Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె కండ్లు ఎప్పుడూ ఆకాశాన్నే చూస్తుంటాయి. రెక్కలు వస్తే పక్షిలా రివ్వున ఎగిరిపోవాలనీ.. మనసెప్పుడూ మంచు పర్వతాల చుట్టూ తిరుగుతుంటుంది ఎప్పటికైనా ఆ హిమాలయాల అంచుల్ని తాకాలనీ.. పంజరంలోని పక్షికి స్వేచ్ఛ ఇస్తే... అనుకున్న గమ్యాన్ని చేరితే.. ఇక ఆ ఆనందానికి హద్దేముంటుంది. అలాంటి ఉద్వేగ భరిత క్షణాలను మనసారా ఆస్వాదిస్తుంది మేఘ పర్మార్. మధ్యప్రదేశ్ నుండి హిమాలయాలు అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమెతో మానవి సంభాషణ...
మాది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహౌర్ జిల్లాలోని భోజ్నగర్ అనే చిన్న గ్రామం. రాజపుత్రులు ఎక్కువగాఉంటారు. అమ్మ మంజు పర్మార్, నాన్న దామోదర్ పర్మార్. మాది వ్యవసాయ కుటుంబం. కట్టుబాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆడపిల్లలు తలపై ముసుగు వేసుకుని మగవాళ్ళకు కనపడకుండా తిరగాలి. మా అమ్మ ఏడాదిలో రెండే సార్లు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేది. ఒకటి రక్షా బంధన్ రోజు, రెండోది సంక్రాంతి రోజు. ఇంతటి కట్టుబాట్ల మధ్య పెరిగాను. మధ్య ప్రదేశ్ మొత్తం ఇదే పరిస్థితి.
స్వేచ్ఛ లేదు
ఆడపిల్లల్ని బయటకు వెళ్ళనీయరు. చదువుకునే స్వేచ్ఛ ఈ మధ్య కొంత వరకు వచ్చింది. కానీ మనసుకు నచ్చింది చేయడంలో మాత్రం స్వేచ్ఛ లేదు. నేను చిన్నప్పటి నుండి స్కూల్లో చాలా యాక్టివ్. ఆటల్లో ముందుండే దాన్ని. ఎన్సీసీలో కూడా ఉన్నా. ఏదో చేయాలనీ, సాధించాలని కోరిక బాగా ఉండేది. 2016లో మా రాష్ట్రం నుండి ఇద్దరు అబ్బాయిలు ఎవరెస్ట్ అధిరోహించారని మొదటి సారి పత్రికలో చదివాను. అప్పుడు నాకు అనిపించింది. అబ్బాయిలు ఎక్కినప్పుడు నేను మాత్రం ఎందుకు ఎక్కలేను అనిపించింది.
ఎగతాళి చేశారు
మౌంటెనింగ్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా. ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఆడపిల్లవి ఇవన్నీ చేస్తే ఎలా అని అమ్మ కోప్పడింది. నాన్నను ఎలాగో ఒప్పించి ట్రైనింగ్ తీసుకోవాలని సంబంధించిన ఆఫీస్కు వెళ్ళా. పంజాబీ డ్రెస్లో వున్న నన్ను చూసి ''పొడుగు జుట్టు, పంజాబీ డ్రెస్లో వున్న నువ్వు పర్వతాలు ఎలా ఎక్కుతావు, ట్రైనింగ్ ఎలా తీసుకుంటావు'' అంటూ నవ్వారు. ఇక అప్పటి నుండి జుట్టు కత్తిరించుకుని, ప్యాంటు షర్టు వేసుకోవడం మొదలుపెట్టా. ఊర్లో ఎగతాళి చేసేవారు. అమ్మకైతే అస్సలు ఇష్టం లేదు. అయినా ట్రైనింగ్ చేశాను.
ఛాన్స్ ఒకే సారి వస్తుంది
మౌంటెనింగ్ ట్రైనింగ్ చాలా కఠినంగా వుంటుంది. కమాండర్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే వుంటుంది. కానీ జీవితంలో ఛాన్స్ ఒకే సారి వస్తుంది. దీన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అనుకున్నది సాధించడం కష్టం. నాలాంటి ఆడపిల్లలకైతే మరీ కష్టం. అందుకే ధైర్యం చేసి అడుగు ముందుకు వేశా. లేదంటే ఎప్పటికీ వెనకే వుండిపోతా. పట్టుదలతో ట్రైనింగ్ పూర్తి చేశా. మన ఇండియాలోనే నాలుగు పర్వతాలు అధిరోహించా. దాంతో నాపై నాకు కాస్త నమ్మకం వచ్చింది. మౌంట్ లధక్ మొదటి సారి ఎక్కాను. నాలోని పట్టుదలను చూసి నాన్న ప్రోత్సహించేవారు. ఇంట్లో సపోర్ట్ దొరకడంతో మరింత ధైర్యం వచ్చింది.
