Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెకు పెండ్లయిన ఏడాదికే తల్లిదండ్రులు చనిపోయారు. ఓ కొడుకు పుట్టాక భర్త కూడా చనిపోయాడు. బాబు చిన్న వాడు. ఒంటరిగా బతకడం కష్టం. అక్కున చేర్చుకోవాల్సిన తల్లిదండ్రులు లేరు. దాంతో కొడుకుని తీసుకుని అన్నా వదినల దగ్గరకు వెళ్ళింది. అన్న స్నేహితుడితో పరిచయమయింది. అలా అతనితో ఏర్పడిన పరిచయం పెండ్లికి దారి
తీసింది. అతని ద్వారా మరో కొడుకు పుట్టాడు. ఆ సందర్భంగా తెలిసిన నిజం ఆమెను నిలువునా దహించివేసింది. చివరకు అతను కూడా చనిపోయాడు. అత్తింటి వారు ఆమెనూ, ఆమె బిడ్డల్ని రానీయలేదు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. తనను చూడకపోయినా కనీసం కొడుకుల్ని అయినా ఆదరించాల్సిందిగా అత్తింటివారిని కోరింది. అయినా వాళ్ళ మనసు కరగలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్సెల్కు వచ్చి..
''నా పేరు మీనాక్షి. ఇంకా ఎన్నో రోజులు బతకను. ఎప్పుడు పోతానో తెలియదు. మా అమ్మానాన్న నాకు మొదట ఓ పెండ్లి చేశారు. అతను తాగుబోతు. ఇల్లు అస్సలు పట్టించుకోడు. ఎప్పుడూ తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఎప్పుడో ఓ సారి ఇంటికి వస్తాడు. అప్పటికే అతని ఆరోగ్యం సరిగా లేదు. మా పెండ్లి అయ్యి ఏడాది నిండక ముందే మొదట నాన్న, ఆ తర్వాత అమ్మ చనిపోయారు. నాకో కొడుకు పుట్టాడు. బాబు పుట్టిన ఆరు నెలలకే నా భర్త చనిపోయాడు. బాబుకు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలీదు. అమ్మా నాన్న లేకపోవడంతో చిన్న బాబుతో ఒంటరిగా వుండలేక మా అన్నయ్య దగ్గరకు వెళ్ళా. మా వదిన మాత్రం నాతో అంటీ ముట్టనట్టు వుండేది. బాబు కోసం ఆమె ఎన్ని అన్నా భరించేదాన్ని. అన్నయ్యను కలిసేందుకు సురేష్ ఇంటికి వస్తుండేవాడు. అన్నయ్య, సురేష్ మంచి స్నేహితులు. సురేష్ నాతో కూడా మంచిగా మాట్లాడేవాడు. ఇద్దరికీ మరిచయమైంది. మా పరిచయం ప్రేమగా మారి పెండ్లి వరకు వెళ్ళింది. వదినతో మాటలు పడటం కంటే అతన్ని పెండ్లి చేసుకుని వేరే వుండటం మంచిదనిపించింది.
అప్పుడే బయటపడింది
నన్ను చేసుకోక ముందే సురేష్కు పెండ్లి అయింది. ఆమె అతనితో ఉండనని పెద్దమనుషుల్లో పెట్టిందంట. కొంత డబ్బు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ విషయం నాతో పెండ్లికి ముందే చెప్పాడు. ఆమెతో విడిపోయాడు కదా అని సురేష్తో పెండ్లికి అంగీకరించాను. నన్ను నా కొడుకును సురేష్ బాగానే చూసుకునేవాడు. రెండేండ్లకు నేను నెల తప్పాను. అప్పుడు మా ఇద్దరినీ టెస్టులు చేయించుకొమ్మని డాక్టర్లు చెబితే చేయించుకున్నాం. సురేష్కు ఎయిడ్స్ వుందని తెలిసింది. నా బిడ్డకు ఆ మాయదారి రోగం రాకుండా జాగ్రత్త తీసుకున్నారు వైద్యులు. అయితే, నాకు కూడా ఎయిడ్స్ వుందని తెలిసింది. క్షమించమని సురేష్ నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి 'నా ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏమిటా?' అనే నా దిగులు.
కొట్టి తరిమేశారు
మేమిద్దరం మందులు వాడుతూ ఎలాగో కొంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చాం. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే రోజురోజుకు అతని ఆరోగ్యం క్షీణించింది. ఓ రోజు పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేర్చాను. వాళ్ళ తల్లిదండ్రులకు కబురుచేస్తే ఎవ్వరూ రాలేదు. అతను చనిపోయిన రోజు కబురుచేస్తే, వాళ్ళన్నయ్య వాళ్ళు వచ్చి బాడీ తీసుకుని వెళ్ళారు. వెంట మేమూ వస్తామంటే వద్దంటూ నెట్టేశారు. అయినా నా ప్రాణం ఆగక బిడ్డల్ని తీసుకుని అక్కడకు వెళ్ళా. మమ్మల్ని లోపలికి రానియ్యలేదు. మొదట విడిపోయిన ఆమెతోనే కార్యక్రమాలన్నీ జరిపించేశారు. ఆమె కనీసం ఏడాది కూడా అతనితో వుండలేదు. అతను మూడేండ్లు ఆసుపత్రిలో వుంటే సేవలు చేశా. ఏడేండ్లు అతనితో కలిసి బతికా. నన్ను మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు. అంతేకాదు నన్నూ, నా బిడ్డల్ని కొట్టి తరిమేశారు.
