Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవత అత్తింటి నుంచి బయటకు వచ్చిందే కానీ, ఇప్పటికీ ఎన్నోసార్లు తిరిగి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేసింది. ప్రతిసారి చీదరింపులు, అవమానాలు భరించింది కానీ, ఇంట్లోకి మాత్రం వెళ్ళలేకపోయింది. భర్త కోసం ఏడాదిన్నర నుంచి ఎదురు చూస్తూ ..తన జీవితంలో మార్పుకోసం ఆలోచిస్తుంది. ఇక లాభం లేదనుకుని తన సమస్య పరిష్కారం కోసం ఐద్వా అదాలత్కు వచ్చింది.
నవత ఆరుగురు సంతానంలో ఐదో పిల్ల. మగపిల్లాడి కోసం ఎదురుచూసి ఐదుగురు ఆడపిల్లలను కన్నారు ఆమె తల్లిదండ్రులు. మగపిల్లాడిని గారాబంగా పెంచడంతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూలులో చదివించారు. ఆడపిల్లలకు మాత్రం పదోతరగతి కాగానే పెండ్లిళ్లు చేశారు. అలా నలుగురు ఆడపిల్లల పెండ్లి తర్వాత నవత కు సంబంధాలు చూశారు. ఎలాగైనా ఆడపిల్లలను పెండ్లి చేసి పంపించేయాలన్న ఆలోచనతో సంబంధం గురించి ఎలాంటి విచారణ చేయకుండా నవత పెండ్లి భాస్కర్తో చేశారు.
మూడునెలలు కాకముందే..
భాస్కర్ ఒక్కడే కొడుకు. ముగ్గురు ఆడపిల్లలు. అందరి పెండ్లిళ్లు అయ్యాయి. భాస్కర్ కూడా తల్లిదండ్రులకు ఆఖరి సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చదువుపై శ్రద్ద లేకపోవడంతో పదోతరగతితోనే స్వస్తి పలికాడు. బైక్ మెకానిక్గా స్థిరపడ్డాడు. సొంతఇల్లు,
ఆర్టిసీ డ్రైవర్గా రిటైర్ అయిన తండ్రి, అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసే తల్లి. అప్పుడప్పుడు వచ్చిపోయే అక్కలు. లైఫ్ అంతా బాగానే ఉన్న సమయంలో భార్యగా అతని జీవితంలోకి వచ్చింది నవత. కంఫర్ట్గా ఉన్న అతనికి కొత్త బాధ్యత వచ్చి నట్టుగా ఫీల్ అయ్యాడు. పుట్టింట్లో ఆడపిల్ల అన్న నిరాదరణకు లోనైన నవత పెండ్లి తర్వాత తన జీవితం బాగుంటుంది అనుకుంది. కానీ, కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో తాను ఒంటరిని అన్న ఫీలింగ్ ఆమెకు కలిగింది. పెండ్లై మూడునెలల గడవక ముందే ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.
బాధ్యత భారమై..
నవతను ఇంట్లో పనిమనిషిగానే చూశారు. కొడుకును తమ నుంచి ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయంతో భాస్కర్ తల్లి కొడల్ని చూసేది. భాస్కర్ భార్యతో ఐదు నిమిషాలు మాట్లాడినా.. వెంటనే పిలిచేది. ఇద్దరు కలిసి బయటకు వెళ్లిన సందర్భాలు అంటూ లేవు. బెడ్రూమ్లోనూ వారి మధ్య సఖ్యత కరువైంది. భార్యతో మాట్లాడిన ప్రతిమాట అమ్మ చెప్పితేనే మాట్లాడినట్టుగా ఉండేది. నవత ఇది భరించలేకపోయింది. భర్త తనను పట్టించుకోకపోవడంతో అసహనానికి లోనైంది. దాంతో ప్రతి చిన్నవిషయం ఆమెకు సమస్యగానే కనిపించేది. ఇద్దరి మధ్య గొడవలే తప్ప ప్రేమ అన్నది లేదు. భాస్కర్ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండటం, అమ్మ చుట్టూ తిరగడం ఆమెకు బాధ కలిగింది. కనీసం వేరే ఉద్యోగం అయినా చూసుకోమని పదేపదే చెప్పింది. దాంతో భాస్కర్కు పెళ్ళాం మాటలు ఇబ్బందిగా మారాయి. బాధ్యత భారంగా అనిపించింది.
