Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లె బతుకులు ఆమె కథల్లో జీవం పోసుకుంటాయి. మట్టితో మమేకమైన ఎన్నో జీవితాలు ఆమె కలం నుండి బతుకు నేర్చుకుంటాయి. ఆమె అక్షరాలు.. అన్యాయం, అక్రమం, పేదరికం, దోపిడిని కండ్లకు కట్టినట్టు చిత్రిస్తాయి. దళితులపై అణచివేతను నిలదీస్తాయి. ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాయి. అంతే కాదు వాటిని ఎదిరించే సత్తాను పాఠకులకు పుష్కలంగా అందిస్తాయి. ఆమే నల్లూరి రుక్మిణి. ఊహ తెలిసిన నాటి నుండి ప్రజా ఉద్యమాలతో మమేకమై గ్రామీణ సమస్యలపై పని చేసి, పౌర హక్కుల కోసం కృషి చేస్తూ ప్రస్తుతం తన రచనలతో ప్రజలను చైతన్య పరుస్తున్న ఆమె గురించి ఆమె మాటల్లోనే...
మాది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం కేవీ పాలం. అమ్మ గోవిందమ్మ, నాన్న ఆదిశేషయ్య. నాన్న ఐదో తరగతి వరకు చదువుకున్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించి అమ్ముతూ వుండేవాడు. నాకు ఓ తమ్ముడు, ఓ చెల్లి. ఊర్లో ఎలిమెంటరీ స్కూలు మాత్రమే వుండేది. ఎనిమిదో తరగతి వరకు చీమకుర్తిలో చదువుకున్నా. అక్కడ కూడా ఎనిమిది వరకే వుంది. మా ఊరి నుండి ఎనిమిది వరకు చదివిన మొదటి ఆడపిల్లను నేనే. ఆపైన చదివిన వారు ఎవ్వరూ లేరు. కనీసం మగపిల్లలు కూడా లేరు. దాంతో నన్ను కూడా మాన్పించేశారు. మా మేనమామ ఒకరు మిలట్రీలో చేసేవారు. ఆయన 'చదివే అమ్మాయిని అనవసరంగా ఖాళీగా వుంచడం ఎందుకు చదివించవచ్చు కదా' అన్నారు. నాన్న కమ్యూనిస్టు. ఆడప్లిల్లలను చదువులో ప్రోత్సహించే వారు. దాంతో ఒంగోలు హాస్టల్లో వుండి పది పూర్తి చేశా. అప్పట్లో ఆడపిల్లను హాస్టల్లో వుంచడమంటే మామూలు విషయం కాదు.
విద్యార్థి సంఘాలతో పరిచయం
పీయూసీ గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చేరా. డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేశా. 'ఆడపిల్లను అంత దూరం పంపించి చదవించడం అవసరమా?' అంటూ చాలా మంది చాలా మాటలు అన్నారు. వాటన్నింటినీ అమ్మా నాన్న బాగానే ఎదుర్కొన్నారు. కాలేజీలో విద్యార్థి సంఘాలతో పరిచయం. వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యార్థుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసేవారు. నేను హాస్టల్లో వుండేదాన్ని. అప్పట్లో ధనవంతుల పిల్లలే ఎక్కువగా చదువుకునేవారు. మా లాంటి వాళ్ళతో ఎవ్వరూ మాట్లాడేవాళ్లు కాదు. బయటకు వెళ్లనిచ్చే వారు కాదు. దాంతో ఒంటరితనాన్ని ఫీలయ్యేదాన్ని. అలాంటప్పుడు విద్యార్థి సంఘాల పరిచయం కాస్త ఊరటనిచ్చింది. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని.
మా పెండ్లి పెద్ద సంచలనం
అప్పట్లో దండా అరుణ, హేమలత, పద్మ అని వుండేవాళ్లు. వాళ్లు నన్ను కార్యక్రమాలకు తీసుకువెళ్లేవారు. హేమలత అప్పుడప్పుడు నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్ళేది. తనతో మంచి స్నేహం కుదిరింది. అప్పట్లో 'ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ' అని వుండేది. ఇది నాకు బాగా నచ్చింది. తర్వాత నేను హాస్టల్ నుండి బయటకు వచ్చి రూంలో వుండేదాన్ని. ఓల్గా లాంటి వాళ్లు మా రూమ్కి వస్తుండేవారు. ఉద్యమంలో పరిచయమైన ప్రసాద్ను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రేమ వివాహం చేసుకున్నా. అప్పట్లో మా పెండ్లి పెద్ద సంచనలం. ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పట్లో ప్రేమ వివాహం, అందులోనూ కులాంతర వివాహం అంటే ఊళ్లో పెద్ద తప్పు చేసినట్టు చూసేవారు. నా వల్ల అమ్మానాన్న ఎన్నో మాటలు పడ్డారు.
ఆలస్యంగా ప్రారంభించా
ప్రసాద్ లెక్చరర్గా చేసేవారు. విప్లవ రచయితల సంఘం(విరసం) ఆధ్వర్యంలో మీటింగ్లు జరిగేవి. వీటికి చెరబండరాజు, నిఖిలేశ్వర్ లాంటి వాళ్లు వచ్చేవారు. మా ఇంట్లో రచయితల సమావేశాలు బాగా జరిగేవి. లెక్చరర్గా పని చేసే ఐ.వి సాంబశివరావు వీటిని నిర్వహించేవారు. ఆయన సాహిత్య అభిమాని. మంచి విశ్లేషకులు. నన్ను కూడా ఆయనే ప్రోత్సహించారు. శ్రీకాకుళం అడవుల్లో జరిగిన ఓ సంఘటన చెబితే 1977 లో 'గోరంత దీపం' అనే కథ రాశా. ఇదే నా మొదటి కథ. ఆ తర్వాత రెండు మూడు కథలు రాశా. తర్వాత సాంబశివరావుగారు జాబ్కు రిజైన్ చేసి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లిపోయారు. ఇక నన్ను ప్రోత్సహించే వారు లేరు. దాంతో చాలా ఆలస్యంగా రచనలు ప్రారంభించాను.
రాయాలనే కసి మొదలయింది
అప్పట్లో మా ఇల్లు ఓ కమ్యూన్లా వుండేది. విలేజ్ క్యాంప్లకు వెళ్ళేదాన్ని. ఏ పని చెబితే ఆ పని చేసేదాన్ని. కానీ ఓ కవిత రాసి వేదికపై చదివిన వాళ్లకున్న విలువ నాకుండేది కాదు. అది నాకు కాస్త బాధగా అనిపించింది. ఆ బాధ మనసును తొలుస్తూ వుండేది. దాంతో రాయాలనే కసి మొదలయింది. ముందు పుస్తకాలు బాగా చదివి సమీక్ష చేస్తే ఎలా రాయాలో తెలుస్తుందని సమీక్షలు చేయడం మొదలుపెట్టా. ఆ తర్వాత 40 నుండి 50 వరకు కవితలు రాశా. 'ప్రశ్నే ప్రశ్నార్థకమైన వేళ' అనే కవితా సంకలనం తెచ్చా. అయితే కవిత్వం నాకు సెట్ కాదనిపించింది. కవిత్వానికి అవసరమైన భావుకత నాలో లేదనిపించింది. దాంతో మెల్లిగా కథలు రాయడం మొదలుపెట్టా. విరసంలో కొత్త రచయితలకు వర్క్ షాపులు పెట్టేవాళ్లు. అక్కడే రాయడం నేర్చుకున్నా. అలా రాసిన కథలతో ఇప్పటి వరకు 'జీవన స్పర్శ', 'గీతల కావల', 'నెగడు' అనే మూడు కథా సంపుటాలు, 'పరామర్శ', 'జ్ఞానం అందరిదీ' అనే వ్యాస సంకలనాలు తెచ్చా.
