Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అత్యున్నతమైన సాహితీ పురస్కారాల్లో ఒకటయిన బుకర్ ప్రైజ్ పురస్కారాన్ని ఈ ఏడాది మొదటి సారి ఇద్దరు రచయితలకు సంయుక్తంగా ప్రకటించారు. వారు మార్గరెట్ అట్వుడ్ (79), బెర్నార్డినో ఎవరిస్టో (60). ఒక నల్లజాతి మహిళ అయిన ఎవరిస్టోకు బుకర్ప్రైజ్ పురస్కారం రావడం ఇదే తొలిసారి. ప్రముఖ రచయిత మార్గరెట్ అట్వుడ్ ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. ఆమె రాసిన 'ద టెస్ట్మెంట్స్' అనే నవలకు ఈ పురస్కారం లభించింది. 'ద హ్యాండ్ మెయిడ్స్ టేల్' నవలకు ఇది సీక్వెల్గా వచ్చింది. 1985 లో వెలువడిన ఈ నవల బెస్ట్సెల్లర్గా నిలవడమే గాక, సైన్స్ఫిక్షన్లో స్త్రీవాద రచనగా గుర్తింపు పొందింది. దానికి సీక్వెల్గా వచ్చిన ఈ 'ద టెస్టమెంట్స్' సెప్టెంబర్ 10న విడుదలయింది. 'ద హ్యాండ్ మెయిడ్స్ టేల్' ని చదివిన లక్షలాది మంది పాఠకుల్ని ఈ నవల కూడా ఆకర్షించడం గమనార్హం.
రెండువేల సంవత్సరంలో 'ది బ్లైండ్ అసాసిన్' నవలకు బుకర్ ప్రైజ్ని మొదటిసారి అందుకున్నారు మార్గరెట్ అట్వుడ్. ఎనభై ఏళ్ళ వృద్ధురాలి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని 'ది బైండ్ అసాసిన్' నవల్ని ఆమె రాశారు. ఈ నవల దాదాపు అయిదు వందల పేజీల పైబడి ఉంది. జీవన సంధ్యాసమయాన ఆ మహిళ ఆలోచనలు, అంతరంగం ఎలా ఉంటాయో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. వృద్ధాప్యంలో ఉండే నిరాశా నిస్పహలు, దిగులు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ నవలలో చూస్తాం. సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని తీసుకుని ఈ నవలను రాశారని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల కమిటీ అట్వుడ్ను ప్రశంసించింది. అట్వుడ్ గతంలో మూడుసార్లు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. ఎట్టకేలకు నాలుగోసారి ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇపుడు రెండోసారి ఆమె బుకర్ప్రైజ్ అందుకోవడం ఆమెలోని తరగని సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం.
స్త్రీలపై అణచివేత నిరసిస్తూ
ఆమె 1985లో రాసిన నవల 'ద హ్యాండ్మెయిడ్స్ టేల్' కూడా బుకర్ప్రైజ్కు నామినేట్ అయింది. బహుమతినందుకోలేదు కానీ సాహిత్య విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇరవయ్యో శతాబ్ది నవలల్లో ప్రముఖమైందిగా నిలిచింది. స్త్రీలపై అణచివేతను, వివక్షను ప్రతీకాత్మకంగా చిత్రించడం ఈ నవలలో కనిపిస్తుంది. ఒక ఊహాజనిత ప్రపంచం 'రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్' లో మహిళల జీవితం ఎలా ఉండేదో చిత్రించారు. ఇది డైస్టోపియన్ నవలగా ప్రసిద్ధి చెందింది. సైన్స్ఫిక్షన్లో స్త్రీవాద భావాల ప్రతిఫలనంగా కూడా పేరొందింది. ఆ నవలలోని పాత్రలు, వాటి స్వభావాలు ఆనాటి సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. కనుక దీనికి సీక్వెల్గా వచ్చిన 'ద టెస్టమెంట్స్' నవల పట్ల పాఠకులు ఆసక్తి చూపుతున్నారు. గిలియడ్ దేశంలోని ముగ్గురు స్త్రీ పాత్రల కథనంతో ఆసక్తికరంగా సాగే ఈ నవల చదవడం ఉద్విగపూరితమైన అనుభవం.
విమర్శకుల ప్రశంసలు...
ఆమె రాసిన నవలల్లో 'ది ఎడిబల్ ఉమెన్', 'క్యాట్స్ ఐ', 'ది రాబర్ బ్రైడ్', 'అలిస్ గ్రేస్' బహుళ పేరుప్రఖ్యాతుల్ని గడించాయి. కథా సంకలనాలో 'డ్యాన్సింగ్ గర్ల్', 'బ్లూ బర్డ్ ఎగ్' పేరొందాయి. సాహిత్య విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మానవ జీవితంలోని సున్నితమైన అనుభూతుల్ని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆమెకు ఆరితేరిన అనుభవం ఉంది. జీవితంలోని వైవిధ్యాల్ని పట్టి చూపే ప్రతిభా సంపత్తులు గల రచయిత్రి మార్గరెట్ అట్వుడ్.
