Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబవ్యవస్థలోని వైరుధ్యాలను, వివాహవ్యవస్థలోని సంక్లిష్టతల్ని, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాల్ని ఏడు దశాబ్దాల కిందటనే చిత్రించిన కథా రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. తొలితరం తెలంగాణ రచయిత్రులలో ప్రముఖులు నందగిరి ఇందిరాదేవి (22 సెప్టెంబర్ 1919-22 జనవరి 2017). తెలంగాణ కథాసాహిత్యంలో ఆమెది ప్రత్యేకస్థానం. కథలు, నాటకాలు, వ్యాసాలు రాశారు. రేడియో కోసం కథలు రాశారు. దక్కన్ రేడియోలో ప్రసంగించిన తొలి మహిళ ఇందిరాదేవి. 1937లో నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభకు అనుబంధంగా జరిగిన 'ఆంధ్ర మహిళా సభ'కు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు. సాంఘిక సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు. మహిళలు చదువుకోవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. ఇవాళ శ్రీమతి నందగిరి ఇందిరాదేవి శతజయంతి ముగింపు సందర్భంగా ఆమె గురించి ఈ తరం
పాఠకుల కోసం ఈ వ్యాసం.
తెలంగాణలో సాహిత్య చైతన్యం, సామాజిక చైతన్యం పాదుకొని వ్యాప్తి చెందడానికి దోహదం చేసిన తొలితరం తెలంగాణ కథా రచయిత్రి శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. ఆమె రచనలు చేయడం వరకే పరిమితం కాలేదు. సామాజిక సేవలో పాలుపంచుకున్నారు. ఇందిరాదేవి హనుమకొండలో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త, మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల సహ వ్యవస్థాపకుడు, తెలంగాణ వైతాళికుడు వడ్లకొండ నరసింహరావు. వరంగల్ జిల్లా హనుమకొండ సమీపాన గల వంగపాడు వారి స్వగ్రామం. అయితే ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. ఇందిరాదేవి బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం నారాయణగూడ ఆంధ్ర బాలికల పాఠశాలలో (ఇప్పటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల) సాగింది. అనంతరం ఎస్.ఎమ్.డి.టి మహిళా విశ్వవిద్యాలయం, పూణే నుండి 1937లో పట్టభద్రురాలయ్యారు. ఆమె తన 14వ ఏటనే అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఊహ తెలియని వయసులో పెళ్ళి చేయడమేమిటని మండిపడ్దారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారిని నిలదీసి ప్రశ్నించేవారు. ఈవిధంగా ఆడపిల్లల పట్ల సమాజంలో రావలసిన మార్పు కోసం పోరాడారు. చదువుకునే వయసులో పెళ్ళిళ్ళు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని అనేకసభల్లో గట్టిగా చెప్పారు. ఈరకంగా తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా ఆనాడు హైదరాబాద్లో బాల్య వివాహాలకు వ్యతరేకంగా చైతన్యాన్ని ప్రోది చేశారు. బాల్య వివాహాలని నిరసించిన ఆమె, తాను స్వయంగా యుక్త వయస్కురాలైన తర్వాతే వివాహం చేసుకున్నారు. ఆమె భర్త నందగిరి వెంకటరావు. న్యాయవాది వృత్తిని చేపట్టి పేదలకు అండగా నిలిచారు. అన్యాయానికి గురయిన వారిని ఆదుకునేందుకు కృషి చేశారు. వెంకటరావు కూడా కథలు రాశారు. తొలితరం కథకుల్లో అగ్రగణ్యులు వారు. ఆంగ్ల, తెలుగు, ఉర్దూ భాషలలో ప్రసిద్ధ కథా రచయితగా పేరొందారు.
ఇక ఇందిరాదేవి పెళ్ళి తర్వాత కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1937లో నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభకు అనుబంధంగా జరిగిన 'ఆంధ్ర మహిళా సభ'కు ఇందిరాదేవి అధ్యక్షత వహించారు. ఆనాడు 'నషర్'గా పేరొందిన దక్కన్ రేడియోలో ప్రసంగించిన తొలి తెలంగాణ మహిళ ఇందిరాదేవి. మహిళలు బయటకు వెళ్ళడం, అందునా రేడియో స్టేషన్కు వెళ్ళి మాట్లాడటం ఊహించడానికి కూడా ఆస్కారం లేని కాలమది. కానీ స్వతహాగా చాలా చురుకయిన, తెలివి గల ఇందిరాదేవి చొరవగా ముందుకు వెళ్ళేవారు. పదుగురితో కలిసిపోయి పలు కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేవారు.
