Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లలకు త్వరగా పెండ్లి చేసి పంపించేయాలన్న తల్లిదండ్రుల ఆలోచన కొన్నిసార్లు ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. పెండ్లి కొడుకు గురించి సరైన విచారణ లేకుండా, విదేశాల్లో ఉద్యోగం గురించి తెలుసుకోకుండా త్వరపడి పెండ్లి చేసి ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల జీవితాలను ఆవేదనకు గురిచేస్తున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా.. మహిళా సంఘాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా విచారణ లేకుండా వివాహాలు చేస్తూనే ఉన్నారు. తమ బిడ్డపెండ్లయిన కొన్ని నెలల వ్యవధిలోనే వరకట్నవేధింపులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఐద్వా అదాలత్కు వచ్చారు.
సుబ్బారావు, సుశీల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పిల్లల భవిష్యత్కోసం రూపాయి రూపాయి కూడబెట్టారు. ఆడపిల్లలు అనగానే వారి చదువులు, పెండ్లిళ్లు బోలెడు ఖర్చులు అన్న భయంతో తమ జీతం నుంచి ప్రతినెలా డబ్బులు చీటీలు కట్టి స్థలం కొని బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టారు. కిరాయి డబ్బుల్లో కొన్ని బ్యాంకు లోను కడుతూ మిగిలిన డబ్బులు వడ్డీలకు ఇస్తూ రూపాయని పది రూపాయలు చేస్తూ ఎంతో కష్టపడ్డారు.
ఎప్పటికైనా తప్పదని...
ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో వారి పెండ్లిళ్లు చేయడం పెద్ద సమస్యగా భావించారు. పెద్దమ్మాయి లక్ష్మి ఇంటర్ పూర్తి కాగానే లక్షణమైన సంబంధం వచ్చింది. అబ్బాయికి మస్కట్లో ఉద్యోగం. ఒక్కడే కొడుకు. మంచి సంబంధం అని చుట్టాలు, బంధువులు చెప్పడంతో పెండ్లి చేశారు. కట్నాకానుకలు వారు డిమాండ్ చేయకపోయినా తమ పిల్లలకే కదా అంటూ ఇరవై తులాల బంగారం పెట్టారు. పెండ్లి అయిన వారంరోజుల్లోనే అమ్మాయి మస్కట్ వెళ్ళిపోయింది.
రెండో అమ్మాయి...
సుబ్బరావు, సుశీల. చిన్నమ్మాయి సరయుకు కూడా విదేశాల్లో ఉద్యోగం చేసే మంచి సంబంధం వచ్చినప్పుడే పెండ్లి చేద్దాం అనుకున్నారు. సరయు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా సంపత్ తల్లిదండ్రులు వచ్చారు. సంపత్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సరయు ఫొటోలు చూడటం, ఓకే అనడం పదిరోజుల్లో పెండ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. పెండ్లి కొడుకు గురించి ఏమీ తెలుసుకోకుండానే పెండ్లికి సిద్ధమయ్యారు. అబ్బాయి గురించి తెలుసుకోమని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. తమ బిడ్డలకు మంచి సంబంధాలు రావడం చూసి ఓర్వలేక చెబుతున్నారని అనుకుని వారి మాటలు పెడచెవిన పెట్టారు. పెండ్లి ఖర్చులకు పది లక్షల రూపాయలు ఇచ్చారు. బిడ్డకు యాభై తులాల బంగారం, కిలో వెండి పెట్టారు.
మూడునెలలు కాకముందే..
సరయు, సంపత్ పెండ్లికి పెద్దమ్మాయి భర్తపిల్లలతో వచ్చింది. ఇల్లంతా సందడే సందడి. తమ జీవితాలకు ఈ ఆనందం చాలు అనుకున్నారు సుబ్బారావు, సుశీల. కానీ, పెద్ద బిడ్డ విషయంలో జరిగిన విధంగా సరయు జీవితంలో జరగలేదు. పెండ్లి అయ్యాక వంటి నిండా బంగారంలో అత్తింటికి వెళ్ళిన సరయు పుట్టింటికి మాత్రం కేవలం పుస్తెల తాడు, నల్లపూసల గొలుసుతో వచ్చింది. చిన్నపిల్ల అని అత్తగారు జాగ్రత్త చేశారులే అనుకుంది సుశీల. నాలుగు రోజుల తర్వాత చిన్నల్లుడు అమెరికా వెళ్లడానికి తన కార్డులు పనిచేయడం లేదని టిక్కెటు కోసం అరవైవేల రూపాయలు మామ దగ్గర తీసుకున్నాడు. వారం రోజుల్లో అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సరయు వీసా కోసం కావాలంటూ మరో రెండు
లక్షల రూపాయలు తీసుకున్నాడు. మూడునెలలు గడిచినా వీసా రాలేదు. అడిగితే రూల్స్ కఠినంగా ఉన్నాయంటూ సాకులు చెప్పాడు.