కొడుకుల పరిస్థితి ఏమిటో?
ఇక చేసేది లేక నేను మా అన్నయ్య దగ్గరకు వచ్చేశాను. మా వదిన ఇప్పుడు మమ్మల్ని ఇంట్లో వద్దని బయటకు పంపేసింది. ప్రస్తుతం ఓ చిన్న గది అద్దెకు తీసుకుని వుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. పనికూడా చేయలేకపోతున్నా. ఎన్నోరోజులు బతకనని నాకు తెలుస్తోంది. ఒక్కపూట గడవడం కూడా కష్టం గా ఉంది. చని పోతానన్న బాధ నాకు లేదు. కాక పోతే నా కొడుకుల పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన రోజు రోజుకు ఎక్కువైపోతోంది. మీరే నాకు న్యాయం చేయాలి'' అంటూ జీవం లేని కండ్ల నుండి నీరు కార్చింది.
ఆమె ఎవరో మాకు తెలియదన్నారు
మీనాక్షి చెప్పింది అంతా విన్న లీగల్సెల్ సభ్యులు వచ్చే వారం రమ్మంటూ ఆమె అత్తింటివారికి లెటర్ పంపారు. పైవారం మళ్లీ ఆమె తన ఇద్దరు బిడ్డల్ని వెంట తీసుకుని వచ్చింది. అత్తింటివైపు నుండి ఎవ్వరూ రాలేదు. ఫోను చేస్తే, 'ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమెకూ మాకూ ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి!' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోను పెట్టేశారు. మరో రెండు వారాల పాటు వారిని రప్పించేందుకు సభ్యులు ప్రయత్నించారు. అయినా వాళ్ళు రాలేదు. ఇక లాభం లేదని స్థానిక ఐద్వా వారిని వాళ్ళింటికి పంపితే 'ఆమె ఎవరో మాకు తెలియదు. ఇలా ఎవరుబడితే వాళ్ళు మా కొడుకుతో సంబంధం ఉందని వస్తే ఎలా?' అంటూ ఎదురు దాడి చేశారు.
కోర్టు వరకు వెళ్ళారు
'వాడు ఎప్పుడో మా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎవరెవరితోనో తిరిగాడు. ఇప్పుడు వాడితో సంబంధం ఉన్నోళ్ళందరూ వస్తే, మేము వాళ్ళందరినీ సాకాలా?' అంటూ వాళ్ళ అన్నయ్య అడిగాడు. 'ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఆమె నిజాయితీగా మీ తమ్ముడితో ఏడేండ్లు ఉంది. ఆమె ఆమాత్రం చూసుకోబట్టే అతను అన్నేండ్లు బతికాడు. ఆమె మానాన ఆమెను వదిలేసినా ఆ ఒక్క కొడుకుతో ఎలాగో బతికేది. మీ తమ్ముడి రోగం వల్లే ఆమె జీవితం నాశన మయింది. పాపం ఆమె ఆ పసిబిడ్డల గురించే పరితపిస్తోంది. మీరు మంచి మనసుతో ఆ బిడ్డల్ని ఆదుకోండి చాలు!' అని ఐద్వా వాళ్ళు కోరారు. అయినా వాళ్ళ గుండెలు కరగలేదు. దాంతో బాధ్యులు ఆమెకు ఉచిత లీగల్ సహాయం అందిస్తూ కోర్టులో అతని కొడుక్కి వారసుడిగా హక్కు ఉందంటూ కేసు వేయించారు. ఇద్దరు కొడుకుల్ని స్టేట్ హౌంలో చేర్చారు.
నాకేమీ అవసరం లేదు
కేసు కోర్టు వరకు వెళ్ళే సరికి మీనాక్షి అత్తింటి వారు దారికి వచ్చారు. ''ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు. బాబు పేరుతో మాత్రం ఐదు లక్షలు ఫిక్స్ చేస్తాం'' అని కబురు పంపారు. మీనాక్షికి కూడా కొంత డబ్బు ఇవ్వాలని లీగల్ సెల్ సభ్యులు అడిగారు. ''మేడమ్ నాకేమీ అవసరం లేదు. నా బాధంతా నా కొడుకు గురించే. ఆ కేసు పూర్తయ్యే వరకూ నేను బతికుంటానో లేదో తెలియదు. ఇంతకు మించి తిరిగే ఓపిక కూడా నాకు లేదు. నా కొడుక్కి ఎంతో కొంత న్యాయం జరిగింది చాలు. ఇప్పటి వరకు నాకు చాలా సాయం చేశారు. ఇక కేసు వెనక్కి తీసుకుంటా'' అన్నది మీనాక్షి.
''సరే నీ ఇష్టం. నీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాబట్టి నీకు ఎలా అనుకూలంగా వుంటే అలాగే చేద్దాం. వాళ్ళు నీ కొడుకు పేర డబ్బులు ఫిక్స్ చేస్తామన్నారు. నువ్వు మాత్రం జాగ్రత్తగా మందులు వాడు. ఇక ఎలాంటి ఆలోచనలూ పెట్టుకోకు. నీ కొడుకుల కోసమైన నువ్వు కొంత కాలం బతకాలి'' అని ధైర్యం చెప్పారు. అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తా'' అని చెప్పి ఇద్దరు కొడుకులను తీసుకుని సంతోషంగా వెళ్ళింది.