Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లి అయితే కెరీర్కు ఫుల్స్టాప్ అనుకుంటారు చాలామంది.. పిల్లలు, ఇంటి బాధ్యతతో తమకంటూ ఒక జీవితం ఉందని మరిచిపోతారు మరికొంత మంది. కానీ, పెండ్లి, పిల్లలు, బాధ్యతలు జీవితం ఒక భాగంగా చూడాలంటున్నారు టీచర్,మాస్టర్ అథ్లెట్ ఇందు హరికుమార్. పెరిగే వయసును లెక్కచేయకుండా క్రమం తప్పని వ్యాయామంతో పతకాలు సాధిస్తున్న ఆమె పరిచయం..
బెంగుళూరు మా స్వస్థలం. నాన్న సుబ్రమణ్యం. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. ఆ తర్వాత సెక్యూరిటీ వింగ్లో చేరారు. అమ్మ రాధ. మేం నలు గురు పిల్లలం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు అన్ని ఆటలు ఆడేలా అమ్మ ప్రోత్సహించేవారు. నలుగురం సైక్లింగ్, స్విమ్మింగ్లో చురుకుగ్గా ఉండేవాళ్ళం. ఎలాంటి వివక్ష లేకుండా పెరిగాం.
చదువంతా బెంగుళూరులోనే సాగింది. స్కూలులో ఉన్నప్పుడే అథ్లెటిక్స్లో బహు మతులు అందుకునేదాన్ని. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మెడల్స్ వచ్చాయి. ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్సిసిలో చేరాను. అప్పడే కొత్తగా నేవీ వింగ్ ఏర్పాటు చేశాను. నేను కూడా అందులో చేరాను. కర్ణాటక రాష్ట్రం తరపున జనవరి 26న దేశ రాజధానిలో జరిగే పెరడ్ మార్చ్లో పాల్గొనడం నాకు వచ్చిన అరుదైన అవకాశంగా భావిస్తాను.
స్కూలు టీచర్గా ..
చదువు పూర్తి అయిన తర్వాత పెండ్లి. మా వారు హరికుమార్ హైదరాబాద్లో పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేస్తారు. దాంతో ఇక్కడకు వచ్చాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి పిజీ చేస్తున్నాడు. చిన్నవాడు బిటెక్ చదువుతున్నాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్దిరోజులు ఖాళీగానే ఉన్నాను. పిల్లలకు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చేవరకు వారికే పూర్తి సమయం కేటాయించాను. ఆ తర్వాత గీతాంజలి స్కూలులో టీచర్గా చేరాను. చిన్నప్పటి నుంచి స్టోర్ట్స్లో యాక్టివ్గా ఉండేదాన్ని. అందుకే ఫిట్నెస్ కోసం రోజూ వ్యాయామం చేయడం అలవాటుగా మారింది. పెండ్లయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను వ్యాయామం ఆపలేదు. పొద్దున్న నాలుగున్నరకే నిద్రలేచి నా ఆరోగ్యం కోసం రోజూ రెండు గంటల పాటు కేటాయించు కునేదాన్ని. ఇంట్లో అందరి కోసం కష్టపడే మనం మనకోసం కొంత టైం తీసుకోవాలి కదా..!
హిమాలయాల్లో ట్రెక్కింగ్..
రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసే అలవాటు వల్ల ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ప్రకృతిలో ఉండటం నాకు ఎంతో ఇష్టం. స్నేహితుల ద్వారా ఒక ఏడాది ఏప్రిల్, మే నెలల్లో హిమాలయల్లో ట్రెక్కింగ్కు వెళ్ళే అవకాశం వచ్చింది. మా చిన్నబాబుకు ఐదేండ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి ట్రెక్కింగ్కు వెళ్ళాను. యూత్ హాస్టల్ అసోసియేషన్ ద్వారా వారం రోజుల పాటు హిమాలయాల్లో నడక ఎంతో ఎనర్జీని ఇచ్చేది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది హిమాలయాల్లో ట్రెక్కింగ్కు వెళ్తున్నాను.
పదికిలోమీటర్ల పరుగుతో..
మహేంద్రహిల్స్లో ఉండే పార్క్లో రోజూ రన్నింగ్కు వెళ్లేదాన్ని. ఒక రోజు డాక్టర్ సుమగారితో పరిచయమైంది. నేను చేసే రన్నింగ్ ప్రాక్టీస్ చూసి ఆమె నన్ను రన్నింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనమని ప్రోత్సహించారు.
'ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం రన్నింగ్ చేస్తున్నాను. పోటీల కోసం కాదు' అని చెప్పాను. హైదరాబాద్ మారథాన్లో అన్నీ వయసుల వాళ్ళు పాల్గొనంటారని, ఇది ఎంతో ఉత్సాహన్ని ఇస్తుందని ఆమె చెప్పారు. అలా డాక్టర్ సుమగారి ప్రోత్సాహంతో 2018లో జరిగిన ఎయిల్టెల్ మారథాన్లో పది కిలోమీటర్ల పరుగులో ఫస్ట్ ప్లేస్లో వచ్చాను. అప్పుడు నాపై నాకు నమ్మకం వచ్చింది. రోజు రెండు, మూడు కిలోమీటర్లే కాదు ఎక్కువ దూరం కూడా పరగెత్తగలను అన్న ధైర్యం వచ్చింది. 2019లో స్టేట్ మీట్ జరిగినప్పుడు మాస్టర్స్ అథ్లెట్స్ పోటీల గురించి తెలిసింది.
35ఏండ్ల పై వారికి..
పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచడానికి అథ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. అయితే అథ్లెట్స్గా రాణించిన వారంతా కొంత వయసు తర్వాత విరామం తీసుకుంటా రు. అంతేకాక పిల్లలు, యువత కోసం నిర్వహించే అథ్లెట్స్ చాలా కష్టతరంగా ఉంటాయి. వీటికి భిన్నంగా మాస్టర్స్ అథ్లెట్స్ నిర్వహిస్తారు. ఇవి 35 ఏండ్లు పై బడిన వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇందులో ఎనభై, తొంభై ఏండ్ల వాళ్ళు కోసం కూడా ప్రత్యేకంగా విభాగాలుంటాయి. నేను గత ఏడాది నుంచే ఈ పోటీల్లో పాల్గొంటున్నాను. అథ్లెట్స్ మాదిరిగానే ఈ పోటీలను కూడా మొదట రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు. ఇక్కడ ఎంపిక అయిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.
మొదటిసారి పోటీల్లోనే..
రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ఎంపిక కావడంతో గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. అక్కడ జరిగిన పోటీల్లోనూ మెరుగైన ప్రతిభ కనపరచడంతో మలేషియాలో జరిగిన ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించాను.
నాలుగు బహుమతులు..
మలేషియాలో జరిగిన ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో అనేక దేశాల నుంచి మహిళలు వచ్చారు. వారందరినీ చూస్తుంటే కొత్త ఉత్సాహం కలిగింది. నేను నాలుగు విభాగాల్లో పాల్గొన్నాను. ఒక బంగారు పతకం, వెండి, కాంస్య పతకం అందుకున్నాను. ఐదు కిలోమీటర్ల పరుగులో నాలుగో స్థానం దక్కింది. పదిహేనువందల మీటర్ల పరుగులో కాంస్య పతకం వచ్చింది. నాలుగు వందల మీటర్ల పరుగులో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాను. పోటీల్లో పాల్గొన్నడం ఉత్సాహాన్ని ఇస్తే.బహుమతులు తెచ్చుకోవడం మరింత ప్రోత్సాహంగా అనిపించింది.
ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో..
ఏషియన్ చాంపియన్షిప్ పతకాలు అందుకోవడంతో పాటు ప్రపంచచాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాను. ఈ ఏడాది కెనడాలో జరిగే పోటీల కోసం సిద్ధమవుతున్నాను.
రెట్టింపు ఉత్సాహంతో..
చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉండేది. పెండ్లి తర్వాత మా వారు, అత్తింటి వారు కూడా నా ఆసక్తిని గమనించి సహకరించారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ, అత్తయ్య వారిని చూసుకునేవారు. ఇప్పుడు మా అబ్బాయిలు కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మనం చేసే పనిలో అంకితభావం ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారంతా సహకరిస్తారు. నా కోసం మాత్రమే అనుకుంటూ ప్రారంభించిన ఫిట్నెస్ ప్రాక్టిస్ ఈ రోజు జాతీయ స్థాయిలో అవార్డు అందుకునేలా చేసింది. ఇప్పుడు బంధువులు, స్నేహితులు నన్ను అభినందించడం, స్ఫూర్తిగా తీసుకోవడం రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది.
- వి. యశోద