ఇంట్లో ఉండలేక..
నాలుగు రోజులు అత్తింట్లో, వారం రోజులు అక్కల ఇంట్లో ఉంటూ నవత జీవితాన్ని నెగ్గుకు వస్తుంది. పిల్లలు కలిగితే తన జీవితంలో మార్పు వస్తుందని అక్కలు చెప్పిన మాటలు ఆమెలో కొత్త ఆశలు నింపాయి. కానీ, భర్త తనతో ప్రేమగా ఉంటే కదా! భాస్కర్కు నచ్చచెప్పాలని ఎంతో ప్రయత్నించినా అమ్మ మాటనే తప్ప భార్య విలువ అతనికి తెలియలేదు. అత్తింట్లో ఉండలేక బయటకు వచ్చింది.
పుట్టింట్లోనూ ..
పెండ్లి చేసి భారం దించుకున్నాం అనుకున్న నవత తల్లిదండ్రులు ఆమె తిరిగి పుట్టింటికి రావడం తో ఆవేదన చెందారు. మగపిల్లలను వారసత్వంగానూ.. ఆడపిల్లలను భారంగా భావించే వాళ్లు నవతనే తప్పు పట్టారు. పెండ్లి అయిన తర్వాత భర్తతో కలిసే పుట్టింటికి రావాలన్నారు. కడుపులో దాచుకుని కష్టాలను వింటారనుకున్న కన్నవాళ్ళ ఆదరణ కరువు కావడంతో తిరిగి అత్తింటికి వెళ్ళింది నవత. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు ఛీత్కారాలు, అవమానాలే. దాంతో అక్కల ను ఆశ్రయించింది. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత వాళ్ళు కూడా భారంగా ఫీలయ్యారు.
అవమానాలు భరిస్తూ..
పెండ్లి తర్వాత జీవితం బాగుంటుంది అని కలలు కన్న నవత జీవితం కష్టాల మయం అయ్యింది. పుట్టింట్లో ఉండలేక, అత్తింటికి వెళ్ళలేక, అక్కఇండ్లల్లో ఇమిడలేక సతమతమయ్యింది. భర్త ఆదరణ లేకపోయినా, తిట్టినా, కొట్టినా, చివరకు చంపినా అత్తింట్లోనే, భర్త కలిసే ఆడపిల్ల ఉండాలని ఈ సమాజంలో కోరుకుంటుందని గ్రహించిన నవత చివరకు తన భర్త కావాలంటూ ఐద్వా అదాలత్కు వచ్చింది.
తనంతట తానే..
నవత చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత భాస్కర్కు లేఖ పంపించారు. రెండువారాలు చూసినా ఎలాంటి సమాచారం రాలేదు. నవత మాత్రం ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంది. భాస్కర్ నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తుంది. భాస్కర్ నెంబర్కు ఫోన్ చేస్తే.' ఆమెనే ఇంట్లో నుంచి తనంతట తానే వెళ్ళిపోయింది. మేం ఏమీ అనలేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అబద్దాలు మాట్లాడుతుంది. మా పరువంతా తీస్తుంది' అన్నాడు. ' ఆమె సంసారం నిలబెట్టుకోవాలనే ఇక్కడకు వచ్చింది. మీరు ఒకసారి వస్తే కూర్చోని మాట్లాడుదాం' అన్నారు బాధ్యులు. సరే 'వచ్చేవారం వస్తాను' అన్నాడు భాస్కర్.
పోలికలతో...
భాస్కర్ తల్లి, అక్కతో కలిసి వచ్చాడు. 'బస్తీలో అంతా మా పరువు తీసింది. ఇంటి బయట నిలబడి పెద్దపెద్దగా అరుస్తుంది. ఏడాదిన్నర అయ్యింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఇప్పుడు భర్త కావాలని వచ్చింది. పెండ్లి అయిన రోజు నుంచి వాళ్ళ బావలతో నన్ను పోల్చి మాట్లాడుతుంది. ఆమెకు అత్తమామ, ఆడబిడ్డలు అన్న గౌరవం లేదు. వేరు కాపురం పెట్టి ఆమెను సాకే ఆర్థిక పరిస్థితి లేదు. మా కుటుంబంలో ఆమె ఇమడలేదు' అన్నాడు భాస్కర్. తల్లి, అక్క కూడా అదే మాట చెప్పారు.
