Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఇంటి పని, ఆఫీసుపని, కుటుంబ బాగోగుల్లో మునిగిపోతున్నారు. బాధను అనుభవిస్తూ ఉండిపోతున్నారే తప్ప.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే చాలా చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది. తరచూ చేసే కొన్ని తప్పుల్ని నివారిస్తే ఆనందం.. ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నివారించాల్సిన ఆ తప్పులు ఏంటంటే..
తగినంత నీళ్లు తాగకపోవడం
ఏ ఇల్లాలినైనా కదిలించి చూడండి.. రోజూ ఏడెనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగాలని తెలుసు. కానీ చాలామంది మహిళలు ఆ నియమాన్ని పాటించరు. చిన్న విషయంలా కనిపించినా ఇది చాలా పెద్ద తప్పు. మంచినీళ్లు తక్కువగా తాగడం వల్ల ఒంట్లో నీటిశాతం తగ్గి, బలహీనంగా అనిపిస్తుంది. అదే సమయంలో దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఎక్కువ. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కాబట్టి మహిళలు రోజూ వారీ ఆహారంలో భాగంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువ మంచినీళ్లు తాగాలి.
భోజనం చేయకపోవడం
పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పనిలో మునిగితేలడంతో గృహిణుల్లో చాలామంది సరిగ్గా తిండి తినరు. పొద్దున తినాల్సిన బ్రేక్ఫాస్ట్కి మంగళం పాడేస్తుంటారు. అదేమంటే కాస్తంత భారీగా మధ్యాహ్నం భోజనం లాగించవచ్చని అనుకుంటారు. కొన్ని సార్లు లంచ్ మానేసి కడుపు నిండా రాత్రి భోజనం చేయవచ్చని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. భోజనం మానేయడం వల్ల బాడీ మెటబాలిజమ్ నెమ్మదిస్తుంది. దానివల్ల అతిగా తింటాం. ఫలితంగా బరువు పెరుగుతుంది.తద్వారా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు సరేసరి. కాబట్టి, ఎంత పనిలో ఉన్నా సరే వేళకు తినడం మానకూడదు. వీలైనంత వరకు పండ్లు, కాయగూరలు, బీన్స్, మొలకెత్తిన విత్తనాలు కూడా తింటూ ఉంటే మెటబాలిజమ్ బాగుంటుంది.
తగినంత నిద్రపోకపోవడం!
మనదేశంలోని గృహిణుల్లో చాలామందికి కనీసం సరైన నిద్రకూడా కరవే! రకరకాల ఇంటిపనులు, బాధ్యతలతో కలత నిద్రతో సరిపుచ్చుకుంటున్నాం. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా, పెద్దగా వయసులేకుండానే ముసలితనం లక్షణాలు వచ్చేస్తున్నాయి. తొందరగా మీద పడే ఈ వార్థక్యాన్ని తప్పించుకోవాలంటే ఆడవాళ్లమే కాదు.. మగవాళ్లు కూడా రోజూ ఏడు గంటలపాటు సుఖంగా నిద్రపోవాలి.
క్యాల్షియమ్ తీసుకోకపోవడం
మనం రోజూ తినే ఆహారంలో తగినంత క్యాల్షియమ్ ఉండాలి. లేదంటే, చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారి ఆస్టియోఫోరోసిస్ వచ్చే ప్రమాదముంది. ఇంట్లో పిల్లలకు రోజూ పాలు, పండ్లు పెట్టే మహిళలు వారు కూడా తప్పనిసరిగా పాలు తాగాలి క్యాల్షియమ్ ఉంటుంది కాబట్టి.
తగినన్ని ప్రోటీన్లు తీసుకోకపోవడం
సన్నగా ఉండాలనో, బరువు తగ్గాలనో ఆదుర్దాలో ప్రోటీన్లున్న ఆహారం తీసుకోకపోవడం మానేస్తుంటాం. దీనివల్ల కండరాలు క్షీణించి, మరింత బరువెక్కుతాం. పైగా ప్రోటీన్లు తినకపోతే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా బ్లడ్ షుగర్ ఉన్నట్టుండి పెరుగుతంది. రోజంతా మరింత ఆకలి వేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తపడాలి.