అమ్మ జీవితంలోని ప్రముఖ ఘట్టాలు
మానవ సంబంధాల్ని నిర్దేశించే సంక్లిష్టమైన శక్తులు, వాటి వెనుకన పనిచేసే బలమైన ఉద్వేగాలు తత్ఫలితంగా జీవితంలో ఊహించని మార్పులు సంభవించడం ఆమె కథల్లో చూస్తాం. ఆమె రాసిన కథల్లో చెప్పుకోతగింది 'మా అమ్మ జీవితంలోని ప్రముఖ ఘట్టాలు'. ఇరవై పేజీల ఈ కథలో ఒక కూతురు తన తల్లి జీవితంలోని విషాదానందాల్ని, వాటి పరిణామాల్ని చెబుతుంది. తల్లి జీవితంలో అనుకోకుండా జరిగే ఘటనలు, తారసపడే వ్యక్తుల ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తుంది. ఆమె ఆశ నిరాశలు, దిగులు, వెతుకులాట కూతురిపై చూపిన ప్రభావాన్ని కథలో చదివి విస్మయం చెందుతాం. మానవ జీవితంలోని నాటకీయతను, సందిగ్ధతను, సంశయాత్మకమైన ప్రయాణాన్ని అట్వుడ్ తన కథల్లో బాగా రికార్డు చేశారు. కథలన్నీ చాలా సాధారణంగా, మామూలుగా ప్రారంభమవుతాయి. కానీ మనకు తెలియకుండానే మనల్ని కథలోకి లాక్కుపోతాయి.
జీవితాన్ని చిత్రిస్తూ..
స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతల్ని ఆమె నవలలు ప్రతిఫలిస్తాయి. మహిళల జీవితాల్లోని వైరుధ్యాల్నీ, వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తాయి. జీవితాన్ని యధాతథంగా చిత్రిస్తూ దాని తాలూకు అనుభవాల ప్రతిఫలనం ఏ రీతిన ఉంటుందో ప్రధానంగా ఆమె నవలలు చెబుతాయి. ఆమె ఊహాశాలిత, సృజనాత్మక విన్యాసం సంపూర్ణంగా ఆమె నవలల్లో ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ఆమె రచించిన 'ద హ్యాండ్మెయిడ్స్ టేల్', 'ద బ్లైండ్ అసాసిన్', 'ద టెస్టమెంట్స్' నవలలు తప్పనిసరిగా చదవాలి. ఆమె నవలలు అనేకం సినిమాలుగా, టీవీ సీరియల్స్గా వచ్చాయి.
కవిత్వాన్ని సాధనంగా...
కవిత్వం, కథ, నవల వంటి ప్రక్రియల్లో నిరంతరం రచనలు చేసే అట్వుడ్ ఇతివృత్తాల ఎంపికలో గానీ, దానికి తగిన శిల్పాన్ని ఎంచుకోవడంలోనూ గానీ ఇబ్బంది పడినట్టు కనిపించదు. పట్టరాని ఉద్విగతల వ్యక్తీకరణకు కవిత్వాన్ని సాధనంగా చేసుకోవడం ఆమె నైజం. ఒక విస్తారమైన అనుభవాన్ని వచనంలో రికార్డు చేసినట్టుగా కవిత్వంలో రికార్డు చేయడం సాధ్యం కాదంటారామె. సజనాత్మకంగా జీవించే అట్వుడ్ భర్త గ్రేమీ గిబ్సన్ కూడా రచయిత. తన సుదీర్ఘమైన సాహిత్య ప్రయాణంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు అనేకం అందుకున్నారు.
అద్భుత ప్రతిభ
వయసును ధిక్కరించిన సృజన ఆమెది. ఆమె రచనల్లో పరిపూర్ణత కనిపిస్తుంది. అయితే పరిపూర్ణత కోసం ఎదురుచూస్తుంటే ఒక్క వాక్యం కూడా రాయలేమని అంటారామె. రాస్తూ పోవడం, మళ్ళీ తిరగరాయడం, అవసరమైన చేర్పులుమార్పులు చేసుకుంటూ పోవడం ద్వారా పర్ఫెక్షన్ సాధించడం సాధ్యమవుతుందని చెబుతారు అట్వుడ్. ఇపుడు రెండోసారి బుకర్ప్రైజ్ అందుకున్న 432 పేజీల నవల 'ద టెస్టమెంట్స్'ను చదివితే మార్గరెట్ అట్వుడ్లోని సృజనాత్మక విన్యాసంలోని అద్భుత ప్రతిభ మన పఠనానుభవాన్ని సాంద్రతరం చేస్తుంది.
సాహిత్య ప్రయాణం
డెబ్బయి తొమ్మిది సంవత్సరాల అట్వుడ్ కెనడాలో జన్మించారు. అట్వుడ్కు ప్రపంచవ్యాప్తంగా పాఠకులున్నారు. విస్తతంగా రాయడం ఆమె స్వభావం, విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తారామె. నవలలు, కథలు, కవిత్వం, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు, నాన్ఫిక్షన్ కూడా రాశారు. ఇప్పటివరకు పదిహేడు కవితా సంపుటాలు, పదహారు నవలలు, ఎనిమిది కథా సంపుటాలు, పది నాన్ఫిక్షన్ పుస్తకాలు, ఎనిమిది పిల్లల పుస్తకాలు, మరికొన్ని ఇతరేతర రచనలు ప్రచురించారు. ఇవి కాక సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. 1961లో మొదలయిన ఆమె సాహిత్య ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతున్నది. అంతేగాక అట్వుడ్ రచనలు దాదాపు 33 భాషల్లోకి అనువాదమయ్యాయి.