Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేచ్ఛకోసం పరితపించిన ఎందరో మహనీయులు ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి విఫలయత్నం చేశారు. కొందరు ఆయుధాలతో పోరాడితే మరికొందరు అక్షరాలతో అవగాహన కల్పించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పత్రికలు ప్రారంభించారు. అలా తెలంగాణలో 'నీలగిరి'పత్రికను స్థాపించిన తెలంగాణా వైతాళికుడు షబ్నవీస్ రామనరసింహారావు. ఆయన గురించి అక్కడక్కడ ఉన్న ప్రస్తావనలను తీసుకుని పరిశోధించి అనేక విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు ఆయన కోడలు ఇందిరా రావు షబ్నవీస్. మూలాల గురించి తెలుసుకున్నప్పుడే భవిష్యత్ బలంగా ఉంటుందని విశ్వసించే ఆమె కలం నుంచి ఎన్నో కథలు వచ్చాయి. మామగారు అక్షరాలను ఆయుధాలుగా ప్రజలకు అందిస్తే , అనేక అంశాలపై అవగాహన కల్పించేలా ఆమె రచనలు చేస్తున్నారు. సాహిత్యరంగంలో చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు అందుకుంటున్న ఆమె పరిచయం..
శ్రీకాకుళంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి, హైస్కూలు నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్లోనే చదివాను. చిన్నతనం నుంచే సాహిత్యంతో పరిచయం ఉండేది. మా నాన్న డి.వి. రాఘవేంద్రరావుగారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన కారణంగానే సాహిత్యం లో అనేక పుస్తకాలు చదివే అవకాశం కలిగింది.నాన్న కోసం ప్రముఖులు జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు, నటరాజ రామక ష్ణగారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారు, పరిమళా సోమేశ్వర్గారు ఇలా అనేకమంది వచ్చేవారు. వారి పుస్తకాలు చదివేదాన్ని. నాన్నగారు కొన్నిరోజులు రవీంధ్రభారతి డైరెక్టర్గా కూడా పనిచేశారు. అప్పుడు మేం రవీంద్రభారతికి వచ్చి అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు చూసేవాళ్ళం.
పాపయ్య శాస్త్రిగారి కవితా సంపుటి పై..
స్కూల్లో జరిగే సాహిత్యకార్యక్రమాల్లో, చర్చల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. రాయడం మాత్రం ఇంటర్లోనే మొదలు పెట్టాను. వనితా కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాదిలో ఉండగా కాలేజీ మ్యాగజైన్ కోసం జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి కవితా సంపుటి పై సమీక్ష రాయమన్నారు. ఆయన సాహిత్యమంతా చదివి నేను రాసిన నాలుగు పేజీల సమీక్ష కాలేజి మ్యాగజైన్లో రావడంతో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. రెండవ ఏడాది 'డామిట్ కథ అడ్డం తిరిగింది' అంటూ రాసిన చిన్న సరదా కథ వచ్చింది. అలా కాలేజీ సమయం లోనే రచనావ్యాసంగం ప్రారంభమైంది. డిగ్రీలో అంత సమయం ఉండేది కాదు. డిగ్రీ పూర్తి కాగానే పెండ్లి చేశారు. మా వారు షబ్నవీస్ వెంకట రావు మస్కట్లో ఎయిర్లైన్స్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేసేవారు. ఆయనతో పాటే మస్కట్ వెళ్ళిపోయాను. అక్కడ ఖాళీగా ఉండటం ఎందుకని మా వారు పనిచేసే ఓమన్ ఎయిర్లైన్స్లోనే చేరాను.
ప్రత్యేక గౌరవం..