ఇందిరాదేవి రచనా వ్యాసంగంలో కథలు ప్రధానమైనవి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రచించిన రేడియో ప్రసంగాలలో ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి ''మసక చాటున మంచి ముత్యాలు'' పేరుతో 1995లో ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఇందిరాదేవి గారు తన వయసు మళ్ళిన కాలంలో సైతం 'బాలానందం' కార్యక్రమాల ద్వారా అనేక నీతి కథలను పిల్లలకు అర్ధమయ్యేరీతిలో ''అమ్మమ్మ కథలు'గా వివరించారు. ఈ నీతి కథలు పుస్తక రూపంలో వచ్చాయి.
ఇందిరాదేవి రాసిన కథలు, వ్యాసాలు, నాటకాలు ఆ కాలంలోని పత్రికలు భారతి, యువ, గృహలక్ష్మి, వినోదిని, ఆంధ్రజ్యోతి, మాతృభూమి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజాహిత, వనితా జ్యోతి వంటి పత్రికలు క్రమం తప్పక ప్రచురించాయి. అయితే అప్పట్లో వారి కథలు పుస్తక రూపంలో రాలేదు. వారు కచ్చితంగా ఎన్ని కథలు రాశారో తెలియదు. గత ఏడాది కొన్ని కథలతో ''నందగిరి ఇందిరా దేవి కథలు'' పేరిట ఒక సంపుటం వచ్చింది. ఇందులోని పదమూడు కథల్ని పరిశీలిస్తే రచయిత్రిగా ఆమె ప్రయాణంలోని వైశాల్యం, సమాజం పట్ల ఆమె దృక్పథం బోధపడతాయి. ఆమె రాసిన ''పందెం'' కథలో - మిత్రుల మధ్య చర్చలో యావజ్జీవ శిక్ష, ఉరిశిక్ష ప్రస్తావనకొస్తాయి. నెమ్మదిగానో, తొందరగానో వ్యక్తుల ప్రాణాలు తీయడమే ఈ రెంటి ఉద్దేశం. కాని తప్పు చేసినవాళ్ళను మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి బదులు, సంఘంలో నుండి వాళ్ళను పూర్తిగా అంతమొందించడం దెబ్బ తగిలిన వేలును పూర్తిగా కోసిపడేయడం వంటిదని ఒకరు వాదిస్తే, మరొకరు యావజ్జీవం కన్నా ప్రాణం తీయడం మంచిదని వాదిస్తారు. యావజ్జీవం జైలులో గడపడం కన్నా ప్రాణాల్ని కోల్పోవడమే మేలని వాదనకు సంబంధించిన కోణాలు ఈ కథలో చిత్రితమయ్యాయి. ఈరీతిన రెండు రకాల శిక్షల గురించి ఆ రోజుల్లోనే ఆలోచింపజేసేలా కథ రాయడం ఇందిరాదేవి ప్రతిభకు నిదర్శనం.
ఇక ''పాపం'' కథలో ఒక కాలేజీ ప్రొఫెసర్ భార్య ప్రసవానికి పుట్టింటికి పోతే, పనిమనిషి కామమ్మతో సంబంధం నెరుపుతాడు. తల్లి పిల్లా ఇంటికి వచ్చే ముందు, కామమ్మ గర్భిణిగా కనిపిస్తే తన భార్య అనుమానిస్తుందని, ఆమెను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతాడు. తమ దగ్గర పనిచేసే మనుషులను అన్ని రకాలుగా వాడుకుని, తరిమేసే యజమానుల స్వార్థపూరిత స్వభావాన్ని గురించి ఆలోచింపజేసే కథ ఇది. డెబ్బయ్యేళ్ళ కిందట పురుషాధిపత్యం ఎలా ఉండేదో ఈ కథ చదివితే తెలుస్తుంది. అలాగే డబ్బు వల్ల వచ్చే అహంకారం, స్వార్థం మానవ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో 'చిట్టి పెళ్ళి' కథలోనూ చూస్తాం.
