సుజల' అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యత నాపై ఉండేది. గ్లాస్ స్వచ్ఛమైన నీరు మన చేతిలోకి రావడం వెనుక ఎంతో ప్రయాస, మరెంతో మావన మేధస్సు ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన నీటిని వృధా చేయడం సరికాదు అన్న మెసెజ్తో డాక్యుమెంటరీ కూడా తీశాం. దాదాపు మూడు దశాబ్దాల పాటు జలమండలిలో పనిచేసిన అనుభవాలతో మరో పుస్తకం త్వరలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను.