Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పటి వరకు మురికి వాడలు తెలియవు. అక్కడి సమస్యలూ తెలియవు. కానీ అనుకోకుండా అక్కడ కనిపించిన ఓ దృశ్యం ఆమెను కదిలించింది. అప్పటికే వైద్యవిద్య పూర్తిచేసిన ఆమె ఇక తన జీవితాన్ని ఆ పేదలకే అంకితం చేయాలని నిర్ణయించుకుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే మార్గంలో పయనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది.
కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెల్లో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు. మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు 'ఆశా' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి.
ఆ తరువాత 'ఆశా' దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటుపోట్లను, వేధింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో 'ఆశా' గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రుణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటునందిస్తోంది.