భార్య కళ్ళుకప్పి బయటి వాళ్ళతో తిరిగే భర్తల బండారాన్ని బయటపెట్టే కథ 'దైవదత్తం'. అలాగే భార్యాభర్తల మధ్య వైరుధ్యాలనీ, సంక్లిష్టతలనీ చర్చకు పెట్టే కథ 'కాఫీ' మరింత ఆసక్తికరమైంది. ప్రేమ, పెళ్ళి, అనంతరం కాపురంలోని గొడవలు, మనస్పర్థలు మహిళల జీవితాల్లో సృష్టించే అశాంతిని గురించి తమ కథల్లో చెప్పారు ఇందిరాదేవి. తెలంగాణలో ఆనాటికి ఉన్న మధ్యతరగతి కుటుంబాల్లోని మనుషుల సంకుచిత స్వభావాల్ని వాస్తవికంగా చిత్రించారు. ప్రేమ రాహిత్యం ఆడవాళ్ళను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న వైనాన్ని చర్చకు పెట్టారు. తెలంగాణలో మధ్యతరగతి వారి ఇండ్లల్లో మాట్లాడుకునే భాషలో కథలు రాసిన ఇందిరాదేవి రచనలు సమస్తం వెలుగులోకి రావలసి ఉంది. ఈ కథలన్నీ 1940-42 మధ్య కాలంలో రాసినవే.
అప్పట్లో తెలంగాణలో స్త్రీ విద్య చాలా తక్కువ. అలాంటిది విద్యాధికురాలైన ఒక తెలంగాణ యువతి కథలను రాయడం చాలా అరుదైన విషయం. వీటిని ఆనాటి సమాజం ఎలా స్వీకరించిందో తెలియదు. కానీ ఇవాళ నందగిరి ఇందిరాదేవి తొలితరం తెలంగాణ కథా రచయిత్రిగా స్మరించు కుంటున్నారు. హైదరాబాద్ స్టేట్లో అక్షరాస్యత తక్కువ. అందునా పత్రికలు మరీ తక్కువ. అయినప్పటికీ తను సాహిత్యం చదువుతూ, కథలు రాసేవారు. ఆనాటికి తన చుట్టూ ఉన్న జీవితాన్ని, తన అనుభవపరిధిలోకి వచ్చిన జీవితాన్ని ప్రబలంగా చిత్రించారు. ఆమె రాసిన వ్యాసాలు, నాటకాలు కూడా లభ్యం కావలసి ఉంది. తెలంగాణ సాహిత్యచరిత్ర, సామాజిక చరిత్రను రికార్డు చేయడానికి నందగిరి ఇందిరాదేవి రచనలు ఉపయోగపడతాయి. కనుక ఆమె రచనలను వెలికి తీయడానికి ప్రయత్నాలు జరగాలి. పెద్దగా వసతులు, పత్రికలు లేని కాలంలో ఎన్నో రచనలు చేసిన ఇందిరాదేవి నేటితరం రచయిత్రులకు ఆదర్శప్రాయం.
- సునంద
ధ్యతరగతి జీవితానికి చిత్రణ
నందగిరి ఇందిరాదేవి తన కథలలో వరంగల్ జిల్లా ప్రజా జీవితాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే తన కథలలో స్త్రీ పురుష మనస్తత్వాలను విశ్లేషించారు. ఆమె కథలలో ఆనాటి మధ్యతరగతి కుటుంబాలలో భర్తలు చూపించే పురుషాహంకారం, స్త్రీ పురుష సంబంధాల్లోని వైరుధ్యాలు, సంఘర్షణలు చిత్రితమయ్యాయి. 1950లకు పూర్వం తెలంగాణలో మహిళల జీవితాలు ఎలా ఉండేవో ఈ కథలు చెబుతాయి. తెలంగాణ తొలితరం కథా రచయిత్రిగా ప్రసిద్ధి గాంచిన ఇందిరాదేవి కథనరీతులు ఈ తరం పాఠకులకు తెలియడం అవసరమని భావించాం. అందుకని ఆమె రాసిన వాటిలో లభించిన పదమూడు కథల్ని సంకలనం చేశాం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని ముద్రించడం సంతోషదాయకం.
- డా|| చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి
సంపాదకులు, నందగిరి ఇందిరాదేవి కథల సంపుటం