మస్కట్లో చాలా మంది తెలుగువారు ఉండేవారు. భారతీయ కట్టుబొట్టుతో ఉండే నన్ను వారెంతో అభిమానించేవారు. సాహిత్యంతో పరిచయం ఉన్న మేము అక్కడ తెలుగువారి కోసం నిర్వహించే సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చిన్నచిన్న నాటికలు, స్కిట్స్, పోటీలు నిర్వహించే వాళ్ళం. రెండు దశాబ్దాల పాటు అక్కడే ఉన్నాం. ఏ రోజు కూడా పొరుగు దేశంలో ఉన్నాం అన్న భావన కలిగేది కాదు.
కాక్పీట్లో ప్రయాణం..
పనిచేసిది ఎయిర్లైన్స్లో కాబట్టి మాకు తొంభైశాతం రాయితీ ఉండేది. కొన్నిసార్లు ఫ్లైట్ ఫుల్ అయితే మేం కాక్పిట్లో ప్రయాణం చేసేవాళ్ళం.మాతో పాటు మా పిల్లలు కూడా కాక్పిట్లో ప్రయాణం చేసారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ కాక్పీట్ నుంచి చూడటం, రోజూ ఎయిర్క్రాఫ్ట్ల మధ్యనుంచి ఆఫీస్కు వెళ్ళడం, అనేది మధురమైన అనుభూతిగా మిగిలింది. తెలుగు కళాసమితి తరపున మనదేశ ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, సాహిత్యవేత్తలంతా ఒక చోట చేరడం ఇలా ఎన్నో సంతోషాన్ని కలిగించేవి.
తిరిగి సాహిత్యం దిశగా..
కొన్ని ఏండ్ల పాటు పరాయిదేశంలో లోకవిహంగాల మధ్య ఉద్యోగం నిర్వహించి 2000 సంవత్సరంలో తిరిగి ఇండియాకు వచ్చేశాం. మస్కట్లో ఉన్నప్పుడు రచనలు పెద్దగా ఏమీ లేవు. అయితే సాహిత్యకార్యక్రమాల కోసం చిన్నచిన్న స్కిట్స్ రాసేదాన్ని. కళలకు పుట్టిల్లు అయిన మనదేశంలోని గాలి, నీరు, మట్టి మళ్లీ సాహిత్యం దిశగా మళ్లించాయి. కొన్ని కథలు, వ్యాసాలు, పరిచయాలు రాశాను. 'ఒక పేజీ కథ'ల పోటీలో తెలంగాణ మాండలికంలో నేను రాసిన 'భరతమాత ముద్దుబిడ్డ'కు ఉత్తమ బహు మతి అందుకున్నాను. ఆంధ్రభూమి, జ్యోతి లాంటి పత్రికలో నేను రాసిన కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఖాళీ సమయంలో అనేక పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. ఆ క్రమంలోనే మా మామగారు షబ్నవీస్ రామనరసింహారావుగారి గురించిన ప్రస్తావన కొన్ని పుస్తకాల్లో చదివాను.
గొప్పవ్యక్తి జీవితచరిత్రను..
స్వాతంత్య్రోద్యమంలో సాహిత్యాన్ని కూడా ఆయుధంగా చేసుకుని ఎంతోమంది స్వేచ్ఛకోసం తమ కళలను, గళాలను ఉప యోగించారు. వారిలో ఆయన ఒకరుగా తెలంగాణలో నీలగిరి పత్రికను ప్రారంభించారు. అచ్చు వేస్తే అచ్చి రాదు అన్న పెద్దమాటను కూడా ఆయన పట్టించుకోలేదు. పత్రిక ప్రారంభం రోజే భార్యచనిపోయినా.. కుంగిపోకుండా పత్రికను నడిపారన్న విషయం పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను.