పక్కటెముకలు విరిగాయి
2018లో మొదటి సారి ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించా. కిందపడి పక్కటెముకలు విరిగాయి. దాంతో వెనక్కి వచ్చేశాను. ఇంట్లో చాలా భయపడ్డారు. పెండ్లి ఎలా అవుతుందని అమ్మ ఒకటే ఏడుపు. డాక్టరైతే ఇక కొండలు, గుట్టలు ఎక్కడానికి వీల్లేదన్నారు. చాలా మంది ఎగతాళి చేశారు. ''ఏంటి మీ అమ్మాయి ఏదో చేస్తుందని ఎక్కడెక్కడికో పంపించావు. ఇప్పుడు ఏమయింది. అందుకే ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి' అని కొందరు నాన్నతో అనేవారు. దాంతో కొంత కాలం నాన్న నాతో మాట్లాడటమే మానేశారు. ఇవన్నీ తట్టుకోలేక ఓ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళాను. నేను విజయం సాధిస్తే నాతో పాటు ఎంతో మంది ఆడపిల్లలకు అవకాశలు దొరుకుతాయి. అందుకే నాకు నేను ధైర్యం చెప్పుకున్న.
కల నిజమైంది
పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్లను సంప్రదిస్తే వెళ్ళొచ్చన్నారు. అయితే అమ్మ చాలా భయపడింది. బతిమలాడితే ఒప్పుకుంది. చివరకు 2019 మేలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టును అధిరోహించగలిగాను. స్కిన్ ఎలర్జీ తప్ప పెద్దగా ఇబ్బంది ఏమీ కాలేదు. నా కల నిజమైంది. చుట్టూ అందమైన మంచు కొండలు. నాపైన ఇక ఆకాశం తప్ప ఏమీ లేదు. ఓ పక్షిలా ఆకాశంలో విహరిస్తున్నంత ఆనందగా అనిపించింది. ఆ తర్వాత ఆగస్టులో హైదరాబాద్లోని 'బూట్స్ అండ్ క్రాంపన్స్' వ్యవస్థాపకుడు తమ్మినేని భరత్ సహకారంతో ఎల్బ్రూస్ అధిరోహించాను. అలాగే సెప్టెంబర్లో ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన కిలిమంజరో అధిరోహించాను. నా కోచ్ ఎస్.కె ప్రసాద్ సార్ కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు.
సంతోషంగా వుంది
మా రాష్ట్రం నుండి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి అమ్మాయిని నేనే. ప్రస్తుతం 'బేటీ పఢావ్ - బేటీ బచావ్' ప్రోగ్రామ్కు మా రాష్ట్ర ప్రభుత్వం నన్ను బ్రాండ్ ఆంబాసిడర్గా నియమించింది. నిరంతరం ప్రోత్సహిస్తూ, అవకాశాలు కల్పిస్తే ఆడపిల్లలు కచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని నమ్మాలి. మా గ్రామంలోనే కాక చాలా మంది తమ ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు కొంత వరకు ముందుకు వస్తున్నారు. నా వల్ల కొంత మంది అమ్మాయిలైన అనుకున్న రంగంలో రాణించేందుకు ఓ దారి దొరికినందకు సంతోషంగా వుంది.
ఆగిపోకూడదు...
ఆడపిల్లలు ఏం చేసినా చుట్టూ వేయి కండ్లు పరిశీలిస్తుంటాయి. కాబట్టి మనం చేసే ప్రతి పనీ పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అడ్డంకి కాకూడదు. ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే దాన్ని సాధించే వరకు పట్టువదలకుండా ప్రయత్నించాలి. నీరు ఒకే చోట ఆగిపోతే ఎందుకూ పనికి రాకుండా మురిగిపోతాయి. అదే ప్రవహిస్తుంటే అందరికీ ఉపయోగపడతాయి. అలాగే మనం కూడా ఒక దగ్గరే ఆగిపోతే ఇక అంతే. ఒక్క విజయం సాధించి అక్కడే ఆగిపోకూడదు. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఎమ్మేస్సీ చేస్తున్నా. ఎప్పటికైనా సెవన్ సమ్మెట్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తా.
ఏడుపొచ్చేది
చుట్టు పక్కల వాళ్ళు చాలా భయపెట్టారు. కొందరైతే 'మీ అమ్మాయి ఎంటీ ఇలా కొండలు, గుట్టల వెంట తిరుగుతుంది. అక్కడ అబ్బాయిలు ఉంటారు. ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అనే వాళ్ళు. చక్కగా చదివించక ఏంటి ఇవన్నీ' అనే వారు. క్యాంపులకు వెళ్ళినప్పుడు మూడు, నాలుగు రోజులు ఇంటికి వచ్చేది కాదు. అప్పుడైతే మేఘా గురించి నాలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకునే వారు. నాకైతే ఏడుపు వచ్చేది. అందుకే తను బయటకు వెళ్ళినప్పుడు రహస్యంగా వుంచే వాళ్ళం. బంధువుల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్ళిందని చెప్పే వాళ్ళం. ఇప్పుడు తన గురించి పేపర్లో, టీవీలో వస్తుంటే అందరూ గొప్పగా చూస్తున్నారు. తను అనుకున్నది సాధించింది. చాలా గర్వంగా వుంది.
- మంజు పర్మార్, మేఘ తల్లి