స్నేహితుడి ద్వారా..
సరయు పుట్టింట్లోనే ఉంది. సంపత్ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వారు కూడా సరైన సమాధానం చెప్పలేదు. దాంతో వాళ్ళ ఊరికి వెళ్ళిన సుబ్బారావుకు అక్కడి పరిస్థితి ఎన్నో అనుమానాలకు కారణమైంది. స్నేహితుడి ద్వారా వారి వివరాలన్నీ తెలుసుకుని కంగుతిన్నాడు. ఊరి నిండా అప్పులే. సంపత్కు సరైన ఉద్యోగం లేదు. అమెరికాలో అక్క వద్ద ఉంటున్నాడు. అందుకే సరయుకు వీసా పంపలేదు. పెండ్లి సమయంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్దాలే. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వారికి ఐద్వా దిక్సూచిగా కనిపించింది.
సుబ్బారావు, సుశీల చెప్పిందంతా విన్నారు బాధ్యులు. 'ఇప్పుడు మీ ముందు ఉన్నవి రెండే దారులు. ఆమెకు కాపురానికి పంపించడం. లేదా అతనికి జైలుశిక్షపడేలా చేయడం. ముందు మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి. పెండ్లి సమయంలో ఎలాగు మీరు ఆడపిల్లలకు ఆలోచించుకునే సమయం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా అన్ని విషయాలు మీ అమ్మాయికి చెప్పి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. వీలైతే ఆమెను తీసుకుని రండి. ఆమెకు ఈ పెండ్లి ఇష్టం లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వాలి' అన్నారు.
మరో ఆడపిల్లల మోసపోకుండా..
ఆ తర్వాతి వారం సరయు కూడా వచ్చింది. 'మేడమ్, నా ఇష్టంతో ప్రమేయం లేకుండానే పెండ్లి చేశారు. వారి మాటకు గౌరవం ఇచ్చి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. నా మంచికోసమే కదా వాళ్ల తాపత్రయం అనుకున్నాను. అయితే అక్కకు మంచి సంబంధం వచ్చిందని నాకు అలాగే మంచి సంబంధం రావాలని లేదు కదా. సంపత్ గురించి కనీసం విచారణ చేయకుండా పెండ్లి చేశారు. ఇప్పుడు కేవలం డబ్బు కోసమే నన్ను పెండ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక అతనితో నేను ఉండలేను. ఏదో విధంగా అమెరికాకు తీసుకువెళ్ళినా అక్కడ నన్ను టార్చర్ చేయడని ఎలా నమ్మాలి. ఈ పెండ్లి ఒక పీడకల అనుకుంటాను. అయితే అతనిని, వాళ్ల అమ్మనాన్నలకు మాత్రం కచ్చితంగా శిక్ష పడాలి. మరో ఆడపిల్లల మోసపోకుండా ఆపాలి' అంది సరయు.
బాధ్యత అంటూ ..
'ఆడపిల్ల అనగానే బాధ్యత అంటూ పెండ్లి చేసి పంపడం కాదు. అమ్మాయి పట్ల ప్రేమ ఉన్న వారు ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెండ్లి చేయవద్దు. విదేశాల్లో ఉద్యోగం అనగానే ఎలాంటి విచారణ లేకుండా ఆడపిల్లను, ఆస్తులను ఇచ్చేస్తారు. ఎంతో మంది ఆడపిల్లలు విదేశాల్లో దీనావస్థలో ఉన్నారు. మీ అమ్మాయికి అలాంటి పరిస్థితి తప్పినందుకు సంతోషించండి. పోలీస్ కంప్లెయిట్ ఇచ్చి వారికి శిక్షపడేలా చేద్దాం. మీకు మేం అండగా ఉంటాం' అన్నారు బాధ్యులు.
'తప్పు మాదే మేడమ్. ఇలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు, తల్లిదండ్రులకు రాకుండా ఉండాలంటే వారికి శిక్ష పడాల్సిందే. మీరిచ్చిన ధైర్యంతో మేం పోరాడుతాం' అన్నారు సుబ్బారావు, సుశీల. సరయును తీసుకుని నేరుగా పోలీస్సేష్టన్కు వెళ్ళారు.