డిగ్రీతోనే ఆపిన చదువును కొనసాగిద్దామని తెలుగు యూనివర్సిటీలో ఎంసిజెలో చేరాను. అక్కడ తెలుగు పత్రికల చరిత్రలో మా మామగారి పేరు ప్రస్తావన వచ్చింది. దాంతో నేను ఆయన కోడల్ని అని చెప్పడంతో అందరూ నన్ను ఎంతో గౌరవంగా చూశారు. చరిత్రలో గొప్పవ్యక్తిగా ఉన్న మా మామగారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. అనేక పుస్తకాలు చదివి, వ్యక్తులను కలుసు కుని సమగ్ర సమాచారంతో 'తెలంగాణా వైతాళికుడు షబ్నవీస్ జీవితం - సాహిత్యం' పుస్తకం తీసుకువచ్చాం. ఈ ప్రక్రియలో సహకరించిన వారిలో కూరెళ్ళ విఠలాచార్య, ఇంద్రగంటి జానకీబాల, అయినంపూడి శ్రీలక్ష్మి, కె. కామేశ్వరి తదితరులు ఎంతో మంది ఉన్నారు. 'తెలంగాణా వైతాళికులు' గ్రంథం ద్వారా స్వాతంత్రోద్యమంలో మరుగునపడిన ఎన్నో చరిత్రలను, వ్యక్తులను వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణగారిదే. ఆయన తీసుకున్న చొరవతోనే ఎందరో మహానీయుల కృషికి అక్షరరూపం ఇవ్వడం సాధ్యమైంది. ఆల్ ఇండియా రేడియోలో షబ్నవీస్గారి గురించి నేను చెప్పిన విషయాలన్నీ ఈ మహాగ్రంథంలో చోటుచేసుకున్నాయి.
షబ్నవీస్ పేరు వెనక..
షబ్నవీస్ అంటే చీకటిలో కూడా రాయగలిగిన వారు అని అర్థమట. మా మామగారి పూర్వీకులు నవాబుల దగ్గర గుమస్తాగా చేసేవారట. రాత్రివేళ గుడ్డి దీపాల వెలుతురులో కూర్చోని లెక్కలన్నీ చూసేవారు. ఒకసారి అర్ధరాత్రి తూర్పు వైపు పెద్ద శబ్దం వినిపిస్తే.. లెక్కలు చూస్తున్న ఆయన పుస్తకంలో అది కూడా రాశారు. పొద్దున్నే చూస్తే ఖజానా అంతా ఎవరో దోచుకున్నారు. అదే సమయంలో ఆయన రాసిన వాక్యం చదివిన నవాబు తూర్పుదిక్కున సోదా చేయిస్తే బావిలో పడేసిన ఖజానలోని సంపద అంతా దొరికిందట. దాంతో కొన్ని ఊర్లను మామగారి పూర్వీకులకు నజరానాగా ఇచ్చి, షబ్నవీస్ అన్న బిరుదులో గౌరవించారు. ఆనాటి నుంచి ఇంటి పేరుగా షబ్నవీస్గా మారింది.
సేవా కార్యక్రమాల్లో..
పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టమైన వ్యాపకం. దానికి తోడు ఇంటీరియల్ డెకరేషన్, గార్డెనింగ్తో ఖాళీ సమయం అంటూ ఉండదు. చాలా పుస్తకాల కలెక్షన్ ఉంది. నెలకి రెండు పుస్తకాలు తప్పక కొంటాను. మస్కట్ నుండి వచ్చేటప్పుడు మా లగేజీలో సగం పుస్తకాలే.ఎక్కువ వార్తల్లోని అంశాలను ఇతివృత్తంగా తీసుకుని కథనం అల్లుతాను. ఇక ముందు చాలా రాయాలని ఉంది. నేను రాసే కథలకు మొదటి పాఠకుడు మా వారే. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిన మా అమ్మాయి, అబ్బాయి కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. వారు కూడా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రేడియోలో వ్యాసాలు చదివే అవకాశం వచ్చినప్పుడు మావారు టైమ్ సెట్ చేసి మరీ వింటారు. ఏమైనా మార్పులు ఉంటే సూచిస్తారు. ఏ మాత్రం ఖాళీటైం ఉన్నా వృద్ధాశ్రమాలకు వెళ్ళి పెద్దవారిని పలకరిస్తాం. వారికోసం రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం.