Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో తేమ వల్ల ఇంటి గోడల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి. ఇంట్లో ఒకలాంటి వాసన కూడా వస్తుంది. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- ముందుగా ఇంట్లో ఎక్కడెక్కడ లీకేజిలు అవుతున్నాయో గమనించాలి. పైకప్పులు, గోడల మీద ఉన్న లీకేజీలను చూడాలి. లేదంటే ఇల్లంతా చెమ్మ పట్టి గోడల మీద ప్యాచ్లు ఏర్పడతాయి. ఇలా కాకుండా ఉండాలంటే గోడలకి వాటర్ప్రూఫ్ కోటింగ్ వేయించుకోవాలి.
- ఇంటికి బయటివైపు ఉండే ఎలక్ట్రికల్ స్విచ్లు ఓపెన్గా ఉంటే వాటిని కవర్ చేయాలి. ఎలక్ట్రికల్, జనరేటర్ గదుల్లో లీకేజిలు ఉన్నాయేమో చూసుకుని వాటిని వెంటనే సరిచేయించుకోవాలి.
- ఈ సీజన్లో కార్పెట్లు, రగ్గులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. కార్పెట్లు తేమను త్వరగా పీలుస్తాయి. దాంతో ఇల్లంతా ముక్కిపోయిన వాసన వస్తుంది. అందుకని కార్పెట్లు, రగ్గులను ప్రతిరోజూ వాక్యూమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తేమ, దుమ్ము దరిచేరకుండా ఉంటాయి. రగ్గులను పాలిథీన్ షీట్లలో చుట్టి పెడితే తేమ, పురుగులు చేరవు.
- ఈ సీజన్లో చెక్క ఫర్నిచర్ పట్ల కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి. కప్బోర్డులు, డ్రాయర్లు వంటి చెక్క సామాన్లలో తేమ చేరి అవి పాడయ్యే అవకాశం ఉంది. అందుకని నాఫ్తలీన్ ఉండల్ని వాటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల బట్టలు, విలువైన వస్తువులు పాడుకాకుండా ఉంటాయి. పురుగులు కూడా పట్టవు. వేపాకులను వేస్తే సిల్వర్ ఫిష్ కప్బోర్డుల్లోకి చేరదు. లవంగాలు వేస్తే బట్టలకు పురుగులు పట్టవు.
- వర్షాకాలంలో తేమ వల్ల ఇంట్లో వచ్చే వాసన పోగొట్టేందుకు గ్లాసు, మెటల్, సెరామిక్ గిన్నెల్లో పాట్పౌరి వేసి ఉంచాలి. అందులో కాస్త ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేస్తే సువాసన వస్తుంది. సెంటెడ్ కొవ్వొత్తులను వెలిగించినా ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి.