Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాల పరిశుభ్రతది కీలకపాత్ర.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో ఒక ఉద్యమంలా తీసుకెళ్తూ అనారోగ్యాల శాతాన్ని గణనీయంగా తగ్గించగలిగారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన. ప్రభుత్వ పథకాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు కొత్త కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయిలోనూ జిల్లాను ఆదర్శంగా నిలిపారు. ఆమె కృషికి ఫలితంగా ఏకంగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇంత సాధించినా అందిరి సహకారం, భాగస్వామ్యం వల్లే సాధించానని చెబుతారు. జిలాల్లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి, ఆరోగ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జిల్లాకు మంచి పేరు తెచ్చే దిశలో ప్రయాణిస్తున్నారు.
పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులను భాగస్వాములను చేశారు. తానే ముందుగా పనిలోకి దిగి ఉత్సాహం అందించారు. స్వయంగా మురుగు కాలువల్లో చెత్త తొలగించి ఆదర్శంగా నిలిచారు. మనం పని చేస్తూ ఇతరులు కూడా పని చేసేలా ప్రోత్సహించటం మంచి పద్ధతని అంటారు ఆమె. డ్రెయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడం, నీరు నిల్వకుండా చూడడం వంటి పనులతోపాటు ప్రతి ఇంట్లో పంచసూత్రాలు అమలు వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి మంచి ఫలితాలు రాబట్టారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత, మరుగుదొడ్డి, కంపోస్టు పిట్, కిచెన్ గార్డెన్, కనీసం ఆరు మొక్కలు నాటేలా చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. దీనిపై విస్తృత అవగాహన కల్పించి ప్రజలు భాగస్వాములు అయ్యేలా చేశారు. స్వయంగా ఆమెతోపాటు జిల్లా అధికారులూ గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించారు. ఐక్యతతో కలిసి పని చేస్తే ఎంతటి లక్ష్యాన్నయినా చేధించవచ్చని నిరూపించి స్వచ్ఛతలో జాతీయ స్ధాయిలో మూడు అవార్డులు సాధించారు.
సర్వత్రా ప్రశంసలు
మన ఇల్లు, మన ఊరు, మన జిల్లా అనే విశాల దృక్పథాన్ని జిల్లా పౌరుల్లో పెంపొందించటంలో కలెక్టర్ సఫలీకృతం అయ్యారు. అందుకే ఆమె చేపట్టిన పంచసూత్రాల కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటిని ప్రజలు వందశాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పంచ సూత్రాలను అమలు చేసే కుటుంబాల ఇంటికి ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్ను అంటిస్తున్నారు.
సబల సానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రం..
నెలసరి సమయంలో ఉపయోగించే సానిటరీ న్యాప్కీన్స్ను సబల కేంద్రం ద్వారా మహిళలే తయారు చేసి అతి తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 20మంది స్వశక్తి సంఘం మహిళలతో కామన్ ఇంట్రస్ట్ గ్రూపు ఏర్పాటు చేసి పీఎంఈజీపీ ద్వారా రూ.25లక్షల రుణం ఇప్పించి 'సబల' పేరుతో సానిటరీ న్యాప్కిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారు. ఇక్కడినుంచి గ్రామాలకు వాటిని సరఫరా చేయడంతోపాటు వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేస్తూ వాడేలా కృషిచేస్తున్నారు. ఈ కేంద్రంలో 40మంది మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. నెలకు దాదాపుగా రూ.5వేల నుంచి 6వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. కమాన్పూర్లో 22 మంది స్వశక్తి సంఘాల మహిళలకు పీఎంఈజీపీ ద్వారా రూ.20లక్షల రుణం ఇప్పించి దుస్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
పాలీథిన్ సంచులకు ప్రత్యామ్నాయంగా...
జిల్లాలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపట్టి మహిళా సంఘాల ఆధ్వర్యంలో బట్ట సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 10 మంది మహిళాసంఘం సభ్యులతో రూ.55లక్షలు వెచ్చించి పేపర్ బ్యాగ్స్, క్లాత్, జూట్ బ్యాగ్స్ తయారీ యూనిట్ను ధర్మారం ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేయించారు. ఇక్కడ తయారైన క్లాత్ సంచులను స్వచ్ఛ పెద్దపల్లి బ్రాండ్తో జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని 90 ప్రాంతాల్లో 330 ఎకరాల భూమి సేకరించి అటవీ, ఉద్యానవన శాఖల సమన్వయంతో వనాలు పెంచుతున్నారు.
అవార్డులు...
జిల్లాలోని 13 మండలాల్లోని 263 గ్రామ పంచాయతీలలో 1,37,058 మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2018లో జిల్లాకు జాతీయ స్థాయిలో మూడవ స్థానం. దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు వచ్చింది. స్వచ్ఛ సుందర్ శౌచాలయ-2019లో జిల్లాకు జాతీయ స్థాయి, స్వచ్ఛ్ సర్వేక్షణ్-2019లో జాతీయ స్థాయిలో మొదటి స్థానం పొంది ప్రధాని చేతుల మీద శ్రీదేవసేన అవార్డును తీసుకున్నారు.
విద్యార్థినుల ఆత్మరక్షణకు 'శక్తి'
స్వచ్ఛ జిల్లాగా మార్చడంలో విజయం సాధించిన శ్రీదేవసేన విద్యార్థినుల ఆత్మరక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి అందరి మన్ననలు పొందారు. 'శకి'్త పేరుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు కేరళ రాష్ట్రానికి చెందిన ప్రాచీన యుద్ధకళ కలరియపట్టు నేర్పిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈ శిక్షణను పరిశీలించి దేవసేనను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బాలురకు 'స్పృహ' పేరుతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి, అందులో తల్లిదండ్రులను సైతం భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
- అరుకుట మల్లేష్యాదవ్,
పెద్దపల్లి