సగటు అత్తమాదిరిగానే..
'మీ కుటుంబంలోకి వచ్చిన ఆడపిల్లలను మీరు ఏ విధంగా చూసుకున్నారో అర్థం అయ్యింది. ప్రతి తల్లి కోడలు కొడుకును తన నుంచి దూరం చేస్తుంది అన్న భయం తోనే ఉంటుంది. ప్రతి అత్త ఒకనాటి కోడలు అన్న విషయం మరిచిపోతుంది. మీరు అంతే సగటు అత్తమాదిరిగానే ఆలోచించారు. కొత్తగా వచ్చిన ఆడపిల్లలను ఆప్యాయంగా చూడలేకపోయారు. మీ కొడుకు కూడా భార్యకు ప్రేమను పంచలేకపోయాడు. ఏడాదిన్నరలో ఎన్నో సార్లు వచ్చినా మీరు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆమె మా వద్దకు వచ్చింది. ఇద్దరికీ సర్దిచెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళపై ఉంది. మేం వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తాం. కలిసి ఉండేలా చూడండి' అన్నారు బాధ్యులు. 'మీరు ఎన్ని చెప్పినా ఆమె మా ఇంట్లో ఉండదు మేడమ్. మా వాళ్ళను వదిలి నేను రాను. ఇదంతా వెస్ట్' అన్నాడు భాస్కర్. నవతను వదిలించుకోవాలని వాళ్ళంతా నిర్ణయించుకునే వచ్చారన్న విషయం బాధ్యులకు అర్థమైంది.
బలవంతంగా ఆమెను కాపురానికి పంపించినా సమస్య పునరావృత్తం అవుతుందే తప్ప పరిష్కారం కాదని స్పష్టమైంది. దాంతో రెండు వారాలు టైం తీసుకుని ఆలోచించుకోమని భాస్కర్ వాళ్ళకు చెప్పారు.
నీ కంటూ కొత్త జీవితాన్ని..
'విలువ లేని చోట బతకడం ఎంతో కష్టమో నువ్వు తెలుసుకున్నావు. ఈ సమాజంలో ఒంటరిగా బతుకుతున్న ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. నువ్వు ఎంత సేపు నీ సమస్యనే చూస్తూ బాధపడు తున్నావు. అంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఎందరో ఉన్నారు. నువ్వు వద్దని స్పష్టంగా చెప్పిన భర్తతో కలిసి ఎలా ఉంటావు? భాస్కర్ నుంచి రావల్సిన మొత్తాన్ని కోర్టు నుంచి తీసుకోవచ్చు. నీ కంటూ కొత్త జీవితాన్ని ఏర్పాటుచేసుకో. ఏదైనా ఉద్యోగం చేస్తూ హస్టల్లో ఉండు. కష్టాల్లో ఉన్నవారికి అండగా మారు. కష్టాలకు కన్నీటిని కార్చడం కాదు కన్నెర్ర చేయాలి. అప్పుడే అవి దూరంగా పారిపోతాయి. భవిష్యత్త్లో నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే పెండ్లి చేసుకో' అన్నారు బాధ్యులు.
రెండు వారాల తర్వాత భాస్కర్ ఫోన్ చేశాడు. 'ఆమెతో కలిసి నేను బతకలేను. కోర్టులో విడాకులు తీసుకుంటాను' అని.
ఏడాదిన్నర సంఘర్షణ తర్వాత నవతకు వాస్తవం అవగతం అయ్యింది. బాధ్యులు ఇచ్చిన భరోసాతో నవజీవితానికి నాంది పలుకుతూ.. ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించింది. నెలరోజుల తర్వాత 'మేడమ్. మీరు చెప్పిందే నిజం. నాకన్న ఎక్కువ కష్టాలు ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారందరి మధ్యనే హాస్టల్లో ఉంటూ, సూపర్మార్కెట్లో సేల్స్గర్ల్గా చేరాను' అంటూ బాధ్యులకు ఫోన్ చేసింది నవత.