గ్రామీణ నేపథ్యంలోనే...
నేను పుట్టి పెరిగింది గ్రామంలోనే. ఉద్యమాలు కూడా గ్రామీణ సమస్యలకు సంబంధించినే జరిగేవి. గో టూ విలేజెస్ అనే కార్యక్రమం పెడితే అందులో కూడా పని చేశా. దీని ప్రభావం నా రచనలపై ఉంది. కమ్యూనిస్టు పార్టీ చీలికల తర్వాత గుంటూరు జిల్లాలో విప్లవోద్యమం ఎలా ప్రారంభమయింది అనే నేపథ్యంలో 'నర్రెంక సెటు ్టకింద' అనే నవల రాశాను. అలాగే కోస్తా జిల్లాలో 1930 తర్వాత రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పుల ఫలితంగా దళితుల్లో వచ్చిన చైతన్యాన్ని వివరిస్తూ 'ఒండ్రుమట్టి' అనే నవల రాశా. ఇది ఓ చారిత్రక నవల. మూడోది 'నిశిధ'. ఇది చుండూరులో దళితులపై జరిగిన ఊచకోతకు సంబంధించిన ఘటనను ఆధారంగా తీసుకుని రాసింది. మరోటి 'మేరువు'. ఇది ఈ మధ్యనే ఆవిష్కరణ జరిగింది. మోటూరు ఉదయం వాళ్ళతో పాటు మహిళా ఉద్యమాల్లో పని చేసిన ద్రోణవల్లి అనసూయ అనే కామ్రేడ్ చరిత్రను ఆధారం చేసుకుని రాశాను. 'పుస్తకంగా తీసుకు రావల్సిన కథలు, వ్యాసాలు ఇంకా చాలా వున్నాయి.
కడవరకూ ప్రజల కోసమే...
మహిళా సంఘాలతో కలిసి పని చేసేటప్పుడు కుటుంబ సమస్యలపై పనిచేయాల్సి వచ్చేది. సమస్యల గురించి మాట్లాడేందుకు పోలీసుల దగ్గరకు వెళితే సరిగా స్పందించేవారు కాదు. లీగల్ విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఉద్యమ అవసరాల కోసమే 1992లో లా చేశాను. చదువు మొదలైన దగ్గర నుంచి ఉద్యమాల్లోనే వున్నాను. లాయర్గా పౌర హక్కుల కోసం పని చేశాను. ప్రతి దశలో నాకు చేతనైనంత వరకు ప్రజల కోసమే పని చేశా. ప్రస్తుతం రచనల ద్వారా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం కులం, మతం పేరుతో సామాన్యులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయా పరిస్థితులపై జనాలకు నిర్దిష్ట అవగాహన కల్పించేలా రాయాలి.
మమేకం కానిదే రాయలేం
ఉద్యమమే నన్ను రాసేలా చేసింది. నేను చదివిన పుస్తకాల్లో అన్నా కెరినీనా, అమ్మ, అసమర్థుని జీవిత యాత్ర బాగా అనిపించేవి. అలాగే 'యజ్ఞం' కథ చదువుతూ మా ఊరితో పోల్చుకునేదాన్ని. చైనీస్ నవల 'తండ్రులు కొడుకులు' ఇవన్నీ నన్ను ప్రభావితం చేసివవే. కవిత్వం రాయడం కన్నా కథ రాయడం చాలా కష్టమైన పని. మానవ మనస్తత్వం తెలియనిదే, వారి ఆంతరంగిక జీవితాన్ని చూడనిదే, వాళ్ళతో మమేకం కానిదే కథను గానీ, నవలను గానీ రాయలేం. ఆ కథలోని పాత్రతో పాటు రచయిత కూడా బాధపడాలి. ఆ బాధ తన బాధగా ఫీలయితేనే కథకు న్యాయం చేయగలం.