Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మనాన్న ప్రేమకు పరిమితులు ఉండకపోవచ్చు కానీ, లక్ష్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి' అంటారు ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వశాస్త్రవేత్త ఫ్రాయిడ్. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రుల పెంపకం తీరు మారాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇద్దరు లేదా ముగ్గురు అన్న సంతాన సూత్రం ప్రస్తుత ఆధునిక పరిస్థితుల కారణంగా ఒక్కరు చాలు అన్న విధంగా మారింది. ఉన్న ఒక్క బిడ్డను చదివించి, బంగారు భవిష్యత్ అందిస్తే చాలు అన్న ఆలోచనతో నేటి తల్లిదండ్రులు ఉన్నారు. తమ ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచుతున్నారు. దీని వల్ల పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులు రేపటి భవిష్యత్కు అద్దం పడతాయి.
పిల్లలపైనే అమ్మనాన్నల ఆశలన్నీ. తాము పడిన కష్టాలు పిల్లలు పడకూడదంటూ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ సమకూర్చి పెడతారు. సంపాదించేది పిల్లల కోసమే కదా అంటూ డబ్బుల విలువ తెలియకుండా పెంచుతారు. వారు అడిగినవన్నీ కాదనకుండా తమ శక్తికి మించిన సౌకర్యాలు కల్పిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తమ పెంపకం ద్వారా సమాజానికి ఎలాంటి పౌరుడిని అందించామన్నదే పరిగణన లోకి తీసుకోరు. అమ్మనాన్న అతిప్రేమ వల్ల పిల్లల్లో గారాబం, పెంకితనం, ఇగో పెరుగుతాయి అంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి సమస్యలు పిల్లల ప్రవర్తనలో రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
ఓపికగా వినాలి...
స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడటం కన్నా ఫోన్లో మాట్లాడే సమయమే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో కాకుండా టీవీ, కంప్యూటర్, లాప్టాప్, ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మంచిది కాదు. ఇంట్లో ఉన్నంత సేపు వీలైనంత వరకు పిల్లలతో గడపాలి. పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. వారు చూసిన, తెలుసుకున్న విషయాలు అమ్మనాన్నతో చెప్పాలని ఉబలాటపడతారు. చాలా మంది పిల్లలు బడి నుంచి రాగానే 'అమ్మ' అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు, తాను కొత్తగా తెలుసుకున్న సంగతులు ఏకధాటిగా చెబుతుంటారు. వాళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి. వారికి అటేంషన్ ఇవ్వాలి. వారి మాటలు ఓపికగా వినడం వల్ల వారి ఆలోచన విధానం అర్థం అవుతుంది. పిల్లల అభిరుచులు, ఆసక్తుల్ని గమనిస్తూ, మంచి, చెడు వివరించాలి.
ఆలోచనలను పంచుకోవాలి. .
పిల్లలకు అన్ని విషయాలు కొత్తవే. పరిసరాలను గమనిస్తూ పెరుగుతారు. మంచీ చెడూ తెలుసుకోలేని వయసు వారిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు, టీవీ, కంప్యూటర్లు, ట్యాబ్లు పిల్లలను ఆకర్షిస్తాయి. అమ్మనాన్న ఇద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న ఇంట్లో పిల్లల కాలక్షేపం వీటితోనే. అలాంటి సందర్భంలో పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. వారికి ఖాళీ సమయం ఎక్కువ ఉండకుండా పుస్తకపఠనం అలవాటు చేయాలి. వారి సృజనాత్మకతను పెంచేలా సంగీతం, నాట్యం, చిత్రకళ వంటి కళలు నేర్పించాలి.
పోలిక వద్దు..
చాలామంది తల్లిదండ్రులు చేసే పొరబాటు ఇతరులతో పిల్లలను పోల్చడం. దీని వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. ఇతర పిల్లల్ని కొట్టటం, తోటి పిల్లల వస్తువులు తీసుకోవడం వంటి అల్లరి పనులు చేస్తే మందలించాలి. తల్లిదండ్రులు పిల్లలతో వీలై నంత ఎక్కువ సమయాన్ని గడపాలి. వారికి దగ్గరగా కూర్చొని కబుర్లు చెబుతూ, వారితో మాట్లాడాలి. చాలామంది అమ్మనాన్న పిల్లల ముందే గొడవ పడుతుంటారు. ఇది వారి మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.
ప్రశ్నించేలా..
ఏ వ్యక్తికైనా విలువలే పునాదిగా ఉంటాయి. ఆ విలువలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తమ మాట వినడం లేదని బాధపడుతుంటారు. వాస్తవానికి పిల్లలు ఎల్లప్పుడూ కన్నవారి నడక, నడతను పరిశీలిస్తూనే ఉంటారు. పెద్దలు అబద్ధాలు ఆడుతూ, పిల్లల్ని మాత్రం నిజం చెప్పాలి అని హితబోధ చేయడం సరికాదు. అంతేకాదు అమ్మనాన్న చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య పొంతన లేకుంటే పిల్లలు క్రమంగా అమ్మనాన్నను కూడా ప్రశ్నిస్తారు. పిల్లలకు నీతి, నైతిక విలువలు చెప్పడం కన్నా, తమ ప్రవర్తన, నడవడికతో నేర్పించడం ముఖ్యం. మహనీయుల జీవితాల స్ఫూర్తిని పిల్లలకు కథలు, పుస్తకాల ద్వారా పరిచయం చేయాలి. వారిలో ప్రశ్నించే తత్త్వం పెంచాలి.
అభిప్రాయాలకు విలువనిస్తూ..
పిల్లల ఆలోచన శక్తి, పరిధి పెరిగింది అన్న విషయం ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకోవాలి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాదిరిగా చిన్నపిల్లలు కూడా పెద్దపెద్ద విషయాలు మాట్లాడుతుంటారు. అలాంటి పిల్లలతో జాగ్రత్తగా మెలగాలి. వారితో వాదించడం వల్ల మొండివారిగా మారుతారు. అలాకాకుండా వారు చెప్పే విషయాలను ఓపికగా వినాలి. వారి అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. మెల్లగా వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. బెదిరించినా, వాదించినా పిల్లలు మాట వినరు అన్న విషయం గుర్తుంచుకోవాలి. వారికి అర్థమయ్యేలా ప్రేమతో చెప్పాలి. ఎప్పుడు చదువే అనకుండా ఆటలకు కూడా సమయం ఇవ్వాలి.